కమ్యూనిస్టు విప్లవయోధుడు | Sakshi Guest Column On Tarimela Nagireddy | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టు విప్లవయోధుడు

Published Sun, Feb 11 2024 1:47 AM | Last Updated on Sun, Feb 11 2024 1:47 AM

Sakshi Guest Column On Tarimela Nagireddy

కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి (టీఎన్‌) జన్మించి ఈ ఫిబ్రవరి 11 నాటికి 107 సంవత్సరాలు. భారత విప్లవ రాజకీయరంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు.  తరిమెల నాగిరెడ్డి 1917లో అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్‌ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, సమ సమాజ స్థాపనకు తన సర్వస్వాన్నీ అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు.

టీఎన్‌ ఎమర్జన్సీ కాలంలో వెంకట్రామయ్య అనే మారు పేరుతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరి 1976 జూలై 28న అమరులైనారు. తన విద్యార్థి దశలోనే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చదువుతూ కమ్యూ నిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. చదువు అయిన వెంటనే కార్మిక, కర్షకుల కొరకు ఉద్యమించారు. 1940లో ‘యుద్ధం– దాని ఆర్థిక ప్రభావం’ అనే పుస్తకాన్ని ప్రచురించి ఏడాది కఠిన కారా గారశిక్షను అనుభవించారు.

కా‘‘ టీఎన్‌ చక్కని వక్త. అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు శ్రద్ధతో వినేవారు.  కామ్రేడ్‌ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ  పంథాను దేశమంతటా వ్యాపింప చేయటంలో చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారు.

ఈ క్రమంలో ఆయన పైనా, మరో 60 మందిపైనా పెట్టిన కుట్రకేసు విచా రణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షర సత్యాలే. 

1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ నీలం సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అసెంబ్లీలో సంచల నాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు.

పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలనూ, భూస్వాముల ప్రయోజనాలనూ పరిరక్షించే విధా నాలను అనుసరిస్తున్నాయనీ అన్నారు. దేశాభివృద్ధి కంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగు తున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటులు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే విధానాలను అవలంబి స్తున్నాయనీ అన్నారు. 

ఆయన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించిన మితవాద, అతివాద, అవకాశవాదా లకూ, తప్పుడు ధోరణులకూ వ్యతిరేకంగా  డీవీతో కలిసి రాజీలేని పోరాటం నిర్వహించి సరైన విప్లవ పంథాను పరిరక్షించారు. ఈ క్రమంలోనే 1975లో కా‘‘ డీవీతో కలిసి యూసీసీఆర్‌ (ఎమ్‌ఎల్‌)ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కా‘‘ టీఎన్‌ తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమా ణాలను పాటించారు. 

– సి. భాస్కర్, యూసీసీఆర్‌ (ఎమ్‌ఎల్‌) 
(నేడు కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి జయంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement