
టెక్ దిగ్గజం ఆపిల్కు భారీ షాక్ తగిలింది. వినియోగదారులను నమ్మించేందుకు తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది. తమ వివిధ ఐఫోన్లు వాటర్ రెసిస్టెంట్ అంటూ తప్పుదోవ పట్టించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ , ఆపిల్ ఇటాలియాపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ : ఆఫర్లు)
ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ప్రకటన ప్రకారం ఆపిల్ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.ఈ లక్షణం కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉందని స్పష్టం చేయకుండా వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది. కంపెనీ డిస్క్లైమర్లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వినియోగదారులను తప్పుడు ప్రకటనతో మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ వాదించింది. అంతేకాదు నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా ఆరోపించింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో , ఐఫోన్ 11 ప్రో మాక్స్ మోడళ్లకు సంబంధించిన ప్రచారాన్ని ఇది ఊదహరించింది. ఈ మోడళ్ల నీటి నిరోధక లక్షణాల గురించి తప్పుదారి పట్టించినందుకు ఆపిల్కు 10 మిలియన్ యూరోలు జరిమానా విధించినట్లు తెలిపింది.