అనుమానాల ఎన్‌కౌంటర్‌కు ఇరవై ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

అనుమానాల ఎన్‌కౌంటర్‌కు ఇరవై ఏళ్లు

Published Fri, Mar 7 2025 9:42 AM | Last Updated on Fri, Mar 7 2025 9:38 AM

అనుమా

అనుమానాల ఎన్‌కౌంటర్‌కు ఇరవై ఏళ్లు

సిరిసిల్ల: నక్సలైట్ల విప్లవ గీతాలు.. పోలీస్‌ బూట్ల చప్పుళ్లతో ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పల్లెలు నిద్రలేచేవి. నాలుగు దశాబ్దాలపాటు సాగిన సాయుధ పోరాటంలో ఒడిదొడుకులు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలను కలుపుకొని మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌ కమిటీగా ఉండే ది. 2005 నాటికి బలమైన నక్సలైట్ల కారిడార్‌ ఈ జి ల్లాల పరిధిలో ఉంది. అప్పట్లో ‘అడవిలో అన్నలు’ సమాంతర పాలన సాగించేవారు. అయితే రెండు ద శాబ్దాల క్రితం జరిగిన మానాల ఎన్‌కౌంటర్‌ పశ్చిమ డివిజన్‌లో నక్సలైట్‌ ఉద్యమాన్ని తూడ్చిపెట్టేసింది. 2005 మార్చి 7వ తేదీన రుద్రంగి మండలం మా నాల శివారులోని జోత్యానాయక్‌తండా సమీప గు ట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఆ ఎన్‌కౌంటర్‌కు 20 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

గుట్టబోరు రక్తపుటేరు

మానాల ఊరు.. పరిసర గిరిజనతండాలు అప్పట్లో నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం పరిధిలో ఉండేది. 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి నక్సలైట్లకు జరిగిన చారిత్రాత్మక చర్చల అనంతరం మానాలలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. అప్పటి కరీంనగర్‌ జిల్లా పశ్చిమ డివిజన్‌ కమిటీ మావోయిస్టు కార్యదర్శి గంగుల వెంకటస్వామి అలియాస్‌ రమేశ్‌(మొగిలిపేట)తోపాటు పది మంది నక్సల్స్‌ హతమయ్యారు. మహిళా దళనేత కామిండ్ల శోభ(వట్టిమల్ల)తోపాటు మరో దళనాయకుడు కొమ్ము బాబు అలియాస్‌ బాబన్న(వట్టిమల్ల), మరో దళనేత రఘు(మూడపల్లి), దళసభ్యులు గట్టు కిషన్‌రెడ్డి ఉరఫ్‌ శంకర్‌(పదిర), గోవర్ధన్‌(వట్టిమల్ల), లావుడ్య రవి ఉరఫ్‌ శ్రీను, సునీత ఉరఫ్‌ పద్మ, జ్యోతి ఉరఫ్‌ స్నేహ, రమేశ్‌ ఉరఫ్‌ సుధీర్‌ మరణించారు. పది మంది మావోయిస్టుల శవాలతో జోత్యానాయక్‌ తండా గుట్టబోరు రక్తపుటేరుగా మారింది.

తప్పించుకున్న కేంద్ర కమిటీ సభ్యుడు

మానాల ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు అప్పటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్నతో కరీంనగర్‌ పశ్చిమ డివిజన్‌ కమిటీకి అపాయింట్‌మెంట్‌ ఉంది. అడవిలో దళంతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఎన్‌కౌంటర్‌ ప్రదేశానికి కొద్ది దూరంలోని ఓ పల్లెలో జంపన్న ఆశ్రయం పొందాడు. తెల్లవారితే రమేశ్‌ దళంతో జంపన్న కలవాల్సి ఉండగానే భారీ ఎన్‌కౌంటర్‌ జరగడంతో అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు.

చిక్కిన వారే కోవర్టుగా మారి

మానాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సాయుధ నక్సలైట్లు భూక్య పద్మ (అడవిపదిర), సుదర్శన్‌రెడ్డి(ఇల్లంతకుంట) సజీవంగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిద్దరూ పోలీసులకు కోవర్టుగా మారి ఎన్‌కౌంటర్‌కు కారణమయ్యారని అప్పట్లో హక్కుల సంఘాలు ఆరోపించాయి. పద్మ జైలు నుంచి విడుదలై సొంతూరు అడవి పదిరలో ఉండగా.. 2006లో మావోయిస్టులు అపహరించుకెళ్లారు. మానాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌ తీరును పద్మతో చెప్పించి, ఆడియో రికార్డు చేశారు. ఎన్‌కౌంటర్‌కు ముందు మానాల అడవుల్లో ఉన్న దళం రాత్రి తిన్న అన్నంలో మత్తుమందు కలిపినట్లు పద్మ చెప్పినట్లుగా ఆడియో రికార్డు బయటకు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పద్మ కోవర్టుకు మారినట్లు ఆరోపిస్తూ కోనరావుపేట మండలం మరిమడ్ల వద్ద పద్మను హతమార్చారు.

అన్నలకు ఉత్తరాలు.. వెలుగుచూసిన నిజాలు

ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో అందరి దృష్టి అక్కడ పడి ఉన్న ఉత్తరాలపై పడింది. భార్యను ఓ భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని ఎలాగైనా అమ్మాయిని అత్తగారింటికి పంపించాలని, ఇద్దరు పిల్లలు ఉన్నారని వేడుకుంటూ.. ఓ తండ్రి అన్నలకు రాసిన లేఖ ఒకటి. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని ఓ మహిళ రాసిన ఉత్తరం. భూమి వివాదంలో పంచాయితీ పెద్దలు చెప్పినట్లుగా ఎదుటివాడు వినడం లేదని ఓ ఆసామి రాసిన లేఖ.. ఇలా ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో అనేక ఉత్తరాలు.. అన్నలను ప్రజలు వేడుకున్నట్లు కనిపించాయి.

పోస్టుమార్టం వీడియో రికార్డింగ్‌

ఈ ఎన్‌కౌంటర్‌పై అమరవీరుల బంధుమిత్రుల కమిటీ హైకోర్టును ఆశ్రయించడంతో మృతదేహాలకు ఇద్దరు డాక్టర్లతో పోస్టుమార్టం చేయించాలని, వీడియో తీయించాలని ఆదేశించింది. ఈమేరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు. శవాలను ఖననం చేయొద్దని, దహనమే చేయాలని పోలీసుల ఆంక్షల మధ్య అత్యక్రియలు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత అమరులపై వచ్చిన పాటలు నక్సలిజం ప్రాబల్య పల్లెల్లో మార్మోగాయి. నక్సలైట్‌ ఉద్యమానికి ఆనవాళ్లుగా ఇప్పటికీ మానాలలో నిర్మించిన మహిళా అమరవీరుల స్మారక స్తూపం సాక్ష్యంగా నిలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం మానాల ఎన్‌కౌంటర్‌తో ముగిసింది.

పది మంది నక్సల్స్‌ హతం

ప్రభుత్వంతో చర్చల అనంతరం భారీ ఎన్‌కౌంటర్‌

త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న

అనంతరకాలంలో తుడిచిపెట్టుకుపోయిన ఉద్యమం

ఉదయించే సూర్యులు

ఉద్యమాల చంద్రులు

మానాల మా అమరులు

అందుకోండి జోహరులు..

మానాల అడవుల్లో మల్లెలు పూశాయి

మంచి మంచి మల్లెలమ్మా.. అవి ఎర్రని మల్లెలమ్మా

ఏడేడు దారుల్లో.. ఎర్రని దారుల్లో..

ఎదిరించి పోరాడిరమ్మ.. నేలమ్మ ఒడిలోనే రాలిరమ్మా..

No comments yet. Be the first to comment!
Add a comment
అనుమానాల ఎన్‌కౌంటర్‌కు ఇరవై ఏళ్లు 1
1/1

అనుమానాల ఎన్‌కౌంటర్‌కు ఇరవై ఏళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement