కమలంలో జోష్‌.. హస్తంలో నైరాశ్యం! | - | Sakshi
Sakshi News home page

కమలంలో జోష్‌.. హస్తంలో నైరాశ్యం!

Published Thu, Mar 6 2025 1:47 AM | Last Updated on Thu, Mar 6 2025 1:43 AM

కమలంలో జోష్‌.. హస్తంలో నైరాశ్యం!

కమలంలో జోష్‌.. హస్తంలో నైరాశ్యం!

● పకడ్బందీ ప్లాన్‌తో బీజేపీ సక్సెస్‌ ● సమన్వయం, సహకారం లేక కాంగ్రెస్‌ డీలా ● పోల్‌మేనేజ్‌మెంట్‌లో బీఎస్పీ విఫలం ● ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీల అంతర్మథనం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన కమలం పార్టీ కేడర్‌లో జోష్‌ నెలకొంది. అధికారంలో ఉండీ.. గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్రెస్‌ పార్టీలో నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్పీ భావిస్తోంది. మొత్తానికి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీఎస్పీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. బరిలో లేకున్నా.. అధికార కాంగ్రెస్‌ ఓటమిపై కారు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలు, వైఫల్యాలే వారిని ఓడించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫలితాలు కమలంలో జోష్‌ను నింపాయి.

● బీజేపీ ఈ విషయంలో ఆదినుంచీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది. నియోజకవర్గం, మండలం, డివిజన్‌, గ్రామాల వారీగా పచ్చాస్‌ ప్రభారీలను నియమించి ప్రతీ 25 మందికి ఒక ఇన్‌చార్జిని కేటాయించింది. వారు ప్రతీ ఓటరును రోజూ కలవడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్స్‌ కోసం తాము చేసిన పోరాటాన్ని వివరిస్తూ ఓటర్లకు చేరువయ్యారు. దీనికితోడు కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం అభ్యర్థులకు బాగా కలిసి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

● కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ పూర్తిస్థాయిలో నరేందర్‌రెడ్డికి సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ విషయంలో తమకు సహకరించినట్లుగా మిగిలిన మూడు జిల్లాల నాయకులు సహకరించలేదని నరేందర్‌రెడ్డి వర్గం అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ నుంచి నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే.. కాంగ్రెస్‌లోని ముగ్గురు కీలక నేతలకు పోటీగా ఎదుగుతాడన్న ఆందోళనతో వారెవరూ సహకరించలేదని మండిపడుతున్నారు. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మద్దతిచ్చారని, బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా లోపాయికారిగా సహకరించిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌ సభలో సీఎం కూడా ఈ సీటు ఓడిపోతే తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించడం తమకు చేటు చేసిందంటున్నారు. అంతేకాకుండా చెల్లకుండా పోయిన సుమారు 28 వేల ఓట్లలో దాదాపు 15 వేలకుపైగా ఓట్లు నరేందర్‌రెడ్డివే కావడం తమ కొంపముంచాయని విశ్లేషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement