
ఆస్పత్రి ఎదుట బైఠాయించిన వీఆర్ఏలు
సాక్షి, కామారెడ్డి: తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు). ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈక్రమంలో వీఆర్ఏల పోరాటంలో చురుకుగా పాల్గొన్న నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్ తనువుచాలించాడు. పేస్కేల్ అమలు చేస్తారో లేదోనని మనస్తాపానికి గురైన అశోక్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
గ్రామంలోని చెరువుకట్ట వద్ద వీఆర్ఏ అశోక్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వీఆర్ఏలు అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
(చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు)
Comments
Please login to add a commentAdd a comment