Interim Budget 2024
-
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గుర్తుచేశారు. -
Interim Budget 2024: బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442 కోట్లు
Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు. కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు. చదవండి: భారత్తో డేవిస్కప్ మ్యాచ్పై పాకిస్తాన్లో అనాసక్తి -
Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. ఎలా ఖర్చు చేస్తారో తెలిపారు. మొత్తం బడ్జెట్ రూ.47,65,768 కోట్లు పన్నుల ఆదాయం: రూ.26,01,574 కోట్లు పన్నేతర ఆదాయం: రూ.3,99,701 కోట్లు ఆదాయ లోటు: రూ.16,85,494 కోట్లు అప్పుల ద్వారా సమీకరణ: రూ.16,81,944 కోట్లు 2024-25లో రూపాయి రాక(శాతాల్లో) కార్పొరేషన్ పన్ను: 17 ఆదాయ పన్ను: 19 కస్టమ్స్ పన్ను: 4 కేంద్ర ఎక్పైజ్ పన్ను: 5 జీఎస్టీ, ఇతర పన్నులు: 19 పన్నేతర ఆదాయం: 7 రుణేతర మూలధన సేకరణ: 1 మార్కెట్ రుణాలు, సెక్యూరిటీలు, ఇతర రుణాలు: 28 రూపాయి పోక(శాతాల్లో) కేంద్ర ప్రభుత్వ పథకాలు/ వ్యయం: 16 రుణాలపై వడ్డీ చెల్లింపులు: 20 రక్షణ రంగ వ్యయం: 8 సబ్సిడీలు: 6 ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయింపులు: 8 పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటా: 20 పెన్షన్ల చెల్లింపులు: 4 ఇతర ఖర్చులు: 10 కేంద్రపాయోజిత పథకాలు: 8 ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి -
Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ఆటోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్ గగన్ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్సే్చంజ్ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్ కిట్ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్ వివరించారు. ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ గగన్ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్ క్యారియర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్ కిట్లను కూడా అందిస్తోంది. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లు, సెల్స్పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
Interim Budget 2024: ప్చ్..నచ్చలే! సెన్సెక్స్ నష్టం 107 పాయింట్లు
ముంబై: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్ మార్కెట్ను మెప్పించకలేకపోయింది. మౌలిక వసతుల రంగానికి అంచనాల కంటే తక్కువ కేటాయింపులు, ఆదాయం పన్ను శ్లాబులు య«థాతథంగా కొనసాగింపు నిర్ణయాలు నిరాశపరిచాయి. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు దిగివచ్చి 21,698 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో ఒడిదుడుకులు... సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలతో ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 71,999, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జనరంజక బడ్జెట్ సమర్పణ ఆశలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ సమయం(గంటసేపు)లో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 72,151 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 21,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే స్టాక్ మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చే ప్రకటలేవీ వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాలు కోల్పోయిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 576 పాయింట్ల పరిధిలో నిఫ్టీ 174 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► బడ్జెట్ ప్రకటన రోజు గత ఆరేళ్లలో స్టాక్ మార్కెట్ నాలుగు పర్యాయాలు లాభపడగా., రెండుసార్లు నష్టాలు చవిచూసింది. 2023, 2022, 2021, 2019 ఏడాదిల్లో పెరిగింది. కాగా, 2020, 2024 ఏడాదిల్లో పతనాన్ని చవిచూసింది. ► బాండ్లపై రాబడులు తగ్గడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్బీ, ఐఓబీ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 7–5%, కెనరా బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు 4–3% పెరిగాయి. మహారాష్ట్ర బ్యాంక్, ఎస్బీఐలు 2–1% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3.11% లాభపడింది. ► రైల్వే సంబంధిత స్టాకులు ఆరంభ లాభాలు కోల్పోయి నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇర్కాన్ 3.69%, రైల్వే వికాస్ నిగమ్ 3.49%, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 3%, జుపిటర్ వేగన్స్ 2% పతనమమయ్యాయి. ఐఆర్సీటీసీ 1.50%, టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్, టిటాఘర్ రైల్వే సిస్టమ్స్ 1% నష్టపోయాయి. ► చరిత్రాత్మకంగా పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్ వేళ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. ఈ ఏడాది అదే పునరావృతమైంది. మూలధన వ్యయాలకు కేటాయింపుల స్వల్ప పెంపు, ద్రవ్య లోటు 5.5% నుంచి 5.1%కి తగ్గింపు లక్ష్యం మినహా ఉత్సాహాన్నిచ్చే ఇతర ప్రకటలేవీ వెలువడలేదు. ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల తగ్గింపు యోచన సముచితంకాదని ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 4% పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది – యస్ సెక్యూరిటీస్ ఎండీ అమర్ అంబానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతాయుత, వినూత్న, సమిళిత మధ్యంతర బడ్జెట్ను సమరి్పంచారు. ఆర్థిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ., ప్రైవేట్ మూల పెట్టుబడులకు అవకాశం కల్పించారు. జాతీయ ప్రాముఖ్యతలున్న రంగాల వృద్ధికి మరోసారి పటిష్ట పునాదులు వేశారు’’ – బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి -
డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్... రూ. 50,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది. అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి లోక్సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదీ తీరు.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, ఆర్వీఎన్ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్మెంట్) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది. -
ఆశలు.. అంచనాలే
సాక్షి, హైదరాబాద్: కేటాయింపుల్లో స్పష్టత ఉండని కేంద్ర ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రాష్ట్రానికి ఆశలు, అంచనాలనే మిగిల్చింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గురువారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. కేవలం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని తలపెట్టిన పలు ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారానే రాష్ట్ర ప్రజానీకం కూడా లబ్ధి పొందనున్నారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇందులో తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లాంటి అంశాలు ప్రస్తావనకు రాలేదు. అయితే దేశ వ్యాప్తంగా అమలు చేయనున్న కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు లబ్ధి కలుగుతుందని, ప్రతిపాదించిన నిధుల్లో తెలంగాణకు ఎంత కేటాయిస్తారన్న దానిపై స్పష్టత వస్తేనే ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాల లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. ఇళ్ల నుంచి సౌర విద్యుత్ వరకు తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన స్టార్టప్లు, ఆయుష్మాన్ భారత్, గృహ నిర్మాణం, ఉపాధి హామీ నిధుల పెంపు, మెట్రో రైళ్లు, 300 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచితంగా సోలార్ పవర్ ప్యానెళ్లు లాంటి పథకాలు తెలంగాణకు ఉపయుక్తం కానున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ల అభివృద్ధిలో దేశంలోనే టాప్ స్థానంలో తెలంగాణ కొనసాగుతోంది. ఒక్క హైదరాబాద్ వేదికగానే 3,500 నుంచి 4,000 స్టార్టప్లున్నాయని అంచనా. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టార్టప్ల ఏర్పాటులో తెలంగాణ నాలుగు శాతం అదనపు వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో స్టార్టప్ల కోసం కేటాయించిన రూ.43 వేల కోట్ల బడ్జెట్ తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్లో స్టార్టప్ల ఏర్పాటుకు మరింత ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త నగరాల్లో మెట్రో రైళ్లను విస్తరిస్తామని బడ్జెట్ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు వందేభారత్ రైళ్ల తరహాలో సాధారణ రైలు బోగీల అభివృద్ధి, రైల్ కారిడార్ల ఏర్పాటు కోసం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, కొత్త లైన్ల నిర్మాణానికి నిధులు దక్కే అవకాశాలున్నాయి. ఈసారి దేశ వ్యాప్తంగా 2 కోట్ల మందికి కొత్త గృహాలు నిర్మించే ప్రతిపాదనలను చేసిన నేపథ్యంలో మన రాష్ట్రానికి 6–8 లక్షల గృహాల నిర్మాణానికి ఈ పథకం కింద నిధులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే విధంగా 300 యూనిట్ల వరకు విద్యుత్ కోసం గృహాలకు ఉచితంగా సోలార్పవర్ ప్యానెళ్లు అందజేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ఉచిత ప్యానెళ్ల వల్ల కూడా లక్షలాది మంది గృహ వినియోగదారులకు ఊరట కలగనుంది. ఇక రాష్ట్రంలో 61 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. ఈసారి బడ్జెట్లో కేంద్రం గత ఏడాది కంటే ఉపాధి నిధులను పెంచింది. దీంతో వచ్చే ఏడాదిలో కార్డుల సంఖ్యతో పాటు ఉపాధి హామీ వేతనం కూడా పెరిగే అవకాశాలున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచాన వేస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా సిబ్బందిని ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకురానుండడంతో రాష్ట్రంలోని 35వేల మంది అంగన్వాడీ టీచర్లు, మరో 35 వేల మంది హెల్పర్లతో పాటు 25 వేల మంది ఆశా వర్కర్లకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభించనుంది. కేటాయింపులు తేలాలి జాతీయ రహదారులు, స్టార్టప్ల కార్పస్ ఫండ్ పేరిట కేటాయించిన నిధుల వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరుతుందనేది కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే కానీ తేలదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. హైవేల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైవేల నిమిత్తం 1,200 కిలోమీటర్ల కొత్త ప్రతిపాదనలున్నాయి. అయితే రాష్ట్రంలోని ఏ రహదారికి ఎంత కేటాయిస్తారనేది కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే తేలనుంది. స్టార్టప్ల కార్పస్ ఫండ్ కింద కేంద్రం రూ.లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రుణాలను అందజేస్తామని ప్రకటించింది. ఈ ఫండ్ను ఏ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారనే లెక్కలు తేలితేనే మన రాష్ట్రంలోని ఎంత మంది యువత ఈ రుణాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందుతారో తేలనుంది. మనదీ ఓటాన్ అకౌంటేనా? కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అటు వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారా? ఓటాన్ అకౌంట్కు వెళతారా అన్న దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదిస్తారు. గ్రాంట్ ఇన్ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటాతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్ను ప్రతిపాదిస్తారు. అయితే కేంద్రం పెట్టిన ఓటాన్ అకౌంట్లో ప్రజలపై వి«ధించే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు కానీ, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా ఆరు నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ పెట్టి ఆ తర్వాత సెపె్టంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హం. స్కూళ్లకు నిధులు యూజీసీకి 60 శాతం కోత న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో గ్రాంట్లను 60.99 శాతం మేర కోత వేసింది. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రూ.6,409 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం 2,500 కోట్లు కేటాయించింది. అయితే, 2024–25 బడ్జెట్లో స్కూళ్లకు కేటాయింపులు పెంచింది. పాఠశాల విద్యకు గత ఏడాది సవరించిన అంచనాల (రూ.72473.80) కన్నా దాదాపు రూ.500 కోట్ల మేర పెంచి 73008.10 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యకు మాత్రం గత ఏడాది రూ.57244.48 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9,600 కోట్లు కోతవేసి 47619.77 కోట్లు కేటాయించడం గమనార్హం. కేంద్రం ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కోత విధించింది. గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.608.23 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే, ఐఐటీలకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.10384.21 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.10324.50 కోట్లు కేటాయించారు. అలాగే, కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధులను 28 శాతం పెంచారు. వీటికి గత ఏడాది రూ.12000.08 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.15472 కోట్లు కేటాయించడం విశేషం. కాగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లను రూ.8,200 కోట్ల మేర పెంచగా, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.308 కోట్ల మేర పెంచారు. 390 వర్సిటీలు... 3000 ఐటీఐలు 2014 నుంచి ఇప్పటివరకు పదేళ్లలో పెద్ద ఎత్తున ఉన్నత విద్యా సంస్థలను నెలకొలి్పనట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్ విద్యాసంస్థలను, 390 యూనివర్సిటీలను ఏర్పాటుచేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే, 3,000 ఐటీఐలను కూడా స్థాపించామన్నారు. యువతను ఎంతవరకు సాధికారికంగా మార్చామన్నదానిపై మన ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. సంస్కరణలకు జాతీయ విద్యావిధానం–2020 నాంది పలుకుతోందని, ‘పీఎం శ్రీ’పథకం ద్వారా నాణ్యమైన బోధనను అందించడంతోపాటు విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద మూడువేల ఐటీఐలను ఏర్పాటుచేసి ఇప్పటివరకు 1.4 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, 54 లక్షల మంది యువకుల ప్రతిభకు మెరుగులు దిద్దామని తెలిపారు. బడ్జెట్.. ఆశలు.. మధ్యంతరమే! ♦ ‘ఓటాన్ అకౌంట్’ కావడంతో ఎలాంటి మార్పులకూ వెళ్లని ఎన్డీయే సర్కారు ♦ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచవచ్చని భావించిన ఉద్యోగులు ♦ కొత్త పథకాలపై ఆశలు పెట్టుకున్న పలు వర్గాలు ♦ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రకటించవచ్చనే అంచనాలు ♦ కానీ చిన్న చిన్న మినహాయింపులకేపరిమితమైన కేంద్ర ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యమంటూ మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. అన్ని వర్గాల ఆశలను మధ్యంతరంగానే వదిలేసింది. మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలున్న నేపథ్యంలో.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచవచ్చని, కొత్త పథకాలు ప్రకటించవచ్చని, పెట్రోల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టవచ్చని ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పన్నులు సహా ఇతర అంశాలు వేటిలోనూ పెద్దగా మార్పులూ చేయలేదు. వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆశ పెట్టుకున్న పన్ను మినహాయింపులు, శ్లాబ్ రేట్ల మార్పు వంటివాటి జోలికి వెళ్లలేదు. ఎలాంటి ఉపశమనం కలి్పంచలేదు. కొత్తగా భారమూ వేయలేదు. ఆర్థిక వృద్ధి, సంస్కరణలపై ఫోకస్.. కొత్త సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రస్తావన పెద్దగా తీసుకురాని కేంద్ర ఆర్థిక మంత్రి.. తన ప్రసంగం పొడవునా ఆర్థిక వృద్ధి దిశగా చేపట్టే చర్యలనే ఎక్కువగా వివరించారు. గత పదేళ్ల పాలనకు సంబంధించి కూడా పన్నుల ఆదాయంలో వృద్ధి, వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్థికవృద్ధి మరింత వేగం పుంజుకునేలా మూలధన వ్యయానికి రూ.11.1 లక్షల కోట్లను కేటాయించామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి అనూహ్య స్థాయిలో వేగం పుంజుకుంటుందని.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి మరిన్ని సంస్కరణలను అమల్లోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు.. భవిష్యత్తులో ద్రవ్యలోటును తగ్గించడంతోపాటు అప్పులు తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తూ వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వివరించారు. ఎన్డీయే పాలనతో ప్రజలు సంతృప్తితో ఉండటంతోనే రెండోసారి భారీ మెజార్టీ ఇచ్చారని.. ఇప్పుడు మూడోసారి గెలిస్తే సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి దిశగా శరవేగంగా చర్యలు చేపడతామని ప్రకటించడం విశేషం. సబ్సిడీలకు కోత వేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తున్న ఎన్డీయే సర్కారు.. దాన్ని ప్రస్తుత బడ్జెట్లోనూ కొనసాగించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలకు కేటాయింపులను 8శాతం మేర తగ్గించారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మాత్రం కోత పెట్టలేదు.మరోవైపు మధ్యతరగతి వారి సొంతింటికలను తీర్చేందుకు కొత్తగా పథకాన్ని తెస్తామని ప్రకటించి కాస్త ఊరటనిచ్చారు. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల అందుబాటు ధరల గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా.. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి కేటాయింపులను 11 శాతం పెంచారు. విమానయానాన్ని మరింత ప్రోత్సహించేలా టైర్–2, 3 స్థాయి నగరాలకూ కొత్తగా విమాన సరీ్వసులతోపాటు ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేను మరింత మెరుగుపర్చే దిశగా.. 40వేలకుపైగా బోగీల్లో ‘వందే భారత్’ప్రమాణాల స్థాయిలో సౌకర్యాల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు. దీనితోపాటు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు రూ.1.3లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇస్తామని ప్రతిపాదించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా రూఫ్టాప్ సోలార్ విద్యుత్ను ప్రోత్సహించేందుకు చర్యలు ప్రకటించారు. -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
అభివృద్ధి నినాదంతో బడ్జెట్: నిర్మలా సీతారామన్
-
అభివృద్ధి నినాదం.. బడ్జెట్ విధానం: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదని అన్నారు. వరుసగా మూడేళ్లుగా 7 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నుంచి దేశాన్ని రక్షించామని స్పష్టం చేశారు. బడ్జెట్లో నాలుగు విషయాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు, యువత, మహిళలు అభివృద్ధి కేంద్రంగా బడ్జెట్ రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. ద్రవ్యలోటును 4.5కు తగ్గించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సరైన విధానాలు, నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. జీడీపీ ఏం సాధించామో స్పష్టంగా చెప్పామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాలనలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. మూడు రైల్వే కారిడార్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మెట్రో, నమో భారత్ కనెక్టివిటీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల జీవణ ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
Interim Budget 2024: లక్షద్వీప్కు నిర్మలమ్మ వరాలు
ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ను నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్లను టూరిస్ట్ హబ్గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్ను కేటాయించారు. సహజమైన బీచ్లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్ మైషో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
Interim Budget 2024: నేడే బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించకముందే ఎన్నికల తాయిలాలతోపాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈరోజే పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మెరుపులు ఉంటాయా ? అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినాసరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50 శాతం డియర్నెస్ అలవెన్స్ను మూలవేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయుశ్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారీ బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం–ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ‘ఆర్థిక సాయం’ కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను శ్లాబులను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆరోసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏమేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. -
Budget 2024: ఉమెన్ పవర్కు ఊతం ఇచ్చేలా...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ గురించి గత వారం రోజుల నుంచి ‘ఈసారి కూడా పేపర్లెస్ బడ్జెటే’ అనే విశేషంతో పాటు ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు, స్మార్ట్ ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాలు, వాయుకాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏంచేయబోతున్నారు... ఇలా రకరకాల విషయాలపై ఉహాగానాలు, చర్చలు జరిగాయి. వ్యాపార రంగంలో మహిళ వ్యాపారవేత్తలు సత్తా చాటుతున్న కాలం ఇది. వారి అడుగులను మరింత వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు? మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి... ఇలాంటి ప్రశ్నలెన్నో బడ్జెట్ నేపథ్యంలో మదిలో మెదులుతాయి. ‘మహిళలకు సంబంధించి బడ్జెట్ 2024 ఎలా ఉండాలి?’ అనే దానిపై కొందరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల అభిప్రాయాలు... ప్రత్యేక నిధి గత అయిదేళ్లలో మన దేశంలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే అయిదేళ్లలో 90 శాతం వరకు పెరుగుతాయని అంచనా. ఎన్నో నగరాల్లో మహిళా వ్యాపారుల ప్రతిభాసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వారికి 2024 బడ్జెట్ ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉండాలి. –స్వాతి భార్గవ, కో–ఫౌండర్, క్యాష్ కరో మహిళా శ్రేయస్సు మహిళల హెల్త్కేర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మహిళల శ్రేయస్సుకు 2024 బడ్జెట్ దోహదకారి కావాలని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్, హెల్త్కేర్, ఎంటర్ప్రెన్యూర్షిప్లలో మహిళలు రాణించేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు బడ్జెట్ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. – రచనా గుప్తా, కో–ఫౌండర్, జినోవేద గేమ్ చేంజర్గా... మహిళలు నిర్వహించే వ్యాపారాలను ముందుకు నడిపించే గేమ్చేంజర్గా ఈ బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను. రుణ ప్రక్రియను సరళతరం చేయాలి. మహిళల నేతృత్వంలోని వ్యాపారాల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహించాలి. నిధుల అంతరాన్ని పూడ్చాలి. గ్రాంట్లు, సబ్సిడీలు, పన్ను మినహాయింపుల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార చతురత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాల కోసం బడ్జెట్లో కేటాయింపులు అవసరం. మహిళలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలి. మాటలు కాదు కార్యాచరణ కనిపించాలి. ‘ఇది కొత్త బడ్జెట్’ అనిపించాలి. – సోమ్దత్తా సింగ్, ఇ–కామర్స్ ఎంటర్ ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్, రైటర్ మరిన్ని పొదుపు పథకాలు గ్రామీణ సమాజంలోని మహిళల కోసం మరిన్ని పొదుపు పథకాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. వడ్డీ లేని రుణాలను ప్రవేశ పెట్టాలి. మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్ ఉండాలి. మహిళలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్షిప్కు ప్రోత్సాహం అందేలా, స్కిల్ బిల్డింగ్కు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాను. స్కిల్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. కృత్రిమ మేధ ఆధారిత రంగాలలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఉపాసన టకు, కో ఫౌండర్–మొబిక్విక్ ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేలా... పన్నెండవ తరగతి తరువాత యువతులకు నైపుణ్యశిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం’ అని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వ్యవసాయరంగంలో ఉన్న మహిళలపై దృష్టి సారించాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరేలా వివిధ రంగాల మహిళలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. – జ్యోతీ బండారీ, లోవక్ క్యాపిటల్ ఫౌండర్, సీయివో బాలికల విద్యకు ప్రాధాన్యత రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అలవెన్స్ పెంచాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ను పెంచాలి. – రాధిక దాల్మియ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కోల్కతా చాప్టర్)– చైర్పర్సన్ మహిళా రైతుల కోసం... బడ్జెట్లో మహిళా రైతులు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాయితీల ద్వారా మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలు అందించాలి. – ధనశ్రీ మంధానీ, సలాం కిసాన్–ఫౌండర్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ‘ఫ్యూచర్ రెడీ’ స్కిల్స్ కోసం మహిళలను సన్నద్ధం చేసే కార్యాచరణను రూపొందించాలి. మహిళల నైపుణ్య శిక్షణకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. – నేహా బగారియా, ఫౌండర్– జాబ్స్ ఫర్ హర్ -
Budget 2024: రేపే మధ్యంతర బడ్జెట్
దిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి, ముఖ్య అధికారులు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. -
Budget 2024: అప్పట్లో ఇవే హైలెట్స్.. మళ్లీ ఉంటాయా?
బడ్జెట్ ఎప్పుడు వచ్చినా మధ్య తరగతి వర్గాలు కోటి ఆశలు పెట్టుకుంటాయి. ఈ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్పైనా మిడిల్ క్లాస్, అల్పాదాయ వర్గాల్లో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఈ వర్గాల కోసం గతేడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏయే ప్రయోజనాలు కల్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కోసం అనేక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ముఖ్యమైన ప్రకటనలు ఏంటో ఇక్కడ చూడండి.. ➧ పన్ను మార్పులు: కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ➧ పన్ను శ్లాబులు: కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. ➧ స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ప్రొఫెషనల్స్, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ను రూ. 50,000 నుంచి రూ. 52,500కి పెంచారు. ➧ 80C మినహాయింపు పరిమితి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో పెట్టుబడి పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. ➧ విద్య: విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసంస్థలకు నిధులతో సహా విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ➧ హౌసింగ్: డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మళ్లీ ఉంటాయా? సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నది మధ్యంతర బడ్జెట్. అయినప్పటికీ గత బడ్జెట్లో అందించిన లాంటి ప్రయోజనాలు మళ్లీ ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ మధ్యతరగతి వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
Budget 2024-25: మహిళాసాధికారతకు ప్రధాన డిమాండ్లు
మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా వారు రాణిస్తున్నారు. కానీ, భాగస్వామ్యం ఆశించినమేరకు లేదనేది వాస్తవం. ఉదాహరణకు కంపెనీల్లో అత్యున్నతస్థానంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ సదరు సంస్థల్లో వారి సంఖ్య పెరగడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రైవేటు సంస్థలు, ఇతర రంగాలు మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. వీటిని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. రానున్న బడ్జెట్లో వారి అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలంటు డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్లో భాగంగా పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసే నగదుపై లభించే వడ్డీను పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని కొందరు కోరుతున్నారు. ప్రసుత్తం 7.5శాతం వడ్డీ అందిస్తున్నారు. దీన్ని మరింత పెంచాలనే డిమాండ్ ఉంది. వర్కింగ్ మహిళలకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే కొందరు భావిస్తున్నారు. మహిళల సాధికారత కోసం సంప్రదాయ వ్యవహారాలకు భిన్నంగా వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించేలా చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి సంబంధించి జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. అది తగ్గించడానికి బడ్జెట్లో నిర్ణయాలు చేపట్టాలని కోరుతున్నారు. 15-50 సంవత్సరాల వయసు ఉన్న మహిళల్లో 57 శాతం మందికి రక్తహీనత ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దాంతో చాలామంది మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. రానున్న బడ్జెట్లో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఒంటరి మహిళల భద్రత, వారికి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేలా నిర్ణయాలు ఉండాలని కొందరు భావిస్తున్నారు. నిర్భయ ఫండ్ అనేది మహిళల భద్రత కోసం 2013లో స్థాపించిన నాన్ లాప్సబుల్ కార్పస్ ఫండ్. డిసెంబర్ 2023లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం 70 శాతం నిధులు మాత్రమే అంటే రూ.7,212 కోట్లలో రూ.5,119 కోట్లు పథకం ప్రారంభం నుంచి వినియోగించారు. నేరాలు జరుగుతున్నా వాటిని అరికట్టేలా చర్యలు ఉండడం లేదు. ఈసారి బడ్జెట్లో మరింత నిధులు పెంచి వాటిని సమర్థ్యంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతున్నా వారు తక్కువ జీతం, తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలను చేపడుతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆ పరిస్థితులు రాకుండా కేంద్రం బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతంకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా 7 శాతం వృద్ధిని అధిగమించగలదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని, కానీ భారత్ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీన్ని ఎకనామక్సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఆర్థికనివేదిక ప్రకారం భారతదేశ వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు నివేదిక చెప్పింది. దాంతో జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు తెలిసింది. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి అంశాలు గతంలో వృద్ధి క్షీణించేందుకు కారణాలుగా మారినట్లు నివేదికలో వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. -
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ఏమన్నారంటే..
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మాట్లాడారు. కొత్త పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేయడం రాష్ట్రపతికి ఇది తొలిసారి కావడం విశేషం. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. రూ.7 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఇటీవల కాలంలో భారీగా పెరిగారు. దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. రీఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, ఐటీ రిటర్న్లు ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ నినాదంతో అభివృద్ధి సాధించాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం ఇండియా. ప్రభుత్వం దేశ్యవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆదునికీకరించింది. భారీగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. -
పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. పన్నుదారులకు ఊరట లభిస్తుందా..?
ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నెలనెలా వస్తున్న ఆదాయాలు, జీతాలు ఏమాత్రం సరిపోవడంలేదని సామాన్యులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వానికి చెల్లించే పన్నుభారం అధికమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పన్నుదారులకు కొంత వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు. దేశంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4-8 శాతంగా నమోదవుతోంది. దాంతో వస్తున్న సంపాదనలో గరిష్ఠంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అదనంగా పన్ను చెల్లింపుదారులకు మరింత నష్టం చేకూరుతుందని భావిస్తున్నారు. అధిక జీతాలున్న వారికి పన్నుస్లాబ్లు పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల థ్రెషోల్డ్ను రూ.20 లక్షలకు పెంచడం వల్ల కొంత ద్రవ్యోల్బణంతో పాటు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2020 కింద కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా పన్నుస్లాబ్లు 5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వార్షికంగా రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రూ.20లక్షల స్లాబ్కు మార్చాలని కొందరు కోరుతున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనని వేచిచూస్తున్నారు. ఏటా స్టాండర్డ్ డిడక్షన్లో భాగంగా ఉన్న రూ.50,000 స్లాబ్ను రూ.1లక్షకు పెంచాలని కొందరు కోరుతున్నారు. -
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
పీఎం కిసాన్ సాయం రూ.9 వేలు? రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్
రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్లో 50 శాతం పెరగవచ్చని అంచనా. ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
కేంద్రబడ్జెట్.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
బడ్జెట్ 2024-25ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దేశ చరిత్రలో కీలకమైన కొన్ని బడ్జెట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. స్వాతంత్య్రం రాకముందే బడ్జెట్.. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్ను బ్రిటిష్ రాణికి సమర్పించారు. స్వతంత్ర భారత తొలి బడ్జెట్.. స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్ను 1947, నవంబరు 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రులు.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు ప్రవేశపెట్టినవారు.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ బడ్జెట్ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టారు. 1962-69 మధ్య 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాలల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్ను సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు, తాజాగా నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సమయం మార్పు.. 1999 వరకు బడ్జెట్ను ఫిబ్రవరిలో చివరి పనిదినాన, సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. అయితే, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్పు చేసి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. బడ్జెట్ తేదీ మార్పు.. బడ్జెట్ను 2016 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. అయితే, 2017 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1కి మార్చారు. అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్లు.. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతిచిన్నది. ఆ బడ్జెట్లో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. సుదీర్ఘ ప్రసంగం.. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు సాగింది. బడ్జెట్ లీక్.. 1950 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ లీక్ అయ్యింది. లీక్ కారణంగా అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించే బడ్జెట్ను, దిల్లీలోని మింట్రోడ్కు మార్చారు. 1980లో నార్త్బ్లాక్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. 1995 వరకు బడ్జెట్ను ఆంగ్ల భాషలో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతులను హిందీ, ఆంగ్లం రెండు భాషల్లోనూ సిద్ధం చేయించింది. పేపర్లెస్ బడ్జెట్.. 2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి సారిగా పేపర్లెస్ బడ్జెట్ను సమర్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పేపర్లెస్ బడ్జెట్ను తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్ విలీనం.. 2017కు ముందు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ, 2017లో ఈ రెండింటిని విలీనం చేశారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..! బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళలు.. ఇందిరాగాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970-71లో ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రేవేశపెట్టి.. రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్కేస్ స్థానంలో సాంప్రదాయ బహీ-ఖాతాలో బడ్జెట్ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది. -
బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ వెల్లడించనున్నారు. లోక్సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రకటించడానికి ముందే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా.. ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద ద్రుష్టి సారించే అవకాశం ఉందని వెల్లడించారు. 👉2024 బడ్జెట్లో డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), బ్రాడ్బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్కు ఎక్కువ నిధులు కేటాయించే సూచనలు ఉన్నాయి. 👉ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును GDPలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 👉కాపెక్స్పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి & వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు. 👉రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 👉వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువని తెలుస్తోంది. 👉గృహాల కోసం ప్రభుత్వం డబ్బును (నిధులు) 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 ట్రిలియన్ డాలర్లకు (12 బిలియన్ డాలర్లకు సమానం) చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్అండ్గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత "సింగిల్ హైబ్రిడ్ స్కీమ్"ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కలకత్తా చాప్టర్) చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు. -
ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల మీద దృష్టి పెట్టనుంది? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందం ఎలాంటి ప్రకటనలు చేయనుందనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల హిందూ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కులం, వర్గం లేదా మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారి అభ్యున్నతిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. యువకులు, మహిళలు, రైతులు, పేదవారిని సంస్కరించడానికి వారి అభ్యున్నతి వైపు దృష్టి కేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ ఉపకరణాలను మెరుగుపరచడానికి, పౌరులకు ఆరోగ్య సంరక్షణ.. ఇతర ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. సీతారామన్ పంట అనంతర పద్ధతులను ఆధునీకరించడం, వివిధ రంగాల్లో తయారీని ప్రోత్సహించడం వంటి ప్రాముఖ్యతలను వివరించారు. బడ్జెట్లో మాత్రమే కాకుండా ఈ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్అండ్డిని మెరుగుపరచడంతోపాటు అగ్రశ్రేణి నిపుణులను సలహాదారులుగా తీసుకురావాలని కూడా చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా? ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చురుకుగా పనిచేస్తున్నాయని ఆమె వెల్లడిస్తూ.. ఈ అభివృద్ధి తక్కువ ఖర్చుతో లావాదేవీలను వేగవంతం చేయడం, అంతర్గత, బాహ్య చెల్లింపులను మరింత సరసమైనదిగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో సానుకూల పనితీరును కనబరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అలంటి వాదనలు చేసేవారు ఆధారాలు చూపాలని సీతారామన్ సవాల్ విసిరారు. -
బడ్జెట్లో రాబోయే కీలక ప్రకటనలు..?
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి దీన్ని పార్లమెంట్లో చదవనున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఇది మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం. అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చులు, గడిచిన ఏడాదిలో ఖజానాకు వచ్చిన రాబడులను వివరిస్తుంది. పేదలు, యువత, రైతులు, మహిళలకు ఈసారి బడ్జెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో ఈ కింది అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళలకు బడ్జెట్ కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో కేటాయింపులు 30 శాతం పెరిగాయని తెలుస్తుంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తీసుకునే డబ్బుపై వడ్డీ రాయితీ పథకం ప్రకటించే వీలుంది. రైతులకు పంటబీమాతో పాటు తమకు తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే అవకాశం ఉంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన ఇంధనంకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. విద్య, ఆరోగ్య సంరక్షణకు మరిన్ని నిధులు కేటాయించే వీలుంది. ఇదీ చదవండి: హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. కిసాన్ సమ్మాన్ నిధి కింది ఇచ్చే నగదును పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పేనా?
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్లో సుధీర్ఘ కాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం ‘భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్’ జనరల్ సెక్రటరీ ముఖేసింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే.. దేశం మహమ్మారి నుంచి కోలుకుని ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. పునసమీక్షించాలని లేఖ కాబట్టి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు విడుతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునసమీకక్షించాలని లేఖ రాశారు. నిలిపివేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విమరణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కరువు భత్యం నిలిపివేసింది కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు చెల్లించేందుకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను జనవరి 2020 నుంచి జూన్ 2021 అంటే సుమారు 18 నెలలు పాటు నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. -
Budget 2024: ఆమె పద్దు ఆరోసారి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా ఆరో బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐదు వార్షిక బడ్జెట్లు కాగా ఇప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. నిర్మలమ్మ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఐదు బడ్జెట్లను సమర్పించిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి మాజీ ఆర్థిక మంత్రుల రికార్డులను అధిగమించనున్నారు. ఆయన పదిసార్లు అత్యధిక సార్లు బడ్జెట్లను ప్రవేపెట్టిన రికార్డ్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్కి ఉంది. మొత్తంగా ఆయన పది బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు. ఏ ఆర్థిక మంత్రికి అయినా గరిష్టంగా ఒక మధ్యంతర బడ్జెట్ సహా వరుసగా ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలోనూ మరో పర్యాయం ఆర్థిక మంత్రిగా కొనసాగితే మరిన్ని బడ్జెట్లు సమర్పించే వీలుంటుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ సమర్పించనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిర్దిష్ట మొత్తాలను ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఓట్-ఆన్-అకౌంట్గా ఉంటుంది. పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నందున ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ఎటువంటి "అద్భుతమైన ప్రకటన" ఉండదని, ఇది సాధారణ ఎన్నికలకు ముందు ఓటు-ఆన్-అకౌంట్ మాత్రమే అని అన్నారు. -
Budget 2024: ట్యాక్స్ పేయర్స్కి ఈ గుడ్ న్యూస్ ఉండొచ్చు!
దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టన్నారు. ఈ బడ్జెట్పై దేశంలోని అన్ని వర్గాలవారు వివిధ ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఈసారి ఏవైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా అని ఆసక్తిగా ఉన్నారు. ఈసారి ప్రవేశపెట్టేది సమగ్ర బడ్జెట్ కాకపోయినా కొన్ని సానుకూల మార్పులపై పన్ను చెల్లింపుదారులలో ఆశలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రధాన పన్ను ప్రయోజనాలు ఉంటాయని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయినప్పటికీ ఈ మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపు ఊరటనిచ్చే కొన్ని చిన్న సర్దుబాట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అవి ఏవేవీ అన్నది ఇక్కడ చూద్దాం.. బెంగళూరుకు హెచ్ఆర్ఏ మినహాయింపు చట్ట ప్రకారం మెట్రో నగరంగా బెంగళూరును గుర్తించినప్పటికీ, ఆదాయపు పన్ను విషయాల పరంగా బెంగళూరును ఇప్పటికీ నాన్-మెట్రో సిటీగా పరిగణిస్తున్నారు. ఈ బడ్జెట్లో బెంగళూరును మెట్రో నగరంగా వర్గీకరించి హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. సెక్షన్ 80D మినహాయింపు పరిమితి పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం సెక్షన్ 80D కింద మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలకు రూ.25,000 నుంచి రూ.50,000కు, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచవచ్చని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవలకు పన్ను తగ్గింపులను సులభతరం చేయడానికి కొత్త పన్ను విధానంలోకి సెక్షన్ 80D ప్రయోజనాలను తీసుకొస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. గృహ కొనుగోలుదారులకు టీడీఎస్ పరిమితి ప్రస్తుతం ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. 50 లక్షలు ఉంది. ఈ పరిమితిని మించితే 1 శాతం టీడీఎస్ ఉంది. ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపులకు సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్ ఆస్తులు విక్రయించే ఎన్ఆర్ఐలకు మరింత పారదర్శకత, అవగాహన తీసుకొస్తుందని భావిస్తున్నారు. మూలధన లాభాలపై పన్ను సరళీకరణ పెట్టుబడి ఆదాయానికి సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను ఎత్తి చూపుతూ ట్యాక్స్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఇండెక్సేషన్కు సంబంధించిన నియమాలను సరళీకృతం చేయడం, లిస్టెడ్, అన్లిస్టెడ్ సెక్యూరిటీల పన్నులో సమానత్వాన్ని తీసుకురావడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. -
బడ్జెట్ ప్రవేశపెట్టని ఆర్థికమంత్రులు.. కారణం..
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడం విశేషం. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం! ‘బడ్జెట్’ పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టని జాబితాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా పనిచేసినప్పటికీ కేంద్ర బడ్జెట్ను సమర్పించలేదు. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి చాలా తక్కువ కాలంపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం రాలేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోయారు. -
కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో కొంత ఉపశమనాన్ని ప్రకటించాలని ప్రజలు భావిస్తున్నారు. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తారు అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకు మేలు జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ను రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు రెట్టింపు చేయాలని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50.7 బేసిస్ పాయింట్ల మేర అంటే దాదాపు రూ.9.07 లక్షల కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈమేరకు నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని కొందరు చెబుతున్నారు. -
Interim Budget 2024: ఆర్థికమంత్రి హల్వా విందు...
2024 మధ్యంతర బడ్జెట్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు ప్రతీకాత్మకంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికశాఖ నార్త్బ్లాక్లో హల్వా విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ అధికారికంగా ప్రారంభమవుతుంది. లోక్సభలో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టేంతవరకూ ముద్రణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ‘లాక్–ఇన్’లో ఉంటారు. బడ్జెట్కు ముందు సంప్రదాయంగా వస్తున్న ఈ హల్వా రుచుల ఆస్వాదన కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి కరాద్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంతా పాండే తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
దేశంలో ఎన్నికలే ఎన్నికలు, మధ్యంతర బడ్జెట్పై పెరిగిపోతున్న అంచనాలు!
ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని, సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చుపై దృష్టి సారిస్తుంది. అయితే, ఓ వైపు దేశంలో ఎన్నికల వాతావారణం అవ్వడంతో మధ్యంతర బడ్జెట్కు ముందు అంచనాలు పెరుగుతున్నాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.5శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి’ అని చావ్లా చెప్పారు. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్) దృష్టిపెడుతూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి, వ్యవసాయం గ్రామీణ ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా లక్ష్యాలను ప్రకటించాలని ప్రజలు ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తుందని తెలిపారు. డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్రాడ్బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు ($48 బిలియన్లు) కేటాయించాలని కేంద్రం యోచిస్తుంది. డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 510 బిలియన్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా అన్నారు. -
వ్యవ‘సాయం’ అందుతుందా..?
భారత్లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయం కీలకపాత్రం పోషిస్తోంది. దేశంలో 42 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ గతంలో కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. దీనికి తోడు వ్యవసాయం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవడం కీలకం. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా అన్నదాత ఆదాయం హెచ్చవుతుందని నిపుణలు చెబుతున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, నాణ్యమైన విత్తనాలు, టెక్నాలజీ వంటివి ఆర్థిక మంత్రికి కీలకంగా మారనున్నాయి. సవాలు విసురుతున్న పరిస్థితులు.. వ్యవసాయ, పశుపోషణ రంగానికి కీలకమైన డీజిల్, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ ఏడాది ఆలస్యం కావడంతో పంట దిగుబడుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఆహారకొరత ఏర్పడుతోంది. వ్యవసాయ ఎగమతులు తగ్గుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు గోధుమ పంటను దెబ్బతీశాయి. గోధుమలు, చక్కెర ఉత్పత్తులను కేంద్రం ఇప్పటికే నిలిపేసింది. ఆధునికీకరణకే పెద్దపీట.. భారత్లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతోంది. దీనికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. భారత్లో రైతుల ఉత్పత్తి.. అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీలను తీసుకురావాల్సి ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రైతులకు సాంకేతికత, దానికి సంబంధించిన పరికరాలు చౌకగా లభించేందుకు ఈ రంగంలోని స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి 2022 బడ్జెట్లోనే పునాదులు వేశారు. కిసాన్ డ్రోన్లను ప్రమోట్ చేసేలా అగ్రిటెక్ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కింద ఓ నిధిని ఏర్పాటు చేసింది. బ్లాక్చైన్, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను వ్యవసాయ రంగానికి అన్వయించడమే అసలైన సవాలు. 2024-25 బడ్జెట్లో వీటికి ప్రత్యేక కేటాయిపులు చేయడంతో పాటు.. పన్ను రాయితీలు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. వ్యవసాయ రుణాలు రూ.22-25 లక్షల కోట్లు..? 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఇచ్చే స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 2% వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. అందువల్లే రూ.3 లక్షల వరకు రుణాలు 7% వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. గడువులోపు బకాయిలు తీర్చేవారికి అదనంగా మరో 3% వడ్డీ మినహాయింపూ ఉంటుంది. దీర్ఘకాల రుణాలనూ రైతులు తీసుకోవచ్చు కానీ.. మార్కెట్ రేటు ప్రకారమే వడ్డీ రేటు ఉంటుంది. -
ఎంఎస్ఎంఈకి ప్రత్యేక ప్యాకేజ్!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో తనకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందని లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) భావిస్తోంది. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో.. ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా తగిన కనిష్ట స్థాయి రుణ రేట్లు పరిశ్రమలకు లభిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. స్థూల దేశీయోత్పతిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 29.15 శాతం కావడం గమనార్హం. బ్యాంకులు– ఎంఎస్ఎంఈల మధ్య సంబంధం అసమానంగా ఉందని, రుణ దాతల విచక్షణ పరిధిలో అసతౌల్యతకు గురవుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) సెక్రటరీ జనర ల్ అనిల్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బడ్జెట్ ప్రయతి్నస్తుందన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ నిర్దిష్ట ఉత్పత్తుల ఎగుమతి వాటా 2023–24లో (సెపె్టంబర్ 2023 వరకు) 45.56 శాతంగా ఉంది. ఇది 2022–23లో 43.59 శాతం. కన్స ల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఎంఎస్ఎంఈలకు మూలధన ప్రవాహాలలో నష్టాలను తగ్గించడానికి క్రెడిట్ గ్యారెంటీలు, బీమా పథకాల వంటి నష్ట నివారణ సాధనాలను ప్రోత్సహించడం మంచిని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో మోటివ్, ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్, ఎలక్ట్రికల్ మెషినరీ, కెమికల్స్ వంటి పరిశ్రమలకు ఈ తరహా చర్యలు అవసరమని వివరించారు. 6 శాతం మాత్రమే ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్ విక్రయాల్లో ఎంఎస్ఎంఈ పాత్ర కేవలం 6 శాతంగా ఉంటోందని పరిశ్రమ పేర్కొంటోంది. -
నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే..
సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ ఇది. 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా మోదీ సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది. సాధారణంగా రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగినప్పుడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సహజం. దీనికితోడు గత బడ్జెట్లలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రకటనలేవీ లేవు. ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో కీలక ప్రకటనలు లేకపోయినప్పటికీ ఉన్నంతలో మధ్యతరగతిని ఆకట్టుకుంటూనే ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్ను రూపొందించడం ఆమె ముందున్న సవాలు. ఇందుకోసం నిర్మలా సీతారామన్, ఆమె టీమ్ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆమె టీమ్లో ఎవరు ఉన్నారు? వారి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.. నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ మంత్రి మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను నిర్మలా సీతారామన్కు అప్పగించారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన నిర్మల.. కెరీర్ తొలినాళ్లలో లండన్లోని ఓ స్టోర్లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్లో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా, తర్వాత రక్షణశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. టీవీ సోమనాథన్, ఆర్థిక శాఖ కార్యదర్శి తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్. గతంలో కార్పొరేట్ వ్యవహారాల జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2015-17 మధ్య ప్రధాని కార్యాలయంలోనూ పనిచేశారు. కలకత్తా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేసిన సోమనాథన్ ప్రపంచ బ్యాంక్లోనూ విధులు నిర్వర్తించారు. బడ్జెట్ బృందంలోని కీలక వ్యక్తుల్లో అత్యంత సీనియర్ ఈయనే. ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది ఈయనే. మరి ఈసారి బడ్జెట్ ఖర్చులను ఎలా రూపొందిస్తారో చూడాలి. పీకే మిశ్రా ప్రమోద్ కుమార్ మిశ్రా(పీకే మిశ్రా) భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ కేడర్కు చెందిన ఆయన 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2001-2004 మధ్యకాలంలో మిశ్రా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అరవింద్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ ఎకానమీ అధికారిగా అరవింద్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. కర్ణాటక కేడర్కు చెందిన ఆయన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అతని పరిధిలోనే ఉన్నాయి. అతను జాయింట్ సెక్రటరీగా పీఎంఓలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో చేరారు. పుణ్య సలిల శ్రీవాస్తవ పుణ్య సలిల శ్రీవాస్తవ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం) కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నవంబర్ 2020 నుంచి అక్టోబర్ 2021 వరకు హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆమె పీఎంఓకు మారారు. ఇదీ చదవండి: పన్ను మినహాయింపు పెంచనున్నారా..? హరిరంజన్ రావు హరిరంజన్ రావు మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పీఎంఓలో సాంకేతికత, పాలనపరమైన వ్యవహారాలు చూస్తున్నారు. రావు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. పీఎంఓలో చేరడానికి ముందు ఆయన టెలికమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేశారు. -
పన్ను మినహాయింపు పెంచనున్నారా..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్ల్లో పన్ను మినహాయింపులు పెంచుతారని పన్నుదారులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఎక్కువ మంది ఆయా ప్లాన్ల్లో అధికంగా కేటాయింపులు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయానికి పెన్షన్, యాన్యుటీ ప్లాన్ల్లో పెడుతున్న పెట్టుబడి చాలా కీలకంగా మారనుంది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్కు సెక్షన్ 80సీ కింద ఇస్తున్న రూ.50,000 పన్ను మినహాయింపును పెంచాలని కోరుతున్నారు. దాంతోపాటు పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు సైతం ఈ మినహాయింపును వర్తింపజేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం ఆ ప్లాన్ల్లో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్ల్లో జీరో రేటింగ్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే వస్తున్న రాబడులపై ట్యాక్స్ భారాన్ని తగ్గించడంలో సహాయపడాలని అంటున్నారు. ఫలితంగా మరింత ఆర్థికభద్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే.. ప్రస్తుతం సెక్షన్ 80సీ పరిధిలోకి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకం, ఈఎల్ఎస్ఎస్ మొదలైన ఇతర పన్ను ఆదా ఉత్పత్తులు వస్తున్నాయి. సెక్షన్ 80డీ కింద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే వీటిలో ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచాలని కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. -
Union Budget 2024: కొత్త బడ్జెట్.. ఆసక్తికర మార్పులు
ఏటా కొత్త బడ్జెట్ వస్తున్నప్పుడల్లా దేశమంతా ఆసక్తిగా చూస్తారు. ఏయే మార్పులు ఉండబోతున్నాయి. పన్నులు ఏమైనా తగ్గుతాయా.. ధరలు తగ్గే వస్తువులేంటి.. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు.. తదితర విషయాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలోనే మార్పు వచ్చింది. ఏళ్లనాటి సంప్రదాయాలు మారాయి. అవేంటి.. ఎందుకు మారాయన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ సమర్పణకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు. ఇందులో ఎటువంటి ప్రధాన ప్రకటనలు ఉండవు. 2024 లోక్సభ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు దీనిని ప్లేస్హోల్డర్గా పరిగణిస్తారు. బడ్జెట్ సమర్పణ తేదీ కొన్నేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్ను సమర్పించేవారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. 2017లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వలసరాజ్యాల కాలంలో మాదిరిగా ఫిబ్రవరి చివరి రోజున కేంద్ర బడ్జెట్ను సమర్పించబోమని ప్రకటించారు. బ్రిటిష్ పాలనలో అనుసరించిన 92 ఏళ్ల పద్ధతికి ముగింపు పలికేందుకు నెల చివరి రోజు కాకుండా ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించనున్నట్లు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీంతోపాటు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త విధానాలు, మార్పులకు సిద్ధం కావడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం ఉందని, అందుకే బడ్జెట్ ప్రదర్శన తేదీని ఫిబ్రవరి 1కి మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ బ్రిటీష్ హయాంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. తర్వాత చాలా ఏళ్లు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. మోదీ ప్రభుత్వంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ను సమర్పించే విధానాన్ని రద్దు చేశారు. రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్తో అనుసంధానం చేయనున్నట్లు 2016లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. బడ్జెట్ సమర్పణ సమయం 1999 వరకు ఫిబ్రవరి నెల చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ను సమర్పించేవారు. బ్రిటీష్ ఇండియా నుంచి సంక్రమించిన ఈ సంప్రదాయం స్వాతంత్ర్యం తర్వాత కూడా మారలేదు. వలసరాజ్యాల కాలంలో బడ్జెట్ సమర్పణ సమయాన్ని బ్రిటన్ స్థానిక సమయం ద్వారా నిర్ణయించేవారు. దీని ప్రకారం బడ్జెట్ను బ్రిటన్లో ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం) సమర్పించేవారు. ఇది భారతదేశంలో సాయంత్రం 5 గంటలకు సమానంగా ఉంటుంది. తర్వాత 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. బడ్జెట్ను మరింత క్షుణ్ణంగా విశ్లేషించడానికి, చర్చించడానికి తగిన సమయం ఉండటమే ఈ మార్పు వెనుక కారణం. -
బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా?
