
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భారత ప్రతినిధిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచ క్రీడల్లో ఇండియా ప్రభావం పెరుగుతుందని, తనను కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నీతా తెలిపారు.
జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో భాగంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులను ఎన్నుకున్నారు. అందులో భారత్ తరఫున నీతా అంబానీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘గ్లోబల్ ఒలింపిక్ బాడీ 142వ సెషన్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికవ్వడం గౌరవంగా ఉంది. కమిటీ నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ధన్యవాదాలు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ ప్రభావం పెరుగుతోంది. భారత్ తరఫున ఒలింపిక్ కమిటీకి సహకరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు.
2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఆమె తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఐఓసీలో చేరిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్లోని ముంబయిలో 30 ఏళ్లకు పైగా ఐఓసీ సెషన్ను నిర్వహించడంలో నీతా అంబానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలాఉండగా, 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు
నీతా అంబానీ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ.
న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు.
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్కు యజమాని.
ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్కు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్పర్సన్గా ఉన్నారు.
నీతా ‘హర్ సర్కిల్’ అనే డిజిటల్ ప్లాట్పామ్ను స్థాపించారు. దీని ద్వారా భారత్లోని మహిళలకు విభిన్నమైన, ఇంటరాక్టివ్, సామాజిక స్పృహతో కూడిన డిజిటల్ సేవలను అందిస్తున్నారు.
ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్గా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment