
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ అనేది సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్పించే తాత్కాలిక ఆర్థిక ప్రణాళిక. దాంతో వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్ వెలువరించనుంది.
కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను సమర్పించే వరకు ప్రభుత్వ వ్యయ అవసరాలను తీర్చడానికి ఇది తాత్కాలిక ఏర్పాటుగా పనిచేస్తుంది. ఏటా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు యూనియన్ బడ్జెట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జరిగే సాధారణ ప్రభుత్వ వ్యయానికి, మధ్యంతర కాలంలో ఖర్చులను భరించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటు అనుమతి అవసరం అవుతుంది. అందుకే మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతారు.
ఈసారి ఎలా ఉండబోతుందంటే..
ఒకవేళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెడితే సాధారణంగా వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి ప్రధాన విధాన ప్రకటనలూ ఉండవు. ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, మధ్యంతర బడ్జెట్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ పెద్ద పథకాన్నీ చేర్చకూడదు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్తో ఆర్థిక సర్వేను సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే పన్నుల పెంపు, తగ్గింపు తదితర అంశాలను మధ్యంతర బడ్జెట్లో ప్రకటించవచ్చు.
మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వంటి ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి పార్లమెంటు వోటాన్ అకౌంట్ను ఆమోదిస్తారు. ఎలాంటి చర్చ లేకుండానే దీనికి ఆమోదం దక్కుతుంది. వోటాన్ అకౌంట్ సాధారణంగా రెండు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది అవసరమైతే పొడిగించవచ్చు.
భారతదేశ ఆర్థిక ప్రణాళిక, పాలనను మధ్య తేడాను అర్థం చేసుకుని బడ్జెట్ను విశ్లేషించాల్సి ఉంటుంది. మధ్యంతర బడ్జెట్ ఆర్థిక స్థిరత్వానికి కీలకం కాగా, పూర్తి సంవత్సర బడ్జెట్ రోడ్మ్యాప్గా పనిచేస్తుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి దిశను నిర్దేశిస్తుంది.
ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలు.. 2023లో ఎక్కువగా అమ్మిన సంస్థలు ఇవే..
పూర్తికాల బడ్జెట్లో..
పూర్తి సంవత్సర బడ్జెట్లో ఆర్థిక వృద్ధి, మూలధన పెట్టుబడి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. పూర్తి సంవత్సరం బడ్జెట్ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది వివిధ రంగాలు, సంస్కరణల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment