ఫండ్స్‌లో ‘సిప్‌’ చేస్తున్నారా..? | Veteran fund manager S Naren big warning against SIP investments in mid and small-caps | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌లో ‘సిప్‌’ చేస్తున్నారా..?

Published Mon, Mar 3 2025 4:41 AM | Last Updated on Mon, Mar 3 2025 4:41 AM

Veteran fund manager S Naren big warning against SIP investments in mid and small-caps

వెంటనే రాబడులు ఆశించొద్దు 

కనీసం 10–20 ఏళ్లు ఆగాల్సిందే.. 

మార్కెట్లో పతనాలు, ర్యాలీలు సాధారణం 

పెట్టుబడి వృద్ధికి తగినంత సమయం ఇవ్వాలి 

స్వల్పకాల అస్థిరతలను పట్టించుకోనక్కర్లేదు.. 

రిస్క్ లు విశ్లేషించిన తర్వాతే నిర్ణయం 

‘‘స్మాల్, మిడ్‌క్యాప్‌లో సిప్‌లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’  మ్యూచువల్‌ ఫండ్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్‌ ఫండ్‌ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో ఎస్‌.నరేన్‌ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్‌ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్‌ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్‌పై సందేహాలు ఏర్పడ్డాయి. 

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్‌ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్‌ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్‌ (హెచ్‌ఎన్‌ఐలు/ధనవంతులు) సైతం సిప్‌కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్‌ను భావిస్తుంటే, దీనిపై నరేన్‌ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్‌ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... 

సిప్‌ అంటే..? 
నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్‌ చేసుకోవడానికి ఫండ్స్‌ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్‌ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి.  

పొదుపు–మదుపులో క్రమశిక్షణ 
సిప్‌తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్‌ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్‌ కాకుండా.. ఇన్వెస్టర్‌ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్‌ ద్వారా సాధ్యపడుతుంది.

దీర్ఘకాలంలో సంపద సృష్టి 
10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్‌ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్‌ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్‌ ప్రయోజనం లభిస్తుంది.  

కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్‌కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్‌ చేయాలనేది సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్‌ (ఏకమొత్తం) ఇన్వెస్ట్‌ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్‌ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్‌.  

మార్కెట్‌ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్‌ చేయాలని సిప్‌ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్‌ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్‌ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్‌ అనే పథకంలో రూ.2,000 సిప్‌ చేస్తున్నారు. ఆ ఫండ్‌ యూనిట్‌ ఎన్‌ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. 

దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్‌ వల్ల అదే ఫండ్‌ ఎన్‌ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్‌తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్‌ యూనిట్‌ ఎన్‌ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్‌ ఎన్‌ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్‌ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.

స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్‌ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఇటీవలే రూ.250 సిప్‌ను (జన్‌నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ 
చేసుకోవచ్చు.

కేవలం ఈక్విటీలకేనా..? 
సిప్‌ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్‌ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్‌ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్‌ ఫండ్స్‌లోనూ సిప్‌ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్‌ ఫండ్స్‌లో సిప్‌తో మెరుగైన ప్రతిఫలం 
పొందొచ్చు.  

సౌలభ్యం..  సిప్‌ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్‌ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది.  

మార్కెట్‌తో ముడిపడి.. 
ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్‌ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్‌ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్‌ రాబడి 4.5 శాతమే. డెట్‌ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్‌ రాబడులు 5 శాతం కాంపౌండెడ్‌గానే (సీఏజీఆర్‌) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.

అనుకూలం/అననుకూలం
→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్‌ అనుకూలం.  
→ అధిక రిస్క్‌ తీసుకునే వారే మిడ్, స్మాల్‌ క్యాప్‌లో సిప్‌ చేసుకోవాలి.  
→ సిప్‌తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్‌ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు.  
→ సిప్‌ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం.   
→ ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్‌ టు మార్కెట్‌ రిస్క్‌’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్‌పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్‌పై లాభానికి గ్యారంటీ లేదు.

అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..?
 సిప్‌ చేస్తూనే.. మార్కెట్‌ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్‌ చేస్తుంటే.. మార్కెట్‌ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్‌ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్‌ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్‌ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్‌ కరెక్షన్‌లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్‌ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్‌లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్‌ ఫండ్‌లో సిప్‌ చేసుకోవాలి.   

ప్రత్యామ్నాయాలు.. 
పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్‌లతో కూడిన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్‌ ఫండ్స్, గోల్డ్‌ ఫండ్స్‌లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్‌ తదితర ఫండ్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు.  

సిప్‌ ఎప్పుడు స్టాప్‌ చేయాలి? 
→ ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్‌ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి.  
→ ఒక ఫండ్‌ మేనేజర్‌ పనితీరు నచ్చి పథకంలో సిప్‌ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్‌ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్‌ మేనేజర్‌ చరిత్రను ట్రాక్‌ చేయాలి. 
→  పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్‌ నిలిపివేయొచ్చు.  

ప్రతికూల రాబడులు 
ఇటీవలి మార్కెట్‌ పతనంతో 26 స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఏడాది కాల సిప్‌ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో సిప్‌ పెట్టుబడిపై ఎక్స్‌ఐఆర్‌ఆర్‌ (రాబడి) మైనస్‌ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో మైనస్‌ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌ ఎక్స్‌ఐఆర్‌ఆర్‌ మైనస్‌ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్‌లపై డబుల్‌ డిజిట్‌ రాబడులు అందించడం గమనార్హం.  

దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్‌ ‘నికాయ్‌ 225’ ఇండెక్స్‌ 1989 డిసెంబర్‌లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్‌ ఎస్టేట్‌ బబుల్‌ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్‌ నాటి ముందు వరకు సిప్‌ లేదా లమ్సమ్‌ రూపంలో జపాన్‌ స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్‌ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్‌ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్‌ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. 

నరేన్‌ ఏం చెబుతున్నారు? 
అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్‌ క్లాస్‌లో (అది స్మాల్‌ లేదా మిడ్‌ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్‌ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్‌లపై రాబడి రాదన్నది నరేన్‌ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో సిప్‌ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్‌క్యాప్‌ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్‌ ఫండ్స్, హైబ్రిడ్‌ ఫండ్స్‌ లేదా మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ అనుకూలమని చెప్పారు.  

నరేన్‌ అభిప్రాయాలతో ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్‌ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు.

    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement