Ration goods
-
కందిపప్పు హుష్కాకి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్ ఇస్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి. ఒక నెలలో వచ్చిన రేషన్ సరుకులు మరుసటి నెలలో ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఎన్నికల్లో పేదల ఓట్లను దండుకోవడమే పరమావధిగా తాము అధికారంలోకి వస్తే రేషన్లో 18 రకాల సరుకులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు.. పీఠం ఎక్కిన తర్వాత పత్తా లేకుండా పోయారు. పేదల నోటికి అందాల్సిన తిండిని లాగేస్తున్నారు. కార్డుదారులకు కిలో కంది పప్పు కూడా ఇవ్వలేక ముఖం చాటేస్తున్నారు. కార్డు తీసుకుని ఎండీయూ వాహనందగ్గరకు వెళ్లిన ప్రతిసారీ లబ్దిదారులకు కందిపప్పు లేదనో, రాలేదనో, వచ్చింది సరిపోలేదనో సమాధానమే ఎదురవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెప్టెంబర్ లో అసలు పంపిణీ ఊసే లేదు. అంటే తొలి మూడు నెలల్లో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా కేవలం 2 శాతం (2.50 లక్షల) కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందించారు. అక్టోబర్లో 2,981 టన్నులు, నవంబర్, డిసెంబర్లో 10,800 టన్నుల చొప్పన, జనవరిలో 8,700 టన్నులు, ఫిబ్రవరిలో 3,100 టన్నుల సరఫరాతో సరిపెట్టేశారు. వాస్తవానికి నెలకు కార్డుదారులు అందరికీ కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేయాలంటే 15 వేల టన్నులు అవసరం. సగటున 7 వేల టన్నులకుపైగా కార్డుదారుల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 36 వేల టన్నులు మాత్రమే. పండుగ పూట కూడా పప్పన్నం లేదు.. పండుగల సమయంలో కందిపప్పు అసలే పంపిణీ చేయలేదు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.180–220 వరకు ధర పలుకుతున్న సమయంలో పేదలు కందిపప్పు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం నిరాశే మిగిల్చారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 14 వేల టన్నుల కందులను మద్దతు ధరపై ఏపీకి కేటాయిస్తే వాటిని మరాడించగా వచ్చిన కంది పప్పును మాత్రమే పంపిణీ చేశారు. టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారన్న కారణంతో కొనుగోలుకు ముందుకు వెళ్లడం లేదు. దీంతో నిల్వలు ఖాళీ అయిపోవడంతో మార్చి నుంచి కందిపప్పు పంపిణీ నిలిచి పోయింది. రాజధాని ప్రాంత జిల్లాల్లోనే ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్కు కూడా కిలో కంది పప్పు చేరని దుస్థితి. సబ్సిడీ భారం తగ్గించుకునే కుట్ర కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీ రేషన్లో కోత పెట్టేందుకే కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే కందిపప్పు పంపిణీని కావాలనే నిలిపి వేస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా కందిపప్పు ధర కిలో రూ.180–220కి పైగా పలికింది. ఆ సమయంలో ప్రభుత్వం పేదల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎంత రేటు పెరిగినప్పటికీ (రూ.170కిలో) కిలో కందిపప్పును రాయితీపై రూ.67కే అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని భారంగా భావిస్తోంది. రేటు పెంచితే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దీనికి బదులు ఎక్కువ రేటు పెట్టి కొని కందిపప్పును ఇవ్వడం కంటే పంపిణీని ఎత్తేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే.. దేశీయంగా కందిపప్పు ధరలు కొంతమేర దిగి వచ్చాయి. హోల్ సేల్లో కిలో రూ.100 (సాధారణం), క్వాలిటీ రకం రూ.110–118 పలుకుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు సబ్సిడీపై కందిపప్పును అందించక పోవడం శోచనీయం. మరో వైపు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పౌర సరఫరాల సంస్థపై ఆర్థిక భారం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అసలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపి వేయడం కొత్తేమీ కాదు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93 లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వస్తువులు ఇస్తామన్న ప్రభుత్వం ఒకటి రెండు సరుకులతోనే సరిపెడుతోంది. బియ్యం, చక్కెర తప్ప మిగిలినవి ఏవీ పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. కందిపప్పు చూద్దామంటే కనిపించకుండా పోతోంది. ప్రభుత్వం ఇలాగే వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తే కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి. – హుసేనమ్మ, కానాల గ్రామం, నంద్యాల జిల్లా స్టాక్ రాలేదని చెప్పారు తిరుపతి జిల్లాలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డుదారులకు కందిపప్పును సక్రమంగా ఇవ్వడం లేదు. మొదటి మూడు నెలలు స్టాక్ రాలేదని చెప్పారు. ఆ తర్వాత కొంత మేరకు మాత్రమే వచ్చిందని తెలిపారు. తాజాగా మళ్లీ రాలేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం కందిపప్పు వస్తుందని.. అయితే కొందరు డీలర్లు డీడీ కట్టడం లేదని చెబుతున్నారు. మొత్తంగా అయితే కందిపప్పు 50 శాతం మంది కార్డుదారులకు సక్రమంగా ఇవ్వడం లేదు. చౌకదుకాణాల్లో కేజీ కందిపప్పు రూ.67కే లభిస్తుంది. మార్కెట్లో రూ.120 నుంచి రూ.130 వరకు చెల్లించాల్సి ఉంటుంది. – గురవయ్య, వాకాడు, తిరుపతి జిల్లా జనవరి నెలలో సగం మందికే పంపిణీ ప్రతినెలా రేషన్ డిపోల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమ పిండి తదితర వస్తువులను సరఫరా చేయాల్సి ఉన్నా ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది. జనవరి నెలలో కందిపప్పు కొంత మందికి మాత్రమే మా ప్రాంతంలో అందజేశారు. మిగిలిన వారు రేషన్ దుకాణదారుడిని అడిగితే నిల్వలు అయిపోయాయని సమాధానం ఇచ్చారు. – ఉరిటి అప్పలనాయుడు, ఎమ్మార్ నగరం, పార్వతీపురం మండలం సరిగా ఇవ్వడం లేదు నేను ఆటో డ్రైవర్గా పని చేస్తున్నా. మా కుటుంబంలో నలుగురం ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపు నుంచి బియ్యం, బ్యాళ్లు (కంది పప్పు), చక్కెర తదితరాలు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాళ్లు ఇవ్వడం లేదు. దీంతో బయటి మార్కెట్లో కేజీ రూ.150 పెట్టి కొనుగోలు చేస్తున్నాం. – రాజశేఖర్, గణేష్నగర్, కర్నూలు ఒకటి, రెండు నెలలే.. కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, గోధుమ పిండి, రాగిపిండి, రాగులు తదితర సరుకులు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లో ఒకటి రెండు నెలల్లో మాత్రమే అదీ కొద్ది మందికే సరఫరా చేశారు. – హయగ్రీవాచారి, రాయపాడు గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా నమ్మించి మోసం చేయడమేకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాల్సిన కంది పప్పును సక్రమంగా అందించడం లేదు. ప్రస్తుతం ప్రతి నెల బియ్యం, పంచదారతో సరిపెడుతున్నారు. పేద ప్రజలకు కంది పప్పు ఇవ్వడమే మానేశారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. – డి.రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా -
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ అరెస్టు
కోల్కతా: రేషన్ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లిక్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మల్లిక్ను కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం కస్టడీ కోరుతామని చెప్పారు. 18 గంటలపాటు ప్రశ్నించినా నోరువిప్పలేదని, విచారణకు సహకరించలేదని అన్నారు. కాగా, మంత్రి మల్లిక్ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిసింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదో విప్లవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో తెచ్చిన మార్పులు అందరికీ ఆహారం, ఇతర నిత్యావసరాలు అందాలన్న ప్రభుత్వ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నాయి. ఇప్పటికే ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ విధానం ప్రజా మన్ననలు పొందింది. వలంటీరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం, సచివాలయాల పాలన ప్రజలకు అతి దగ్గరగా కొనసాగుతుండటం వల్ల ప్రజాపంపిణీ మరింత ప్రయోజకత్వాన్ని సంతరించుకొంది. దీంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలోనే చౌక డిపోల నుంచి ఇంటిముందుకు ప్రత్యేక సంచార వాహనాలు సరుకులు తీసుకురావడం దేశంలో ఇదే మొదటిసారి. కుటుంబంలో ఏ ఒక్క లబ్ధిదారుడయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. పెద్దలు కుటుంబ పోషణ కోసం ఇంటి నుంచి పని చేసే ప్రదేశాలకు వెళ్ళిన సమయాల్లో పిల్లలు సైతం ఈ సంచార వాహనాల నుంచి సరుకులు తీసుకోవచ్చు. చిన్నా చితకా కూలి పనులు చేసుకు బతికే పేదల చెంతకు సత్వర సేవలు అందాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా ఇక్కడ నెరవేరుతుంది. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం 2013’ పోషకాహార భద్రతను అందించడం లక్ష్యంగా సాగుతోంది. ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. సరస మైన ధరలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలసిన బాధ్యత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ బియ్యం, గోధుమలను భారత ఆహార సంస్థ నుంచీ, చక్కెరను పరిశ్రమల నుంచీ సేకరించి ప్రజలకు చేరుస్తోంది. చౌక ధరల దుకాణాలు ప్రజాపంపిణీ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మిల్లుల నుంచి మండల స్థాయి నిల్వ కేంద్రాలకు ‘భారత ఆహారసంస్థ’ సరకు రవాణా చేస్తుంది. ఆ సరుకు నిల్వ కేంద్రాల నుంచి లబ్ధి దారుల ఇంటి మెట్ల వరకు సరుకులు చేర్చడం ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నూతన అధ్యాయం సృష్టించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ, విపత్తులలోనూ ఆహారం, వస్తువుల పంపిణీ చౌకధరల దుకాణాల నుంచే జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ దుకాణాలు ప్రజలకు ఆహారాన్ని అందించడంలో అవిశ్రాంతంగా కృషి చేశాయి. కొన్ని జిల్లాల్లో 25 కిలోమీటర్ల పరిధిలోని భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి చౌకధరల దుకాణాలకు నేరుగా ఆహార ధాన్యాల తరలింపు కూడా జరుగుతోంది. తొలిదశ రవాణా, నిర్వహణ ఛార్జీలను నివారించడం ద్వారా విజయ వాడ, విశాఖపట్నంలలో చౌక ధరల దుకాణాల డీలర్లు నేరుగా మండల స్థాయి సరుకు నిల్వ కేంద్రాల నుంచి సరుకు తీసుకెళ్తున్నారు. ఇలా భారత ఆహారసంస్థ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఒక కారణం. గ్రామ స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ పాలనా యంత్రాంగంలో చోటు చేసుకున్న మార్పులు ఉద్యోగుల్నీ, అధికారులనూ పజలపక్షం నిలబెట్టాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ సరుకు పంపిణీ మొదలయిన తర్వాత లబ్ధిదారులు పదిశాతం మంది పెరిగారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సంచార వాహ నాల ద్వారా ప్రజాపంపిణీ జనామోదం పొందిందని అర్థమ వుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థను ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’, ‘మధ్యాహ్న భోజన పథకా’లకు కూడా విస్తరించారు. దీనితో సకాలంలో లబ్ధిదారులకు ఆహారపదార్థాలు అందించ గలుగుతున్నారు. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో ఆహార, పౌర సరఫరాల శాఖకు రూ. 3,725 కోట్లు కేటాయించారు. ఇటువంటి పథకాలు, ప్రభుత్వ విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ‘ఆహార భద్రత’ స్థాయి పెరిగింది. గతంలో కంటే పేదలకు ప్రభుత్వం పట్ల మనస్సులో విశ్వాసం నిండింది. భారత ప్రభుత్వ ‘వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ’ మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రకటన ద్వారా రాష్ట్ర ఆహార కమిషన్ ‘జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013’లోని సెక్షన్ 16 అమలును సమీక్షిస్తుంది. నేటి ‘ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్’ దాని పరిధిలో శక్తి మంతంగా పనిచేస్తోంది. ఆహార భద్రత, హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. అధికారులు, ఉద్యో గులు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షిస్తోంది. ప్రజా ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కరిస్తోంది. అంగన్ వాడీ కేంద్రాల్నీ, ప్రభుత్వ గురుకులాల్నీ, వసతి గృహాలనూ తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు పెడుతున్న ఆహారం, వసతుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ విద్యాలయాలు, హాస్టళ్లకు నాణ్యమైన ఆహార పదార్థాలు సక్రమంగా సరఫరా జరుగుతుందో లేదో తనిఖీ చేస్తోంది. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్లో భారత ఆహార భద్రతాచట్టం పటిష్టంగా అమలు జరుగుతుందని చెప్పొచ్చు. దీని కోసం స్థానిక ఏపీ ఆహార కమిషన్ అన్ని విధాలా సమర్థంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘వలంటీర్’ వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా ‘ఇంటిదగ్గరకే ప్రభుత్వ పాలన’ అనే లక్ష్యాన్ని అక్షరాలా సాధించిందని చెప్పడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చిన మార్పులే నిదర్శనం. ప్రభుత్వ సేవలు భౌతిక రూపంలో ఇంటిముందుకు నడిచి రావడం కన్నా ఏ ప్రజా పంపిణీ వ్యవస్థ అయినా సాధించగల విజయం ఏముంది? కాట్రగడ్డ సురేష్ వ్యాసకర్త ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షులు ‘ 94412 64249 -
CM YS Jagan: 48 గంటల్లో సాయం
వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్తో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్ సరుకులు అందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సాయానికైనా సిద్ధం.. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్ కాల్ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. వరద తగ్గగానే పంట నష్టం అంచనా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి, క్లోరినేషన్ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి. అదనపు సిబ్బంది తరలింపు.. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. కరకట్ట పరిశీలన.. పూడికతీత గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి. తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి. అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ.. గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్కళ్యాణ్ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. -
బియ్యం బండిపై మొండిగా!
సాక్షి, అమరావతి: అది రెక్కాడితేగానీ డొక్కాడని పేదల కోసం ఎప్పుడో ప్రకటించిన పథకం. అదేమీ కొత్తది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. క్యూ లైన్లలో నించుని, కూలి పనులు మానుకుని చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ఇన్నాళ్లకు తమ ఇంటివద్దే రేషన్ బియ్యం అందబోతున్నాయని గ్రామీణ పేదలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పేదల ఇబ్బందులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఓ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, పేదలకు తిండిగింజలు అందించటాన్ని సానుకూలంగా చూడాలని హైకోర్టు సైతం సూచించినా పెడచెవిన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన మొబైల్ వాహనాలపై ఉన్న రంగులతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బొమ్మలను తొలగించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. తొలుత ఒక వాహనానికి మాత్రం ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి తాను పరిశీలించేందుకు తీసుకుని రావాలని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగు మార్చిన ఆ వాహనాన్ని పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆ మార్పులకు తాను అనుమతిస్తేనే వాహనాలు తిప్పాలన్నారు. ముందస్తు వ్యూహంతోనే.. మొబైల్ వాహనాలకు ప్రస్తుతం ఉన్న రంగులను మార్పు చేసి పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పాత రంగులు వేయాలని భావించరాదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ ప్రకటించారు. దీన్నిబట్టి ఆయన ముందస్తు వ్యూహంతో, నెలల తరబడి ఎన్నికల కోడ్ అమలులో ఉండేలా పక్కా స్క్రిప్టు ప్రకారం వ్యవహరిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఎప్పుడో సిద్ధమైన వేల వాహనాలకు ఇప్పటికిప్పుడు రంగులు మార్చడం సాధ్యమయ్యే పనేనా? ఇదంతా ఇప్పట్లో జరిగేపని కాదనే ఎస్ఈసీ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉత్తర్వును జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చినా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సరుకుల పంపిణీ కోసం మొబైల్ వాహనాలను వినియోగించడానికి వీల్లేదని గత నెల 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పథకం రాజకీయ కార్యక్రమం కాదని, ఈ పథకం పేదలకు ఎంత అవసరమో గమనించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇంటింటా రేషన్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న ఐదు రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనాల గురించి ఎస్ఈసీకి పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించడంతో పాటు పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చారు. పథకం అమలుæ కోసం వినియోగించనున్న మొబైల్ వాహనాలను ఈనెల 3న నిమ్మగడ్డ పరిశీలించారు. అయితే ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు సూచించిన విషయాలను ఆయన ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తొలుత మొబైల్ వాహనాలపై ఉన్న రంగులను తొలగించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడంతో పేదలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. -
నేటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ
సాక్షి, అమరావతి: బియ్యం కార్డుదారులకు నేటి (సోమవారం) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఉచిత సరుకుల పంపిణీ జరగనుంది. కోవిడ్–19 వైరస్ కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికే లబ్ధిదారులకు ఏడు సార్లు ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 8వ విడతలో భాగంగా కార్డులో పేర్లు నమోదై ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. -
రేపటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ
సాక్షి, అమరావతి: పేదలకు ఎనిమిదో విడత ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సరుకులను సిద్ధం చేసింది. సోమవారం నుంచి లబ్ధిదారులు బియ్యంతో పాటు శనగలను ఉచితంగా తీసుకోచ్చు. మండల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి అవసరమైన సరుకులను ఇప్పటికే రేషన్ షాపులకు తరలించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు కార్డుల్లో పేర్లు నమోదైన ఒక్కో వ్యక్తికి ఐదు కిలోలు, కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రమవుతున్నందున ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. భౌతిక దూరం తప్పనిసరి ► రేషన్ షాపుల వద్ద గుంపులుగా ఉండకూడదు. విడతల వారీగా రావాలి. ► బయోమెట్రిక్ వేసే ముందు, ఆ తర్వాత చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ► శానిటైజర్, నీళ్లు, సబ్బును రేషన్ డీలర్లు అందుబాటులో ఉంచాలి. ► సోమవారం నుంచి 28వ తేదీ వరకు రేషన్ షాపులను తెరవాలి. ► ఈ దఫా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధిపొందనున్నారు. -
తొలి రోజు 15.22 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7వ విడత ఉచిత సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం కార్డులో పేరున్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. కరోనా కారణంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుమిగూడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్నాకే.. లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నారు. ఇందుకు అవసరమైన శానిటైజర్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఏడో విడత ఉచిత సరుకులను మొదటి రోజైన శుక్రవారం 15,22,822 కుటుంబాల వారు తీసుకున్నారు. -
మరోసారి ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మరో విడత ఉచితంగా సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుపేదలెవ్వరూ ఖాళీ కడుపుతో ఉండటానికి వీలులేదని భావించిన ప్రభుత్వం ఏడో విడత పంపిణీలో భాగంగా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. చక్కెరకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఏడో విడత పంపిణీ ఈ నెల 3నుంచి ప్రారంభిస్తారు. బియ్యం కార్డులో పేర్లు నమోదైన ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల కోసం రేషన్ డీలర్లు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
ట్రాన్స్జెండర్లకు రేషన్ సరుకులు ఇచ్చారా?
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు రేషన్ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్కుమార్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. వైరస్ వ్యాప్తికి గురయ్యే ట్రాన్స్జెండర్లకు వైద్య సహాయం అందించేందుకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వారిని జనరల్ వార్డులో ఉంచితే ఇతరులతో వారు సమస్యలు ఎదుర్కొనవచ్చునని వ్యాఖ్య చేసింది. ఇలా చేయడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం కోర్టు కేసు విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. -
రెండు రోజుల్లో అరకోటి కుటుంబాలకు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ సరుకులను రెండు రోజుల్లో 50,99,293 కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు ఇప్పటికే మూడు విడతలు బియ్యంతో పాటు కందిపప్పు / శనగలు పంపిణీ చేశారు. నాలుగో విడత పంపిణీ శనివారం నుంచి ప్రారంభించారు. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు వెనక్కు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ డీలర్లు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుల వద్దే ఉండి పంపిణీ చేస్తున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా మానవతా దృక్ఫథంతో సరుకులు ఇవ్వాలని డీలర్లందరితో చర్చించి నిర్ణయించినట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. అత్యధికంగా ‘అనంత’లో... ► నాలుగో విడత ఉచిత రేషన్తో ఆదివారం నాటికి అరకోటి కుటుంబాలు లబ్ధి్దపొందాయి. ► 12,61,917 కుటుంబాలు పోర్టబులిటీ ద్వారా రేషన్ తీసుకున్నాయి. ► రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్ల ద్వారా 2.51 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. ► అత్యధికంగా అనంతపురం జిల్లాలో 44.05 శాతం కుటుంబాలు సరుకులు అందుకున్నాయి. -
నేటి నుంచి 4వ విడత ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. లాక్డౌన్తో పనులు లేక.. పేదలు ఆకలి బాధలతో ఇబ్బంది పడకుండా వారిని ఆదుకునేందుకు మార్చి 29 నుంచి ఇప్పటివరకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతోపాటు కందిపప్పు లేదా శనగపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గొడుగులు ఉపయోగిస్తే మంచిది – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ ఎండలు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చే కార్డుదారులు గొడుగులు ఉపయోగిస్తే మంచిది. గొడుగు వల్ల వ్యక్తికి, వ్యక్తికి మధ్య దూరం ఉంటుంది. సరుకుల పంపిణీలో భాగంగా బయోమెట్రిక్ వేయడం తప్పనిసరి. కోవిడ్–19 నియంత్రణలో భాగంగా చౌక దుకాణాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ రేషన్ తీసుకునే ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా గతంలో మాదిరి ఈసారి కూడా సరుకుల పంపిణీకి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశాం. ► శనివారం నుంచి రేషన్ కార్డులో నమోదై ఉన్న ప్రతి సభ్యుడికి ఐదు కిలోల బియ్యంతోపాటు కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా ఇస్తారు. ► రాష్ట్రంలో 1,48,05,879 పేద కుటుంబాలకు ఉచితంగా సరుకులు అందనున్నాయి. ► అర్హత ఉండి బియ్యం కార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో కొత్తగా 81,862 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయనున్నారు. ► ఇప్పటికే బియ్యం, శనగలు రేషన్ షాపులకు చేరుకున్నాయి. ► కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. షాపుల వద్ద శాని టైజర్లను అందుబాటులో ఉంచారు. ► ఒకేసారి రేషన్ షాపుల వద్దకు రాకుండా టైమ్స్లాట్తో కూడిన కూపన్లను లబ్ధిదారులకు జారీ చేశారు. కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్, ఏ తేదీలో, ఏ సమయానికి వెళ్లి రేషన్ తీసుకోవచ్చనే పూర్తి వివరాలు పొందుపరిచారు. ► కార్డుదారులు రేషన్ తీసుకునే ముందు ఈ–పాస్లో బయోమెట్రిక్ తప్పనిసరి. ► లబ్ధిదారులు తమ సొంత ఊరిలో లేకపోయినా పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. -
3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు
సాక్షి, అమరావతి: అధికారులు, రేషన్ డీలర్లు, గ్రామ, వార్డు వలంటీర్ల కృషితో మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 86.23 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత రేషన్ సరుకులు అందాయి. శనివారం ఒక్క రోజే 33.26 లక్షల మంది కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ఇప్పటి వరకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 8,524 మెట్రిక్ టన్నుల శనగల్ని పేదలకు పంపిణీ చేశారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18.67 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డులున్న 1,47,24,017 కుటుంబాలకు సరుకులు అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియోకార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
ఏపీ : రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రెండో విడత రేషన్ సరకుల పంపిణీ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న వారికి ఒక్కో కుటుంబానికి కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.రెడ్ జోన్ ఏరియాల్లో నేరుగా కార్డుదారుని ఇంటికే ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు. తొలి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందిస్తున్నారు. అందరూ ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా సమయాలను సూచిస్తూ వాలంటీర్లు కూపన్లు పంపిణీ చేశారు. కార్డుదారులు తమకు ఇచ్చిన కూపన్లోని సమయాల్లోనే రేషన్ షాపుకు వచ్చి సరుకులను తీసుకెళ్తున్నారు. ఇక లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ లేకుండానే సరుకులను అందజేస్తున్నారు. నేరుగా ఇంటికే రేషన్..! లాక్డౌన్ నేపథ్యంలో రెండో విడత ఉచిత రేషన్ కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఉచిత డోర్ డెలివరీని మంత్రి పేర్ని నాని, ఆర్డీవో ఖాజావలీ ప్రారంభించారు. కార్డులోని కుటుం సభ్యులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం, ప్రతి కార్డుకి కిలో శనగలు పంపిణీ చేశారు. 27 వరకు అందిస్తాం : మంత్రి వెల్లంపల్లి రెండో విడత ఉచిత రేషన్ను ఈ నెల 27వరకు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ తూర్పులో రెండో విడత రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెల్లకార్డు లేకపోయినా పేదవానిరి గుర్తిస్తే సరుకులు అం దిస్తామని తెలిపారు. ముందుగా రెడ్ జోన్ల ప్రాంతాలతో ఇంటికే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని, ఆతర్వాత అన్ని ప్రాంతాల వారికి అందిస్తామని చెప్పారు. ►తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరడ గ్రామంలో రెండో విడత బియ్యం పంపిణీని ఆర్డివో చిన్న కృష్ణ ప్రారంభించారు. ►నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు ఆర్ఆర్ కాలనీలో రెండో విడత రేషన్ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్రెడ్డి మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు సార్లు రేషన్ అందిస్తున్నారని తెలిపారు. ►కర్నూలు జిలాల్లోని 2436 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా 2,036 కౌంటర్లు ఏర్పాటు చేసి జిల్లాలోని 11.91 లక్షల కార్డు దారులకు రేషన్ అందిస్తున్నారు. ►వైఎస్సార్ జిల్లా రామరాజుపల్లిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటించి ఉచిత రేషన్ సరకులను అందించారు. రేషన్ సరకులకు వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కూపన్లలో తెలిపిన సమయానికే రేషన్కు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ►వైయస్సార్ జిల్లా రాయచోటిలో తెల్లవారుజామున ఆరు గంటల నుంచి విపత్తు పరిహారం క్రింద ఎపి సర్కార్ అందిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం కోనసాగుతుంది. సచివాలయ, రెవిన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. గుంపులు గుంపులుగా లబ్ధిదారులు రాకుండా ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా టైమింగ్ స్లాట్ ఇవ్వడంతో లబ్ధిదారులు సమయపాలన పాటిస్తూ, భౌతిక దూరం వహిస్తూ రేషన్ తీసుకోంటున్నారు. ►తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 16.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 600 కార్డులు దాటితే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసి రేషన్ సరుకులను అందిస్తున్నారు. ►కృష్ణా జిల్లా నందిగామ నియోజవర్గంలో ఉదయం 6 గంటలకే రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. కేటాయించిన సమయంలో కార్డు దారులను వాలంటీర్లు రేషన్ షాపుకు తీసుకొస్తున్నారు. ►శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8.29 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని అర్హులైన 14677 మందిని గుర్తించి వారికి కూడా సరుకులు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,300 టన్నుల బియ్యం, 824 టన్నుల శనగలు పంపిణీ చేయనున్నారు. ►అనంతపురం జిల్లా కదిరిలో రేషన్ సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా.సిద్దారెడ్డి ప్రారంభించారు. ►కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రేషన్ దుకాణం షాప్ నెం 1,2,4,5,13,14, 114 లలో ఎమ్మెల్యే ఆర్థర్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. చౌక దుకాణం వద్ద సామాజిక దూరం పాటించాలని లబ్దిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కోసం క్యూలైన్లలో ఉన్న వారికి మాస్కలు,శానటైజర్లు పంపిణీ చేశారు. 4వ చౌక దుకాణం వద్ద రేషన్ పంపిణీ సరిగ్గా జరగడం లేదని డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా, సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఏపీ: నేటి నుంచి ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్ సరుకులను నేటి నుంచి అందించనున్నారు. రేషన్ షాపులకు సరుకులు ఇప్పటికే చేరుకున్నాయి. మొదటి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి ∙రెండో విడత సరుకులను లబ్దిదారులకు పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందించనున్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 29 వరకు మూడు విడతలు రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. –ఈసారి రేషన్ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా లబ్ధిదారులకు టైం స్లాట్తో కూడిన కూపన్లు జారీ చేశారు. –వలంటీర్ల ద్వారా కూపన్లను కార్డుదారులకు అందిస్తున్నారు. –కూపన్లపై రేషన్ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వివరాలు ముద్రించి ఉంటాయి. –లబ్దిదారులు వేలిముద్ర వేయకుండా వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారా రేషన్ సరుకులు ఇస్తారు. –రాష్ట్రంలోని 14,315 రేషన్ షాపుల్లో ఎక్కువ కార్డులు ఉన్న చోట్ల రద్దీని నియంత్రించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. –8 వేల రేషన్ షాపుల్లో సింగిల్ కౌంటర్, 3,800 షాపుల్లో రెండు కౌంటర్లు, 2,500 షాపుల్లో అదనంగా 3 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. –రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉంటే 92 లక్షల కార్డులకే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోంది. మిగిలిన 55 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది. –బియ్యం కార్డులు పొందేందుకు అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత సరుకులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. –లాక్డౌన్ వల్ల పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న లక్షల మంది కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం ద్వారా సరుకులు పొందేందుకు కూపన్లు జారీ చేశారు. –కరోనా వైరస్ వల్ల రెడ్ జోన్గా ప్రకటించిన చోట్ల సురక్షిత ప్రాంతంలో సరుకులు అందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీలైతే ఇంటింటికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. –రేషన్ అందకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురైతే 1902 నంబర్కి కాల్ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. -
పేద కుటుంబానికి ఉచిత రేషన్
గాజువాక: ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఓ పేద కుటుంబానికి ఉచిత రేషన్ సరుకులు అందాయి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులే ఆ పేద కుటుంబం ఇంటికెళ్లి మరీ సోమవారం సరుకులను అందించారు. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం జిల్లా గాజువాక కొండ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో తాను పేదరికంలో మగ్గుతున్నానని పెంటయ్యనగర్కు చెందిన బొడ్డటి పూజ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. తాపీ మేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తున్న తన భర్తకు లాక్డౌన్ కారణంగా పనులు దొరకడం లేదని, దీంతో ఆకలిబాధలు తప్పడం లేదని లేఖలో పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం కార్యాలయ అధికారులు ఆ కుటుంబానికి ఉచిత రేషన్ సరుకులు అందజేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)ని ఆదేశించారు. జేసీ ఆదేశాలతో తక్షణం స్పందించిన పౌర సరఫరాల శాఖ సహాయ పంపిణీ అధికారి పి.వి.రమణ, గాజువాక తహసీల్దార్ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది స్వయంగా ఉచిత రేషన్ సరుకులను ఆమె ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర కిలో పంచదారను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పూజ సీఎం కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. -
అందరికీ రేషన్ అందిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చివరి రేషన్కార్డుదారుడికి కూడా సరుకులు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రెండు మూడు రోజుల్లోనే వంద శాతం పంపిణీ పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ డిపోల వద్ద భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పని చేస్తున్నారని అభినందించారు. చోడవరంలో వృద్ధురాలి మృతిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో వైరస్ కోరలు పెకిలించే మందు తమ దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్కు భయపడి ఇంట్లో దాక్కున్న చంద్రబాబు విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ► వలంటీర్లతో సరుకులు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు గతంలో వారిపై చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా వలంటీర్ల సేవలను గుర్తించడం అభినందనీయం. ► రేషన్ సరుకులు కొలిచి ఇవ్వాల్సి ఉన్నందున కొన్నిచోట్ల క్యూలలో నిలుచుంటున్నారు. ► దేశవ్యాప్తంగా లాక్డౌన్, కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించాం. -
ఎక్కడ నుంచైనా రేషన్..వలసదారులకు వరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం (పోర్టబిలిటీ) వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా రాష్ట్రాల్లోనే సబ్సిడీ సరుకులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో తెల్లరేషన్ కార్డులు కల్గి ఉండి తెలంగాణలో ఉంటున్న వారు ఈ–పాస్ ద్వారా సరుకులు తీసుకునే విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రేషన్ తీసుకునే విధానం విజయవంతమైతే ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేయనున్నారు. కాగా, ఏపీలోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే రాష్ట్రానికి చెందిన మరికొందరికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్ ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ నుంచి ప్రజా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. 5, 10, 20 కిలోల బ్యాగుల ద్వారా బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్లకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వచ్చినా వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా రేషన్ డీలర్ (స్టాకు పాయింట్లు) వద్దే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఈ–పాస్ మిషన్లలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఎక్కడ, ఏ రేషన్ దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్లైన్లో నమోదవుతుంది. కాగా, ఏదేని రేషన్ షాపులో 50 శాతం సరుకు పూర్తికాగానే సంబంధిత జిల్లా డీఎస్ఓలను అప్రమత్తం చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్ వెళ్తుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు. -
పౌరసరఫరాల ఐటీ సేవలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాలశాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అమలుతీరుపై అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) దేశాల అధికారుల బృందం అధ్యయనం చేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది పేదప్రజలకు సేవలందిస్తున్న పౌరసరఫరాల శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న విధానం బాగుందని కొనియాడింది. శుక్రవారం ఇండోనేసియా, కంబో డియా, మయన్మార్, థాయ్లాండ్, వియత్నాం, మలేసియా దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన 13 మంది అధికారులు పౌర సరఫరాల భవన్లో కమిషనర్ అకున్ సబర్వాల్తో సమావేశమయ్యారు. శాఖలో చేపట్టిన వినూత్న చర్యలు, సంస్కరణలు, విధానాలపై 18 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, ఈ–పాస్, ఐరిస్ విధానం, టి–రేషన్ యాప్, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనితీరును పరిశీలించారు. సరుకుల పంపిణీ విధానం, రేషన్షాపులు, రేషన్ కార్డుల సంఖ్య, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకు ఏ విధంగా సరుకులు చేరుతున్నాయనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖలో చేపట్టిన చర్యలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. -
ఐరిస్తోనూ రేషన్ సరుకులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారులకు సులువుగా, ప్రయోజనం కలిగించేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. వేలిముద్రలతోపాటు కనుపాపల (ఐరిస్) ఆధారంగా లబ్ధిదారులకు సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈనెల 1 నుంచి మొదటి విడతలో 16 జిల్లాల్లో 5,186 దుకాణాల్లో ఈ విధానం ప్రారంభించింది. దాదాపు ఏడాది నుంచి పౌరసరఫరాల శాఖ ఈపాస్ (బయోమెట్రిక్) విధానం ద్వారా సరుకుల పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానంలో వృద్ధులు, మహిళల వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఈపాస్ మెషీన్లు ధ్రువీకరించడం లేదు. దీంతో ప్రతినెలా రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిపడని చోట ఆయా ప్రాంతాల్లో వీఆర్వో, వీఏవో, పౌరసరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లకు లబ్ధిదారులను ప్రామాణీకరించే సౌకర్యం కల్పించింది. అయితే ఈ విధానం కొన్ని చోట్ల దుర్వినియోగమవుతున్న విషయం పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఐరిస్ విధానం పరిష్కారమని భావించిన ఆ శాఖ అధికారులు రాష్ట్రంలోని 17,200 రేషన్ షాపుల్లో దశల వారీగా ఐరిస్ విధానం అమలుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలోని రేషన్ షాపుల్లో ఐరిస్ విధానం అమలు తీరును పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో అన్ని షాపుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా, అర్హులైన పేదలకు మరింత సులువుగా నిత్యావసర సరుకులు అందించడానికి ఐరిస్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 5,186 దుకాణాల్లో ఈనెల ఒకటవ తేదీ నుండి ఐరిస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని, ఈ నాలుగు రోజు ల్లో 15.20 లక్షల మంది రేషన్ సరుకులు తీసుకున్నారని తెలిపారు. -
15రోజులే
సాక్షి, రంగారెడ్డి జిల్లా : చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు ఇకపై నెలలో 15 రోజులు మాత్రమే సరుకులు అందజేయనున్నారు. వచ్చేనెల నుంచి ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అప్పటినుంచి ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీలోపే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 919 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులు కలిపి మొత్తం 5.18 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రతి కార్డుదారుడికి రెండు కిలోల గోధుమలు, ఒక లీటరు నీలి కిరోసిన్ చొప్పున పంపిణీ అవుతోంది. మొన్నటి వరకు ప్రతినెలా 25వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉండేవి. తమ సౌలభ్యాన్ని బట్టి వీలైన రోజు కార్డుదారులు సరుకులను తీసుకెళ్లేవారు. తాజాగా రేషన్దుకాణాల పనిదినాలను కుదించడంతో కాస్త ఇబ్బంది కలగవచ్చు. పని వేళలను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే వచ్చేనెల నుంచి కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు పౌర సరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈనెలలోనే ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర వస్తువుల పంపిణీ అమలు కావాల్సి ఉంది. అయితే అధికంగా సెలవులు రావడంతో 17వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేశారు. వచ్చేనెల పని దినాల్లో ఎలాంటి సడలింపు ఉండబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డీడీల చెల్లింపుల్లోనూ! రేషన్ దుకాణాల పని దినాలను కుదించిన ప్రభుత్వం.. డీలర్లు డీడీలు చెల్లించే రోజులను సైతం తగ్గింది. మొన్నటి వరకు ప్రతినెలా 27వ తేదీలోపు డీడీలు చెల్లించేవారు. ఆ నెలాఖరులోగా సరుకులు డీలర్ల వద్దకు చేరేవి. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ప్రతినెలా తప్పనిసరిగా 16 నుంచి 18వ తేదీలోపే డీడీలు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెల్లించినదాన్ని బట్టి స్టాక్ రిలీజ్ ఆర్డర్లను మండల స్థాయి స్టాక్ గోదాం (ఎంఎల్ఎస్)లకు పంపిస్తారు. అక్కడి నుంచి నెలాఖరులోగా డీలర్ల వద్దకు వస్తువులను పంపించాల్సి ఉంటుంది. తదుపరిగా వచ్చే ఒకటో తేదీ నుంచి విధిగా రేషన్ దుకాణాల ద్వారా డీలర్లు కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తారు. వేతనం ఇవ్వాల్సి వస్తుందనే! రేషన్ దుకాణాల పనిదినాలను కుదించడం వెనుక కుట్ర ఉందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రతి నెలలో 25 రోజులపాటు సరుకులు పంపిణీ చేసేవారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు మొదలు పెట్టడం డీలర్లకు కాస్త ఇబ్బందిగా మారింది. సరుకుల సంఖ్య కుదించడం, ఈ–పోస్ మిషన్లు తీసుకురావడం వల్ల తమకు ఏమీ మిగలడంలేదని డీలర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా నెలంతా కష్టపడితే దుకాణాల అద్దె కూడా వెళ్లడంలేదని లబోదిబోమంటున్నారు. ప్రత్యామ్నాయంగా తమకు ప్రతినెలా వేతనాలను చెల్లించాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సరుకుల అమ్మకం ద్వారా వచ్చే కమీషన్లు లేకున్నా.. వేతనం ఇస్తే చాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు నిరవధికంగా దుకాణాలను బంద్ చేయాలని కూడా నిర్ణయించారు. ఇలాంటి సమయంలో నెలలో 15 రోజులే దుకాణాలు పనిచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తమకు వేతనాలు అందించాలన్న డిమాండ్ను నీరుగార్చడంలో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించారని విమర్శిస్తున్నారు. పనిదినాల కుదింపు వల్ల తమకు వచ్చే నష్టం ఏమీలేదని చెబుతున్నారు. -
ప్రతి పథకమూ పారదర్శకం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రతి పథకం వివరాలు అందుబాటులో ఉంచి పథకాల అమలులో పారదర్శకతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్రం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు ‘డీబీటీ భారత్’పేరుతో వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాల్లో ఎంత మేర లబ్ధిదారులకు చేరింది, ప్రభుత్వానికి ఎంత ఆదా అయింది తదితర వివరాలను అందులో పొందుపరిచింది. సమాచారాన్ని పక్కాగా అందుబాటులో ఉంచేందుకు అన్ని రాష్ట్రాల్లో డీబీటీ సెల్లు ఏర్పాటు చేసింది. వివిధ పథకాల సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే నగదు బదిలీ విధా నాన్ని కేంద్రం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గ్యాస్ సబ్సిడీతో మొదలైన విధానాన్ని మెల్లగా ఇతర పథకాలకూ విస్తరిస్తోంది. ఎల్పీజీ.. రూ.29 వేల కోట్లు ఆదా.. నాలుగేళ్లుగా ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్రం.. దాని ద్వారా తొలి ఏడాదిలోనే రూ.29 వేల కోట్లు ఆదా అయినట్లు లెక్క తేల్చింది. దీంతో మిగతా పథకాల సబ్సిడీలనూ నేరుగా లబ్ధిదారులకే చేరవేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూలీ ల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. జాతీయ సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులకు చెల్లించే పెన్షన్లనూ నేరుగానే పంపిణీ చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేసే రేషన్ సరుకుల సబ్సిడీనీ నేరుగా అందించే కార్యాచరణను కూడా చేపట్టింది. డీబీటీ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ధనం భారీగా ఆదా అవుతోందని, దీని ద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయగలిగామని వెబ్సైట్లో కేంద్రం వెల్లడించింది. డీబీటీతో 2016–17లో రూ.57,029 కోట్లు ఆదా అయినట్లు లెక్క తే ల్చిన కేంద్రం.. ఆ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. అన్ని పథకాలు డీబీటీ పరిధిలోకి..! దేశంలో 395 పథకాలు అమలు చేస్తున్న కేంద్రం.. ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ శాఖలో అమలులో ఉన్న విత్తన పంపిణీ మొదలు డ్రిప్ ఇరిగేషన్ వరకు, వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధి శిక్షణ, ఉపాధి హామీ నిధులు, అంగన్ వాడీ పథకాలు.. ఇలా అన్నింటికీ సబ్సిడీలు చెల్లిస్తోంది. వీటిలో కొన్నింటి సొమ్ము ఇప్పటికే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతోంది. అయితే కొన్ని పథకాలకు సంబంధించిన సబ్సిడీలు ముందుగా ఆయా శాఖలకు చేరుతుండటంతో సబ్సిడీ సొమ్ము వివిధ రకాలుగా దుర్వినియోగమవుతున్నట్లు తెలిసింది. దీంతో ఉపాధి హామీ, గ్యాస్, కిరోసిన్, రేషన్ బియ్యం, స్కాలర్షిప్, పెన్షన్లు నేరుగా లబ్ధిదారులకే అందేలా డీబీటీ విధానం తీసుకొచ్చింది. నిధుల దుర్వినియోగం జరగకపోవడం, భారీగా ప్రభుత్వ ధనం ఆదా అవుతుండటంతో సబ్సిడీతో ముడిపడి ఉన్న మిగతా పథకాలనూ డీబీటీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్.. ప్రస్తుతం ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే రేషన్ సరుకులపై కేంద్ర సబ్సిడీ నేరుగా రాష్ట్ర ఖాతాలో జమవుతుంది. అయితే సబ్సిడీని లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా జమ చేస్తే దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన కేంద్రం.. గతేడాది నుంచి అన్ని రాష్ట్రాలను ఆ దిశగా అప్రమత్తం చేసింది. డీబీటీతో ఆదా చేసిన సొమ్మును రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం పంపించాలని, కేంద్ర పథకాలను అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలను డీబీటీ వెబ్సైట్లో పొందుపరచాలని కోరింది. అయితే ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగింది, ప్రభుత్వ పథకాలేమేం అందాయి, లబ్ధి పొందని కుటుంబాలెన్ని అనే కోణంలో ఈ డేటాను కేంద్రం సమీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల వారీగా ఆధార్ లింకేజీ పూర్తయినందున ఏయే పథకాల్లో ఎవరు, ఎంతమేర లబ్ధి పొందారో క్షణాల్లో వివరాలు తెలుసుకోవచ్చని.. ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాలకూ అది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. -
చెట్టెక్కితేనే.. రేషన్ బియ్యం!
ప్రజా పంపిణీకి సెల్ సిగ్నల్స్తో షాక్ - సిగ్నల్స్ సరిగా అందక పనిచేయని ఈ–పాస్ యంత్రాలు - వేలిముద్ర వెరిఫై అయ్యాకే సరుకులు ఇవ్వాల్సిన పరిస్థితి - సిగ్నల్ కోసం గుట్టలు, చెట్లు ఎక్కుతున్న డీలర్లు సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అమల్లోకి తెచ్చిన ఆధునిక టెక్నాలజీ రేషన్ డీలర్లను చెట్లు, గుట్టలు ఎక్కిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాలకు సెల్ సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సిగ్నల్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకుని తిరగడం, ఇళ్లు, భవనాలపైకి ఎక్కడం, గ్రామాల సమీపంలోని గుట్టలపైకి వెళ్లాల్సి రావడం వంటి వాటితో.. అటు రేషన్ డీలర్లకు, ఇటు లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ–పాస్కు సెల్ సిగ్నల్ షాక్ ఈ–పాస్ యంత్రాలు సెల్ఫోన్ టెక్నాలజీ (సిమ్కార్డు) ఆధారంగా పనిచేస్తున్నాయి. అన్ని లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి.. రేషన్ దుకాణాలను దానికి అనుసంధానం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం కారణంగా ఈ–పాస్ యంత్రాల వినియోగం సమస్యాత్మకంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో పరిశీలించినప్పుడు... గండేడు, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సిపాయిగూడెం, బండలేమూరు, చెన్నారెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలంలో సిగ్నల్ సమస్య తలెత్తింది. దీంతో బయోమెట్రిక్ వివరాలు వెరిఫై చేయలేక.. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు సరిగా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. సరుకులు, యంత్రాలు తీసుకుని.. సెల్ సిగ్నల్ కోసం ఎత్తయిన చోట్లకు వెళుతున్నారు. ఇళ్లపైకి, చెట్లపైకి ఎక్కడం, కొన్ని చోట్ల సమీపంలోని గుట్టలు ఎక్కడం వంటివి చేయాల్సి వస్తోంది. అటు లబ్ధిదారులు కూడా సరుకుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇక ఈ–పాస్ యంత్రాలు తరచూ స్విచాఫ్ కావడం, సిగ్నల్స్ సరిగా లేక సాంకేతిక లోపంతో తూనికల యంత్రాలు సరిగా పనిచేయక ఇబ్బందులు వస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట పడుతున్నా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, బినామీ లబ్ధిదారులను ఏరివేయడం లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. వాటితో అర్హులైన లబ్ధిదారుల వేలిముద్రను సరిచూసుకుని మాత్రమే సరుకులను అందజేయాల్సి ఉంటుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1,545 రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి.. ఈ–పాస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కేవలం 15 నెలల కాలంలో ప్రభుత్వానికి ఏకంగా రూ.320 కోట్లు ఆదా అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 800 రేషన్ షాపుల్లో అమలు చేయగా.. నెల రోజుల్లోనే రూ.3.3 కోట్లు భారం తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ షాపుల్లో ఈ–పాస్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్తోపాటు ఐరిస్ స్కానింగ్ సౌలభ్యం కూడా ఉండేలా అధునాతన యంత్రాలను తెప్పించి.. దశలవారీగా ఏర్పాటు చేస్తోంది. టెలికాం కంపెనీల దృష్టికి సమస్య పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సెల్ సిగ్నల్ సమస్యను సంబంధిత కంపెనీల దృష్టికి తీసుకెళ్లారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా తదితర ఆపరేటర్ల ప్రతినిధులను పిలిపించి నెట్వర్క్ విషయంలో జాగ్ర త్తలు తీసుకోవాలని కోరినట్లు తెలిపాయి. అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 10 వేల రేషన్ షాపుల్లో ఈ–పాస్ అమల్లోకి రానుంది. మిగతా 7,200 షాపుల్లో దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు. పని మానుకుని తిరుగుతున్నం.. రేషన్ సరుకులు తీసుకోవడానికి కూలీ పనులు, వ్యవసాయ పనులు మానుకుని తిరగాల్సి వస్తోంది. వారం రోజుల నుంచి వచ్చి పోతున్నా వేలిముద్రలు రాక సరుకులు ఇవ్వడం లేదు. – నీలి గంగమ్మ, గాధిర్యాల్ రోజుల కొద్దీ మిషన్లు పనిచేయడం లేదు రేషన్ సరుకులు తీసుకోవడానికి మిషన్లు పెట్టడంతో దూర ప్రాంతాల్లో పనులకు వెళ్లినవారు కూడా నెలకోసారి ఊరికి వచ్చిపోవాల్సి వస్తోంది. ముంబై, పుణెలకు వలస పోయినోళ్లూ వచ్చిపోతున్నరు. ఇక్కడ గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల కొద్దీ మిషన్లు పనిచేయక.. సరుకులు తీసుకోవడం కష్టమవుతోంది. – లక్ష్మీబాయి, మొకర్లాబాద్ తండా సరుకుల పంపిణీ కష్టంగా మారింది రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఈ–పాస్ మిషన్లు పెట్టడం మంచిదే అయినా.. మారుమూల ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ రాక సమస్యలు వస్తున్నాయి. నా రేషన్ షాపు పరిధిలో 460 కార్డులుండగా.. ఇదివరకు వారంలో సరుకుల పంపిణీ పూర్తయ్యేది. ఈ–పాస్ మిషన్లు వచ్చాక.. 20 రోజుల పాటు పనిచేయాల్సి వస్తోంది. ఈ విషయమై సర్కార్ దృష్టి పెట్టాలి’’ – గోపాల్నాయక్, మంగంపేట రేషన్ డీలర్ -
గివ్ ఇట్ అప్
బియ్యం వద్దనుకుంటే తహసీల్దార్కు లేఖ ఇస్తే చాలు.. ఆ మేరకు డీలర్ కోటాలో కోత మిగతా రేషన్ సరుకులు యథావిధిగా పొందొచ్చు కేంద్రం నుంచి వెలువడిన ఉత్తర్వులు వరంగల్ రూరల్ : గ్యాస్ సిలిండర్పై రాయితీ వద్దనుకునే సంపన్నుల కోసం గతంలో కేంద్రప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ సౌకర్యాన్ని కల్పించింది. దీని ద్వారా నమో దు చేసుకున్న సెల్ నంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ను ఉత్పత్తి ధరకే అందిస్తున్నారు. ఇదే రీతిలో దొడ్డు బియ్యం వద్దనుకునే రేషన్ కార్డుదారులకు కూడా ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దొడ్డు బియ్యం తినలేం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలువురికి నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులోని పేర్ల ఆధారంగా ఒక్కొక్కరికి రూ.1కి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు. దీనికి తోడు చక్కెర, గోధుమలు, నూనె ఇత్యాది సరుకులు అందజేస్తున్నారు. అయితే, పలువురు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక బయట అమ్ముకుంటుండగా.. మరికొందరు షాపుల నుంచే తీసుకోవడం లేదు. ఇలా మిగిలిపోయిన బియ్యాన్ని డీలర్లు బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారు. దీంతో బియ్యం పక్క దారి పడుతోందని గుర్తించిన ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తమకు బియ్యం అవసరం లేదని తహసీల్దార్ లేఖ ఇస్తే ఆ లబ్ధిదారుడు సరుకులు తీసుకునే డీలర్ కోటా నుంచి మినహాయించి సరఫరా చేస్తారు. అయితే, రేషన్ కార్డుపై ఇచ్చే మిగతా సరుకులను మాత్రం యథావిధిగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా అవసరాలకు కూడా కార్డు పనికొస్తుంది. కాగా, వరంగల్ రూరల్ జిల్లాలో 3,42,084 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 2,17,422 మందికి ఆహార భద్రత కార్డులు, 12,865 మందికి అంత్యోదయ కార్డులు ఉండగా, 15మంది అన్నపూర్ణ కార్డులు పొందారు. ఖర్చు ఎక్కువ ఉపయోగం తక్కువ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రుపాయి కి కిలో బియ్యం అందించడానికి అధిక మొత్తంలో ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నాయి. రూ.23 నుంచి రూ.24కు కేజీ చొప్పున ప్రభుత్వం రైసు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి, రూ.1కే కిలో చొప్పున లబ్ధిదారులకు అందజేస్తోంది. తద్వారా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, పలువురు దొడ్డు బియ్యం తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతోంది. తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలి.. ఎస్డబ్ల్యూ.పీటర్, డీఎస్ఓ (07 డబ్ల్యూజీఎల్ 301 లేదా 302 – ఎస్డబ్ల్యూ.పీటర్, డీఎస్ఓ)కార్డుదారుల్లో రూ.1కి కిలో బియ్యం వద్దనుకునేవారు తహసీల్దార్కు ‘గివ్ ఇట్ అప్’ వర్తింపజేయాలని తెల్లకాగితంపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నెలనెలా ఎంత బియ్యం వద్దనుకుంటున్నారో లెక్క వేసి వారి రేషన్ షాపులకు ఇచ్చే నుంచి మినహాయిస్తాం. అయితే, బియ్యం వద్దని రాసిస్తే మిగతా సరుకులు కూడా ఇవ్వరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ యథావిధిగా ఇస్తారు. దీనికి సంబంధించి మాకు కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. -
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
► జేసీ రాంకిషన్ ► సివిల్ సప్లయ్ రవాణా టెండర్ల ఖరారు మహబూబ్నగర్ న్యూటౌన్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను లారీల ద్వారా టెండర్దారులు ఎమ్మెల్ఎస్ గోదాంల నుంచి నేరుగా చౌకధర దుఖానాలకు తరలించాలని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎం రాంకిషన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని 24 ఎంఎల్ఎస్ పాయింట్లకు సంబంధించి దాఖలైన టెండర్ దరఖాస్తులను పరిశీలించగా శుక్ర వారం వాయిదా పడిన 18 టెండర్లను శనివారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా జేసీ రాంకిషన్ మాట్లాడుతూ ఎమ్మెల్ఎస్ గోదాం నుంచి లారీలు సరుకుల లోడ్తో నేరుగా కేటాయించిన గ్రామాలలోని చౌకధర దుఖానాలకు చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్ఎస్ గోదాముల నుంచి సరకులు రవాణా చేసే ప్రతీ లారీని జీపీఎస్తో అనుసంధానించనున్నట్లు తెలిపారు. ఈ సారి కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సారి మంచి రేటును నిర్ణయించిందని, క్వింటాలుకు రూ. 12 నుంచి రూ.17ల వరకు ఇస్తోందన్నారు. టెండర్దారులు ఈ విషయాన్ని గమనించి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాఖలైన టెండర్లలో నిరే ్ధశించిన రేటు ప్రకారం ఎవరు తక్కువ ధరకు దాఖలు చేస్తే వారికి టెండర్లను అప్పగించారు. ఒకే రేటుకు దాఖలు చేసిన టెండరుదారుల పేర్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో సివిల్సప్లై డీఎం బిక్షపతి, డిఎస్వో రాజారావు, మాజీ డీఎం ప్రసాదరావు, టెండర్దారులు పాల్గొన్నారు. జిల్లాలోని 24 ఎమ్మెల్ఎస్ పాయింట్ల వారీగా రవాణా టెండర్లు దక్కించుకున్న వివరాలిలా ఉన్నాయి. -
రేషన్.. ‘వేలిముద్రల’ పరేషాన్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈ-పాస్) అమలుతో రేషన్ సరుకులు మిగులు బాటు దేవుడెరుగు కానీ... లబ్ధిదారులైన నిరుపేదలకు మాత్రం వేలిముద్రల పరేషాన్ పట్టుకుంది. ఈ-పాస్ మిషన్ లోని ఆధార్ డేటా తో వేలి ముద్రలు సరిపోక నానా ఇబ్బందులు కలుగుతున్నాయి. సరుకుల కోసం చక్కర్లు తప్పడం లేదు. మరోవైపు చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ తలనొప్పిగా తయారవుతోంది. ఫలితంగా మొదటి రెండు వారాల్లో కనీసం 25 శాతానికి మించి సరుకులు పంపిణీ చేయలేక పోయామని డీలర్లు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణిలో సంస్కరణల్లో భాగంగా సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్లోని 12 సర్కిల్స్ పరిధిలో గల సుమారు 1543 షాపుల్లో ఈ- పాస్ ద్వారా సరుకులు పంపిణీ కొనసాగుతోంది. ఈ విధానం సరుకులు పక్కదారి పట్టకుండా కట్టడి చేస్తున్నప్పటికీ సరుకులు కొనుగోలు కోసం రేషన్ షాపులకు వచ్చే అసలైన లబ్ధిదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేద న్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. వేలిముద్రల ఆధారంగానే... ఈ-పాస్ విధానంలో వేలిముద్రల ఆధారంగానే సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్ యం త్రాన్నిఆధార్ డేటాతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుడి వేలిముద్రలు సరి పోల్చుతున్నారు. చౌకధరల దుకాణానికి సరుకుల కొనుగోలు కోసం లబ్ధిదారుడు ఆహార భద్రత రేషన్ కార్డు డేటా స్లిప్ తీసుకొస్తే డీలర్ ఈ-పాస్ యంత్రం పై కార్డు నెంబర్ నమోదు చేస్తున్నారు. కార్డులోని లబ్ధిదారులు వివరాలు డిస్ప్లే అనంతరం సరుకులు కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తి పేరు ఉంటే దానిని టిక్ చేసి వేలి ముద్ర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-పాస్ యంత్రానికి ఆధార్ అనుసంధానం ఉన్న కారణంగా లబ్ధిదారుడి వేలిముద్ర సరిపోతే అమోదం అని డిస్ప్లే అవుతుంది. ఒక వేళ కా కుంటే బయోమెట్రిక్ మ్యాచ్ కావడం లేదని డిస్ ప్లే అవుతోంది, సదరు లబ్ధిదారుల మిగిలిన వేళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్ధిదారుడి పది వేలిముద్రలు కూడా సరి పోకుంటే అదే కుటుంబంలోని మిగతా సభ్యులు వేలిముద్రలను సేకరించి సరి పోల్చాల్సి ఉంటుంది. సదరు కుటుంబంలో ఒకరి వేలి ముద్ర మ్యాచ్ అయినా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. సరిపోతేనే సరుకుల మెనూలో వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరుకులు గుర్తింపు, బిల్లింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే సరుకులు పంపిణీ జరుగుతుంది. ఒక లబ్ధిదారుడికి సరుకులు పంపిణీ చేసేందుకు కనీసం 20 నిమిషాల వరకు అవుతోంది. కష్టజీవుల వేలిముద్రల్లో.. నిరుపేదలైన కష్ట జీవులకు కష్టం వచ్చి పడింది. ఈ-పాస్ పై వేలిముద్రలు సరిపోలడం లేదు. అధిక శాతం కూలీలు, రిక్షా కార్మికులు, వృద్దులు, చిన్నారుల వేలిముద్రలు ఈ-పాస్ ఆధార్తో సరిపోవడం లేదు. గతంలో ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలుముద్రలు ప్రస్తుత వేలుముద్రల్లో కొద్ది మార్పులు జరగడం తో ఈ- పాస్లో సరిపోలడం లేదు. ముద్రలు ఎర్రర్ చూపిస్తున్న కారణంగా డీలర్లు వారికి రేషన్ సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారు తిరిగి ఆధార్ కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సింగిల్ లబ్ధిదారులైన కార్డుదారులు సరుకుల కొనుగోలు కోసం రేషన్ షాపులకు రాక తప్పడం లేదు. మరోవైపు సర్వర్ డౌన్ కూడా పెద్ద సమస్యగా తయారైంది. సరుకులు వస్తాయన్న నమ్మకం లేదు రేషన్ సరుకుల కోసం దుకాణానికి వెళితే సరుకులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోతుంది. మిషన్పై వేలి ముద్రలు త్వరగా పడడం లేదు. ఒక్కోసారి దుకాణం నుంచి ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. ఈ విధానాన్ని ఎత్తివేయాలి. రేషన్ దుకాణం వద్ద కూడా సరుకుల కోసం చాలా ఆలస్యమవుతోంది. -శోభ, ఉప్పుగూడ. వేలిముద్రలు సరిపోవడం లేదు సరుకులకు వేలిముద్రలకు లింక్ పెట్టారు. సరుకులు తీసుకోవడం కష్టతరమవుతోంది. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం తీసుకున్న వేలి ముద్రలకు ఇప్పుడు ఆమోదించడం లేదు. చిన్నారులను పంపించడం కుదరదు. మా లాంటి వారు వెళ్లి అవస్థలు పడుతున్నాం. వేలి ముద్రలు ఆమోదించని సమయంలో ఏఎస్వోను కలవాలని రేషన్ డీలర్...రేషన్ డీలర్ను కలవాలని అధికారులు తిప్పుతున్నారు. - కె.రాజ్లింగం, జంగమ్మెట్ -
రేషన్కు కొత్త మెలిక
ఈ-పోస్ మెషీన్లో వేలిముద్రలు నిక్షిప్తం 40 లక్షల మంది ముందుగా నమోదుచేస్తేనే ఏప్రిల్ సరుకులు అందజేత ఆందోళనలో కార్డుదారులు, డీలర్లు మచిలీపట్నం : జిల్లాలో తెల్లకార్డుపై రేషన్ సరుకులు తీసుకోవాలంటే ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. కార్డులో పేర్లున్నవారంతా ఈ నెలలో రేషన్ తీసుకునే డిపో వద్దకు వెళ్లి అక్కడి ఈ-పోస్ మెషీన్లో తమ వేలిముద్రలను నమోదుచేయాలి. వచ్చే నెల నుంచి కుటుంబంలో ఎవరైనా వెళ్లి సరుకు లు తెచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వేమూరి రవికిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపుల్లోని ఈ-పోస్ మెషీన్లకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడం, కొందరి వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం వంటి ఇబ్బందులు ప్రతినెలా ఎదురవుతున్నాయి. దీంతో కార్డుదారులకు సరుకుల పంపిణీలో ఆలస్యమవుతోంది. ఒక కార్డులో నలుగురు సభ్యుల పేర్లుంటే వారంతా కచ్చితంగా రేషన్ షాపు వద్దకు వెళ్లి తమ వేలిముద్రలను ఈ-పోస్ మెషీన్లో ఇస్తేనే ఏప్రిల్ నెలకు సంబంధించిన సరుకులు అందుతాయని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కార్డులో పేర్లు ఉన్న వారి నుంచి వేలిముద్రలను సేకరించాలని అధికారులు ఇప్పటికే రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికి పూర్తయ్యేను! జిల్లాలో తెల్ల కార్డులు 10,62,444, అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డులు 67,359, అన్నపూర్ణ కార్డులు 494.. మొత్తం 11,30,297 కార్డులున్నాయి. 2,160 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా సరుకులు అందజేస్తున్నారు. ఇవికాక గులాబీ కార్డులు 1,63,691 ఉన్నాయి. తెల్ల కార్డులు ఇచ్చే సమయంలో సంబంధిత కార్డులోని సభ్యుల వేలిముద్రలు సేకరించలేదు. ఆధార్ కార్డులు మంజూరు చేసినప్పుడు ఆయా కుటుంబాల్లోని సభ్యుల వేలిముద్రలను సేకరించి రేషన్ కార్డులకు వీటిని అనుసంధానం చేశారు. ఇప్పటివరకు రేషన్ షాపునకు కుటుంబసభ్యుల్లో ఒకరు వెళ్లి వేలిముద్ర వేస్తే సరుకులు ఇస్తున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుతం మార్పుచేశారు. తెల్ల కార్డులు 11 లక్షలకు పైగా ఉండగా దాదాపు 40 లక్ష ల మంది ఈ-పోస్ మెషీన్లో వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సి ఉంది. వీరంతా ఎప్పటికి రేషన్ షాపులకు వస్తారు, ఎప్పటికి ఈ ప్రకియ పూర్తవుతుందో అధికారులకే తెలియాల్సిఉంది. వేలిముద్రల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సరుకులు ఇస్తామనే నిబంధన విధిస్తే పేదలు ఇబ్బందులు పడ తారనే వాదన వినిపిస్తోంది. వృథా అయిన డీడీలు జిల్లాలోని 2,160 రేషన్పాపుల ద్వారా ప్రతినెలా 10, 15 తేదీల్లోగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక మరుసటి నెలకు సంబంధించి సరుకుల కోసం డీలర్లు 15లోగా డీడీలు తీయాల్సి ఉంది. పాత పద్ధతిలోనే డీలర్లు ఈ నెలలో డీడీలు తీశారు. అయితే అవి చెల్లుబాటు కావని, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు బ్యాంకు ఖాతాకు నగదును జమ చేయాలని పౌర సరఫరాలశాఖ అధికారులు చెప్పారు. ఈ విషయం ముందుగానే చెబితే తాము జాగ్రత్తపడేవారమని డీలర్లు అంటున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి సరుకుల కోసం డీడీలు తీసి అధికారులకు అందజేశామని, వాటినలా ఉంచి మళ్లీ సరుకుల కోసం నగదు చెల్లించాలని అధికారులు చెబుతుండడంతో తమపై ఆర్థికభారం పడుతోందని డీలర్లు వాపోతున్నారు. -
పస్తులు తప్పవా..?
లంఖణం(పస్తు ఉండడం) దివ్య ఔషధం అన్నారు పెద్దలు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యమేమో గాని..ఏకంగా నెలంతా ప్రతిరోజూ పస్తులుంటే శుష్కించి అనారోగ్యం బారిన పడతారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా చౌకధరలకు సరుకులను పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గ్రామాల్లో డిపోలకు అందజేసిన ఈ పోస్ మెషీన్లు సరిగా పనియకపోవడం, కొంతమంది వృద్ధుల వేలిముద్రలు స్కాన్ అవకపోవడం వంటి ఇబ్బందులతో లబ్ధిదారులకు వచ్చిన రేషన్ కాస్తా తిరిగి వెళ్లిపోతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. సరుకులు అందకుండా వెనక్కి వెళ్లిపోతే నెలంతా పస్తులుండాల్సిదేనని వాపోతున్నారు. * జిల్లాలో 76వేల మందికి పైగా అందని రేషన్ * ఇబ్బందుల్లో లబ్ధిదారులు భోగాపురం: జిల్లాలోని 34మండలాల్లో ఈ పోస్ ద్వారాపనిచేస్తున్న 1341 రేషన్ షాపుల్లో 6,62,681 లబ్ధిదారులు ఉండగా ఫిబ్రవరిలో కేవలం 5,86,080మందికి మాత్రమే రేషన్ సరుకులు అందాయి. ఈ పోస్ సిగ్నల్స్ అందని షాపులు జిల్లాలో 30నుంచి 40వరకు ఉండవచ్చు. వారికి మాన్యువల్గానే సరుకులు అందిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈనెల సరుకులు 88.44శాతం పంపిణీ జరిగాయి. జిల్లాలో అత్యధికంగా కొత్తవలసలో 93.49శాతం సరుకులు అందించగా, అతితక్కువగా మెంటాడ మండలంలో 84.79శాతం సరుకులను మాత్రమే అందించారు. దీంతో ఈనెల చౌకధరల దుకాణాల ద్వారా 76,541మంది సరుకులను పొందలేకపోయారు. జిల్లాలో ఇన్చార్జ్ డీలర్లు ఎక్కువగా ఉండడం, ఈపోస్ మెషీన్లు పనిచేయకపోవడం. మెషీన్లు పనిచేసినా ఇంట్లో ఒక్కరే ఉన్న కార్డుల్లో వేలిముద్రలు స్కాన్ కాకపోవడంతో సరుకుల పంపిణీ కాలేదు. అయితే రేషను సరుకులపైనే ఆధారపడే పేదవారు ఈపోస్ విధానం ద్వారా సరుకులు పొందలేక ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతినెలా 15నుంచి 20వ తారీఖుల్లో ఈ పోస్ ఆన్లైన్ ఆగిపోవడంతో సరుకులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. రేషన్ ఇస్తున్నారంటే చాలు లబ్ధిదారులు పగలనక, రాత్రనక డిపోల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. పడిగాపులు కాసినా తీరా వారివంతు వచ్చేసరికి వేలిముద్రలు పడకపోవడమో, సర్వర్ ఆగిపోవడమో జరుగుతుండడంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాలోని ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలోనే ఫిబ్రవరి నెలలో సుమారు 10వేల మంది లబ్ధిదారుల రేషన్ వెనక్కి వెళ్లి పోయింది. దీంతో లబ్ధిదారులు ఈనెల ఏంతిని బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు తిరిగినా రేషన్ రాలేదు మాది భోగాపురం మండలం రావాడ పంచాయతీ చినరావాడ గ్రామం. మేము రేషన్ అందుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావాడ గ్రామానికి వెళ్లాలి. నా వయసు 80ఏళ్లు. నేను ఒక్కదాన్నే ఉంటాను. వారంరోజులు తిరిగాను వేలి ముద్రలు పడలేదని వెనక్కి పంపించేశారు. కోటా బియ్యమే ఆధారం. నెలకు నాకు ఇచ్చే ఐదు కేజీల బియ్యం కూడా అందలేదు. - బమ్మిడి అచ్చెమ్మ, చినరావాడ రేషను సరుకులకు ఇబ్బంది పడుతున్నాం రేషన్ సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెషీన్లు పనిచేయడం లేదని సరుకులు రాత్రిపూట ఇవ్వడంతో మా గ్రామం నుంచి చీకట్లో ఇబ్బందులు పడి మరీ వెళ్తాం. అయినా నాకు రేషను అందలేదు. రావాల్సిన ఐదుకేజీల బియ్యం అందకపోతే ఏం తిని బతకాలి. మా పరిస్థితి ఏంటి? - ఇప్పిలి తాత, చినరావాడ -
రేషన్కు నిబంద్నలు!
ప్రభుత్వం విధించిన నిబంధనలు చాలామందికి రేషన్ సరుకులు అందకుండా చేశాయి. ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ కార్డుదారులకు సరుకులు అందజేయాలనే నిబంధన ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, సర్వర్ ఇబ్బందులు పెట్టడం వంటి కారణాలతో సుమారు 16 శాతం మంది తిండి గింజలకు నోచుకోలేదు. సోమవారంతో గడువు ముగియడంతో కార్డుదారులు, డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ సరుకులపంపిణీకి ముగిసిన గడువు 16 శాతం మందికి అందని తిండిగింజలు ఆందోళన చెందుతున్న కార్డుదారులు, డీలర్లు వీరఘట్టం: జిల్లాలో 2,001 రేషన్ షాపులు ఉండగా 8,25,094 కార్డుదారులకు 13,530.730 మెట్రిక్టన్నుల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇంతవరకు 6,93,078 మంది కార్డుదారులకు(84 శాతం మందికి) బియ్యం పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో మరో 16 మంది సరుకులు నోచుకోలేదు. అలాంటి వారంతా గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారు. డీలర్ల ఇబ్బందులు మరోపక్క మరుసటి నెల సరుకుల కోసం ప్రతి నెల 16వ తేదీనే డీడీలు తీయాలనే నిబంధనను ప్రభుత్వం విధించడంతో డీలర్లలో కలవరం మొదలైంది. దీనికితోడు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచిరాత్రి 8 గంటల వరకు తప్పనిసరిగా రేషన్ షాపులు తెరవాలని నిబంధన సైతంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులు గడువు కోరాం సుమారు 16 మందికి సరుకులు అందని విషయాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సోమవారంతో రేషన్ బియ్యం పంపిణీకి గడువు ముగిసిందన్నారు. మరో రెండు రోజులు గడువు పెంచాలని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. -
పక్కదారి పడుతున్న రేషన్ సరుకులు
పౌరసరఫరాల శాఖ పేదలకు పంపిణీ చేసే బియ్యంతోపాటు ఇతర సరుకులను అక్రమ మార్గంలో తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. రాజధానిలో రేషన్ కిరోసిన్, పప్పులు, గోధుమలతోపాటు బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి విక్రయిస్తున్న 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో రేషన్ డీలర్లతోపాటు వ్యాపారులు, దళారులు, మిల్లర్లు ఉన్నారు. వీరి నుంచి 362 క్వింటాళ్ల బియ్యం, 500 క్వింటాళ్ల గోధుమలు, 630 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు ట్రక్కులను సీజ్ చేశారు. అక్రమాలకు పల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. -
‘ఈపాస్’ అయితేనే రేషన్
పాత పద్ధతిలో పంపిణీ లేనట్టే.. వేలిముద్రలు పడని వారికి ప్రత్యేక ఆప్షన్ పంపిణీ మేరకే సరకుల లిఫ్టింగ్ విశాఖపట్నం: ‘ఈపాస్’ ద్వారా తీసుకుంటేనే రేషన్ సరకులు.. లేకుంటే లేనట్టే. ఇప్పటి వరకు వేలిముద్రలు పడకపోయినా.. మిషన్లు పనిచేయకపోయినా పాతపద్ధతిలో సరకులిచ్చేవారు. ఇక నుంచి ఈ అవకాశం లేదు. ఈ‘పాస్’యితేనే సరకులు లేకుంటే ఆశలు వదులుకోవల్సిందే. జిల్లాలో ఈపాస్ అమలవుతున్న 1604 రేషన్ షాపుల పరిధిలో 9.50 లక్షల కార్డులుండగా ప్రతి నెలా ఏడున్నర లక్షలమంది కార్డుదారులకు ఈపాస్ ద్వారా సరకుల పంపిణీ జరుగుతోంది. క్రమం తప్పకుండా సరకులు తీసుకునే మరో 50 వేలమందికి సాంకేతిక కారణాలవల్ల మిషన్లు పనిచేయకున్నప్పటికీ పాత పద్ధతిలోనే పంపిణీ చేసేవారు. వచ్చే నెల నుంచి పాతపద్ధతిలో సరకుల పంపిణీకి ఫుల్స్టాప్ పెట్టడం నిరుపేదలకు అశనిపాతంగా మారింది. జీవీఎంసీ పరిధిలో 76 శాతం, గ్రామీణ ప్రాంతంలో 89 శాతం వరకు సరకుల పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు క్లోజింగ్ బ్యాలెన్స్కనుగుణంగానే కార్డుల సంఖ్యను బట్టి మరుసటి నెల సరకుల కేటాయింపు జరిగేది. డిసెంబర్లో ఈపాస్ వర్తింప చేసే షాపుల కు సరకుల కేటాయింపులో 10 శాతం కోత విధించారు. జనవరి నుంచి నూరు శాతం ఈపాస్లో పంపిణీ జరిగిన సరకుల మేరకే లిఫ్టింగ్కు అనుమతి ఇవ్వనున్నారు. పైగా గతంలో మాదిరిగా ఇండెంట్ పెట్టుకోవల్సిన అవసరం లేదు. ప్రతి నెలా 22వ తేదీన ఈపాస్ మిషన్ నెంబర్ కొట్టగానే ఆ మిషన్ ఏ డీలర్కు చెందింది.? ఆ షాపులో ఆ నెలలో ఎన్ని కార్డులకు సరకుల పంపిణీ జరిగింది? మెయిన్ సర్వర్లో తెలిసిపోతుంది. తదనుగుణంగా ఆటోమేటిక్గా లిఫ్టింగ్ జనరేట్ అయిపోతుంది. సరకుల కోసం గతంలో మాదిరిగా మండల లెవల్ సప్లయి (ఎంఎల్ఎస్) పాయింట్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈపాస్ ద్వారా జనరేట్ అయ్యే లిఫ్టింగ్ను బట్టి సరకులను నేరుగా సంబంధిత రేషన్ షాపునకు చేరుస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సరకులు తీసుకునేటప్పుడు, రవాణాలో కూడా తరుగు కన్పిస్తుందని.. తద్వారా నష్టపోవాల్సి వస్తుందంటూ డీలర్లు ఇన్నాళ్లు గగ్గోలు పెట్టేవారు. ఇక నుంచి నేరుగా రేషన్ షాపునకు లిఫ్టింగ్ జరుగనుండడంతో అక్కడే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో సరకులను తూకం వేసి తమకు కేటాయించిన మేరకు సరకులు వచ్చాయా? లేదా? చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇదంతా మాన్యువల్గానే జరిగేది. ఇక నుంచి లిఫ్టింగ్ కూడా ఈపాస్ ద్వారానే జరుగనుంది. మిషన్లో డీలర్, రూట్ ఆఫీసర్ ఒకేసారి వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. గత నెలలో సరకులు తీసుకున్న కార్డుదారుని వేలిముద్రలు పడకపోవడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురైతే అటువంటి వారి కోసం ఈపాస్ మిషన్లోనే ప్రత్యేకంగా ఆప్షన్ పొందుపరుస్తున్నారు. ఏదైనా తీర్థయాత్రలకు, వ్యక్తిగత అవసరాలు లేదా కూలి పనుల నిమిత్తం కుటుంబసమేతంగా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లడం వలన ఆ నెలలో సరకులు తీసుకోలేకపోతే ఆ మరుసటి నెలలో వారికి సరకులు హుళక్కే. దీంతో ఇప్పటికే ఈపాస్ పుణ్యమాని లక్షన్నర కుటుంబాలకు పైగా రేషన్కు దూరం కాగా.. ఇప్పుడు ఈ కొత్త మెలిక వల్ల ప్రతి నెలా వేలాదిమంది సాంకేతిక సమస్యల కారణంగా రేషన్ పొందలేని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. జనవరి నుంచి అమలు డిసెంబర్లో ఈపాస్ ద్వారా ఎంతమందికైతే సరకుల పంపిణీ జరుగుతుందో ఆ మేరకే జనవరిలో రేషన్ షాపునకు సరకుల కేటాయింపు జరుగుతుంది. ఇక నుంచి ఈపాస్ బయట ఎలాంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు. ఇప్పటికే 1604 షాపుల్లో ఈపాస్ అమలు చేస్తున్నాం. మిగిలిన షాపుల్లో కూడా త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. తరుగు సమస్య లేకుండా చర్యలు చేపట్టాం. -జె.నివాస్, జాయింట్ కలెక్టర్ -
బియ్యం ఇవ్వని యంత్రం
ఈ-పాస్ ఫెయిల్ మొరాయిస్తున్న సర్వర్లు ఏడునెలలైనా వీడని బాలారిష్టాలు సరకుల కోసం రోజూ నరకమే సర్వర్ డౌన్ అయిపోయింది... మిషన్ పనిచేయడం లేదు..ఎప్పుడు పని చేస్తుందో తెలియదు..చెప్పలేం..ఏ రేషన్ షాపునకు వెళ్లినా ఇవే సమాధానాలు. కూలి పనులు మానుకొని చెప్పులరిగేలా తిరుగుతున్నా గంటలు కాదు.. ఏకంగా రోజుల తరబడి షాపుల వద్ద పడిగాపులు పడుతున్నా రేషన్ సరకులు అందక పోవడంతో కార్డుదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈ-పాస్ అమలులోకి వచ్చి ఏడునెలలైనా బాల రిష్టాలను మాత్రం సర్కార్ అధిగమించలేక పోవడం సామాన్యులకు శాపమవుతోంది. విశాఖపట్నం : జిల్లాలో 2016 రేషన్షాపులుంటే వాటి పరిధిలో 11,22,053 బీపీఎల్ కార్డులున్నా యి. వాటిలో తెల్ల్లకార్డులు సిటీలో 3,61,251 రూరల్లో 6,64,199 ఉన్నాయి. ఏఏవై కార్డులు సిటీలో 7,887, రూరల్లో 64,866, అన్నపూర్ణ కార్డులు సిటీలో 386, రూరల్లో 614కార్డులున్నాయి. గత నెల వరకు నగర పరిధిలోని 412 షాపులతో సహా మొత్తం 1172 షాపుల్లో ఈ-పాస్ అమలు చేసే వారు. ఈ నెల నుంచి మరో 436 షాపులకు విస్తరించారు. ఏజెన్సీ పరిధిలోని 385 షాపులతో పాటు మైదానంలోని మారుమూల ప్రాంతాల్లో 12షాపుల్లో నెట్వర్కింగ్ లేదంటూ పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తున్నారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో 1608 షాపుల్లో ఈ-పాస్ అమలవుతోంది. క్రమేపీ ఈపాస్ షాపుల సంఖ్య పెంచుకుంటూ పోవ డం..అదే స్థాయిలో సర్వర్ కెపాసిటీ లేకపోవడంతో సాంకేతిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఏ షాపు దగ్గరకు వెళ్లినా సర్వర్ డౌన్ అయింది..ఎప్పుడు పని చేస్తుందో చెప్ప లేం..ఆ తర్వాత మమ్మల్నితిట్టొద్దు అంటూడీలర్లు ముందుగానే కార్డుదారులకు చెబుతూ వారి ఆగ్రహావేశాల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. సర్వర్ కనెక్ట్ అయినా ఈపాస్ మిషన్ మొరాయిస్తుండడం.. వేలిముద్రలు పడక పోవడంతో సామాన్యులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గంటల తరబడి షాపుల వద్ద వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక సర్కార్పై నానాశాపనార్ధాలు పెడుతూ నిరాశతో వెనుదిరుగుతున్నా రు. ఇలా ఒకరోజు..రెండు రోజులు కాదు రోజుల తరబడి తిరుగుతున్నా ఎప్పుడు సరకులందుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ఈ నెలలో సరకులు తీసు కోకపోతే వచ్చే నెలలో తమ కార్డులను ఎక్కడ పక్కన పెట్టేస్తారోనన్న ఆందోళనతో పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ప్రతీనెలా ఒకటవ తేదీ నుంచి ప్రారంభించే సరకుల పంపిణీ 15వ తేదీతో ఆపేస్తారు. ఈ మధ్యలో సెలవులు ఎక్కువగా వచ్చినా లేదా సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఉన్నా 18వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. అప్పుడే 13వ తేదీ దాటింది. కానీ జిల్లాలో పంపిణీ 35శాతానికి మించలేదు. కొత్తగా ఈ నెల నుంచి శ్రీకారంచుట్టిన 436 షాపులతో పాటు మెజార్టీ షాపుల్లో అయితే కనీసం పదిశాతం కూడా పంపిణీ జరగలేదు. దీంతో కార్డుదారులు సరకులు కోసం నరకం చూస్తున్నారు. తాను వారం రోజులుగా షాపునకు వెళ్లడం..సర్వర్ డౌన్ అయిందని చెప్పడం..వెనుతిరగడం పరిపాటయిందని ఎస్.రాయవరానికి చెందిన బీ.అప్పారావు సాక్షి వద్ద వాపోయారు. ఇచ్చే రూ.150ల విలువ చేసే సరకులుకోసం రోజుకు రూ.200ల కూలీ పనులు మానుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి శాంతకుమారి వద్ద ప్రస్తావించగా..ఒకేసారి రాష్ర్ట స్థాయిలో షాపుల సంఖ్య పెరగడంతో ఆ భారం సర్వర్లపై పడిందని..దీంతో తరచూ సర్వర్ డౌన్ అవుతోందని చెప్పుకొచ్చారు. ఒకటి రెండ్రోజుల్లో సమస్యకు పరిష్కార మవుతుందన్నారు. -
రేషన్ సరుకులు కొన్నా, అమ్మినా కేసు!
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి నిరుపేదలకు అంది స్తున్న బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్మార్కెట్కు తరలిపోవడం క్షమించరాని నేరమన్నారు. రేషన్ బియ్యం కొన్నా, అమ్మినా నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, ఇతర అధికారులతో తన అధికారిక నివాసంలో ఆయన ఈ అంశంపై చర్చించారు. రేషన్ కాజేసేందుకు పెద్ద రాకెట్ నడుస్తోందన్నారు. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, బోగస్ కార్డులు ఏరివేయడం సహా ఇతర చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం సూచించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: రజత్కుమార్ నిత్యావసర సరుకుల్లో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్కుమార్ స్పష్టం చేశారు. రేషన్ అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారిపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
మాయాబజార్
- సబ్సిడీ ‘మాయం'! - రేషన్ సరుకు.. డీలర్ల కిటుకు - నిత్యావసరాల పంపిణీలో అక్రమాలు - బలవంతంగా ప్రైవేట్ సరుకుల విక్రయం - డీలర్ చెప్పినట్టు వినకుంటే తంటాలే! రేషన్ దుకాణాల్లో దోపిడీ ఎక్కువైంది. సరుకుల పంపిణీ అంతా మాయగా మారింది. ప్రభుత్వం సరఫరా చేసే సరుకుల కంటే ప్రైవేట్ సరుకుల విక్రయంపైనే డీలర్లు ‘దృష్టి’ పెడుతున్నారు. ఇక, చిల్లర లేదంటూ చేతివాటమూ చూపుతున్నారు. వారు చెప్పిందానికి తలూపాల్సిందే.. లేదంటే కార్డు ఊడబీకేస్తామని బెదిరింపులు.. ఇంతటి దౌర్జన్యం కొనసాగుతోన్నా అడిగే దిక్కులేదు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎవరి పొట్లం వాళ్లకు ఇవ్వాలని ప్రభుత్వం రేషన్ సరుకులను డీలర్ల చేతితో పెడితే.. వాళ్లేమో పేదల పొట్టగొడుతున్నారు. ఆహార భద్రత సరుకులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఓపెన్ మార్కెట్లోని కల్తీ, నాసిరకం సరుకులు పట్టుకొచ్చి వాటిని నయానో భయానో తెల్లకార్డుదారులకు అంటగడుతున్నారు. ప్రైవేటు సరుకులు తీసుకోకపోతే డీలర్లు నోటిదురుసు చూపుతున్నారు. రేషన్ కార్డు రద్దవుతుందని బెదిరిస్తున్నారు. నోరున్నోళ్లకే సరుకులు... రాష్ట్ర ప్రభుత్వం వివిధ నిత్యావసర వస్తువులను డీలర్లకు పంపుతోంది. ఇవన్నీ కచ్చితంగా అందుకుంటున్న కుటుంబాలు 40 శాతం వరకు మాత్రమే ఉన్నాయి. గ్రామ స్థాయిలోని చోటామోటా నేతల కుటుంబాలు, అక్రమాలను నిలదీసే వారికి మాత్రమే కచ్చితంగా అన్ని సరులకు అందిస్తున్నారు. ఇలాంటి వాళ్లు సమయానికి రాకపోయినా డీలర్లు వారి కోసం దాచిపెట్టి మరీ ఇస్తున్నారు. ఇక నిరుపేదలకైతే షాపు వద్ద సరుకుల సంగతి దేవుడెరుగు. కనీస గౌరవం కూడా దక్కడం లేదు. రేషన్ డీలర్లు మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. ఓపెన్ మార్కెట్లోని కల్తీ, నాసిరకం నూనెలు, సబ్బులు, సర్ఫ్లు, షాంపూలు తెచ్చి బలవంతంగా అంటగడుతున్నారు. స్టాక్ పాయిం ట్ నుంచి డీలర్ సరుకులు తీసుకొని నల్ల బజారుకు తరలించి, అక్కడి ఓపెన్ మార్కెట్ నుంచి నాసిరకం సరుకులు తెచ్చి అంట గట్టే వరకు సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. వెంటపడి అంటగడుతున్నారు.. ప్రతి కుటుంబానికి కిలో పామాయిల్ చొప్పున సరఫరా చే యాలి. కొంతకాలంగా ప్ర భుత్వం రేషన్ దుకాణాలకు ఠమొదటిపేజీ తరువాయి సబ్సిడీ నూనెను సరఫరా చేయడం లేదు. డీలర్లు ప్రైవేట్ కంపెనీల నూనె ప్యాకెట్లను తెచ్చి అంటగడుతున్నారు. విజయ నూనె పేరుతో ఉన్న ప్యాకెట్లను డీలర్లు వినియోగదారులకు రూ.64కు ఇస్తున్నారు. కంపెనీ వీళ్లకు రూ.58కే టోకున ఇస్తుందట. నూనె ప్యాకెట్ మీద మాత్రం ఎమ్మార్పీ రూ.78 ఉండటం గమనార్హం. 250 గ్రాముల ఊర్వశి బట్టల సబ్బును ఎమ్మార్పీ రూ.10కి, 150 గ్రా. సంతూర్ సబ్బును ఎమ్మార్పీ రూ.24 ఉండగా రూ. 22కు, ఎక్సలెంట్ డిష్బార్ (250 గ్రాములు)ను రూ.40కి కార్డుదారులకు విక్రయిస్తున్నారు. ఇదీగాక రూపాయి, రెండు రూపాయలు చిల్లర లేదనే సాకుతో అగ్గిపెట్టెలు, పిప్పరమెంట్లు, బఠానీలతో సరిపెడుతున్నారు. డీలర్లు ఇచ్చిన సరుకులు తీసుకోకపోతే బియ్యం, చక్కెర ఇవ్వడం లేదు. కిరోసిన్ పోయడం లేదు. రెండు, మూడు నెలల వరకు రేషన్ సరుకులు తీసుకపోకపోయినా డీలర్లు ఏమీ అనడం లేదు గాని ప్రైవేటు సరుకులు ఒక్క నెల తీసుకోకపోయినా బెదిరిస్తున్నారు. ప్రైవేటు సంస్థల సరుకులను వినియోగదారులకు అందజేయడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వ సరుకులను అందించడంలో లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు నోరు మెదపటం లేదు. డీలర్ల అక్రమాలకే జై కొడుతున్నారు. -
‘ఈ-పాస్ ’ నిధులపై తేల్చని కేంద్రం
రాష్ట్రం కోరిన రూ.234 కోట్లపై స్పందన నిల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ సరకులను కట్టడి చేసేందుకు రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేయదలచిన బయోమెట్రిక్ ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పాయిం ట్ ఆఫ్ సేల్) యంత్రాలను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. ఈ పాస్ యంత్రాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును భరించాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ఖర్చులో సగమైనా కేంద్రం భరించాలని శుక్రవారం తాజాగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీకి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారధి విజ్ఞప్తి చేశారు. రేషన్ సరుకులు ఏటా 25 నుంచి 34 శాతం వరకు పక్కదారి పడుడున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏటా వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేయడానికి అన్ని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. అయితే వీటి ఏర్పాటుకు సుమారు రూ.234 కోట్ల మేర వ్యయం అవుతుండటంతో ఈ భారాన్ని భరించాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, సంబంధిత శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రానికి పలుమార్లు విన్నవించారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శుక్రవారం ఈ పాస్, ఈ పీడీఎస్, సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితరాలపై కేంద్ర సంయుక్త కార్యదర్శి ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ మరోమారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డులకు ఆధార్ సీడింగ్, సరుకుల సరఫరాలో అక్రమాల నివారణకు సరఫరా వ్యవస్థ నిర్వహణపై కమిషనర్ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 84 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని తెలిపారు. -
తప్పుడు సర్వేతో తిప్పలు
మంచాల: సకల జనుల సర్వేనే అన్నిటికి మూలమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు కూడా ఇంటి దగ్గర ఉండి సర్వే అధికారులకు సహాకరించారు. కాని అధికారులు తప్పుడు సర్వే చేయడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అర్హత ఉండీ రేషన్ సరుకులకు, పింఛన్ వంటి సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. వాస్తవాలు తెలిసిన అధికారులు సైతం సమగ్ర కుటుంబ సర్వే ఫాం ఆధారంగానే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చేతులెత్తేస్తున్నారు. మండలంలో తప్పు డు సర్వే బాధితులు ఎందరో ఉన్నారు సర్వేల్లో దొర్లిన తప్పులు సరి చేయాలని మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.వారి బాధలు వర్ణనాతీతం. అరకొర వివరాలు.. మండల పరిధిలోని లోయపల్లి గ్రామానికి చెందిన కొర్ర నరేందర్ నాయక్ ఆటో డ్రైవర్. నిత్యం పట్టణం వెళ్లి ఆటో నడుపుకొని వచ్చిన ఆదాయంతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మితో పాటు కళావతి, రోజా అనే ఇద్దరు కూతుళ్లు, రాజు, మోహన్ అనే ఇద్దరు కూమారులు ఉన్నారు. అదే విధంగా తండ్రి దేవా(75) కూడా ఉన్నారు. వీరిది ఒకే కుటుంబం. కళావతి డిగ్రీ, రోజా ఇంటర్మీడియట్, రాజు ఎనిమిదవ తరగతి, మోహన్ నాలుగో తరగతి చదువుతున్నారు. సర్వే రోజు అందరూ ఇంటివద్దనే ఉన్నారు. అందరికీ ఆధార్ కార్డులు ఉండడమే గాకుండా రేషన్ కార్డులో కూడా ఉన్నారు. కాని అధికారులు సమగ్ర కుటుంబ సర్వే ఫాంలో అరకొర వివరాలు పొందుపర్చారు. కేవలం నరేందర్నాయక్, అతని భార్య లక్ష్మి, కూతురు కళావతి మాత్రమే ఉన్నట్లు రాశారు. మిగత వారి వివరాలు పొందు పర్చలేదు. దీంతో గత పదిహేను ఏళ్లుగా పింఛన్ పొందుతున్న దేవా వృద్ధాప్య పింఛన్ ఆగిపోయింది. అదే విధంగా వారికి రేషన్ కోటా కూడా తగ్గించారు. వారి పిల్లల వివరాలు ఎస్కేఎస్ ఫాంలో లేవని వారికి కుల, ఆదాయ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా,సంక్షేమ పథకాలు అందాలన్నా వారి వివరాలు కచ్చితంగా ఎస్కేఎస్ ఫాంలో ఉండాలి. వారిని మాత్రమే గుర్తిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మా పిల్లల పరిస్థితి ఏమిటని నరేందర్ నాయక్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. నిత్యం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు తామేమీ చేయలేమని, ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చాకే మళ్లీ వారిని ఎస్కేఎస్ ఫాంలో చేర్చుకోవడం జరుగుతుందని కచ్చితంగా చెప్పేస్తున్నారు... ఇలా తప్పుడు సర్వే వల్ల గ్రామాల్లో చాలా మంది తీవ్ర అన్యాయానికి గురై ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించి సర్వేలో తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయంపై తహసీల్దార్ బాలరాజును వివరణ కోరగా ఎస్కేఎస్ సర్వే ఫాం ద్వారా పొందుపర్చిన వివరాల ఆధారంగానే తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తప్పులను సరిచేయడం తమ చేతిలో పని కాదన్నారు. ఉన్నతాధికారుల నుండి తగిన సూచనలు రావాలని అన్నారు. -
రేషన్కు మంగళం!
జనవరి నుంచి 2.60 లక్షల మందికి సరకులు లేనట్టే.. సంక్రాంతి కానుకకూ వీరు దూరం యూఐడీ సీడింగ్ కాలేదంటూ సాకు రచ్చబండ కూపన్లూ రద్దు విశాఖపట్నం : జిల్లాలోని రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి రేషన్ సరకులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. సర్కారు విధిస్తున్న నిబంధనలు కార్డుహోల్డర్లపాలిట శాపంగా పరిణమించి రేషను అందకుండా చేయనున్నాయి. రూ.500కు పైబడి విద్యుత్ బిల్లులు వస్తున్నాయంటూ ఇప్పటికే 50వేల రేషన్కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే రచ్చబండలో ఇచ్చిన 69వేల కూపన్లకూ జనవరి నుంచి సరకులకు మంగళం పలకనుందని తెలిసింది. కార్డుల్లో యూఐడీ సీడింగ్ కాలేదంటూ మరో 8.76లక్షల మందికి సరుకులు నిలిపి వేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 2.60లక్షల కార్డుదారులకు కొత్త సంవత్సరం ఆరంభం నుంచి రేషను అందనట్టే. వరుస కత్తెర ఇలా: జిల్లాలో10,76,313 కార్డులపరిధిలో 4,13, 283 కార్డుదారులు(అన్సీడెడ్ యూనిట్స్)ను తొలగిం చారు. యూనిక్ ఐడీ సీడింగ్ కాని 7,50,354 సభ్యులతో పాటు ఇంతవరకు సీడింగ్ కాని 1,25,519 మందికి జనవరి నుంచి సరుకులు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియవచ్చింది. యూఐడీ నెంబర్లతో సీడింగ్ చేయించుకున్న వారికి మాత్రమే సరుకులు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్టుగా చెబుతున్నారు. గతసర్కార్ రచ్చబండ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 38,624, సిటీలో 57,276 కూపన్లు పంపిణీ చేసింది. వీటికి ఆధార్, ఫామిలీ ఫోటోలు అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరిలో 80 శాతంమంది సమర్పించినా సిబ్బంది వైఫల్యంతో అప్లోడ్ కాలేదని సమాచారం. సిటీలో 32,218, రూరల్ పరిధిలో 26,254మంది కూపన్లవారికి జనవరి 1వ తేదీ నుంచి సరుకులు నిలిపివేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలొచ్చినట్టు తెలిసింది. ఉచిత సరకుల జాబితాలో రచ్చబండ కూపన్ దారులు లేరని డీలర్లు బాహాటంగానే చెబుతున్నారు. యూఐడీ సీడింగ్ కాని వారితో పాటు రచ్చబండ కూపన్దారులకు పంపిణీ చేయనవసరం లేదని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతి కానుక కొందరికే: సంక్రాంతికి సర్కారు ప్రకటించిన రాయితీ కొందరికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. నెలవారీ ఇచ్చే బియ్యం,పంచదారతో పాటు అరకేజి పామాయిల్, అరకేజి కందిపప్పు, కేజీ శెనగలు, కేజీ గోధుమ పిండి, వంద గ్రాముల నెయ్యి, అరకేజి బెల్లంతో కూడిన కిట్ను సంక్రాంతి కానుక పేరిట అల్పాదాయ వర్గాల వారికి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో నిరుపేదలైన కార్డుదారులంతా ఆనందపడ్డారు. సర్కారు కార్డులకు ఎసరు పెడుతుండటంతో రెండున్నర లక్షల మంది రేషనుతోపాటు ఈ సంక్రాంతి కిట్టును పొందే అవకాశం కోల్పోతున్నారు. పై విషయాలను కలెక్టర్ ఎన్.యువరాజ్ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమిలేదన్నారు. ఇంత వరకు అధికారికంగా ఆదేశాలు రాలేదని చెప్పారు. -
గోదాముల్లో గోల్మాల్!
సాక్షి నిఘా విభాగం, మెదక్: మెదక్ జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం సరఫరా కోసం మొత్తం 19 మండల స్థాయి గోదాములున్నాయి. నెలనెలా జిల్లాకు సుమారు 13 వేల టన్నుల సబ్సిడి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో గానీ, ఇతర జిల్లాల్లో గానీ ఉన్న స్టేజ్-1 గోదాం నుంచి సంబంధిత స్టేజ్-1 కాంట్రాక్టర్ మండలస్థాయి స్టాక్ పాయింట్లకు రేషన్ సరుకులు రవాణా చేస్తాడు. అక్కడి నుండి స్టేజ్-2 కాంట్రాక్టర్ గ్రామాల్లోని రేషన్ డీలర్లకు రేషన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే డీలర్లు ప్రతినెలా తమ కోటాకనుగుణంగా డీడీలు చెల్లించి 18 తేదీలోగా మండల రెవెన్యూ కార్యాలయంలో అందజేస్తే వారు ఆర్ఓలు జారీ చేస్తారు. ఇందుకనుగుణంగా నెల చివరి వరకు స్టేజ్-2 కాంట్రాక్టర్ డీలర్లకు రేషన్ సరఫరా చేయాలి. బియ్యం పక్కదారి పడుతున్న తీరిది మామూలుగా స్టేజ్-1 గోదాం నుంచి రేషన్ సరుకులను వే బ్రిడ్జి మీద తూకం వేసి ఇస్తారు. అలాగే స్టేజీ-2 గోదాం నుంచి సరుకులను తూకం వేసిన తర్వాతే డీలర్లకు పంపిణీ చేయాలి. జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఎక్కడా వే బ్రిడ్జిలు లేవు. కేవలం చిన్నపాటి తులామాన్ తూకాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం తూకం వేయకుండానే 50 కిలోల లెక్కన బియ్యాన్ని సంచిల్లో నింపి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. బియ్యం సంచులు లోడ్ అన్లోడ్ చేసేటప్పుడు ఇనుప కొక్కాలు వాడుతుంటారు. దీంతో సంచులకు కన్నాలు పడి కిలోల కొద్ది బియ్యం గోదాంలో పడిపోతుంటాయి. బియ్యంలోని తేమ ఆవిరవుతుండటంతో కూడా సంచుల్లో తరుగు వస్తుంది. ఈ లెక్కన 50 కిలోలుండాల్సిన బియ్యం సంచి డీలరును చేరే సరికి 48 నుంచి 49 కిలోలు మాత్రమే ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఒక్కోసారి సంచులకు రంద్రాలు పడితే అందులో 5 కిలోల వరకు తరుగు వస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ లెక్కన గోదాముల్లో నెలనెలా క్వింటాళ్లకొద్ది బియ్యం మిగిలిపోతున్నాయి. అలాగే బోగస్ రేషన్కార్డులు కలిగి ఉన్న రేషన్ డీలర్లు మిగులుబాటు బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లోనే అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల రేషన్ డీలర్లు ప్రతినెల మొదటివారంలో ఇవ్వాల్సిన బియ్యాన్ని 20వ తేదీ నుంచి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అవికూడా రెండు, మూడు రోజులకోసారి బియ్యం ఇస్తుండటంతో 20 శాతం బియ్యం పంపిణీ చేయకముందే మరో నెల కోటా వ స్తోంది. ఇలా ఒక నెల బియ్యం..మరో నెలలో కలుపుతూ ఏడాదికి ఎంతలేదన్నా రెండు, మూడు కోటాల రేషన్ సరుకులను మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని గ్రామాల్లో ఒకే వ్యక్తి పేరుపై రెండు, మూడు బినామి రేషన్ షాపులున్నాయి. అవికూడా వేర్వేరు షాపులుగా కాకుండా ఒకేదుకాణంలో నిర్వహిస్తున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో అధికారులు బినామీ విద్యార్థుల పేర్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరికి సంబంధించిన బియ్యం కూడా మిగిలిపోతున్నాయి. ఇలా రకరకాల మోసాలతో మిగిలించుకున్న బియ్యం తిరిగి గోదాముల్లోకే చేరుతున్నాయి. బయట అమ్ముకుంటే బజారు పాలవుతామన్న ఉద్దేశ్యంతో అవినీతి పరులు గుట్టుచప్పుడు కాకుండా మిగులుబాటు బియ్యాన్ని గోదాంలోనే వదిలేసి...అందుకు సంబంధించిన డబ్బులందుకొని బయట పడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం రేషన్ సరుకులు గ్రామాల్లోకి తీసుకెళ్లే సమయంలో తప్పనిసరిగా రూట్ అధికారి ఉండాలి. గ్రామంలోని కనీసం ఐదు గురుకి సమాచారం ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో బియ్యం బకాసురుల అవినీతికి అడ్డేలేకుండా పోతుంది. ఆర్ఓలే మారుతాయ్... బియ్యం బస్తాలు కదలవు.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వార సరఫరా చేసే బియ్యం కుంభకోణం రాకెట్ పకడ్బందీ ప్రణాళికతో, హైటెక్ మోసంతో కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా మండలస్థాయి స్టాక్ పాయింట్లలో వివిధ మార్గాల ద్వారా ప్రతినెల ఎన్ని బియ్యం మిగులుతాయనే విషయం సంబంధిత గోదాం ఇన్చార్జికి అవగాహన ఉంటుంది. అంతే పరిమాణంలో రేషన్ బియ్యాన్ని స్టేజ్-1 గోదాం నుంచి స్టేజ్-2 గోదాంకు తీసుకురాకుండానే ఆర్ఓలను ఎంఎల్ఎస్ పాయింట్ల స్టాక్ రిజిష్టర్లో నమోదు చేసుకుంటారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు అక్రమ పద్ధతి ద్వారా మిగిలిన బియ్యాన్ని సర్దుబాటు చేస్తారు. అలాగే స్టేజ్-1 గోదాంలో మిగిలిన బియ్యానికి సమానంగా ఏదో ఒక రైస్మిల్ నుంచి లేవీ కింద తెచ్చి జమ చేసినట్లు లెక్కలు చూపుతారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో డీలర్లు, గోదాం అధికారులు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు కూడబలుక్కొని లక్షలాది రూపాయల బియ్యం కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. సాధారణంగా స్టేజ్-1 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు స్టేజ్-2 కాంట్రాక్ట్ తీసుకోకూడదనే నిబంధనలున్నాయి. కానీ స్టేజ్-1 కాంట్రాక్టరే బినామీ పేర్లతో స్టేజ్-2 కాంట్రాక్ట్ తీసుకుని నడిపిస్తున్నట్లు సమాచారం. కేసులైనా...ఆగని అక్రమాలు.. * ఈనెల 15న దుబ్బాక ఎంఎల్ఎస్ పాయింట్పై విజిలెన్స్ శాఖ దాడులు చేయగా, 54 బియ్యం బస్తాలు, రెండు ఉప్పు బస్తాలు, ఒక చెక్కర బస్తా తక్కువగా వచ్చాయి. * ఈ సంవత్సరం జూలైలో సదాశివపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్పై జరిగిన విజిలెన్స్ దాడి చేయగా, భారీమొత్తంలో బియ్యం స్టాక్ గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు లోనైన గోదాం ఇన్చార్జి గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. * ఏడాదిన్నర క్రితం గజ్వేల్ ఎంఎల్ఎస్ పాయింట్ పై జరిగిన దాడిలో సుమారు 50 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చినట్లు సమాచారం. తూకానికి వే బ్రిడ్జిలు లేవు: సివిల్ సప్లయీస్ డీఏం జయరాజ్ జిల్లాలోని గోదాముల్లో బియ్యం తూకం చేయడానికి వే బ్రిడ్జిలు లేవు. వేసవికాలంలో బియ్యం తరుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తూకం చేస్తుంటారు. ఇతర సమయాల్లో డీలర్లు అడిగితే బయట వే బ్రిడ్జిలపై తూకం వేసి ఇస్తారు. గోదాముల్లో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహించవద్దు. ఎలాంటి అక్రమాలు జరిగినా తగిన చర్యలు తీసుకుంటాం. -
70 ఏళ్లు దాటినా పింఛన్ ఇస్తలేరు!
సంగారెడ్డి అర్బన్: తనకు 70 సంవత్సరాలు దాటినా పెన్షన్ మంజూరు కావడం లేదని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా పెన్షన్ మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన మునగాల మల్లయ్య ఏజేసీ మూర్తికి ఫిర్యాదు చేశారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులను అందజేశారు. తన డబ్బుల సంచీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని రామచంద్రపురం మండలం అశోక్నగర్కు చెందిన సుందర్రాజు విజ్ఞప్తి చేశారు. 8 నెలలుగా తనకు రేషన్ సరుకులు అందడం లేదని, కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన అంతమ్మ విజ్ఞప్తి చేసింది. తనకు రెండు నెలలుగా పెన్షన్ అందడం లేదని, కొత్త జాబితాలో కూడా పేరు లేదని అధికారులు చెబుతున్నారని దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు కాలేదని,పెన్షన్తో పాటు కొత్త రేషన్ కార్డు ఇప్పించాలని నర్సాపూర్ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్ కోరారు. తాను కళాకారుడినని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని రామాయంపేట మండలం ఝన్సీలింగాపూర్కు చెందిన టేకుమట్ల బసవయ్య విజ్ఞప్తి చేశారు. తనకు రెండు నెలలుగా పింఛను అందడం లేదని అదే గ్రామానికి చెందిన టేకుమట్ల సాయిలు పేర్కొన్నారు. ఈ - పంచాయతీ కంప్యూటర్ అపరేటర్గా 8 నెలల క్రితం హైదరాబాద్లోని కార్వీ సంస్థలో శిక్షణ పూర్తిచేసినా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ విషయమై అధికారులను కలిస్తే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని, నిరుద్యోగులమైన తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించాలని ఆపరేటర్లు రవీందర్, రామస్వామి, శ్రీనివాస్, శ్రీకాంత్ , వెంకటేష్, దామోదర్ కోరారు. కార్యక్రమంలో ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఆధార్ లేకున్నా రేషన్
సంగారెడ్డి అర్బన్: ఆధార్కార్డులేని వారికి కూడా రానున్న రెండు నెలలు రేషన్ సరుకులు అందజేస్తామని, ఆలోపు కార్డుదారులంతా తప్పకుండా ఆధార్ కార్డు పొందాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమస్యలు లేవనెత్తారు. ఈ సందర్భంలోనే అల్లాదుర్గం జెడ్పీటీసీ సభ్యురాలు మమత, రాయికోడ్ జెడ్పీటీసీ సభ్యుడు అంజయ్యలు మాట్లాడుతూ, ఆధార్ సెంటర్ సమీపంలో లేక, అవగాహన లేక చాలా మంది కార్డుదారులు ఇంతవరకూ ఆధార్కార్డులు పొందలేదని, మరోవైపు పౌరసరఫరాలశాఖ ఆధార్కార్డు సమర్పించని కార్డుదారులకు రేషన్సరుకులు పంపిణీ నిలివేయడంతో చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఆధార్కార్డు పొందేందుకు వారికి వారికి కాస్త సమయం ఇవ్వాలని, అంతవరకూ రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్...మరో రెండునెలల పాటు ఆధార్కార్డుతో అనుసంధానంకాకపోయినా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్నారు. సర్కార్ ఆహారభద్రత కార్డులను త్వరలోనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, ఆహారభద్రత కార్డు పొందాలంటే తప్పకుండా ఆధార్కార్డు ఉండాల్సిందేనని, అందువల్ల ఇంతవరకు ఆధార్కార్డు పొందని వారంతా సాధ్యమైనంత త్వరగా కార్డు పొందాలన్నారు. ఇందుకోసం సంగారెడ్డి పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రంతో పాటు మండలంలో కూడా కొత్తగా ఆధార్ కేంద్రం కొత్తగా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కూసునే జాగ చూపండి ఎంపీడీఓ కార్యాలయాల్లో తమకు చాంబర్లు లేక ఎక్కడ కూర్చోవాలో తెలియని దుస్థితి ఉందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేయగా, స్పందించిన చైర్పర్సన్ రాజమణి, ఎంపీడీఓ కార్యాలయాల్లో జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా చాంబర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు ఏకరువు పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమల కాలుష్యంతో ఇస్నాపూర్ చెరువు నీరు కలుషితమై ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, ఈ విషయంపై గవర్నర్ నరసింహన్ కూడా చెరువును సందర్శించి తగిన చర్యలు తీసుకుపోవాలని సూచనలు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని పటాన్చెరు జెడ్పీటీసీ శ్రీకాంత్గౌడ్ సభ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట మండలం మక్కరాజ్పేట వద్ద గల పరిశ్రమలు వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నాయని దీంతో నీరంతా కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేగుంట జెడ్పీటీసీ సభ్యుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఘనపురం ఆనకట్ట ఆదుధునికీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపక పోవడమే కాకుండా శిలాఫలకంపై కూడా పేర్లు ముద్రించలేదని స్థానిక జెడ్పీటీసీ సమావేశంలో ప్రస్తావించగా, స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం పంపాలని జిల్లా పంచాయతీ అధికారి , జెడ్పీ సీఈఓ ప్రభాకర్రెడ్డికి సూచించారు. ఇస్మాయిల్ఖాన్పేట్, బేగంపేట్ , చిద్రుప్ప, ఆరట్ల నుంచి రోజూ రూ.2 కోట్ల విలువచేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, వాహన దారులు ఓవర్లోడ్తో వెళ్తుడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని జిన్నారం జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ సమావేశంలో ప్రస్తావించారు. సంగారెడ్డి మండల ఆర్ఐ సత్తార్ ప్రోత్సాహంతో మండలంలో అక్రమ ఫిల్టర్లు జోరుగా సాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని సంగాారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్గౌడ్ కలెక్టర్ను కోరగా, ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
సన్నబియ్యం పేరుతో ఘరానా మోసం
గుడివాడ : ‘మేం నాగాయలంక, అవనిగడ్డకు చెందిన రైతులం’ అంటూ మీవద్దకు వస్తున్నారా..? మోపెడ్లపై బియ్యం మూటలతో వచ్చి తక్కువ ధరకు సన్నబియ్యం ఇచ్చేస్తున్నామని చెప్పారా..? వారి మాటాలు నమ్మి ఆ బియ్యం కొన్నారంటే మోసపోయినట్లే.. జిల్లాలోని కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇలా అంటగట్టేస్తున్నారు. తీరా ఆ బియ్యం వండి చూస్తే రేషన్ సరుకని తేలి లబోదిబోమనాల్సిందే. గత వారం రోజులుగా గుడివాడ ప్రాంతంలో ఇటువంటి వారు నకిలీ బియ్యాన్ని అమ్మటంతో అనేక మంది మోసపోయారు. కంకిపాడు ప్రాంతంలో ఆ వ్యక్తుల్ని గుర్తించిన సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంకిపాడు పోలీసులు కూపీ లాగకుండానే పెట్టీ కేసు నమోదు చేసి వదిలేశారు. గుడివాడలో వీరి బారినపడి మోసపోయిన వారు ‘సాక్షి’కి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... విత్తనాలకు డబ్బులేక దాచుకున్నవి అమ్ముకుంటున్నాం... జిల్లాలోని నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో పండే బీపీటీ సన్నబియ్యం బాగుంటాయని పేరుంది. ఈ బియ్యానికి మంచి గిరాకీ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఘరానా మోసగాళ్లు ఆప్రాంత రైతులమని చెప్పి సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిలువునా ముంచేస్తున్నారు. గుడివాడలోని శ్రీరామ్పురంలోకి నాలుగు రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు మోపెడ్లపై బియ్యం మూటలతో వచ్చారు. తాము అవనిగడ్డ ప్రాంతానికి చెందిన రైతులమని, విత్తనాలకు డబ్బులేక, తినటానికి దాచుకున్న బియ్యాన్ని అమ్ముకుంటున్నామని తెలిపారు. సన్నబియ్యం తక్కువ రేటుకు అందిస్తున్నామని చెప్పారు. శాంపిల్గా వారి వద్ద ఉన్న ఒక సంచిలో ఉంచిన మంచి బియ్యాన్ని చూపించారు. ఇవన్నీ ఒకే పొలంలోవని చెప్పారు. బహిరంగ మార్కెట్లో 25 కేజీల బస్తా ధర రూ.1,300 ఉందని, రూ.900కే అమ్ముకుంటున్నామని దీనంగా చెప్పారు. ఇళ్లవద్ద ఉండే మధ్యతరగతి మహిళలు వీరి మాటలు నమ్మి, తక్కువ ధరకు బియ్యం వస్తున్నాయని కొన్నారు. తీరా వండిన తరువాత అవి రేషన్బియ్యం అని తేలింది. ఈనెల 13న సత్యనారాయణపురంలో కూడా ఇదే తరహాలో బియ్యం అమ్మారు. ఇలా గుడివాడలోనూ, పరిసరాల్లోని పల్లెల్లో మధ్యతరగతి వర్గాలు ఉండే ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిసింది. మినీ వ్యాన్లో తీసుకొచ్చి.. మోపెడ్లపై అమ్ముతూ.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్చేసి అమ్ముతున్నట్లు సమాచారం. నలుగురైదుగురు మోపెడ్లతో వస్తారు. వీరితోపాటు బియ్యం బస్తాలు మినీ వ్యాన్లో వస్తాయి. వ్యాన్ను గ్రామం చివర్లో ఉంచి బస్తాలను మోపెడ్లపై ఇళ్లవద్దకు తీసుకెళతారు. అమ్మకం పూర్తి కాగానే ఆ ప్రాంతం నుంచి మాయమవుతారు. ఇలా జిల్లాలో కొందరు రేషన్, ముతక బియ్యాన్ని రీసైక్లింగ్చేసి అమాయకులకు అంటగట్టి మోసం చేస్తున్నట్లు తెలిసింది. పట్టిస్తే పెట్టీ కేసు పెట్టారు... గుడివాడలో పలువురిని మోసం చేసిన వారిలో ఇద్దరు కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల సమీపంలో మోపెడ్పై బియ్యం పెట్టుకుని ప్రధాన రహదారిపై వెళ్లే వారికి అమ్ముతున్నారు. వీరి మోసానికి బలైన గుడివాడ వాసి వీరిని గుర్తించి కంకిపాడు పోలీసులకు ఉప్పందించారు. వారు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరు కంకిపాడు మండలం కోలవెన్ను శివారు మాదాసువారి పాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, సూరిబాబుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పెట్టీ కేసు నమోదు చేశారు. వీరిని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే నకిలీ బియ్యం ముఠా గుట్టు రట్టయ్యేదని పలువురు చెబుతున్నారు. కాగా గుడివాడలో వీరి మోసానికి బలైన వ్యక్తి కంకిపాడు పోలీసు స్టేషన్లో ఉన్న వారివద్దకు వెళ్లారు. నకిలీ బియ్యం అంటగట్టి తీసుకున్న రూ.3,500ను నిందితులు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్మే ముఠా గుట్టు రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి వ్యాపారుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ఇక ‘భద్రతా కార్డు’..!
ఆదిలాబాద్ అర్బన్ : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. అయితే రేషన్ కార్డు అనే పేరుకు బదులు ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ అని కొత్తగా పేరు తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ఇక ‘రేషన్ కార్డు’ లింకు తెగిపోనుంది. ఈ కార్డు స్థానంలో ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ రానుంది. ఇది కేవలం రేషన్ సరుకులు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుకు బదులుగా ‘కుటుంబ అహార భద్రత కార్డు’ తెలంగాణ ప్రభుత్వం పేరిట జారీ కానుంది. ఇందులో భాగంగానే అర్హులైన ప్రజలందరికీ ‘ఆహార భద్రత కార్డు’ (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఇచ్చేందుకు ఈ నెల 15 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతోపాటు అర్హులైన వారికి పింఛన్లు, కుల, ఆదాయ, విద్యార్థులకు సంబంధించిన ఇతర సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఈ నెల 7న హైదరాబాద్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శుల సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ తగిన సూచనలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాకు మార్గదర్శకాలు అందాయి. ఇందులో భాగంగానే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ‘భద్రత కార్డు’ ప్రక్రియ ఇలా... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ నిత్యావసర వస్తువులు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రతా కార్డు’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ కార్డు కోసం ప్రజలు గ్రామాల్లోని వీఆర్వోలకు, లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వీరిని ఈ ప్రక్రియ గ్రామ ఇన్చార్జీలుగా నియమించారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున మొత్తం 1732 మంది అధికారులు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ నెల 15 వరకు ‘భద్రతా కార్డు’ దరఖాస్తులతో పాటు, పింఛన్లు, ఇతర తహశీల్దార్ ద్వారా జారీ చేయబడే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారందరూ ఆహార భద్రతా కార్డులకు తెల్లకాగితంపై తమ వివరాలను రాసి సంబంధిత అధికారులు అందించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ కోరారు. వీఆర్వోలకు, కార్యదర్శులకు అందించిన దరఖాస్తులన్నీ గ్రామాల వారీగా విభజించి ఆహార భద్రతా కార్డు, పింఛన్లు, సర్టిఫికెట్ల దరఖాస్తులను వేరు చేస్తారు. ఇలా గ్రామాల వారీగా విభజించిన దరఖాస్తులను ఈ నెల 15 నుంచి పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ మండలానికి ఆరుగురు ప్రత్యేక అధికారుల చొప్పున పర్యవేక్షించేందుకు నియమించారు. వీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా సంబంధిత గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్న తీరు.. అర్హులా.. కాదా.. అనేది తేల్చుతారు. ఒక వేళ ‘బోగస్’గా కూడా ఆహార భద్రతా కార్డు జారీకి అర్హులని గుర్తిస్తే ఈ ఆరుగురు అధికారులే బాధ్యులవుతారు. జిల్లా వ్యాప్తంగా 52 మండలాల్లో మండలానికి ఆరుగురు అధికారులు చొప్పున మొత్తం 312 మంది అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు ముఖ్యులుగా ఉంటారు. ఇప్పటికే 85 వేల దరఖాస్తులు జిల్లాలో ప్రస్తుతం 6,72,288 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉండడం.. పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టడం వంటి వాటిని ప్రభుత్వం సీరియస్గా పరిగణించి బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టింది. ఇందులో 81,700 రేషన్ కార్డులను బోగస్గా గుర్తించి తొలగించారు. అయితే.. గతంలో చేపట్టిన రచ్చబండ, ప్రజాపథం కార్యక్రమాలు, ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 85 వేల మంది తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఈ దరఖాస్తులు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,78,613 కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 8,28,042 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి ఈపీడీఎస్ విధానం ద్వారా సరుకులు కేటాయిస్తున్నారు. కొత్త కార్డులు ఇచ్చేందుకు... - ఎం.జగన్మోహన్, కలెక్టర్ రేషన్ కార్డులకు బదులు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆహార భద్రతా కార్డును జారీ చేయనుంది. ఇందుకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మొదట గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. 15 నుంచి ప్రతి దరఖాస్తును మండల అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. అర్హులందరికీ ‘ఆహార భద్రత కార్డు’లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తాం. -
పండగ పూట ఎండిల్లేనా?
భువనగిరి : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా తయారైంది పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ప్రధాన పండగల వేళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఉప్పు పప్పు, చక్కెర, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను కుదించడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. దీంతో తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగలు ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి. 9 సరుకులు జాడే లేదు 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 9,333 ఉండగా వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు కార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తె ల్ల రేషన్కార్డులపై 9 రకాల సరుకులను రూ.185కే అందించడానికి ‘అమ్మహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం 9 సరుకులకు గాను కేవలం బియ్యం, అడపాదడపా చక్కర మాత్రమే ఇస్తుండటంతో కార్డుదారులు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అతిపెద్ద పండగలైన బతుకమ్మ, దసరాకు ప్రజలు ఎక్కువగా పిండి వంటలు చేస్తుంటారు. వీటిలో వినియోగించే పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండడం లేదు. బయటి మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఏడు నెలలుగా నిలిచిన పామోలిన్ రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే పామోలిన్ ఏడు నెలలుగా నిలిచిపోయింది. ప్రతి నెలా జిల్లాకు 9 లక్షలకు పైగా పామోలిన్ పాకెట్లు రావాల్సి ఉండగా ఎన్నికల ముందు నుంచి సరఫరా కావడం లేదు. గతంలో ప్ర తిరేషన్కార్డుపై లీటర్ పామోలిన్ రూ.40కు ఇచ్చే వారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పామోలిన్ రూ.55 ఉంది. అదే విధంగా కంది పప్పుది అదే పరిస్థితి. జిల్లాకు ప్రతి నెలా సుమారు 9 లక్షల కందిపప్పు ప్యాకెట్లు రావాల్సి ఉండగా గత 5 నెలలుగా నిలిచిపోయాయి.కందిపప్పు రేషన్ దుకాణాల్లో కిలో రూ.47కు ఇవ్వగా బహిరంగ మార్కెట్లో రూ. 80కి విక్రయిస్తున్నారు. చేదెక్కిన చక్కెర గత నెల వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ 30 ఉన్న చక్కెర ప్రస్తుతం రూ.34కు చేరింది. బతుకమ్మ, దసరా, బక్రీద్ పండగల నేపథ్యంలో చక్కెర వినియోగం అధికంగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చక్కెర ధరను అమాంతం పెంచేశారు. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుపై కేవలం అరకిలో చక్కెర మాత్రమే ఇస్తున్నారు. అదనపు చక్కర కోసం ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్షాపులో కిలో రూ.13.50లకు లభించే చక్కెర కాస్తా బహిరంగ మార్కెట్లో రూ.34కి చేరడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. -
ఆపరేషన్ ఏరివేత
ఆధార్ సీడింగ్ పేరుతో5,36,102 మందికి రేషన్ కట్ 2,144 టన్నుల బియ్యం కోత పేదలకు ఇబ్బందులు సరుకుల్లోనూ కుదింపు రేషన్ షాపు యజమానులకూ కష్టకాలం మచిలీపట్నం : ఆధార్ సీడింగ్ పేరుతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆప‘రేషన్ ఏరివేత’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కారణమేదైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బోగస్ కార్డుల కింద భావించి రేషన్ సరుకుల సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ విధంగా రెండు నెలల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సరుకుల సరఫరా నిలిపివేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పేదలు అల్లాడుతున్నారు. కార్డులు జారీ చేసినప్పుడు తెలియదా.! జిల్లాలో 11,23,944 తెల్ల రేషన్కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 31,37,710 మందికి సంబంధించిన ఆధార్కార్డుల సీడింగ్ పూర్తి చేశారు. వారిలో 5,36,102 మందిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ నెలకు నాలుగు కిలోల చొప్పున ఇప్పటి వరకు బియ్యం కేటాయిస్తూ వచ్చారు. ఈ నెలలో అనర్హులుగా గుర్తించిన వారికి రేషన్ బియ్యం నిలిపివేయడంతో దాదాపు 2,144 టన్నుల బియ్యం మిగిలిపోయాయి. అన్ని రేషన్కార్డులకు ఆధార్ సీడింగ్ పూర్తయితే అనర్హుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆధార్ సీడింగ్కు ఇప్పటి వరకు రాని రేషన్కార్డుల్లో ఎక్కువ శాతం బోగస్వేనని భావిస్తున్నారు. కొంతమందికి మాత్రమే ఆధార్ కార్డులు ఇంకా అందలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు బోగస్ కార్డులు తమ వద్దే పెట్టుకుని ప్రతి నెలా రేషన్ పొందుతున్న డీలర్ల ఆటలు ఇక సాగవని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బోగస్ కార్డుల వ్యవహారం అధికారులకు తెలియదా.. మంజూరు చేసే సమయంలో నిబంధనలు పాటించలేదా.. అని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల కంప్యూటరీకరణ జిల్లా వ్యాప్తంగా 17ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రేషన్ విడుదల, రికార్డులు రాయడం తదితర ప్రక్రియలు మాన్యువల్గానే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద అనేక అవకతవకలకు అవకాశం ఉంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంఎల్ఎస్ పాయింట్లను కంప్యూటరీకరించేందుకు రంగం సిద్ధమైంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కంప్యూటర్లను, ఆపరేటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజరు సింగ్ తెలిపారు. ఇప్పటికే తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్ డీలర్ల వద్ద ఉన్న స్టాకు వివరాలను ఈ-పీడీఎస్ పద్ధతి ద్వారా సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఒక్కో రేషన్ షాపునకు ప్రతి నెలా ఎంత మేర సరుకులు కేటాయించాలనేది నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. డీలర్ల వద్ద నిల్వలు మినహాయించి మిగిలిన సరుకులను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. మిల్లర్లకు ఇబ్బందులు! కేంద్ర ప్రభుత్వం లేవీ బియ్యం కిలో రూ.26 చొప్పున కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేస్తుంది. బోగస్ కార్డుల ద్వారా ఆ బియ్యం పొందిన డీలర్లు వాటిని మిల్లర్లకు రూ.16 చొప్పు విక్రయించడం, మిల్లర్లు అవే బియ్యాన్ని ఎఫ్సీఐకి మళ్లీ రూ.26 లేవీ బియ్యంగా విక్రయించడం జరుగుతోంది. ఈ నెలలో 2,144 టన్నుల బియ్యం కోత విధించడంతో మిల్లర్లు కూడా మండిపడుతున్నారు. నాలుగు సరుకులు మాత్రమే గతంలో అమ్మహస్తం పథకం ద్వారా తొమ్మిది రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేవారు. ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం పామోలిన్పై సబ్సిడీ ఎత్తివేయడంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంలేదు. కార్డులో పేరు ఉన్న సభ్యునికి నాలుగు కిలోల బియ్యంతోపాటు ఒక్కో కార్డుకు అర కిలో పంచదార, లీటరు కిరోసిన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పెరిగిన ధరలకు బయట కొనుగోలు చేయలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
మళ్లీ ‘ఆధార్’ లొల్లి
ఘట్కేసర్ టౌన్: మళ్లీ ఆధార్ లొల్లి మొదలైంది. ఆధార్ నంబర్లు ఇవ్వని వారికి ప్రభుత్వం సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను నిలిపివేసింది. రేషన్ కావాలంటే కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందజేయాలని షరతు విధించింది. నిజమైన లబ్ధిదారులైతే వివరాలను అందజేస్తారని ఇవ్వని పక్షంలో బోగస్ కింద పరిగణించవచ్చని సర్కారు ఆలోచన. దీని ద్వారా ఏటా ప్రభుత్వంపై పడుతున్న రూ.కోట్ల భారాన్ని తప్పించుకోవచ్చని భావిస్తోంది. కార్డులున్న వారిలో చాల మంది అనర్హులున్నారని, ఇతర ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా కార్డులు పొందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనర్హులను తొలగించేందుకే కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ నంబర్లను ఇవ్వాలని, అనుసంధానం అయితేనే సరుకులు అందుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో 10.07 లక్షల కార్డులుండగా అందులో మరణించిన వారు, ఇచ్చిన చిరునామాలో శాశ్వతంగా నివాసం లేని 1,55,000 మంది లబ్ధిదారులను గుర్తించి సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను నిలిపివేశారు. ఇంకా ఆధార్ వివరాలను అందజేయని వారు 2,55,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో మండలంలో 6,250 మందికి రేషన్ సరుకులు నిలిచిపోయాయి. అనుసంధానం కానివారికి ఇబ్బందులు బోగస్ రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకులను నిలిపివేశామని పౌర సరఫరా శాఖ అధికారులు చెబుతున్నా ఆధార్ అనుసంధానం కానివారు, ఆధార్ లేనివారు వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ఆధార్ కేంద్రానికి వెళ్లి నమోదుచేసుకున్నా ఇప్పటికీ కార్డులందని వారు కోకొల్లలు. అనుసంధానం కోసం చాలాసార్లు ఆధార్ ఇచ్చినా సరుకులు నిలిపివేశారని పలువురు వాపోయారు. రేషన్ ఆగిన లబ్ధిదారులు కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందజేయాలని, అనుసంధానం తర్వాతే సరుకులను అందజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. -
రేషన్.. కోత!
- జిల్లాకు 93,594 క్వింటాళ్ల బియ్యం తగ్గింపు - ప్రభుత్వానికి తగ్గిన 25.27 కోట్ల భారం - ఆధార్ కార్డులివ్వని వారంతా బోగస్ కింద లెక్కింపు పాలమూరు : జిల్లాకు సరఫరా అవుతున్న రేషన్ సరుకుల్లో భారీగా కోత విధించారు. రేషన్ సరుకులు తీసుకోవాలంటే కార్డుదారులు ఆధార్ కార్డు ఇవ్వాల్సిందేనని నిబంధన విధించారు. దీంతో కొందరు ఆధార్ కార్డులు సమర్పించారు. ఇంకా చాలామంది వాటిని అందించలేదు. ఆధార్ కార్డులివ్వని వారంతా బోగస్ కిందే ప్రభుత్వం లెక్కగట్టింది. దీంతో వారికి ఇవ్వాల్సిన కోటాకు కత్తెర పెట్టింది. కుటుంబాల సంఖ్యతో పోలిస్తే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, బోగస్ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం విధితమే.. అందులో భాగంగానే జిల్లాలో 57,412 బోగస్ కార్డులను గుర్తించింది. వాటికి అందజేయాల్సిన రేషన్ బియ్యం కోటాలో కోత విధించారు. జిల్లాకు ప్రతినెల 18,256 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. కార్డుల ఏరివేతతో మొత్తం కోటాలోంచి సెప్టెంబర్ నెలకు గాను 93,594 క్వింటాళ్ల బియ్యాన్ని తగ్గించారు. దీంతో ప్రభుత్వానికి 25.27 కోట్ల భారం తగ్గింది. జిల్లాలో 57,412 కార్డులు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మూడు విడతలుగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి తాత్కాలిక కూపన్లు పంపిణీ చేశారు. ప్రతి మూడు నెలలకోసారి కూపన్లు పంపిణీ చేస్తూ వచ్చారు. కుటుంబ సభ్యుల ఫొటోతోపాటు ఆధార్ కార్డు నెంబర్లు ఇచ్చిన వారికి కార్డులు తయారు చేసి ఇచ్చారు. అయినా ఫొటోలు ఆధార్ నంబర్లు ఇవ్వని వారి సంఖ్య 69,218కు చేరుకుంది. ఈ కూపన్లకు సంబంధించి ఆధార్ నంబర్లు, ఫొటోలు సమర్పించాల్సి ఉంది. వీరికి నేడు సాయంత్రం వరకు గడువు విధించారు. జిల్లాపై నెలకు తగ్గిన 25.27 కోట్ల భారం బోగస్ కార్డుల ఏరివేతతో ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలుగుతోంది. ఎఫ్సీఐ నుంచి క్వింటాలు బియ్యాన్ని 2,800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. 2,700 చొప్పున సబ్సిడీ భారం మోస్తూ.. 100కు క్వింటాలు చొప్పున పేదలకు చౌకడిపోల ద్వారా పంపిణీ చేస్తోంది. బోగస్ యూనిట్ల తొలగింపుతో నెలకు 93,594 క్వింటాళ్ల కోటా తగ్గుతోంది. క్వింటాలుకు 2,700 చొప్పున నెలకు 25.27 కోట్లు ప్రభుత్వానికి భారం తగ్గుతోంది. సమాచారం నమోదుకు నేడు ఆఖరు జిల్లా వ్యాప్తంగా 69,218 కూపన్లకు సంబంధించి ఫొటో, ఆధార్ కార్డు నంబర్ను నమోదు చేయాల్సి ఉంది. వీరిలో అందరూ అనర్హులున్నారని భావించే పరిస్థితి లేదు. కొందరు అర్హులు కూడా ఉంటారు. పెపైచ్చు ఆహార భద్రత చట్టం ప్రకారం బియ్యం సరఫరా చేయకుండా ఎవరినీ వేధించే హక్కులేదు. దీంతో కూపన్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తుది గడువు ఇచ్చింది. శుక్రవారం లోపు కుటుంబ సభ్యులతో కూడిన ఫొటో, ఆధార్ కార్డు నెంబర్లను సంబంధిత తహశీల్దారుకు సమర్పించాలి. వారు నిజంగా అర్హులైతే లెక్కలోకి తీసుకుని వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేస్తారని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి సయ్యద్ యాసిన్ పేర్కొన్నారు. -
రేషన్ బంద్!
- రచ్చబండ కార్డులపై సరుకులు నిలిపివేత - ఫొటో, ఆధార్ నంబర్లు ఇవ్వని ఫలితం - జిల్లాలో 40వేల మంది - వచ్చే నెల 5లోగా వివరాలిస్తేనే కోటా సాక్షి, కరీంనగర్ : రేషన్ సరుకులు అందాలంటే.. ఫొటో, ఆధార్ నంబర్ సమర్పించాలని ఇది వరకే స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి వివరాలు సేకరిస్తోంది. అయినా జిల్లాలో వేలాదిమంది రేషన్కార్డుదారులు వివరాల సమర్పణకు వెనకడుగు వేస్తున్నారు. వివరాలివ్వని వారందరూ బోగస్కార్డుదారులేనని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకే వారికి సరుకులు నిలిపేశారు. గతంలో ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి.. రేషన్ కార్డులు లేని 86,350 మందికి కార్డులు అందజేసింది. ఇతర కార్డులపై అందజేస్తున్న మాదిరిగానే వీరికి బియ్యం, చక్కెర, కిరోసిన్, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు తదితర నిత్యావసర వస్తువులన్నీ అందిస్తోంది. రచ్చబండలో జారీ చేసిన కార్డుల్లో చాలా మంది అనర్హులున్నారని, కుటుంబంలో ఇతర సభ్యులకు కార్డులున్నా తప్పుడు సమాచారంతో మళ్లీ కార్డులు పొందారనే విమర్శలు వచ్చాయి. ఈ కార్డులపై రేషన్ కోటా కూడా పెరగడంతో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఫొటో, ఆధార్నంబర్ సేకరించాలని అధికారులను ఆదేశించింది. రచ్చబండ కార్యక్రమాల్లో కార్డులు పొందిన వారిలో 47 వేల మంది ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పించారు. 13,350 మందిలో ఫొటో సమర్పిస్తే.. ఇంకొందరు ఆధార్ నంబర్ మాత్రమే ఇచ్చారు. 26 వేల మంది మాత్రం రెండింటిలో ఏ గుర్తింపూ ఇవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా వివరాలు సమర్పించకపోవడంతో.. పూర్తి సమాచారం ఇవ్వని వారికి నిత్యావసర వస్తువులు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. వ చ్చే నెల ఐదో తేదీలోగా ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పిస్తేనే వారికి ఆ నెల రేషన్ సరుకులు ఇవ్వాలని సూచించింది. ‘వివరాలు సమర్పించని వినియోగదారులు తమ పరిధిలోని రేషన్డీలర్లకు నిర్ణీత సమయంలోగా ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పించాలి. అయినా ఆలస్యం చేస్తే.. ఆ నెల కోటా ఇచ్చే ప్రసక్తే లేదు’ అని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చంద్రప్రకాశ్ తెలిపారు. -
అస్తవ్యస్తం !
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయా.. లేదా.. అని చూసేందుకు సరిపడా అధికారులు లేరు. ఫలితంగా ప్రజా పంపిణీ సజావుగా సాగడం లేదు. జిల్లాలో ఒక్కో డివిజన్కు ఒక ఏఎస్వో స్థాయి అధికారి విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వీరు జిల్లాలో అవసరమైనంత మంది లేకపోవడంతో పర్యవేక్షణ పడకేసింది. జిల్లాలో ఉన్న రేషన్ షాపులు, కిరోసిన్, వంటగ్యాస్ సంస్థలపై తరచుగా ప్రత్యేక బృందాలు దాడులు చేస్తేనే పౌరసరఫరాలో లోటుపాట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దాడులు లేకపోవడంతో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కిరాణం షాపుల్లో, మిల్లర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. వంట గ్యాస్ సిలెండర్లను కమర్షియల్ సిలెండర్లుగా, వివిధ కార్లకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఏఎస్వో స్థాయి అధికారులు సరిపడా లేకపోవడంతో మండల కేంద్రాల్లో ఉన్న సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురికి ఒక్కరే... ప్రజా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఒక అధికారి ఉంటారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, డీఎస్వో కార్యాలయంలో పాలన పరమైన అంశాలు చూసేందుకు మరొకరు జిల్లా కేంద్రంలో ఉంటారు. అయితే జిల్లాలో ఐదుగురు ఏఎస్వోలకు గాను ప్రస్తుతం ఒక్కరే డీఎస్వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రు. మిగిలిన నాలుగింటిలో భద్రాచలం డివి జన్లో పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఖమ్మం ,కొత్తగూడెం, పాల్వంచలలో పని చేస్తున్న వారు డిప్యూటేషన్పై హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. అలాగే భద్రాచలం డివిజన్లో ఒక్క డీటీ మాత్రమే పనిచేస్తున్నారు. బూర్గం పాడు మండలంలో సైతం సివిల్ సప్లై డీటీ పోస్టు ఖాళీగానే ఉంది. పర్యవేక్షణ కరువు.... డివిజన్ పరిధిలో ఏఎస్వో స్ధాయి అధికారి విధుల్లో కొనసాగితే ఆ పరిధిలోని డిప్యూటి తహశీల్దార్లను అప్రమత్తం చేస్తూ అక్రమ మార్గంలో తరలే నిత్యావసర వస్తువులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అయితే పై స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండలస్ధాయిలో సివిల్ సప్లై డీటీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ దందా ..... సరైన పర్యవేక్షణ లేని కారణంగా రేషన్ బియ్యం అక్రమ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ప్ర జా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కిరోసిన్ అక్రమదందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడో ఒకసారి జరిగే దాడుల్లో దొరుకుతున్నప్పటికీ అంత గా చర్యలు లేకపోవడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా కొనసాగుతోంది. పెద్దల ముసుగులో అక్రమ వ్యాపారం... జిల్లాలో బియ్యం, కిరోసిన్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువులు అక్రమ మార్గంలో తరలివెళ్లడంలో పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దల ముసుగులో కొందరు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జిల్లా అధికారులకు తెలుసో.. తెలియదో కానీ కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం అక్రమార్కుల జోలికి వెళ్లడంలేదు. ఒకవేళ ఎవరినైనా పట్టుకుంటే ‘పెద్దాయన.. అదే మీబాస్ మా దగ్గరి చుట్టం.. ఆయనతో మాట్లాడించాలా’ అని అనడంతో మాకెందుకులే అని సిబ్బంది నోరు మెదపకుండా వస్తున్నారు. ఈ తరహా వ్యవహారం ఖమ్మంలో అధికంగా సాగుతోందని పౌరసరఫరాల అధికారులే పేర్కొనడం కొసమెరుపు. -
‘రేషన్’ కష్టమే..!
సాక్షి, ఒంగోలు: ఇకనుంచి రేషన్ సరకుల సరఫరా కష్టమవనుందా..? అవునంటున్నారు పౌరసరఫరాల శాఖ అధికారులు. ఇప్పటికే అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాల సరుకుల పంపిణీలో ప్రభుత్వం చేతులెత్తేసింది. రానున్న రోజుల్లో పేదలకు దక్కాల్సిన బియ్యం కూడా గగనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయించిన నూతన ‘లెవీ’ సేకరణ విధానం నేపథ్యంలో భవిష్యత్లో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై సర్వత్రా విమర్శిస్తున్నారు. నూతన లెవీ సేకరణ విధానంతో పేదలకు అందాల్సిన బియ్యం నిల్వలు తగ్గిపోతాయని సామాజిక, పౌరసంస్థలు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రైవేటు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసి ప్రజాపంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం మీనమేషాలు లెక్కించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం ఇదీ... ప్రస్తుతం అమలులో ఉన్న లెవీ విధానం ప్రకారం మిల్లర్ల నుంచి 75 శాతం బియ్యాన్ని ప్రభుత్వమే లెవీగా సేకరించి..25 శాతంను మిల్లర్లు బయట ప్రైవేటుగా అమ్ముకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వం (ఎఫ్సీఐ) సేకరించిన లెవీ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వపెట్టి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేస్తోంది. అలాంటిది, తాజాగా కేంద్రం అమలు చేయాలనుకుంటున్న లెవీ విధానం ప్రకారం 25 శాతమే లెవీకింద సేకరించి..మిగిలిన 75 శాతం బియ్యంను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని మిల్లర్లకు అవకాశమివ్వనుంది. ఈ విధానంతో ప్రభుత్వం అవసరమైతే బయట మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసి ప్రజాపంపిణీకి అందజేయాల్సి ఉంటుంది. మిల్లర్ల నుంచి ఎఫ్సీఐ కిలోబియ్యాన్ని రూ.22.50 కొనుగోలు చేసి వివిధ పథకాలకు అమలు చేస్తోంది. తాజా మార్పులతో బియ్యం బయట కొనుగోలు చేస్తే ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. జిల్లాలో ప్రతీనెలా 12,102 టన్నుల బియ్యాన్ని ప్రజాపంపిణీకి కేటాయిస్తున్నారు. తగ్గిపోనున్న ‘లెవీ’.. జిల్లాలో గతేడాది ఖరీఫ్లో 50 వేల టన్నులు లెవీ లక్ష్యంగా నిర్దేశించారు. మిల్లర్లు కేవలం 48 వేల టన్నులు మాత్రమే లెవీకింద ఇచ్చారు. అంతకు ముందు ఏడాది 62 వేల టన్నులు లక్ష్యం కాగా, సుమారు 52 వేల టన్నులే సేకరించారు. ఇకపై లెవీ చెల్లింపులు గణనీయంగా పడిపోనున్నాయి. జిల్లాలో సుమారు 300 మిల్లులున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతతో పాటు ఇతర సమస్యలతో సుమారుగా 60 వరకు మూతపడే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్సీఐ నుంచి నెలవారీ బిల్లులు రావడంతో మిల్లర్లు అంతంతమాత్రంగా వ్యాపారం చేస్తున్నారని.. పెద్ద మొత్తంలో బియ్యం ప్రైవేటుగా విక్రయించుకోవడం ఆర్థిక భారంతో కూడుకున్నదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త లెవీ విధానం అమలుచేస్తే మరో 100కు పైగా మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని మిల్లర్లు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా ప్రజాపంపిణీ సరుకుల కొరత తీవ్రంగా ఉండటంతో.. జిల్లాకు కేటాయించినంత నిల్వలనే లబ్ధిదారులకు సర్దుబాటు చేయడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భవిష్యత్లో ఈ పరిస్థితి మరింత పెరిగినట్లయితే, పేదలకు నెలవారీ బియ్యం అందించలేమనే ఆందోళనలో ఉన్నారు. -
‘ఆధార్’ తెస్తేనే రేషన్ సరుకులు
బాన్సువాడ : ‘నువ్వు ఆధార్ కార్డును ఇప్పటి వరకు ఇవ్వలేదు.. గవర్నమెంట్ నీకు రేషన్ సరుకు విడుదల చేయలేదు.. ఇంటికి వెళ్లిపో.. ఆధార్ తెస్తేనే రేషన్ సరుకు ఇస్తాం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..’ అంటూ రేషన్ డీలర్లు లబ్ధిదారులను రేషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా రా ష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారు ఆధార్ కా ర్డును నమోదు చేయాలని ఆదేశించడం, రేషన్ డీల ర్లకు ఒకవైపు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టగా, మరోవైపు ఆధార్ లేదని చెబుతూ లబ్ధిదారులకు రేషన్ ఇవ్వకుండా డీలర్లు లబ్ధి పొందుతున్నారు. ఇంకా రేష న్ కార్డుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమే కాలేదు. కేవలం ఆధార్ కార్డుల ఫీడింగ్ మాత్రమే చేస్తుండగా, రే షన్ సరుకు మాత్రం ప్రస్తుతం ఉన్న కార్డులకు సరిప డా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే గత జూలై, ఆగస్టు నెలల సరుకుల్లో ప్రభుత్వం కోత విధించిందని, ఆధార్ కార్డు ఇవ్వని వారికి సరుకు ఇచ్చేది లేదని రేషన్ డీలర్లు మోసం చేయడం గమనార్హం. బాన్సువాడతోపాటు బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి, వర్నీ, పిట్లం తదితర మండలాల్లో రేషన్ డీలర్లు కోత విధిస్తూ చతురతను ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆధార్ కార్డుల కోసం నమోదు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నా, ఇప్పటి వరకు కార్డులు రాని వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారికి ఈఐడీనంబర్ మాత్రమే వచ్చింది. దీంతో వారు శాశ్వత నంబర్ కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇప్పటికే ఆధార్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ కార్డులు ఇస్తేనే తమ రేషన్ కార్డులు ఉంటాయని, లేని పక్షంలో ప్రభుత్వం బోగస్ కార్డు కింద లెక్క కట్టి, తొలగిస్తారని తెలుసుకొన్న నిరుపేద లబ్ధిదారులు ఒక్క బాన్సువాడలోనే సుమారు 4వేలకు పైగా ఉన్నారు. వీరికి ఆధార్ కార్డు ఇంకా రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. అయితే ఆధార్ కార్డునే సాకుగా చేస్తున్న రేషన్ డీలర్లు, ఇప్పటి నుంచే చేతివాటాన్ని ప్రద ర్శించి రేషన్లో కోత విధించారంటూ వారి పేరిట వచ్చిన రేషన్ను దబాయించుకోవడం శోచనీయం. ఈ విషయమై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురాగా, వారు సైతం పట్టించుకోవడంలేదని వార్డు సభ్యుడు అక్బర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి రోజు అనేక మంది లబ్ధిదారులు తమకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, తాము సైతం అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పం దించి రేషన్లో కోత విధించకుండా అందరికీ రేషన్ సరుకులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ఆధార్ సీడింగ్ చేస్తేనే రేషన్ సరుకులు
తాండూరు రూరల్: గ్రామాల్లో రేషన్ సరుకులు అందాలంటే లబ్ధిదారుల నుంచి డీలర్లు ఆధార్ కార్డులు సేకరించి సీడింగ్ చేస్తేనే సరుకులు వస్తాయని వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్హాల్లో నియోజకవర్గ స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్డు ఉన్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలన్నారు. గతంలో అనేకసార్లు ఆధార్ జిరాక్స్లు సేకరించాలని డీలర్లకు చెప్పినా పట్టించుకోలేదని, పది రోజుల్లో డీలర్లు లబ్ధిదారుల నుంచి సేకరించాలన్నారు. అవసరమైతే ఇంటింటింకి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకోవాలన్నారు. దీని ద్వారా గ్రామాల్లో బోగస్ కార్డులను కూడా గుర్తించవచ్చన్నారు. బోగస్కార్డుల ఏరివేత వేగిరం చేయాలన్నారు. చనిపోయిన, పెళ్లి చేసుకొని వెళ్లిన వారి పేర్లను త్వరగా తొలగించాలన్నారు. గత ప్రభుత్వ రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు ఇచ్చిన వారికి కూడా ఆధార్ కార్డుల జిరాక్స్ ఇస్తే త్వరలో బియ్యం ఇస్తామని ఆమె చెప్పారు. రేషన్ డీలర్లు ప్రతి నెలా 18వ తేదీలోపు డీడీలు కట్టాలన్నారు. సీడింగ్ చేయకపోతే డీలర్ను తొలగిస్తాం.. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్లు సేకరించి సీడింగ్ చేయకపోతే సదరు రేషన్ డీలర్ను తొలగిస్తామని సబ్కలెక్టర్ హెచ్చరించారు. పూర్తిస్థాయిలో కార్డులు సేకరించాలన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి, పాషాపూర్ గ్రామాల్లో డీలర్లు ఆధార్ కార్డుల సీడింగ్ తక్కువ శాతం నమోదు చేశారన్నారు. వారం రోజుల్లో ఎక్కువ మొత్తంలో సీడింగ్ చేయకపోతే డీలర్ను తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పట్లో కొత్త కార్డులు లేవు.. ఇప్పట్లో కొత్త కార్డులు వచ్చే పరిస్థితి లేదని సబ్ కలెక్టర్ వెల్లడించారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గ్రామానికి ఎన్ని రేషన్కార్డులు అవసరం ఉంన్నాయనే విషయాలను డీలర్ నుంచి నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు డుమ్మా.. ఆహార సలహా సంఘం సమావేశానికి నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు హాజరుకలేదు. ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీ, పార్టీల ప్రతినిధులు హాజరు కవాల్సి ఉన్నా ఎవరూ కూడా హాజరు కాలేదు. యాలాల ఎంపీపీ సాయిలుగౌడ్ మాత్రమే కార్యక్రమానికి వచ్చారు. దీంతో ప్రజల సమస్యలు అధికారులకు విన్నవించే నాయకుడు కానరాలేదు.కార్యక్రమంలో పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ తహసీల్దార్లు, పౌరసరఫరశాఖ అధికారులు, రేషన్ డీలర్లు, ఆహార సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
రేషన్కు వీడని ‘ఆధార్’ ముడి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రేషన్ సరుకులకు ఆధార్ ముడి కొనసాగుతూనే ఉంది. సంక్షేమ పథకాలను ఆధార్తో ముడి పెట్టొద్దన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఆధార్ అనుసంధానం లేకపోతే రేషన్ సరుకులు ఇచ్చేది లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు నిబంధన పెట్టడం విస్మయానికి గురి చేస్తోంది. మూడు నెలల క్రితం ఆధార్ నుంచి ‘వంటగ్యాస్’ కు విముక్తి లభించినా... పేదల రేషన్ సరుకులకు మాత్రం ఇంకా మోక్షం లభించడం లేదు. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 11 లక్షల యూనిట్ల వరకు రేషన్ సరుకులు అందడంలేదు. కొందరి తెల్ల రేషన్ కార్డులు ఆధార్తో అనుసంధానం కాలేదన్న సాకుతో ప్రతీనెలా డైనమిక్ కీ రిజిస్ట్రార్ ద్వారా వారి (ఆ యూనిట్లకు) సరుకులకు కత్తెరపెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర సరుకుల పంపిణీని ఆధార్తో ముడిపెట్టే ప్రయోగానికి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పౌసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టి పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు (యూనిట్లు) ఆధార్ నంబర్తో అనుసంధానం ప్రక్రియకు కొంత గడువు ఇచ్చిన అధికారులు.. ఆ తర్వాత అనుసంధానం కానీ వారి సరుకులను నిలిపివేశారు. మూడు నెలల నుంచి... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆధార్ లేని సుమారు 11 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ సరుకుల సరఫరా నిలిచిపోయింది. ఆధార్ అనుసంధానం ఆధారంగా మార్చి నెల నుంచి ఆన్లైన్ ద్వారా యూనిట్ల వారీగా అధికారులు రేషన్ కోటాను కేటాయించి, డైనమిక్ కీ సేల్స్ రిజిస్ట్రర్లను రేషన్ డీలర్లకు అందిస్తున్నారు. ఫలితంగా ఆధార్ నంబర్లు అనుసంధానం కాని కార్డు హోల్డర్లకు సరుకుల పంపిణీ జరగడంలేదు. లబ్ధిదారులు ఆధార్ కార్డు కోసం పేర్లు నమోదు చేసుకొని, ఫొటోలు దిగినప్పటికీ అధిక శాతం మందికి ఇంకా కార్డులు జారీ కాలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 74 శాతం, రంగారెడ్డి జిల్లా పరిధిలో 44 శాతం మాత్రమే ఆధార్తో అనుసంధానమైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆధార్ అనుసంధానం కాని లబ్ధిదారులు గత మూడు నెలలుగా రేషన్ అందకపోవడంతో గగ్గొలు పెడుతున్నారు. రే షన్ కార్డుకు ఆధార్ అనుసంధానం నిబంధనను తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
అక్రమార్కులపై విజిలెన్స్ కొరడా
మచిలీపట్నం క్రైం, న్యూస్లైన్ : జిల్లా కేంద్రంగా సోమవారం రాత్రి జరిగిన విజిలెన్స్ దాడుల్లో భారీ మొత్తంలో బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారాలు చేస్తున్నారంటూ విజయవాడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఏవీజీ విజయ్కుమార్కు అందిన విశ్వసనీయ సమాచారంతో ఆయన ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు మచిలీపట్నంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. వర్రేగూడెంకు చెం దిన కందుల జయబాబు అదే ప్రాంతంలోని సయ్యద్హుస్సేన్, భాజీ ఇంట్లో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరఫరా అయ్యే 24 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచాడు. విజిలెన్స్ అధికారులు సదరు గోడౌన్పై ఆకస్మిక దాడి చేసి పరిశీలించగా బియ్యం కట్టలు పట్టుబడ్డాయి. చింతచెట్టుసెంటర్లోని కందుల వెంకటగణేష్ తన ఇంట్లోని ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 76 కిలోల బరువు ఉన్న 156 అర కిలోల పంచదార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గొడుగుపేటలోని 14వ నెంబరు రేషన్ దుకాణంపై ఆకస్మిక దాడి చేసి 17 క్వింటాళ్ల బియ్యం ప్యాకెట్లతో పాటు 0.38 క్వింటాళ్ల పంచదార ప్యాకెట్లు, 0.52 క్వింటాళ్లకందిపప్పు, 0.30 క్వింటాళ్ల ఉప్పు ప్యాకెట్లతో పాటు 0.37 క్వింటాళ్ల గోధుమపిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నూరుద్దీన్పేటలో కందుల బాపూజీకి చెందిన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు 88.50 క్వింటాళ్ల బియ్యం ప్యాకెట్లతో పాటు 26 క్వింటాళ్ల ముతక బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచి అక్రమార్జన కోసం అక్రమమార్గంలో వ్యాపారాలకు పాల్పడుతున్న వారందరిపై క్రిమినల్ కేసులతో పాటు 6ఏ కేసులను బనాయిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి.రాజేష్ తెలిపారు. కాగా రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచి పట్టుబడిన వారిపై సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు ఇనగుదురుపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో ఎస్ఐ వైవివి.సత్యన్నారాయణ, పీసీలు మహేష్, సురేష్తో పాటు రెవెన్యూశాఖ తరఫున, బందరు ఆర్ఐ గంగాధర్, వీఆర్వోలు చలం, పి.సీతారామారావు, ఎండీ షకీర్ పాల్గొన్నారు. -
రేషన్ సరుకులు పక్కదారి పట్టొద్దు
వికారాబాద్, న్యూస్లైన్ : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకట్రెడ్డి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్నికలు తదితర అంశాలపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రేషన్ డీలర్లు సరుకులను బ్లాక్మార్కెట్ తరలిస్తున్నారన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కొందరు డీలర్లు బియ్యం, పంచదార, పామాయిల్ను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. స్టాక్ పాయింట్లో అక్రమాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తనిఖీలకు అధికారులు ఉపక్రమించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని, తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జేసీ హెచ్చరించారు. వికారాబాద్లో వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరు, సిలిండర్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు సిద్ధం కండి.. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలన్నారు. వికారాబాద్లో సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సబ్కలెక్టర్ ఆమ్రపాలిని జేసీ ఆదేశించారు. అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30 ఎకరాలు.. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో ఆర్టీసీ ఏర్పాటు చేయదలచిన అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30ఎకరాల ప్రభుత్వ భూమిని త్వరలోనే అందజేయనున్నట్టు జేసీ ఎంవీరెడ్డి తెలిపారు. ఈ భూమిలో కొందరు ప్రైవేట్ పట్టాదారులకు 4.35 ఎకరాలు ఉన్నందున వారికి పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్టు వివరించారు. సమీక్ష సమావేశంలో సబ్కలెక్టర్ ఆమ్రపాలి, డీఎస్వో నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రభుదాస్, భూ సర్వే అసిస్టెంట్ డెరైక్టర్ అనంతరెడ్డి, తహసీల్దార్లు గౌతంకుమార్, రాములు, డిప్యూటీ తహసీల్దార్ అమరలింగం గౌడ్, ఆర్ఐలు పాల్గొన్నారు. -
పండగకు మొండిచేయి
ఈసారి సంక్రాంతి పండగకు రేషన్ సరుకులు అందడం అనుమానమే. పామాయిల్కు తీవ్రమైన కొరత ఉంది. చక్కెర, కందిపప్పుతో పాటు ఇతర సరుకులు పూర్తిస్థాయిలో సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. సోమవారం వరకు డీలర్లు సరుకులు తీసుకోవాల్సి ఉన్నా, మూడోవంతు స్టాకు కూడా రేషన్ దుకాణాలకు చేరలేదు. పండగ నేపథ్యంలో పామాయిల్ సకాలంలో అందుబాటులో ఉంచాల్సిన సర్కారు మొండిచేయి చూపింది. సాక్షి, కరీంనగర్ : జిల్లాలో 11,11,000 పైచిలుకు తెల్లకార్డులున్నాయి. లబ్ధిదారులకు జనవరి నెలకు 1.21 లక్షల క్వింటాళ్ల బియ్యంతోపాటు అమ్మహస్తం పథకం కింద పామాయిల్, కందిపప్పు, చక్కెర, కారం, పసుపు, చింతపండు, గోధుమలు, గోధుమపిండి కోటా ఎప్పటిలాగే మంజూరైంది. కానీ ఆ మేరకు స్టాక్ విడుదల కాలేదు. డిసెంబర్ నెలలో విడుదలైన స్టాకులో మూడో వంతు కూడా జనవరి కోటా కింద సరఫరా కాలేదు. డిసెంబర్లో 1,49,642 ప్యాకెట్ల కందిపప్పు, 2,94,549 పామాయిల్ ప్యాకెట్లు, 10,24,540 చక్కెర ప్యాకెట్లు విడుదలయ్యాయి. జనవరిలో కందిపప్పు 62,209 ప్యాకెట్లు, పామాయిల్ 89,556 ప్యాకెట్లు, చక్కెర 6,92,498 ప్యాకెట్లు మాత్రమే రేషన్ దుకాణాలకు చేరాయి. వాస్తవానికి గత నెలలో కన్నా ఈ నెలలో సరుకులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికి డీడీలు కడితేనే డీలర్లకు పౌరసరఫరాల సంస్థ నుంచి సరుకులు అందుతాయి. డీలర్ల పరిధిలోని వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా పౌరసరఫరాలశాఖ డెప్యూటీ తహసీల్దార్లు డీడీలు తీయించాలి. ఇప్పటివరకు తమకు వచ్చిన డీడీలకు సంబంధించి నిల్వలు విడుదల చేశామని, సరుకులకు కొరత లేదని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెప్తున్నారు. సంక్రాంతికి ఇతర సరుకుల కన్నా పామాయిల్కే డిమాండ్ అధికంగా ఉంటుంది. అదనంగా సరఫరా చేయాల్సిన సమయంలో అసలుకే ఎసరు పెట్టారు. జిల్లాకు 11 లక్షల పైబడి పామాయిల్ ప్యాకెట్ల కోటా ఉండగా ఒక్క నెలలలో కూడా పూర్తిస్థాయిలో సరఫరా జరగలేదు. నవంబర్లో 63,4912 ప్యాకెట్లు సరఫరా అయ్యాయి. డిసెంబర్లో 2,94,549 ప్యాకెట్లు సరఫరా చేయగా, ఈ నెలలో కేవలం 89,556 ప్యాకెట్లే వచ్చాయి. జిల్లా కోటా ప్రకారం పామాయిల్ విడుదల కావడం లేదు. గతంలో ఉద్యమాల వల్ల రవాణా స్తంభించి స్టాక్ రాలేదని అధికారులు చెప్తూవచ్చారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకపోయినా కొరత తప్పలేదు. -
ఇక డీడీలకు చెల్లు..
కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతినెలా రేషన్ డీలర్లకు డీడీలు తీయడానికి *400నుంచి *500 వరకు ఖర్చవుతోంది. దీంతో రేషన్డీలర్లపై అదనపు భారం పడుతోంది. దీనిని పౌరసరఫరాల శాఖే భరించాలని కొంతకాలంగా డీలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ *5కే రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ కార్డు నంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లో డ బ్బులు జమచేస్తే ఇవి సివిల్ సప్లయి ఖాతాలోకి వెళ్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే నల్లగొండ మండలంలో అమలు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. వచ్చేనెల నుంచి ఈ పద్ధతిని అమలు పరచడానికి కార్డుల్ని ఐసీఐసీఐ బ్యాంకువారు తయారు చేశారు. తగ్గనున్న శ్రమ.... ప్రీపెయిడ్ విధానం ద్వారా డీలర్లుకు శ్రమతోపాటు సమయం కూడా మిగులుతుంది. డీడీకి అయ్యే సర్వీస్ చార్జ్ కూడా ఆదా కానుంది. ప్రతినెలా వేల రూపాయల డీడీ తీయడానికి బ్యాంకుల్లో బారులుదీరుతున్నారు. డబ్బులు పౌర సరఫరాల శాఖ ఖాతాల్లో జమచేసినా మళ్లీ డీడీకోసం బ్యాంకుల్లో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై ఇటువంటి శ్రమ ఉండదు. అంతేగాక డీడీకి అవసరమైన సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. తద్వారా డీలర్లపై ఆర్థికభారం తగ్గినట్లే. ప్రీపెయిడ్ విధానం నల్లగొండ మండలంలో విజయవంతమైతే మొదటగా జిల్లావ్యాప్తంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్ధతి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కలెక్టరేట్లో నల్లగొండ మండలంలోని 70 మంది రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ విధానంపై డీఎస్ఓ నాగేశ్వరరావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి ప్రీపెయిడ్ కార్డులు అందజేశారు. -
రేషన్కు కోత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: రేషన్కు ప్రభుత్వం కోత పెట్టింది. బోగస్ను బూచిగా చూపించి కోటాను భారీగా తగ్గించేసింది. ముందస్తు సమాచారం లేకుండా చౌకధరల దుకాణాలకు అందించే సరుకులకు కత్తెర వేసింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు ఈనెల వచ్చిన కోటాను చూసి డీలర్లు డీలా పడ్డారు. ఇప్పటి వరకు అందిస్తున్న సరుకులకు 15 శాతం ప్రభుత్వం కోత పెట్టి 85 శాతం సరుకులను మాత్రమే విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దాంతో నిర్ణీత తేదీల్లో చౌకధరల దుకాణాలకు ఎవరు ముందుగా వస్తే వారికి సరుకులు ఇవ్వనున్నారు. 85 శాతం దాటిన తరువాత వచ్చిన వారికి మొండిచెయ్యే మిగులుతుంది. వీరికి ఏం సమాధానం చెప్పాలంటూ అనేక మంది డీలర్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2102 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 53 వేల 874 కార్డులున్నాయి. ప్రతినెలా బియ్యంతోపాటు అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు వాటి ద్వారా కార్డుదారులకు అందిస్తుంటారు. రేషన్లో కోత విధించకముందు జిల్లాకు ప్రతినెలా 10304.384 క్వింటాళ్ల బియ్యం వచ్చేవి. అక్టోబర్ వరకు ఇదేవిధంగా పంపిణీ చేశారు. నవంబర్ కోటా వచ్చేసరికి 15 శాతం కోత పడింది. కిలోరూపాయి బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు కూడా తగ్గిపోయాయి. తక్కువగా వచ్చిన సరుకులను చూసుకున్న డీలర్లు అసలు విషయం తెలుసుకుని డీలా పడిపోయారు. 85 శాతం సరుకులు పంపిణీ చేసిన తరువాత మిగిలిన 15 శాతం కార్డుదారులు వస్తే వారికి ఏం సమాధానం చెప్పాలని డీలర్లు తర్జన భర్జన పడుతున్నారు. భిన్నవాదనలు చౌకధరల దుకాణాల నుంచి సరఫరా చేసే నిత్యావసర సరుకులకు ఒక్కసారిగా 15 శాతం కోత విధించడంపై అటు డీలర్లు, ఇటు పౌరసరఫరాలశాఖలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని చర్చించుకుంటున్నారు. బోగస్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో వాటికి చెక్ పెట్టేందుకు రేషన్ తగ్గించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కార్డుదారులంతా చౌకధరల దుకాణాలకు రావడం లేదని, దీంతో పక్కదారి పడుతున్న సరుకులను నియంత్రించేందుకే ఈ చర్యకు దిగిందంటున్నారు. ఇదిలా ఉండగా డీలర్ల వాదన మరో విధంగా ఉంది. బోగస్ కార్డుల పేరుతో కోటాను తగ్గించడం భావ్యం కాదంటున్నారు. ఇంటింటికీ తిరిగి రేషన్ కార్డులపై విచారణ జరిపి వాస్తవ లబ్ధిదారులా కాదా అన్న విషయాన్ని విచారించి అక్కడికక్కడే కార్డు రద్దు చేస్తే సమస్యలు ఉండవని చెబుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తాము కార్డుదారుల ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుందని తల్లడిల్లుతున్నారు. సరుకుల కోసం వచ్చినవారి మధ్య పోటీ నెలకొని ఘర్షణలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. బోగస్ ఏరివేతే ధ్యేయంగా పెట్టుకుంటే డొంక తిరుగుడుగా వెళ్లకుండా బహిరంగంగా విచారించవచ్చని డీలర్లు అంటున్నారు. రచ్చబండకు క్లియరెన్సా? ప్రభుత్వం రచ్చబండతో మరోమారు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో గతంలో ఇచ్చిన కూపన్ల స్థానంలో రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రచ్చబండలో వచ్చిన కూపన్లు రేషన్ కార్డులుగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి నిత్యావసర సరుకులు సరఫరా చేయకుంటే ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో రేషన్ కోటాను తగ్గించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. -
బియ్యానికి భరోసా
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే రేషన్ సరకులకు ఇబ్బందులు తప్పాయి. ఉధృతంగా కొనసాగుతున్న సమైక్య సమ్మె వల్ల సెప్టెంబరు కోటా సరకుల పంపిణీకి ఇబ్బందులు తప్పవని భావించినా చివరకు ఆటంకాలు తొలగాయి. తొలుత రేషన్ డీలర్ల నుంచి సమ్మె సెగ తగులుతుందనే భయంతో అధికారులు కంగారుపడ్డారు. కానీ సరకుల పంపిణీకి సహకరించడానికి ముందుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో సమ్మె మరింత ఉధృతం అయ్యేలోగా జిల్లాలో ఎక్కడికక్కడ బియ్యం పంపిణీ పూర్తి చేయించడానికి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే అమ్మహస్తం సంచులను కార్డుదారులకు అందించనున్నారు. జిల్లాకు ప్రతి నెలా తెల్ల బియ్యం కోటా కింద 1500 టన్నుల బియ్యం అవసరం. నెల రోజులకుపైగా జరుగుతున్న సమైక్య ఉద్యమం కారణంగా ఆగస్టు నెల బియ్యం కోటా ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. చాలామంది కార్డుదారులు సైతం సరకులు విడిపించుకోలేదు. ఈ నేపథ్యంలో చాలావరకు సరకు మిగిలిపోయింది. దీనికి తోడు సెప్టెంబరు కోటా బియ్యం తొలి విడతగా విడుదలైన బియ్యంతో ప్రసుత్తం పలు గోడౌన్లలో 750 టన్నుల బియ్యం నిల్వలున్నాయి. మిగిలిన సరకు చేతికి వచ్చేలోపు వీటిని కార్డుదారులకు సరఫరాచేయాలని అధికారులు నిర్ణయించారు. సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపించడంతో రెండురోజుల నుంచి అధికారులు రేషన్ డీలర్ల నుంచి డీడీలు కట్టించుకోవడం మొదలుపెట్టారు. మరో రెండు రోజుల్లో మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం వాహనాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల బియ్యం తరలించే వాహనాలను ఆందోళనకారులు అడ్డగిస్తుండడంతో సరకు గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర జాప్యమవుతోంది. ఇప్పటికే పలుజిల్లాలో ఇటువంటి పరిస్థితులు సంభవించడంతో జిల్లాలో ఆ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించే వాహనాలను అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు. అవసరమైతే వాహనాలకు కొంతవరకు భద్రత కల్పించాలని ఆలోచిస్తున్నారు. మరోపక్క జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పౌరసరఫరాశాఖ అధికారులు ఎక్కడికక్కడ మండలాలకు బియ్యం సకాలంలో చేరేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు తెల్ల బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత అమ్మ హస్తం సంచులు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెల్ల కార్డుల ప్రకారం జిల్లాకు 10.84 లక్షల సంచులు అవసరం. వీటిలో మొత్తం అన్నీ ఒకేసారి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అందులో సగమైనా జిల్లాకు రప్పించి పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు.