
వేంసూరు: తొలకరి జల్లులు కురవడంతో ఆనందంగా వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరానికి చెందిన ఉట్ల శ్రీనివాసరావు (38) తన పొలంలోని మోటార్ను పరిశీలించేందుకు గురువారం ఉదయం వెళ్లాడు.
ఈ క్రమంలో పొలానికి రక్షణగా ఉన్న ఇనుప కంచె దాటుతుండగా.. కంచెలోని తీగ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ స్తంభం సపోర్ట్ వైర్ను తాకింది. సపోర్ట్ వైర్లో విద్యుత్ సరఫరా అవుతుండటంతో శ్రీనివాసరావు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సురేష్ తదితరులు పరిశీలించారు.