టీవీల్లో 'గేమ్ ఛేంజర్‌' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత | Tollywood Producer SKN Tweet On Ram Charan Game Changer Movie On TV | Sakshi
Sakshi News home page

Game Changer Movie: టీవీల్లో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. టాలీవుడ్ నిర్మాత ఆగ్రహం

Jan 15 2025 1:14 PM | Updated on Jan 15 2025 2:52 PM

Tollywood Producer SKN Tweet On Ram Charan Game Changer Movie On TV

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

వెంటాడుతున్న పైరసీ..

అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్‌లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్‌లో గేమ్ ఛేంజర్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్( శ్రీనివాస కుమార్‌) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్‌కేఎన్‌ తన ట్విట్‌లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం ‍మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్‌ది సినిమా' అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశారు.

లీక్ చేస్తామంటూ బెదిరింపులు..

తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్‌ సినిమాని లీక్‌ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారని మూవీ టీమ్‌ ఫిర్యాదులో పేర్కొంది.

దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement