హైదరాబాద్:ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తాళలేక తాను చనిపోతున్నానని తల్లికి వాట్సాప్ కాల్ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.సతీష్కుమార్(42) ఫిలింనగర్ రోడ్ నెం.9లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 17న తన తల్లి అనసూయకు వాట్సాప్ కాల్ చేసిన అతను ఇంట్లో వేధింపులు ఎక్కువయ్యాయని ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి తోడయ్యాయని తాను చనిపోతున్నానని చెప్పాడు. తన కుమారుడు లిఖిత్తో పాటు అన్న కొడుకు వీరేంద్ర చౌదరి బాధ్యతలు తీసుకోవాలని తల్లికి కోరాడు. దీంతో ఆందోళనకు గురైన అనసూయ ఈ నెల 20న నగరానికి వచ్చి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.