
చెయ్యి దాటుతున్న ఖర్చు
గుంటూరు నగరానికి చెందిన సాయి భరద్వాజ్ ఒక ప్రైవేట్ కంపెనీలో మెడికల్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. జీతం నెలకు రూ.60వేలు. ఈ మొత్తంతో ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవిస్తున్నాడు. అయితే, ఇటీవల ఒక దుకాణంలో వస్తువులు కొని బిల్లు పే చేసేందుకు స్కానర్ క్లిక్ చేసి డబ్బులు కొడితే.. సరైన బ్యాలెన్స్ లేదని చూపించింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అర్థం కాలేదు. ఆ తర్వాత చెక్ చేసుకుంటే డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.
చిల్లర కొరత తీరింది
మాది చిన్న బడ్డికొట్టు. రూ.10 నుంచి రూ. వెయ్యి వరకు వరకు వివిధ రకాల వస్తువులు విక్రయిస్తాం. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ ఎంతో మంది వస్తుంటారు. ఈ క్రమంలో చిల్లర కొరత బాగా ఎదురయ్యేది. డిజిటల్ పేమెంట్స్తో సమస్య తీరింది.
– పి. శివయ్య, వ్యాపారి, గుంటూరు
తెలియకుండానే ఖర్చు
గతంలో నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.
–రామరాజు కోటేశ్వరరావు
(స్టాక్ బ్రోకర్, పీఎల్ క్యాపిటల్)
●
పట్నంబజారు: జిల్లాలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం లాంటివి ఉపయోగించాలంటే జనం భయపడేవారు. ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లో చెల్లింపులు చేస్తున్నారు. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియనంతగా వీటి వినియోగం మారిపోయింది. అయితే, పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్లో పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులు ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట.
లెక్కలేకుండా ఖర్చు
ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. గతంలో మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు బిల్లు వేస్తే ఏదీ ఎంత అయిందని చూసుకుని చేతి ద్వారా డబ్బులు చెల్లించే వాళ్లం. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో.. ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు.
కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్
డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల కిందట డెబిట్, క్రెడిట్ కార్డులు, గిఫ్ట్ కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. ఫోన్పే, గూగుల్పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి.
డిజిటల్ చెల్లింపులు.. జేబుకు చిల్లులు ! పెరిగిన అనవసర ఖర్చులు ధర తెలుసుకోవడం దాదాపుగా మానేశారు రూ.5 మొదలు వేల రూపాయల లావాదేవీలు ఆన్లైన్లోనే తల్లకిందులవుతున్న ఫ్యామిలీ బడ్జెట్ కోవిడ్ తర్వాత అన్నీ డిజిటల్ చెల్లింపులే.. చిల్లర కొరత నేపథ్యంలోనూ మారిన తీరు

చెయ్యి దాటుతున్న ఖర్చు

చెయ్యి దాటుతున్న ఖర్చు