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024 బడ్జెట్లో ఈవీ రంగానికి సానుకూలమైన మద్దతు ప్రకటిస్తారని వాహన తయారీ సంస్థలు ఆశిస్తున్నాయి. 2023లో భారతీయ ఈవీ రంగం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది కూడా ఉత్తమ ఉత్పత్తులను, విక్రయాలను సాధించనున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. 2024లో చాలా వరకు ఫ్యూయెల్ కార్లఉత్పత్తి తగ్గి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమ విడిభాగాలపై వస్తువులు, సేవల పన్ను (GST) రేటును తగ్గించాలని.. బడ్జెట్ 2024లో ఫేమ్ సబ్సిడీ పథకాన్ని పొడిగించాలని పలువురు ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి తప్పకుండా ఫేమ్ III స్కీమ్ పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం అదనపు వనరులను కోరే అవకాశం ఉంది. ఫేమ్ అనేది ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (e-3W), ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (e-4W), ఎలక్ట్రిక్ బస్సుల కోసం అందించే సబ్సిడీ స్కీమ్. ఇదీ చదవండి: చైనా కంపెనీకు చుక్కలు చూపించిన కస్టమర్.. దెబ్బకు రూ.10 లక్షలు ఫైన్! గతంలో 7,000 ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి ఫేమ్ 2 పథకాన్ని రూ. 10000 కోట్ల బడ్జెట్ వ్యయంతో 2019లో మూడు సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సుమారు 1216380 వాహనాలకు ఇప్పటి వరకు రాయితీలు అందించారు. దీని వ్యయం 2023 డిసెంబర్ 21 నాటికి రూ. 5422 కోట్లు. -
Budget 2024: ద్రవ్యలోటు 5.3 శాతానికి కట్టడి
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ఏప్రిల్తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.3 శాతానికి కట్టడి చేయడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రయతి్నస్తుందని భావిస్తున్నట్లు ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ అంచనా వేసింది. అలాగే 2023–24లో 5.9 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని కూడా అభిప్రాయపడింది. ఎన్నికల పరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, 2024–25లో 5.3 శాతానికి లోటును కేంద్రం కట్టడి చేయగలుగుతుందని అభిప్రాయపడింది. వ్యయ కుదింపునకు బదులుగా మూలధన వ్యయం ఆధారిత వృద్ధి ద్వారా ద్రవ్య లోటును తగ్గించుకునే వ్యూహాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు పరిస్థితి కనబడుతోందని వివరించింది. సబ్సిడీ లీకేజీలుసహా అనవసర వ్యయాలను తగ్గించుకోవడం, డిజిటలైజేషన్ వినియోగం ద్వారా పన్ను వసూళ్లను భారీగా పెంచుకోవడం లక్ష్యంగా చర్యలు ఉంటున్నాయని వివరించింది. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. నవంబర్ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. మొత్తం లక్ష్యంలో (రూ.17.86 లక్షల కోట్లు) ఇది 51 శాతం. -
Budget 2024: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..?
కేంద్ర బడ్జెట్ 2024 పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా చూడాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న యూనియన్ బడ్జెట్లో సెక్షన్ 80C కింద మినహాయింపుల పరిమితిని పెంచాలని అంటున్నారు. ఈ మినహాయింపులను చివరిసారిగా 2014-2015 బడ్జెట్లో రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు సవరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈసారైనా మినహాయింపు స్లాబ్ను పెంచుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80C అనేది ఆదాయపు పన్ను చట్టంలో కీలకమైంది. సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వేతనజీవులు స్వల్ప, దీర్ఘకాల పెట్టుబడులు, ఖర్చుల కోసం పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు. సెక్షన్ 80C కింద క్లెయిమ్ అవుతున్న కొన్ని పెట్టుబడులు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) జీవిత బీమా ప్రీమియంలు సుకన్య సమృద్ధి యోజన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. పరిమితిని ఎందుకు పెంచాలంటే.. సెక్షన్ 80C కింద మినహాయింపుల కోసం రూ.1.5లక్షల పరిమితి తొమ్మిదేళ్లుగా అలాగే ఉంది. దీన్ని చివరిగా 2014-15లో సవరించారు. అప్పటినుంచి ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణించి సవరణలు చేయాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఈ పరిమితిలో ఎక్కువ భాగం ప్రావిడెంట్ ఫండ్కే కేటాయించబడుతుందని కొందరు తెలుపుతున్నారు. ఒకవేళ హౌసింగ్ లోన్ ఉంటే అసలు కట్టేందుకే ఈ పరిమితి సరిపోవడంలేదని చెబుతున్నారు. దీన్ని కనీసం రూ.2,50,000కి పెంచాలని అంటున్నారు. -
ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే..
కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న తరుణంలో భారత్ వంటి పెద్ద దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పన్నువసూళ్లు ఆసక్తిగా మారాయి. పరోక్ష పన్నులతోపాటు నేరుగా ప్రజల సంపాదనపై వేసే ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని తెలిపింది. జనవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థిరమైన వృద్ధిరేటు కొనసాగిస్తున్నాయని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 బడ్జెట్ అంచనాల్లో 80.61 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం పేర్కొంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ టాక్స్) రూపేణా రూ.18.23 లక్షలు వసూలు చేయాలని బడ్జెట్ అంచనాల్లో గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది 2022-23 సంవత్సరం రూ.16.61 లక్షల కోట్లతో పోలిస్తే 9.75 శాతం ఎక్కువ. ఇక గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024 జనవరి 10 వరకు ఐటీ రీఫండ్స్ రూ.2.48 లక్షల కోట్లుగా ఉండనున్నాయి. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.17.18 లక్షలకోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16.77 శాతం ఎక్కువ. స్థూల కార్పొరేట్ టాక్స్ (సీఐటీ) వసూళ్లు 8.32 శాతం, వ్యక్తిగత పన్ను ఆదాయం (పీఐటీ) వసూళ్లు 26.11 శాతం పెరిగాయి. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత సీఐటీ వసూళ్లలో నికర వృద్ధిరేటు 12.37 శాతం, పీఐటీ వసూళ్లలో 27.26 శాతంగా నమోదైనట్లు తెలిసింది. -
ఈసారి మధ్యంతర బడ్జెటేనా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ అనేది సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్పించే తాత్కాలిక ఆర్థిక ప్రణాళిక. దాంతో వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్ వెలువరించనుంది. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను సమర్పించే వరకు ప్రభుత్వ వ్యయ అవసరాలను తీర్చడానికి ఇది తాత్కాలిక ఏర్పాటుగా పనిచేస్తుంది. ఏటా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు యూనియన్ బడ్జెట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జరిగే సాధారణ ప్రభుత్వ వ్యయానికి, మధ్యంతర కాలంలో ఖర్చులను భరించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటు అనుమతి అవసరం అవుతుంది. అందుకే మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతారు. ఈసారి ఎలా ఉండబోతుందంటే.. ఒకవేళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెడితే సాధారణంగా వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి ప్రధాన విధాన ప్రకటనలూ ఉండవు. ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, మధ్యంతర బడ్జెట్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ పెద్ద పథకాన్నీ చేర్చకూడదు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్తో ఆర్థిక సర్వేను సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే పన్నుల పెంపు, తగ్గింపు తదితర అంశాలను మధ్యంతర బడ్జెట్లో ప్రకటించవచ్చు. మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వంటి ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి పార్లమెంటు వోటాన్ అకౌంట్ను ఆమోదిస్తారు. ఎలాంటి చర్చ లేకుండానే దీనికి ఆమోదం దక్కుతుంది. వోటాన్ అకౌంట్ సాధారణంగా రెండు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది అవసరమైతే పొడిగించవచ్చు. భారతదేశ ఆర్థిక ప్రణాళిక, పాలనను మధ్య తేడాను అర్థం చేసుకుని బడ్జెట్ను విశ్లేషించాల్సి ఉంటుంది. మధ్యంతర బడ్జెట్ ఆర్థిక స్థిరత్వానికి కీలకం కాగా, పూర్తి సంవత్సర బడ్జెట్ రోడ్మ్యాప్గా పనిచేస్తుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి దిశను నిర్దేశిస్తుంది. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలు.. 2023లో ఎక్కువగా అమ్మిన సంస్థలు ఇవే.. పూర్తికాల బడ్జెట్లో.. పూర్తి సంవత్సర బడ్జెట్లో ఆర్థిక వృద్ధి, మూలధన పెట్టుబడి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. పూర్తి సంవత్సరం బడ్జెట్ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది వివిధ రంగాలు, సంస్కరణల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది.