
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో హిందూ దేవాలయంపై దాడి ఘటనలో ప్రధాన నిందితులు సహా 50 మందిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఆలయాన్ని కాపాడటంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందంటూ పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు.
యార్ఖాన్ జిల్లా భొంగ్ నగరంలోని ఓ స్కూలు ఆవరణలో మూత్ర విసర్జన చేశాడంటూ అరెస్టు చేసిన 8 హిందూ బాలుడిని పోలీసులు విడుదల చేసినందుకు నిరసనగా కొందరు స్థానిక దేవాలయాన్ని బుధవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం పోలీసుల తీరుపై మండిపడింది. ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించే పనులు మొదలయ్యాయని పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ తెలిపారు. ఆలయాలపై దాడులు జరక్కుండా చూస్తామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.