
కాబూల్: అఫ్గానిస్థాన్లో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ మరణించడంలో తమ ప్రమేయం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఎవరి కాల్పుల కారణంగా డానిష్ మరణించాడన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని, అతను ఎలా చనిపోయాడో తమకు తెలియదని తాలిబన్ల ప్రతినిధి జబుల్లా ముజాహిద్ తెలిపారు. వార్జోన్లోకి వచ్చే ప్రతి జర్నలిస్టు తమకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే వారి గురించి తగిన రక్షణలు తీసుకుంటామని సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జర్నలిస్టులు తమకు చెప్పకుండా రణ క్షేత్రంలోకి వస్తున్నారని, ఇది బాధాకరమని అభిప్రాయపడ్డారు. డానిష్ మృతదేహాన్ని ఐసీఆర్సీ(ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్క్రాస్)కు అప్పగించారు. తాలిబన్లకు, అఫ్ఘన్ దళాలకు మధ్య జరుగుతున్న కాల్పులను కవర్ చేయడానికి వెళ్లిన డానిష్, అవే కాల్పుల మధ్య చిక్కుకొని మృతి చెందాడు.