● కాసులు కురిపించిన ‘ఉపాధి’ రోడ్లు ● సందు గొందుల్లోనూ స
ఉపాధిహామీ పనులు కింద చేపట్టిన సీసీ రోడ్లు కూటమి నేతలకు కాసుల వర్షం కురిపించాయి. అవసరం ఉన్నచోట్ల రోడ్లు వేయడం కంటే..తమ్ముళ్లు ఎక్కడ చెబితే అక్కడ రోడ్లు వేసి అధికారులు కూటమి భక్తి చాటుకున్నారు. ఒక ఇంటికే దర్జాగా సీసీ రోడ్డు వేసినా అధికారులు కళ్లప్పగించి చూసారే కానీ అడ్డు చెప్పకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. వేసిన రోడ్లు సైతం నాసిరకంగా వేసి నాణ్యతకు తీలోదకాలు ఇచ్చారు. అందినకాడికి నేతలు దోచుకొని జేబులు నింపుకోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పలమనేరు మండలంలో పనులు ఇలా..
సచివాలయాలు 12
మొత్తం పంచాయతీలు 10
గ్రామాలు 56
మంజూరైన పనులు 34
నిధుల కేటాయింపు
రూ.1,49,62 కోట్లు
మంజూరైన మీటర్లు 3758
ఇప్పటిదాకా పూర్తయిన పనులు 27
ఇస్టాను సారంగా వేసిన పనులు 4
రోడ్లపైనే వేసిన రోడ్లు 1
అనుమతి లేకుండా వేసిన రోడ్లు 2
నాసిరకంగా ఉన్న రోడ్లు 4
బిల్లుల చెల్లింపులు రూ. 1 కోటి
పనులు దక్కించుకున్న
కూటమి నేతలు 34 మంది
పలమనేరు : కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు ఉపాధిని కల్పించే పథకంగా పలమనేరు నియోజకవర్గంలో మారింది. తమకిష్టమైన చోట పనులు, కావాల్సిన వారికి సీసీ రోడ్లు, కాంట్రాక్టు పొందిన వారు మరొకరికి కమీషన్ కింద పనులు, పలుచోట్ల నాసిరకంగానే పనులతో ప్రజాధనాన్ని కూటమి నేతలు ఎడాపెడా మేసేశారు.
నేతలు ఎక్కడ చెబితే అక్కడే పనులు
పలమనేరు మండలంలో కూటమి నేతలు ముందుగా ఎక్కడ చెబితే అక్కడ మాత్రం పనులను చేపడుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా గతంలో సీసీ రోడ్లు వేసి దెబ్బతిన్నవి లేదా అవసరమైన వీధుల్లో వీటిని వేయకుండా టీడీపీ నాయకులు సూచించిన వీధుల్లో పనులను చేపట్టారనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరుల ఇళ్లకు వీలుగా సీసీ రోడ్లను నిర్మించడం విమర్శలకు తావిస్తోంది.
కమీషన్లు తీసుకొని వదిలేసి..
కొందరు సీసీ రోడ్ల పనులను చేజిక్కించుకొని వాటిని ఎంతో కొంత కమీషన్ తీసుకొని డబ్బులున్న కాంట్రాక్టర్లకు అంటగట్టి పనులు చేపించారనే విమర్శలు ఉన్నాయి. ఉపాధి పనులు కూటమి నేతల జేబులు నింపేందుకు తప్ప గ్రామాల్లోని ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై సంబంధిత అధికారులను అడిగినా మాదేముంది అంతా అధికారంలోని వారి ఇష్టమే కదా అనే మాట వినిపిస్తోంది.
నాణ్యత ప్రమాణాలేవీ...?
సీసీరోడ్ల నిర్మాణాల్లో నిబంధనలు కూటమి కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. సీసీ రోడ్డు కింద పట్ట, బెర్ములు కనిపించలేదు. బస్తా సిమెంట్కు రెండు బస్తాల ఇసుక, నాలుగు తట్టల కంకర వేయాలి. వీటిని పెద్దగా పాటించలేదు. ఇక కాంక్రీట్ మిక్చర్లోనూ తక్కువరేటున్న సిమెంట్ను వాడారు. ఇన్నాళ్లకు డబ్బు సంపాదించుకొనే అవకాశం దక్కిన కూటమి కాంట్రాక్టర్లు దొరికినంత ఎక్కువగా సంపాదించేందుకు నాణ్యతకు తిలోదకాలిచ్చారనే విమర్శలు ఉన్నాయి.
30 నుంచి 40 శాతం నేతల జేబుల్లోకి...
పలమనేరు మండలంలో జరిగిన పనుల్లో వాటిని దక్కించుకున్న నేతలకు 30 నుంచి 40 శాతం జేబుల్లోకి అక్రమంగా వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే సీసీ రోడ్లను వేసిన కాంట్ట్రార్లకు పది శాతం దక్కేది గగనంగా ఉండేది.. కానీ కూటమి నేతలు నాసిరంగా పనులు చేపట్టి దొరినంత దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సైతం అధికార పార్టీ నేతలు కావడంతో చేసేదేమీ లేకుండా మొక్కుబడిగా తనిఖీలు చేసి మమ అనిపించి కూటమి నేతలకు దాసోహమయ్యారు.
పలమనేరు మండలంలో పరిస్థితి ఇలా..
పలమనేరు మండలంలోని మొరం పంచాయతీలోని రాజీవ్నగర్ కాలనీలో డ్రైన్లకు మంజూరైన నిధులను సీసీ రోడ్డుకు వినియోగించుకున్నారు. గతంలో గ్రామానికి వేసిన సీసీ రోడ్డుకు మిగిలిన చోట మాత్రం సీసీ రోడ్డును వేశారు.
జరావారిపల్లిలో ఇంకా సీసీ రోడ్ల పనులు మొదలు కాలేదు. ఇదే పంచాయతీలో పందేరుపల్లి సమీపంలోని తెల్లగుండ్లపల్లి కాలనీకి రోడ్డు దెబ్బతిన్నా సీసీ రోడ్డుకు ఎంపిక చేయలేదు.
సముద్రపల్లి పంచాయతీ నూనేవారిపల్లిలో ఎంపిక చేసిన వీధిలో పనులు ఇంకా చేపట్టలేదు.
జంగాళపల్లిలో అనవసరమైన వీధుల్లో ఇప్పటికే సీసీ రోడ్లను వేశారు. అక్కడ వైఎస్సార్సీపీ సానుభూతి పరులున్న వీధులను పట్టించుకోలేదు.
కోతిగుట్టలో కేవలం టీడీపీ సానుభూతిపరుడి ఇంటికి సౌకర్యంగా సీసీ రోడ్డును నిర్మించారు.
మండలంలో సాగిన ఈ పనులు పలుచోట్ల నాసిరకంగా ఉన్నా సంబంధిత శాఖ అధికారులు నోరు మెదపకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
● కాసులు కురిపించిన ‘ఉపాధి’ రోడ్లు ● సందు గొందుల్లోనూ స
Comments
Please login to add a commentAdd a comment