
ఆరు దశాబ్దాలపాటు ఆఫ్రికన్ సాహిత్యసీమను ఏలిన గూగీ వా థియాంగో
నైరోబీ: ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్రవేసిన కెన్యా దిగ్గజ నవలా రచయిత, ఆరు దశాబ్దాలపాటు ఎన్నో రచనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ గూగీ వా థియాంగో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 87 సంవత్సరాలు. వలసరాజ్యం నుంచి తన కెన్యా దేశం ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే క్రమంలో జరిగిన పరిణామాలను ఆయన తన రచనల్లో అక్షరబద్ధంచేశారు.
జైలు జీవితం, ప్రవాస జీవితం, తీవ్ర అనారోగ్యం ఇవేవీ ఆయన రచనను అడ్డుకోలేపోయాయి. ఎన్నోసార్లు సాహిత్య నోబెల్ ఆయనను వరించబోయి కొద్దిలో తప్పిపోయిందనేది ప్రపంచవ్యాప్తంగా సాహితీవేత్తల అభిప్రాయం. ఎంతో సరళంగా, మనసుకు హత్తుకునేలా నవలలు, నాటకాలు, చిన్న కథలు, వ్యాసాలు రాశారు. సాహిత్యం మొదలు సామాజిక విమర్శ, చిన్నారుల రచనల దాకా అన్ని రకాల సాహిత్య ప్రయోగాల్లో ఆయనకు అద్భుతమైన ప్రవేశం ఉంది.
స్వదేశం కెన్యాలో ఏ గ్రంథాలయంలో చూసినా ఆయన రచనల పుస్తకాల కోసం ప్రత్యేకంగా అరలు ఉంటాయి. ‘‘ కెన్యా రాజధాని నైరోబీలో 30 సంవత్సరాలకుపైగా బుక్స్టోర్ నిర్వహిస్తున్నా. గూగీ రచనలు అలా ఆపకుండా చదవాలనిపిస్తుంది’’ అని నూరియా బుక్స్టోర్ ప్రొప్రైటర్ బెన్నెట్ ఎంబాటా చెప్పారు. ‘‘కెన్యా అక్షరమాలలో సమున్నత శిఖరం గూగీ. కెన్యాలో సామాజిక న్యాయం, అధికార దుర్వినియోగంపై గూగీ ధైర్యంగా పదునైన రచనాస్త్రాలు సంధించారు.
ఆఫ్రికా సాహిత్య దీపస్తంభం ఆరిపోయింది’’ అని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం గూగీకి ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ వలసరాజ్యంగా ఉన్నప్పుడు కెన్యాలోని కమిరిథులో 1938 జనవరి ఐదున జేమ్స్ గూగీ జన్మించారు. తొలుత అందరూ ఆఫ్రికన్లలాగే ఇంగ్లిష్పై మక్కువతో ఆంగ్లంలో తొలి నవల ‘వీప్ నాట్, చైల్డ్’ రాశారు. ఇది 1964 మేలో ప్రచురితమైంది. తూర్పు ఆఫ్రికా రచయిత రాసిన పుస్తకం ప్రచురితంకావడం అదే తొలిసారి. తర్వాత ఆయన స్థానిక ‘గికుయూ’ భాషలో మాత్రమే రాయడం మొదలెట్టారు.
ప్రభుత్వ విధానాలను ఎండగట్టినందుకు కొంతకాలం జైలుజీవితం అనుభవించారు. అప్పుడు కూడా ఆయన రచనను వదిలిపెట్టలేదు. తొలి ఆధునిక గికుయూ నవల ‘ డెవిల్ ఆన్ ది క్రాస్’ను జైళ్లో ఖైదీలకు ఇచ్చే టాయిలెట్ పేపర్లతో రాశారు. జైలు నుంచి విడుదలయ్యాక సైతం కుటుంబాన్ని నియంత ప్రభుత్వం హింసించడంతో వేధింపులు తట్టుకోలేక ప్రవాసజీవితం గడిపారు. జర్మనీలో బేరూత్ వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. బ్రిటన్లో కొన్నాళ్లు ఉండి చివరకు కాలిఫోర్నియా వర్సిటీలో బోధిస్తూ అక్కడే స్థిరపడ్డారు.
22 ఏళ్ల తర్వాత 2004లో సొంత దేశానికి వస్తే కెన్యన్లు అపూర్వస్వాగతం పలికారు. కానీ మాజీ అధికారపార్టీ పెద్దలకు ఇది ఇష్టంలేదని కొందరి అభిప్రాయం. ఈ మాటలను నిజంచేస్తూ గూగీ ఉంటున్న అపార్ట్మెంట్లోకి నలుగురు చొరబడి ఆయనను దారుణంగా కొట్టారు. భార్యను రేప్ చేశారు. తర్వాత ఆయన దాదాపు కెన్యాకు రాలేదు. ఈయనకు 1995లోనే ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినా ఎలాగోలా కోలుకున్నారు. 2019లో మూడుసార్లు గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. తర్వాత మూత్రపిండ వైఫల్యం బాధించడం మొదలెట్టింది. అనారోగ్యంతో అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ సిటీలో కన్నుమూశారు.