
సింధు నది ఒడ్డున ఇసుకలో వెండి నాణేలు దర్శనమివ్వడంతో వాటికోసం జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Silver Coins In Sindh River: ఒక్కపక్క భారీ వరదలతో మధ్యప్రదేశ్లో అతలాకుతలమైంది. భారీ వర్షాలు ప్రజల జీవితాల్లో బీభత్సం సృష్టించాయి. కానీ కొందరి జీవితాల్లో మాత్రం నాణేల పంట పండింది. ముఖ్యంగా వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన గుణ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక్కడి సింధు నది ఒడ్డున ఇసుకలో వెండి నాణేలు దర్శనమివ్వడంతో వాటికోసం జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆదివారం నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న కొంతమందికి వెండి నాణెం దొరికింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన వారికి కొన్ని నాణేలు దొరికాయి. దీంతో వార్త గ్రామం అంతటా వ్యాపించింది. ఈ నాణేలు బ్రిటిష్ రాణి విక్టోరియా కాలం నాటివిగా తెలుస్తోంది. మరికొన్ని1862 కాలం నాటివి కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో దాచిపెట్టుకున్నవి, వరదలు కారణంగా కొట్టుకుని వచ్చాయా? నదిలోకి నాణేలు ఎలా వచ్చాయి అనేదానిపై స్పష్టత లేదు.
గుణ, అశోక్ నగర్ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాల కారణంగా సింధ్ నది ఉధృతంగా మారింది. అయితే ఆదివారం పంచవాలి గ్రామంలోని సింధ్ నది వరద ఉధృతి తగ్గిన తర్వాత వెండి నాణేలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ వార్తలు గ్రామం మొత్తం పాకడంతో మరింత సందడి నెలకొంది. యువకులు సహా పలువురు తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి నాణేలు సేకరించిన వారిని విచారించారు. అయితే నాణేల సేకరణపై ఎలాంటి ఆధారాలు సంబంధిత అధికారి అమర్నాథ్ తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు.