మంగపేట: హేమాచల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలోని లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు. అనంతరం విధుల్లో భాగంగా జాతరలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని సందర్శించి ఇప్పటివరకు ఎంత మంది భక్తులకు వైద్య సేవలు అందించారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగపేట మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆదేశించారు.
వృద్ధులకు దుస్తుల పంపిణీ
జిల్లా వైద్యాధికారి అప్పయ్య పెళ్లిరోజు సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూరిబాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులను పలకరించి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పయ్యను వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కొమరగిరి సాంమ్రాజ్యం, కేశరావు దంపతులు శాలువాతో సత్కరించారు.
హేమాచల క్షేత్రంలో
డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య