![Azadi Ka Amrit Mahotsav: Operation Blue Star - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/5/888.jpg.webp?itok=Jc1LvPOH)
సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 38 ఏళ్లు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సుమారు 4 దశాబ్దాలుగా స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984లో సైనిక చర్యకు ఆదేశించారు.
అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది చనిపోగా, అనంతరం ప్రతీకారంగా జరిగిన ఇందిర హత్య, పర్యవసానంగా జరిగిన మూకుమ్మడి హత్యాకాండలలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ఆనాడు ఇందిరా గాంధీ మరణించారు. మరోవైపు స్వర్ణదేశాలయంపై మిలటరీ దళాలు చేసిన ఆపరేషన్ లో బ్రిటిష్ సైన్యం పాత్ర కూడా ఉందని బ్రిటిష్ సిక్కు కమ్యూనిటీ నమ్ముతోంది.
ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటిష్ సైన్యం పాత్రపై యూకే విదేశీ కార్యాలయంలో ఉన్న పత్రాలు మాయమయ్యాయని కూడా అక్కడి బ్రిటిష్ సిక్కు మతస్తులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఇండియాకు నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ పాలకవర్గం సహకరించిందని, బ్రిటిష్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ సోల్జర్స్.. ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్నారని బ్రిటన్లోని సిక్కులు బలంగా విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment