
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
గుంటూరు ఎడ్యుకేషన్: నల్లచెరువులోని అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో సర్దుబాటుపై పని చేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్, డి.రవిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల హాజరు నమోదులో అవకతవకలు, మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచి చూపడం, సరైన రికార్డులను నిర్వహించకపోవడం వంటి అంశాలపై ఎంఈఓ, డీవైఈఓలతో విచారణ జరిపించిన డీఈఓ రేణుక వారి నివేదిక ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. పాఠశాలను డీఈఓ రేణుక తనిఖీ చేసిన సమయంలో 46 మంది విద్యార్థులను ఆన్లైన్ హాజరులో నమోదు చేయడం, తీరా పాఠశాలలో భౌతికంగా హాజరైన విద్యార్థులు తొమ్మిది మందే ఉండటంపై విచారణకు ఆదేశించారు. దీనిపై రెండు రోజుల క్రితం డీవైఈవో, ఎంఈవో పాఠశాలకు స్వయంగా వెళ్లి, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చారు.
గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు తాత్కాలిక సీనియార్టీ జాబితా
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు అర్హులైన వారితో తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండోసారి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలను
htt pr//doegunturblogspot.com,
htt pr//doenellore.50webs.com,
www.prakasamschooledu.com
సైట్లలో సందర్శించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 22లోపు సమర్పించాలని సూచించారు.
సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి
నరసరావుపేటటౌన్: స్థానిక ప్రత్యేక ఉపకారాగారాన్ని శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి. ప్రవళిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిమాండ్ ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాలను వివరించారు. బెయిల్ లభించి జామీనదారులను పెట్టుకునే స్తోమత లేని వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ రవికుమార్ యాదవ్, ప్యానల్ న్యాయవాది, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు జాతి
ఎడ్ల బలప్రదర్శన
వినుకొండ: మదమంచిపాటి వీరాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా మక్కెన చినరామయ్య ఆడిటోరియంలో జాతీయ ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు కొనసాగుతున్నాయి. నాలుగ పళ్ల సైజు విభాగంలో 10 జతలు పాల్గొన్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మక్కెన వెంకట్రావు, అనుమాల సుబ్బారెడ్డి, మదాల చిరంజీవి, కుంటా కోటిరెడ్డి, జగ్గరెడ్డి, అక్కిరెడ్డి, రొడ్డా నాగిరెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, జక్కిరెడ్డి, నాగిరెడ్డి, గురువారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలలు
యూడైస్లో రిజిస్టర్ కావాలి
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1వ తరగతి ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం తెలిపారు. ప్రభుత్వం ఆర్టీఈ 12 (1)సీ ఉత్తర్వులు ఇచ్చినందున జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు cre.ap.gov.in పోర్టల్లో యుడైస్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. దానిలో పాఠశాల గుర్తింపు కాపీని అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈనెల 19వతేది నుంచి 25వతేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్