
దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్ని రోజులుగా అంబులెన్స్లపై అధ్యయనం చేశారు. ఫలితంగా సిటీలో సంచరిస్తున్న అన్ని అంబులెన్స్ల్లోనూ అత్యవసర వైద్యం అందించాల్సిన పేషెంట్లు ఉండట్లేదని తేలింది. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యం చేయి విరిగిన వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే అంబులెన్స్లపై సమగ్ర విధానం రూపకల్పనకు నిర్ణయించారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్కు అందించేలా చేయనున్నారు. వాటి పూర్వాపరాలు పరిశీలించే ఇక్కడి అధికారులు అది ప్రయాణించే రూట్లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ తదితరాలు అందిస్తారని, ఈ విధానంతో అటు అత్యవసర రోగులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్ల కారణంగా సాధారణ వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్న వాటికి మాత్రమే ‘గ్రీన్ లైట్’ విధానం అమలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా, ఖాళీగా సంచరిస్తున్న సందర్భాల్లో సైరన్ వినియోగిస్తే ఆయా అంబులెన్స్ యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. అంబులెన్స్ల వ్యవహారంపై ట్రాఫిక్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మంగళవారం కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇదే రోజు పెంపుడు కుక్కకు సంతాన నిరోధక ఆపరేషన్ కోసం.. రోగులను తీసుకువెళ్లాల్సిన అంబులెన్స్లో సైరన్ మోగించుకుంటూ వెళ్లిన డ్రైవర్ను పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అంబులెన్స్ను సీజ్ చేయడం గమనార్హం.
ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మరీ ఇబ్బంది..
సిటీలోని ఆసుపత్రులను నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. వీరిలో కొందరిని అంబులెన్స్ల్లో తరలిస్తుంటారు. ఈ కారణంగానే నగరంలోని ఏ చౌరస్తాను తీసుకున్నా సరాసరిన ప్రతి గంటకు కనిష్టంగా ఐదు అంబులెన్స్ను క్రాస్ చేస్తుంటాయి. ఆస్పత్రులు ఎక్కువగా ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చే అంబులెన్స్ అయినా ఇక్కడికే చేరుకుంటుండటమే దీనికి కారణం. ప్రస్తుతం అన్ని అంబులెన్స్ల్నీ ఒకే తరహాలో పరిగణిస్తున్న ట్రాఫిక్ పోలీసులు సైరన్ వినిపిస్తే చాలు అప్రమత్తమవుతున్నారు. సదరు జంక్షన్లో మిగిలిన దిశల నుంచి వచ్చే ట్రాఫిక్ను ఆపి.. అంబులెన్స్ ఉన్న దిశలో వాటినే ముందుకు పంపిస్తున్నారు. ఇలా ఒకసారి ఆపిన చౌరస్తా మళ్లీ గాడిన పడటానికి కొన్ని నిమిషాల సమయం పడుతోంది. ఫలితంగా ఇతర వాహనచోదకులకు సమయం, ఇంధనం వృథా అవుతోంది.
ఆ ప్రతిపాదనలకు ఆచరణ సాధ్యం కాక...
సాధారణంగా అంబులెన్స్ అనగానే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తరలిస్తోందనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలో వీటికి నగర రోడ్లపై ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గతంలో భావించారు. రహదారులపై కుడి వైపుగా అంబులెన్స్ల కోసం ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయాలని భావించారు. ఆపై వీటికి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) ట్యాగ్స్ జారీ చేయడంతో పాటు సిగ్నల్స్కు రీడర్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఫలితంగా ఓ చౌరస్తా వద్దకు అంబులెన్స్ వచ్చిన వెంటనే ఆర్ఎఫ్ ట్యాగ్ ద్వారా సిగ్నల్ గుర్తించి ఆ మార్గంలో గ్రీన్ లైట్ ఉంచేలా చేయాలని భావించారు. అయితే.. నగర రోడ్లపై ఈ రెండూ ఆచరణ సాధ్యం కాదని తేలడంతో ప్రస్తుతం ప్రతి అంబులెన్స్ను క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది మాన్యువల్గా క్లియరెన్స్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అంబులెన్స్ల సంచారం పెరగడంతో అనేక జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మంగళవారం తార్నాకలో అంబులెన్స్ను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
అన్నీ తీవ్రమైన కేసులే ఉండట్లేదు..
సిటీలో సోమవారం నుంచి ప్రారంభమైన తనిఖీలు
ఫలితంగా అనేక అంశాలు వెలుగులోకి..
అనవసరంగా సైరన్ మోగించిన వారిపై కేసులు

దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు

దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు