Stress Test: మీ పెట్టుబడులకు రక్షణ ఉందా? | Sakshi
Sakshi News home page

Stress Test: మీ పెట్టుబడులకు రక్షణ ఉందా?

Published Mon, Mar 25 2024 1:09 AM

Mutual Fund Stress Test: Stress Test Results for Small-Mid Cap Funds - Sakshi

స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కు స్ట్రెస్‌ టెస్ట్‌

ప్రతి నెలా డేటా విడుదల

పెట్టుబడుల్లో  రిస్క్‌లు తెలుసుకునే చాన్స్‌

రిటైల్‌ ఇన్వెస్టర్లకు చిన్న కంపెనీలంటే చెప్పలేనంత ఆకర్షణ. అందుకే నేరుగా స్టాక్స్‌లో లేదంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల్లో అధిక రాబడులు వారిని ఆకట్టుకుంటున్నాయి. కానీ, పెద్ద కంపెనీలతో పోలిస్తే వీటిల్లో రిస్క్‌ పాళ్లు అధికం. ఈ రిస్‌్కను రిటైల్‌ ఇన్వెస్టర్లలో అధిక శాతం మంది పట్టించుకోవడం లేదు. ఫలితం మార్కెట్‌ దిద్దుబాట్లలో తప్పటడుగుల కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ రిస్క్‌ను ఇన్వెస్టర్లు అర్థం చేసుకునేందుకు తీసుకొచి్చందే స్ట్రెస్‌ టెస్ట్‌.

గడిచిన మూడేళ్ల డేటాను గమనించినట్టయితే స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. ఒక్క 2023 సంత్సరంలోనే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.23,000 కోట్లు వస్తే.. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్‌ పథకాలు రూ.41,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2022లోనూ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.20,500 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.19,795 కోట్ల చొప్పున వచ్చాయి.  కానీ, అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్‌ పథకాల నుంచి 2023లో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం.

మూడేళ్ల కాలంలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఏటా 24 శాతం చొప్పున రాబడిని ఇవ్వగా, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ ఏటా 22 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించాయి. ఈ స్థాయి రాబడిని చూసి ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులను ఈ పథకాల్లోకి కుమ్మరిస్తున్నారు. వచ్చే పెట్టుబడుల ప్రవాహానికి తగ్గట్టు ఫండ్స్‌ సంస్థలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఆ మేరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది.

ఇవన్నీ కలసి స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఓ బుడగ మాదిరి తయారవుతున్నట్టు క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ ఆందోళన చెందింది. ఫలితంగా కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఉండే రిస్క్‌ నుంచి ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణకు కార్యాచరణ రూపొందించుకోవాలని, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులను నియంత్రించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అన్ని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కు సంబంధించి ‘స్ట్రెస్‌ టెస్ట్‌’ నిర్వహించాలని ఫండ్స్‌ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. లిక్విడిటీ స్ట్రెస్‌ టెస్ట్‌ ఫలితాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం అవసరం.

ఏమిటీ ఈ స్ట్రెస్‌ టెస్ట్‌?
పైకి ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించకపోవచ్చు. మరి అనూహ్యంగా హార్ట్‌ ఎటాక్‌తో చిన్న వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నట్టు? గుండె సామర్థ్యాన్ని, సమీప కాలంలో వచ్చే ముప్పును తెలుసుకునేందుకు వైద్యులు థ్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ (టీఎంటీ) నిర్వహిస్తుంటారు. మెషిన్‌పై శ్రమతో నడస్తున్న సమయంలో గుండె స్పందనలు ఎలా ఉన్నాయనే దాని ఆధారంగా భవిష్యత్‌ రిస్‌్కలను వైద్యులు అంచనా వేస్తారు. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించిన స్ట్రెస్‌ టెస్ట్‌ కూడా ఇదే మాదిరి అనుకోవచ్చు. 2020 కరోనా సమయంలో స్టాక్‌ మారెŠక్‌ క్రాష్‌ గుర్తుండే ఉంటుంది.

ఈ తరహా పతనాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు తమ నిర్వహణలోని పెట్టుబడుల (ఏయూఎం)ను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి? రిస్‌్కను ఎలా ఎదుర్కొంటాయి? ఇన్వెస్టర్ల ప్రయోజనాలను ఎంత మేరకు కాపాడగలవు? ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే తిరిగిచ్చే సామర్థ్యం ఫండ్స్‌ సంస్థలకు ఉంటుందా? ఇత్యాది అంశాలన్నీ తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్‌ టెస్ట్‌ ఉపకరిస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ఇది కొత్తగా విని ఉండొచ్చేమో..! కానీ ఆర్‌బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంక్‌లకు సంబంధించి లిక్విడిటీ స్ట్రెస్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుంటుంది. బ్యాంకుల్లో నగదు లభ్యత ఎలా ఉంది?
కొరతను ఎదుర్కొంటున్నాయా? అన్నది ఆర్‌బీఐ మదింపు చేస్తుంటుంది.  

దీని అవసరం..?
బాండ్ల మార్కెట్లలో మాదిరే ప్రతికూల సమయాల్లో స్మాల్, మిడ్‌క్యాప్‌ పథకాలకు సంబంధించి కూడా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంటుంది. ఒక మోస్తరు ఆస్తులను (పెట్టుబడులు/ఏయూఎం) నిర్వహిస్తున్నంత వరకు ఈ లిక్విడిటీ అనేది మ్యూచువల్‌ ఫండ్స్‌కు పెద్ద సమస్య కాబోదు. కానీ, గడిచిన ఏడాది రెండేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి వస్తున్న భారీ పెట్టుబడులు లిక్విడిటీ పరంగా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి నాటికి అన్ని స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఏయూఎం రూ.2.49 లక్షల కోట్లకు చేరితే, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ ఏయూఎం రూ.2.95 లక్షల కోట్లకు చేరుకోవడాన్ని ఇక్కడ గమనించాలి.

ఇప్పుడు ఈ విభాగాల్లోని పెద్ద పథకాలు ఒక్కో దాని నిర్వహణలోని ఆస్తులు రూ.25,000–60,000 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ.60,000 కోట్ల ఆస్తులు నిర్వహించే పథకం ఒక శాతం (రూ.600 కోట్లు) మేర స్టాక్స్‌ను విక్రయించినా దాన్ని మార్కెట్‌ సర్దుబాటు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో (తక్కువ వ్యాల్యూమ్‌ ట్రేడ్‌ అయ్యేవి) ఈ రిస్క్‌ ఇంకా ఎక్కువ. కొద్ది అమ్మకాలకే స్టాక్‌ ధరలు నేలచూపులు చూస్తాయి. దీంతో ఆయా పథకాల యూనిట్‌ నెట్‌ అస్సెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) అదే స్థాయిలో పడిపోతుంది.  

స్ట్రెస్‌ టెస్ట్‌  ఎలా నిర్వహిస్తారు?
పథకాల పోర్ట్‌ఫోలియోలో 50, 25 శాతం మేర స్టాక్స్‌ను విక్రయించేందుకు వీలుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల మేనేజర్లు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తమ స్టాక్స్‌కు సంబంధించి గడిచిన మూడు నెలల్లో సగటు ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ను పరిశీలిస్తారు. లిక్విడిటీ (వ్యాల్యూ మ్‌) చాలా తక్కువగా ఉన్న దిగువ స్థాయి 20 శాతం స్టాక్స్‌ను మినహాయిస్తారు. మిగిలిన స్టాక్స్‌ వాల్యూమ్‌ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో ఏ మేరకు పెరుగుతుందన్నది ఊహాత్మక గణాంకాల ఆధారంగా అంచనా వేస్తా రు.

ఈ గణాంకాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ (హోల్డింగ్స్‌)ను ఎన్ని రోజుల్లో విక్రయించగలమనే అంచనాకు వస్తాయి. ఒక పథకం తన పెట్టబడుల్లో 25 శాతాన్ని, 50 శాతాన్ని ఎన్ని రోజుల్లో విక్రయించగలదన్నది దీని ద్వారా తెలుస్తుంది. సెబీ ఆదేశాల ప్రకారం ఫండ్స్‌ ప్రతి నెలా ఈ విధమైన స్ట్రెస్‌ టెస్ట్‌ నిర్వహించి, ఫలితాలను తర్వాతి 15 రోజుల్లోపు ఆన్‌లైన్‌ పోర్టల్‌పై వెల్లడించాలి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టిన టాప్‌–10 ఇన్వెస్టర్ల వివరాలను కూడా ఫండ్స్‌ వెల్లడించాల్సి ఉంటుంది.

వర్రీ అక్కర్లేదు..
ఒక పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 60 రోజుల సమయం పడుతుందని వెల్లడించిన సందర్భాల్లో.. ఇన్వెస్టర్ల ఉపసంహరణ క్లెయిమ్‌లు ఒకే సారి ఎక్కువ మొత్తంలో వస్తే ఆమోదిస్తుందా? అన్న సందేహం అక్కర్లేదు. ఈ స్ట్రెస్‌ టెస్ట్‌ ఫలితాలు అన్నీ కూడా వాస్తవంగా మార్కెట్లో విక్రయించి, వెల్లడించిన డేటా కాదు. మార్కెట్‌ పతనాల్లో ఎన్ని రోజుల్లో విక్రయించగలమో ఊహాత్మకంగా వేసిన అంచనాలే. ఆయా సమయంలో ఫండ్స్‌ పెట్టుబడుల్లో ఉండే రిస్‌్కల గురించి తెలుసుకునేందుకు ఈ డేటా ఇన్వెస్టర్లకు సాయంగా ఉంటుంది.

ముఖ్యంగా పెట్టుబడుల్లో 25 శాతం నుంచి 50 శాతం మేర ఉపసంహరణ ఒత్తిళ్లు రావడం అన్నది చాలా అరుదుగానే ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు 10 శాతం మించవు. దీనికంటే కూడా మార్కెట్లు పడడం మొదలైన తర్వాత ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కానీ అప్పటికే చేసిన ఫండ్స్‌ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అరుదు. నష్టభయమే దీనికి కారణం.

నిజానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలైన అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) లిక్విడిటీ రిస్క్‌ విషయంలో తగిన సన్నద్దంగానే ఉంటాయి. అందుకే స్మాల్‌క్యాప్‌ అయినా, మిడ్‌క్యాప్‌ అయినా పెట్టుబడుల్లో 35 శాతం వరకు తీసుకెళ్లి లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఎదురైతే ముందుగా లార్జ్‌క్యాప్‌ పెట్టుబడులనే నగదుగా మార్చుకుంటాయి. దీనికి తోడు పథకంలో కొంత మేర నగదు నిల్వలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా పథకం మొత్తం పెట్టుబడుల విలువలో 20 శాతం మేర రుణం తీసుకుని స్వల్పకాల అమ్మకాల ఒత్తిడిని అధిగమించేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి.  

విశ్లేషణకు కీలక డేటా
స్ట్రెస్‌ టెస్ట్‌ డేటాతో ఇన్వెస్టర్లకు తాము ఇన్వెస్ట్‌ చేసిన పథకాల్లో ఉండే రిస్క్‌ ఎంతన్నది తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో పెట్టుబడులను ఫండ్‌ మేనేజర్లు నగదుగా మార్చుకుంటున్నారన్నది ఇందులో కీలకమైన అంశం. ఇప్పటి వరకు విడుదలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ స్ట్రెస్‌ టెస్ట్‌ ఫలితాలను ఒక్కసారి తప్పకుండా గమనించాలి. స్మాల్‌క్యాప్‌ పథకాలు తమ పెట్టుబడుల్లో 50 శాతాన్ని విక్రయించి నగదుగా మార్చుకునేందుకు సగటున 22 నుంచి 60 రోజులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే 25 శాతం పెట్టుబడులను విక్రయించేందుకు 11–30 రోజుల సమయం పడుతోంది.

మొత్తం ఒకే రోజు విక్రయించేందుకు ఇక్కడ అవకాశాలు పరిమితం. ఎందుకంటే ఆయా స్టాక్స్‌లో లిక్విడిటీ (ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌) చాలా తక్కువగా ఉంటుందన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ పథకాల వద్ద నగదు నిల్వలు 4.5 శాతం నుంచి 11 శాతం మధ్య ఉన్నాయి. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి ఎదురైతే తొలుత ఈ నగదు నిల్వలతో ఫండ్స్‌ గట్టెక్కగలవు. అప్పటికీ రిడెంప్షన్‌ (ఉపసంహరణ) ఒత్తిడి ఆగకపోతే పెట్టుబడులను విక్రయించాల్సి వస్తుంది.  

 ఆయా పథకంలో కేవలం కొద్ది మంది ఇన్వెస్టర్లే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉన్నారా? లేదా అన్నది తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పథకం నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అనుకుందాం. కేవలం ఐదు, పది మంది ఇన్వెస్టర్లకు సంబంధించే రూ.500 కోట్ల పెట్టుబడులు ఉంటే, అది రిస్‌్కకు దారితీస్తుంది. ఆ స్థాయిలో పెట్టుబడులు కలిగి ఉన్నవారు స్మార్ట్‌ ఇన్వెస్టర్ల కిందకే వస్తారు. మార్కెట్‌ పతనం మొదలైన వెంటనే, ముందుగా వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయతి్నస్తే పథకం ఎన్‌ఏవీ దారుణంగా పడిపోతుంది.

ఇది మిగిలిన ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను గణనీ యంగా ప్రభావితం చేస్తుంది. అయితే, తాజా స్ట్రెస్‌ టెస్ట్‌ ఫలితాలను గమనిస్తే ఈ రిస్క్‌ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. ఒక పథకం పెట్టుబడుల విలు వలలో టాప్‌–10 ఇన్వెస్టర్లకు సంబంధించి పెట్టుబడుల విలువ 0.61–2.1 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ పథకాలు అయినప్పటికీ లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు సైతం చెప్పుకోతగ్గ మేర కేటాయింపులు చేసిన పథకాల్లో లిక్విడిటీ రిస్క్‌ చాలా తక్కువ.

ఎందుకంటే లార్జ్‌క్యాప్‌లో లిక్విడిటీ సమస్య ఉండదు. కావాలంటే ఒకే రోజు మొత్తం పెట్టుబడులను విక్రయించుకోగలవు. ఇక స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ లిక్విడిటీ మెరుగ్గా ఉంది. స్మాల్‌క్యాప్‌ పథకాలతో పోలిస్తే సగం వ్యవధిలోనే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులను విక్రయించుకోగలవని స్ట్రెస్‌ టెస్ట్‌ డేటా తెలియజేస్తోంది. కాకపోతే మిడ్‌క్యాప్‌ పథకాల్లో  టాప్‌–10 ఇన్వెస్టర్లకు సంబంధించిన పెట్టుబడులు 1.3–4.9 శాతం మధ్య ఉన్నాయి. అంటే కొంచెం కాన్సన్‌ట్రేషన్‌ రిస్క్‌ ఉన్నట్టు.   అవసరమైతే డేటా విశ్లేషణకు నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.

సంక్షోభాల్లో ఎలా..?
తీవ్ర ప్రపంచ ప్రతికూల పరిణామాల్లో మార్కెట్లు కుప్పకూలితే, ఫండ్స్‌ పథకాలు లిక్విడిటీ రిస్‌్కను గట్టెక్కుతాయా? అంటే అవుననే చెప్పుకోవాలి. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఫలితాలు ఇలానే ఉండాలని లేదు. అప్పుడు ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారు..? ప్రతికూల పరిణామాలు స్వల్ప కాలమా? లేక దీర్ఘకాలమా? తదితర అంశాలు అప్పటి వాస్తవ లిక్విడిటీ రిస్‌్కను ప్రభావితం చేస్తాయి. ఎలాంటి ప్రతికూల పరిణామాలు అయినా సరే తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు కోరితే.. ఫండ్స్‌ సంస్థలు తప్పకుండా అనుసరించాల్సిందే. నష్టానికి అయినా అవి అమ్మి చెల్లింపులు చేస్తాయి.  

మార్గం ఏంటి?
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అంతేకానీ, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సంకేతం కాదు. రిస్‌్కలను అర్థం చేసుకోలేని వారు, ఎన్‌ఏవీలు గణనీయంగా పడిపోయినప్పుడు ఓపిక పట్టలేని వారు ఈ తరహా పెట్టబడులను తగ్గించుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను స్వల్పకాలిక ఆటుపోట్లను చూసి విక్రయించుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అంత రిస్క్‌ వద్దనుకుంటే లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఒకేసారి ఒక పథకం నుంచి 25–50 శాతం పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం సాధారణంగా జరగదు. కనుక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.  

ఇవీ ఉదాహరణలు
► రూ.46,000 కోట్ల పెట్టుబడులను నిర్వహించే నిప్పన్‌ ఇండియా స్మాల్‌క్యాప్‌ ఫండ్‌.. తన పెట్టుబడుల్లో 50 శాతాన్ని నగదుగా మార్చుకునేందుకు 27 రోజులు, 25 శాతం పెట్టుబడుల విక్రయానికి 13 రోజులు పడుతుందని స్ట్రెస్‌ టెస్ట్‌ ఫలితాలను విడుదల చేసింది.  
► రూ.17,193 కోట్ల పెట్టుబడులను నిర్వహించే క్వాంట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ తన పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 22 రోజులు, 25 శాతాన్ని విక్రయించేందుకు 11 రోజులు తీసుకుంటుందని తెలిపింది.  
► రూ.25,500 కోట్లు నిర్వహించే ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ 50 శాతం పెట్టుబడుల విక్రయానికి 60 రోజులు పడుతుందని వెల్లడించింది.
► క్వాంట్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 100% పెట్టుబడుల విక్రయానికి 10 రోజులు, 25% పెట్టుబడుల అమ్మకానికి 5 రోజులు చాలని ప్రకటించింది.
► అదే యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 50 % పెట్టుబడులను 12 రోజుల్లో, 25% పెట్టుబడులను 6 రోజుల్లో నగదుగా మార్చుకోగలనని పేర్కొంది. 

Advertisement
Advertisement