
మృతి చెందిన సింగం శివ (15)
ప్రత్తిపాడు: చికెన్ పకోడి బడ్డీ వద్ద జరిగిన స్వల్ప వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. వివరాలివి..తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలోని జెడ్పీ స్కూల్ సమీపంలో సింగం ఏసు చికెన్ పకోడి బడ్డీ పెట్టుకుని బతుకుతున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పదో తరగతి చదివే కుమారుడు శివ (15) రోజూ తండ్రి బడ్డీ వద్ద చేదోడు వాదోడుగా ఉంటుంటాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొవ్వూరి వీరబాబు మద్యం మత్తులో బడ్డీ వద్దకు వచ్చాడు. చిన్న విషయంలో ఏసుతో తగవు పడ్డాడు. కోపోద్రిక్తుడైన వీరబాబు తన కారుతో బడ్డీని ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా ఇనుపరాడ్డుతో ఏసు..అతని కుమారుడిపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన శివను కాకినాడ తరలించగా అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు వీరవరంలో పికెట్ ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడి ఎస్ఐ ఎస్.అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేయాల్సి ఉంది.