గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. | Ganesh Chaturthi: Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..

Sep 10 2021 10:09 AM | Updated on Sep 10 2021 10:34 AM

Ganesh Chaturthi: Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung - Sakshi

ఆవుపేడకు ఒక పవిత్రత ఉంది. దాంతోపాటు ఎరువు స్వభావం కూడా ఉంది. అందుకే కాంత ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం మొదలెట్టింది.  

వినాయకుడు వరములు ఇచ్చువాడు. ఇవాళ ప్రపంచానికి ఒక వరం కావాలి. అది  గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల గతి తప్పుతున్న రుతువులను, ఉష్ణోగ్రతలను అదుపులోకి తేవడం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు. కాని ఒక విషయంలో మాత్రం పదే పదే విఘ్నాలు కలిగించాలి. ఏ విషయంలో? పర్యావరణానికి హాని చేసే ఏ పని ఎవరు మొదలెట్టినా అది జరగకుండా విఘ్నాలు కలిగిస్తూ ఉండాలి.

అప్పుడు గిరులు పచ్చగా ఉంటాయి. ఝరులు కళకళలాడుతాయి. వినాయకుడు గణపతి. ఆయన ఏ గణాలకు అధిపతి అయినా అసలు అధిపతిగా ఉండాల్సింది మాత్రం ప్రకృతి గణాలకే. అవి శక్తిమంతమయ్యి మనుషులకు శక్తి ఇవ్వాలి. అది కూడా ఈ వినాయక చవితి పండగ సందర్భంగా మనం కోరుకోవాలి. 

Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung: భోపాల్‌లోని కాంతా యాదవ్‌ వినాయకుడి శక్తి ప్రకృతికి అందాలంటే ఏం చేయాలో ఆలోచించింది. ఇంతకాలం ఆమె కుటుంబం దేవతల విగ్రహాలు చేస్తూ బతికింది. అవి దాదాపు పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే పదర్థాలతోనే అయి ఉండేవి. కాని ఈసారి  కొత్త పని మొదలెడదాం అనుకుందామె. కొత్త పని అంటే ప్రకృతికి మేలు చేసేదే. వినాయకుడి పూజకు మట్టి విగ్రహం తయారు చేయడం ఒక మంచి ఆలోచన.

కాని కాంతా యాదవ్‌ కొంచెం ముందుకు వెళ్లి వినాయకుడు తిరిగి మొక్కకు శక్తిగా మారే విధంగా విగ్రహం తయారు చేయాలనుకుంది. అందుకు గోమయం (ఆవుపేడ)ను ఎంచుకుంది. ఆవుపేడకు ఒక పవిత్రత ఉంది. దాంతోపాటు ఎరువు స్వభావం కూడా ఉంది. అందుకే కాంత ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం మొదలెట్టింది.  

‘ఆవు పేడను ఎండ పెడతాను. తర్వాత దానికి రంపంపొట్టు, మైదా పిండి కలిపి మెత్తటి పదార్థంగా చేసి అచ్చులో పోసి విగ్రహం తయారు చేస్తాను. ఇది తయారు చేయడం పది నిమిషాల పనే అయినా ఆరడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత రంగులు వేస్తాను. విగ్రహం పూజలు అందుకున్నాక నీటి బకెట్టులో సులభంగా నిమజ్జనం అవుతుంది. ఆ తర్వాత ఆ నీటిని మొక్కలకు పోస్తే ఎరువు అవుతుంది.

ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది బొమ్మలు కొంటున్నారు. అంతే కాదు ఢిల్లీ, పూనా నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి’ అంది కాంత. కాంత ఈ పనిని అందరికీ నేర్పుతుంది. బహుశా వచ్చే సంవత్సరం నాటికి చాలాచోట్ల గోమయ వినాయకుడు దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు.  

చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement