
తాన్హాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే చిత్రం ఆదిపురుష్. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. రామాయణం కథాంశంతో 3డీలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి నటించబోతుందని అనేక వార్తలు వెలువడ్డాయి. రాముడిగా కనిపించనున్న ప్రభాస్కు జోడీగా సీత పాత్రలో స్వీటీ నటించనుందని, ఈ విషయంపై ఇప్పటికే అనుష్కను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై అనుష్క స్పందించారు. తాను ఆదిపురుష్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పేశారు. (ఆది పురుష్కి రెహమాన్?)
ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైం వీడియోలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న స్వీటీ ఆదిపురుష్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా ఆదిపురుష్లో సీతగా మొదట కీర్తి సురేష్ నటించనున్నారని ఆ తర్వాత కియారా అద్వానీ, అనుష్క శర్మ ఇలా పలువురి పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆదిపురుష్లో పవర్ఫుల్ విలన్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. తెలగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2021లో సెట్స్ మీదకు వెళ్లనుంది. (బిగ్బాస్: అనుష్క అందుకే రాలేదట!)