ఐపీఎల్‌ మ్యాచ్‌ స్ట్రీమింగ్‌ వివాదం... చిక్కుల్లో తమన్నా! | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: ఐపీఎల్‌ మ్యాచ్‌  స్ట్రీమింగ్‌ వివాదం.. తమన్నాకు నోటీసులు

Published Fri, Apr 26 2024 1:18 PM

Illegal IPL Streaming Case: Tamannaah Bhatia Summoned By Maharashtra Cyber Police - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్‌ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్‌ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్‌ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్‌’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే  ఈ యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్‌ దత్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్‌ దదత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్‌ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఫెయిర్‌ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ యాప్‌ మహదేవ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ అండ్‌ బెట్టింగ్‌ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముసుగులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది.  ఈ యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్ట్రీమింగ్‌ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్‌ దత్‌,  జాక్వెలిన్‌ ఫెర్నాండెస్‌ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.

Advertisement
Advertisement