
రాజ్కోట్: విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఐనాక్స్ విండ్ అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు రానుంది. వచ్చే 30–45 రోజుల్లో ఐపీవోను ప్రకటించే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో కైలాష్ లాలా తారాచందానీ తెలిపారు. జూన్ 17న దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించనుంది.
రూ. 370 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, మరో రూ. 370 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఐనాక్స్ విండ్.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి ప్రయత్నించడం ఇది రెండోసారి. ఫిబ్రవరిలో ఒకసారి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ ఏప్రిల్లో దాన్ని ఉపసంహరించుకుంది. అయితే, ఇందుకు ఎలాంటి కారణాలు వెల్లడి కాలేదు.
చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు!