
కోల్కతా: రేషన్ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లిక్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
మల్లిక్ను కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం కస్టడీ కోరుతామని చెప్పారు. 18 గంటలపాటు ప్రశ్నించినా నోరువిప్పలేదని, విచారణకు సహకరించలేదని అన్నారు. కాగా, మంత్రి మల్లిక్ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిసింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.