● కల్లందొడ్డి విషయంలో ఘర్షణ
కోడుమూరు రూరల్: ఆస్తి విషయంలో వివాదం చెలరేగి సొంత తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఈ ఘటన కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అన్నదమ్ములైన బోయ భాస్కర్, బోయ వెంకట్రాముడు(30) గతంలోనే ఆస్తులను పంపకాలు చేసుకుని అనుభవిస్తున్నారు. అయితే కల్లందొడ్డి పంపకం విషయంలో బుధవారం రాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అన్న భాస్కర్ తమ్ముడు వెంకట్రాముడును ఎద్దుల బండికుండే ఇనుప మేడితోక తీసుకుని తలపై బలంగా కొట్టట్టాడు. తీవ్ర గాయాలతో వెంకట్రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. కోడుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకట్రాముడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య శోభతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బోయ భాస్కర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలనరసింహులు తెలిపారు.