![No He](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/knl_mr.jpg.webp?itok=b_SCyZBh)
కర్నూలు(సెంట్రల్): జూన్ 4వ తేదీన చేపట్టబోయే ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను రౌండ్ల వారీగా ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తరువాతే ప్రకటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో కౌంటింగ్ విధులకు ఎంపిక చేసిన 1,174 మంది సిబ్బందికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇందులో ఉదయం 600 మంది, సాయంత్రం 574 మంది శిక్షణకు హాజరయ్యారు. ఒక్కో సెషన్లో 60 టేబుళ్ల్లను ఏర్పాటు చేసి, టేబుల్కు 10 మంది చొప్పున కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈవీఎంల ఓట్లను ఎలా లెక్కించాలి..పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎలా లెక్కించాలనే అంశాలపై సుధీర్ఘంగా మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
● ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం కోసం 14, పార్లమెంట్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ ఉండి ఓట్లను లెక్కించాల్సి ఉంటుందన్నారు.
● పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ చేశారా? లేదా, సంతకం, డిక్లరేషన్, సీరియల్ నంబర్, ఓటరు సంతకం, సీరియల్ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్గా గుర్తించాలన్నారు. వ్యాలిడ్ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంటుందన్నారు.
● ఈనెల 27వ తేదీన జరిగే మొదటి ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఎవరనేది తెలుస్తుందన్నారు.
● జూన్ 2వ తేదీన జరిగే రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఏ అసెంబ్లీకి కేటాయించారో తెలుస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 5.30 గంటలకు జరిగే మూడో ర్యాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్కు కేటాయించారనే విషయం తెలుస్తుందన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 7 గంటలకే సిబ్బంది కౌంటింగ్ హాళ్లకు చేరుకోవాలన్నారు.
● ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల్లో అడ్రస్ ట్యాగ్, పింక్ పేపర్ సీల్, గ్రీన్ పేపర్ సీల్, కౌంటింగ్ ఏ విధంగా చేపట్టాలనే దానిపై పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, ఆదోని ఆర్వో/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కర్నూలు ఆర్వో/మునిసిపల్ కమిషనర్ భార్గవ్తేజ, టేబులేషన్పై పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మీ, పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్పై డీఆర్డీఏ పీడీ సలీంబాషా, మైక్రో అబ్జర్వర్ల విధులపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోమశేఖరరెడ్డి శిక్షణ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు.
● కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూదన్రావు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం ఆర్వోలు ఎం.శేషిరెడ్డి, చిరంజీవి, రామునాయక్, మురళీ పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన
రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌంటింగ్ హాళ్ల లోపల, బయట నిర్దేశించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయనున్న క్యాబిన్ల నుంచి ఏజెంట్లు సంతకాలు చేయడానికి అనువుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాళ్లకు ఏజెంట్ల సమక్షంలో తీసుకోచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాళ్లకు, తిరిగి కౌంటింగ్ హాళ్ల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లే సిబ్బందికి టీషర్టుల కొనుగోలు చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ ఈవీఎంలను తీసుకొచ్చే సిబ్బందికి తెలుపు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను తీసుకొచ్చే సిబ్బందికి పింక్ రంగు టీ షర్టులను కేటాయించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు బ్యాడ్జీలు ధరించేలా చూడాలని ఆమె సూచించారు.
రౌండ్ల వారీగా
ఫలితాలు ప్రకటించాలి
పోస్టల్ బ్యాలెట్లో వ్యాలిడ్,
ఇన్ వ్యాలిడ్ ఓట్లను పక్కాగా గుర్తించాలి
కౌంటింగ్ సిబ్బంది శిక్షణలో
జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన
![No Headline](/sites/default/files/gallery_images/2024/05/25/24knl111-600693_mr.jpg)
No Headline