
ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది.
లింగంపల్లి- వికారాబాద్- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్- బీదర్ సెక్షన్, మన్మాడ్- ముద్ఖేడ్ ధోనే- గుంతకల్ సెక్షన్కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్-బర్బణీ సెక్షన్కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది.
‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్’ అనేది రైలు డ్రైవర్కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.
రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..
Comments
Please login to add a commentAdd a comment