
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
యాప్ ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్పై కోహిమా పోలీస్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు.

ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment