Freedom Fighters History
-
చిన్నవాణ్ణని వదిలేశారు
జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి. మా ఇంట్లో ఉండేవారు ‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు. సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు. ఎడ్ల బాధ చూడలేక నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది. గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది. లాఠీ దెబ్బలే దెబ్బలు మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే. మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు. నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్ను, ఫస్ట్ లుక్ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్రామ్సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించనున్నారు. ఈ సిరీస్లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్లు రానున్నాయి. -
మహోజ్వల భారతి: భారత విప్లవోద్యమ మాత
భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు మేడమ్ కామా నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే ఉండిపోయారు. పరాయి పాలనలోని దైన్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్ కామా జన్మించారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. ఆమె జాతీయ వాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు. 1885లో ఆమె రుస్తోంజీ కేఆర్ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి. భారత దేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితంగా ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు. అలా ఆమె 1902లో ఇంగ్లండ్ చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్ కేంద్రంగా ఉంది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణ వర్మ, వినాయక్ దామోదర్ సావర్కర్ అక్కడే పనిచేసేవారు. వారితో ఆమెకు పరిచయం కలిగింది. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే ఉండిపోయారు. ఇంగ్లిష్ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్ రేవాభాయ్ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్ కామా కలసి పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. వందేమాతరం’, ‘తల్వార్’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఐక్య పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్ కామాకే దక్కుతుంది. ఆ పతాకాన్ని ఆమె 1907 ఆగస్టు 22 న జర్మనీలోని స్టట్గార్ట్లో ఎగురవేశారు. అనంతర కాలంలో.. నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తింది. 1935లో ఆమెకు పక్షవాతం వచ్చింది. ఒకసారి గుండెపోటు వచ్చిది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత’. నేడు కామా వర్ధంతి. 74 ఏళ్ల వయసులో 1936 ఆగస్టు 13న ఆమె కన్ను మూశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: మీ డబ్బొద్దు.. మీరు కావాలి) -
చైతన్య భారతి: ఈశాన్య భారత పోరాట వీరుడు టోగన్ సంగ్మా
‘బ్రిటిషర్లు మా భూమిని పరిపాలించేందుకు మేము అనుమతించం! మమ్మల్ని వారి బానిసలుగా మార్చే కుట్రలను సహించం!’’ అంటూ తన ప్రజలనుద్దేశించి ఒక ఆదివాసీ వీరుడు ఆవేశంతో ప్రసంగిస్తున్నాడు. ఆయన మాటలకు తెగ మొత్తం మంత్రముగ్దులవుతోంది. తెల్లవాళ్లను తమ గడ్డ నుంచి తరిమికొట్టేందుకు ఎంతకైనా సిద్ధమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. నాగరికత పేరిట మారణాయుధాలతో దాడికి వచ్చిన బ్రిటిష్ ముష్కరులను కేవలం తమ విల్లంబులతో ఒక ఆదివాసీ తెగ ఎదిరించడానికి ఆ నాయకుడు కలిగించిన ప్రేరణే కారణం! ఈశాన్య భారతంలో వలసపాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించిన అతడు..పా టోగన్ సంగ్మా! ఈశాన్య భారతావనిలో నేటి మేఘాలయ ప్రాంతంలో గారోహిల్స్ ప్రాంతం కీలకమైనది. ఈ కొండలను నెలవుగా చేసుకొని పలు ఆదివాసీ తెగలు జీవనం కొనసాగిస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనది అచిక్ తెగ. ఈ గిరి పుత్రులు సాహసానికి పెట్టింది పేరు. వీరి నాయకుడు పా టోగన్ సంగ్మా అలియాస్ పా టోగన్ నెంగ్మింజా సంగ్మా. తూర్పు గారోహిల్స్ లోని విలియం నగర్ సమీపంలోని సమందా గ్రామంలో ఆయన జన్మించారు. బైబిల్ల్లో పేర్కొనే గోలియత్తో ఆయన్ను ఆచిక్ తెగ ప్రజలు పోలుస్తుంటారు. 1872వ సంవత్సరంలో ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో బ్రిటిషర్లు గారోహిల్స్పై కన్నేశారు. కొండల్లోని మట్చా రోంగెర్క్ గ్రామం వద్ద బ్రిటిష్ సేనలు విడిది చేశాయి. దేశభక్తుడైన సంగ్మాకు విదేశీయుల ఆక్రమణ నచ్చలేదు. దీంతో ఆయన బ్రిటిషర్లపై పోరాటానికి యువ సైన్యాన్ని కూడగట్టారు. మాతృభూమి రక్షణ కోసం యువత త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. బలిదానం బ్రిటిష్ సేనలు విడిది చేసిన శిబిరంపై దాడి చేసి తరిమి కొట్టాలని సంగ్మా నిర్ణయించుకున్నారు. అయితే వారి వద్ద ఉండే ఆధునిక ఆయుధాల గురించి అమాయక ఆదివాసీలకు తెలియదు. కేవలం సాహసంతో, స్వాతంత్ర కాంక్షతో ఆచిక్ వీరులు సంగ్మా నేతృత్వంతో బ్రిటిషర్లపై దాడి చేశారు. సంగ్మా, ఆయన సహచరులు బ్రిటిష్ శిబిరానికి నిప్పంటించారు. ఇలాంటి దాడిని ఊహించని బ్రిటిష్ వారు నిత్తరపోయారు. అయితే ఆయుధాలు, ఆధునిక పోరాట పద్ధతులతో మెరుగైన బ్రిటిష్ సైన్యం ముందు ఆచిక్ వీరులు నిలవలేకపోయారు. దాడిలో సాహసంగా పోరాడిన సంగ్మా చివరకు అసువులు బాశారు. అరటి బోదెలతో ఏర్పాటు చేసిన డాళ్లను వాడితే బుల్లెట్ల నుంచి తప్పించుకోవచ్చని సంగ్మా భావించారు. అయితే బుల్లెట్ల దెబ్బకు అరటి షీల్డులు ఛిన్నాభిన్నమవడంతో అచికు వీరులకు మరణం తప్పలేదు. సంగ్మా, తదితర వీరులు మరణించినా ఈశాన్య భారత ప్రజల్లో దేశభక్తిని రగల్చడంలో సఫలమయ్యారు. తర్వాత కాలంలో ఈశాన్య భారత ప్రజలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయడంలో సంగ్మా వీర మరణం ఎంతగానో దోహదం చేసింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు డిసెంబర్ 12 న సంగ్మా వర్ధంతిని ఘనంగా జరుపుకుంటారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్ బూర్కి వైట్
1947లో జరిగిన భారత విభజన మానవాళి చరిత్రలో ఒక మహా విషాదం. కోటీ యాభయ్ లక్షల నుంచి రెండు కోట్ల మంది పాకిస్థాన్ నుంచి భారత్ కూ, భారత్ నుంచి పాకిస్థాన్కూ తరలిపోయారు. ఇరవైరెండు లక్షల మంది ఆచూకీ దొరకలేదు. ఈ రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్ అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ యజమాని హెన్రీ లూస్ ‘లైఫ్’ పేరుతో ఒక పత్రికను వెలువరించాలని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే మార్గరెట్ను ఆ పత్రికకు ఎంపిక చేశారు. ఆమె లైఫ్లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రషా) మీద నాజీ సేనలు దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. ఇక మనదేశానికైతే కేవలం మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీశారు. ఇంకా చాలా పోజులలో ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశంలో తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్ర పురుషుల పోర్టెయ్రిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్ తన కెమెరాతోను, లీ ఐటింగన్ డైరీ కలంతోను ఆ దారుణ దృశ్యాలకు శాశ్వతత్వం కల్పించారు. మార్గరెట్ విభజన విషాద చిత్రాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఆమె మాత్రం పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతావనిని చూడటం ఒక వైచిత్రే. -
చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య
మామిడిపూడి వెంకటరంగయ్య ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. వెంకటరంగయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు. సరిగ్గా అప్పుడే వెంకటరంగయ్య జీవితం మలుపు తిరిగింది. బెంగాల్ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్ చంద్ర పాల్ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ మద్రాస్లో దిగారు. వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. పాల్ మేరీనా బీచ్లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. తర్వాత వెంకటరంగయ్య పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాతి మలుపు కాకినాడకు తిప్పింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు. 1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వైస్చాన్స్లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వెంకట రంగయ్యను చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్గా నియమించారు. ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్ కూడా అయ్యారు. మధ్యలో... అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు. ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా వెంకటరంగయ్య ప్రతిభను వెల్లడిస్తాయి. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన రచించారు. ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్ స్టేట్ అండ్ సోషలిస్ట్ స్టేట్, సమ్ థియరీస్ ఆఫ్ ఫెడరలిజమ్ వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి. జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. -
చైతన్య భారతి: అణకువ కలిగినవాడు.. ఇనాయతుల్లా అల్ మష్రికి
భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్ తెహ్రీక్. ఖక్సర్ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద గట్టి నిర్బంధం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్ కూడా ఖక్సర్ను పరమ శత్రువులాగే చూసింది. లాహోర్ కేంద్రంగా ఉద్యమించిన ఈ ఖక్సర్ తెహ్రీక్ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్ మష్రికి స్థాపించారు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్ పోలీసుల యూనిఫామ్ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారవాసం అనుభవించాడు. 1942 జనవరి 19 న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆయనపై ఆంక్షలు విధించారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ... కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్ పండితులు, మేధావిగా గుర్తింపు పొందారు. అమృత్సర్కు చెందిన ముస్లిం రాజ్పుత్ కుటుంబంలో జన్మించిన మష్రికి కేంబ్రిడ్జ్ నుంచి గణితశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్ అయ్యారు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్ సెక్రటరీ అయ్యారు. మష్రికి 1939లో బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. దాంతో ఖక్సర్ ప్రమాదకరంగా తయారైందని పంజాబ్ గవర్నర్ హెన్రీ డఫీల్డ్ వైస్రాయ్ లిన్ లిత్గోకు నివేదిక పంపించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఓసారి ఢిల్లీలో ప్రసంగిస్తూ మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించారు. ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉపకరించింది. మష్రికితో మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆయన జీవితాంతం తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. 75 ఏళ్ల వయసులో క్యాన్సర్తో మర ణించారు. -
చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!
దాదాపు 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’ ఇరోమ్ చాను షర్మిల. దీక్షలో ఉన్న అన్నేళ్లలోనూ ఆమె నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులోనే ఆ పదహారేళ్లూ ఆమె ఉన్నారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం.. ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన అది: మణిపూర్ ప్రభుత్వమే ఆమెను బతికిస్తూ వచ్చింది. అయితే నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్ట్యూబేషన్ పద్ధతిలో.. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు నిర్బంధంగా పంపించడం! ‘అఫ్స్పా’ సాయుధ బలగాలు తన కంటి ఎదురుగా జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఆ నిరాహార దీక్ష ఆరంభించారు. అది 2000 నవంబర్ 2. షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే.. అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రదర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. అప్పటికి వివాహం కాలేదు. దీక్ష వల్ల ప్రయోజనం లేదనీ, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో పోరాడాలనీ తలచి 2016 ఆగస్టు 9 న దీక్షను విరమించారు. ఆ తర్వాత ఎన్నికల్లో నిలుచున్నప్పటికీ ఆమె గెలవలేదు. అఫ్స్పా చట్టం నేటికీ పూర్తిగా రద్దవలేదు. షర్మిల 1972 మార్చి 2 ఇంఫాల్లోని కోంగ్పాల్ గ్రామంలో జన్మించారు. పౌరహక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ తన ఉద్యమ భాగస్వామి అయిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ ఆంథోనీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం సామాజిక అంశాలపై వ్యాస రచనలు చేస్తున్నారు. -
జైహింద్ స్పెషల్: ది గ్రేట్ ఎస్కేప్
జర్మనీ నుంచి బోస్ జపాన్ బయల్దేరాడు. జర్మనీ సబ్మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు. జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే.. ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్ బోస్ తప్పించు కున్నాడు! ‘‘బ్రిటన్ తరఫున జర్మనీపై ఇండియా యుద్ధం చేస్తుందని ప్రకటించడానికి మీరెవరు?’’ అని వైశ్రాయ్ని నిలదీసినందుకు జైలుపాలై.. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లోనే హంగర్ స్ట్రైక్ చేసి విడుదలైనవాడు.. దేశం నుంచే తప్పించుకున్నాడు! బోస్ దేశం దాటకుండా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించి, చుట్టూ నిఘా పెట్టినప్పటికీ అతడు తప్పించుకున్నాడు.! ‘జర్మనీతో ‘టై–అప్’ అయితే బ్రిటన్ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్ సైన్యాన్ని దింపాలి..’ అనే ప్లాన్తో తప్పించుకున్నాడు! ఎలా తప్పించుకున్నాడు?! పోలికలు తెలియకుండా పఠాన్లా వేషం వేసుకున్నాడు. గుండ్రటి ముఖం కనిపించకుండా గడ్డం పెంచాడు. భాష విని గుర్తుపట్టకుండా మూగ, చెవిటి అయ్యాడు. ముందు పెషావర్ వెళ్లాడు. అక్కడి నుంచి కాబూల్. అక్కడి నుంచి రష్యా. అక్కడ బుక్కయ్యాడు! రష్యాకు, బ్రిటన్కు పడదు కాబట్టి తనను చేరదీస్తారు అనుకున్నాడు కానీ, రష్యన్ అధికారులు అనుమానిస్తారని అనుకోలేదు. వాళ్లతడిని మాస్కో తరలించారు. అక్కడ కొద్దిగా నయం. రెండు మూడు ఆరాలు తీసి బోస్ని మాస్కోలోని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్ దగ్గరికి పంపారు. షూలెన్బర్గ్కి బోస్ మీద నమ్మకం కుదిరింది. అతడిని ఇటలీ మీదుగా జర్మనీ పంపే ఏర్పాటు చేశారు! బ్రిటన్కు మండిపోయింది. తప్పించుకున్న వాడు తప్పించుకున్నట్లు ఉండకుండా దేశాలన్నీ తిరగడం ఏమిటి? కనిపిస్తే కాల్చిపారెయ్యమని సీక్రెట్ ఏజెంట్లని పంపింది. జర్మనీలో అడుగు పెట్టకముందే అతడిని చంపేయాలి. అదీ టార్గెట్. కానీ బోసే మొదట తన టార్గెట్ని రీచ్ అయ్యాడు. జర్మనీలో అతడు క్షణం ఖాళీగా లేడు. హిట్లర్ని కలిశాడు. బ్రిటన్ గురించి, ఇండియా గురించి చెప్పాడు. బెర్లిన్లో ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేశాడు. దాన్నుంచి స్వతంత్ర భారత్ నినాదాలు ప్రసారం చేశాడు. జర్మనీకి బందీలుగా ఉన్న ఐదువేల మంది భారతీయ సైనికులతో కలిసి ‘ఇండియన్ లీజన్’ ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తర ఆఫ్రికాలోని బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, యుద్ధంలో జర్మనీకి చిక్కిన సైనికులు వీళ్లు! హిట్లర్ హ్యాండిచ్చాడు! ‘లీజన్’ అంటే సైనిక సమూహం. ఇండియన్ లీజన్, జర్మనీ సైన్యం కలిసి ఇండియా వెళ్లి కాళ్లతో నేలను రెండు చరుపులు చరిస్తే చాలు... బ్రిటన్ ఎగిరిపడాలని బోస్ వ్యూహం. 1941 నుంచి 1943 వరకు ఇదే వ్యూహం మీద జర్మనీలోనే ఉండిపోయారు బోస్. అక్కడే ఎమిలీ షెంకెల్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడే వారికి అనిత పుట్టింది. అక్కడే జర్మనీపై అతడి భ్రమలు తొలగిపోయాయి! హిట్లర్ హ్యాండిచ్చాడు! బోస్ అక్కడి నుంచి జపాన్ బయల్దేరాడు. మొదట జర్మనీ సబ్మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు.జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే... ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్. ‘‘మీ రక్తాన్ని ధారపొయ్యండి. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అన్నాడు బోస్. అంతేనా! ఢిల్లీ చలో అన్నాడు. జైహింద్ అన్నాడు. సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత పోస్టల్ స్టాంప్స్, సొంత న్యాయం, సొంత నియమం. అన్నీ సొంతం! బ్రిటన్ని వ్యతిరేకించే దేశాలన్నీ వీటన్నిటినీ ఆమోదించాయి. ఆఖరికి రష్యా, అమెరికా కూడా! అంటే పారలల్ మిలట్రీ. పారలల్ గవర్నమెంట్. బోస్ సమాంతర ప్రభుత్వాన్ని, సమాంతర సైన్యాన్ని నడుపుతున్నాడు. సింగపూర్లో ఏర్పాటు చేసుకున్న అజాద్ హింద్ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ మొదటిసారిగా బోస్ గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా... నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’ అని కోరారు. మరణం రాసిపెట్టలేదు! తర్వాత ఏమయింది? మూడేళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బోస్ ఏమయ్యారు? ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ తెలీదు! సింగపూర్ నుంచి టోక్యో వెళ్లడానికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఎక్కిన జపాన్ యుద్ధ విమానం 1945 ఆగస్టు 18న నేలకూలి అందులో ఉన్న వారితో పాటు ఆయనా మరణించారని ఒక ‘అధికారిక’ కథనం! కాదు, ఆ ప్రమాదంలో ఆయన తప్పించుకున్నారని, అక్కడి నుంచి ఇండియా వచ్చి అజ్ఞాతంగా సాధువురూపంలో గడిపారని; కాదు కాదు ఏ శత్రుదేశమో నేతాజీని బందీగా ఉంచుకుందనీ, అలాంటిదేం లేదు... రష్యాలో ఆయన తలదాచుకున్నారనీ... ఇలా ఏవేవో అనధికారిక కథనాలు. ఒకటి మాత్రం వాస్తవం. నేతాజీ... అమరుడు! ఆయనకు జననమే కానీ, మరణం లేదు. కావాలంటే ఏ హిస్టరీ బుక్ అయినా తెరిచి చూడండి. జననం ఒక్కటే కనిపిస్తుంది. చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948 -
మహోజ్వల భారతి: వాటర్మ్యాన్
డాక్టర్ రాజేంద్రసింగ్ రాజస్థాన్, అల్వార్ జిల్లాకు చెందిన జల పరిరక్షకులు, సంఘసేవకులు. ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందారు. స్టాక్హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. ప్రభుత్వేతర సంస్థ ‘తరుణ్ భారత్ సంఘ్’ ఆయన స్థాపించినదే. నేడు రాజేంద్ర సింగ్ జన్మదినం. 1959 ఆగస్టు 6న ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో మంచినీటి నిర్వహణకు విశేషకృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నారు. రాజేంద్రసింగ్ కృషి వల్ల రాజస్థాన్లో అర్వారి, రూపారెల్, సర్సా, భగా ఆని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి! 2009లో భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టానికి (1986) అనుగుణంగా గంగా నది కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ, సమన్వయ అధికారం గల సంస్థ ‘నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ సభ్యులలో రాజేంద్ర సింగ్ ఒకరు. ‘గ్రహాన్ని రక్షిస్తున్న 50 మంది వ్యక్తులు’ జాబితాలో ప్రఖ్యాత ‘గార్డియన్’ పత్రిక రాజేంద్రసింగ్కి స్థానం కల్పించింది. చదవండి: జైహింద్ స్పెషల్: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం -
మహోజ్వల భారతి: ఈస్టిండియా ఉరికి వేలాడిన తొలి భారతీయుడు!
ప్లాసీ యుద్ధంలో (1757) బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడిపోయాక, తదనంతర పరిణామాల్లో బెంగాల్లోని ముర్షీదాబాద్ నవాబు దగ్గర పనిచేసే నందకుమార్ను బ్రిటిషర్లు తమ పాలనా యంత్రాంగం సిబ్బంది విభాగంలోకి తీసుకున్నారు. తర్వాత ఈస్టిండియా కంపెనీ తరఫున బెంగాల్లోని వివిధ ప్రాంతాలలో పన్నులు వసూలు చేసేందుకు 1764లో ఆయన్ని దివాన్గా నియమించారు. నందకుమార్కు అప్పటికే ‘మహారాజా’ అనే బిరుదు ఉంది. 17వ మొఘల్ చక్రవర్తి షా ఆలమ్ ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు. చివరికి ఆ మహారాజు దివాన్ అయ్యారు. అంటే ముఖ్య కోశాధికారి. అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వారెన్ హేస్టింగ్స్ని తొలగించి, నందకుమార్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పుడు మౌనంగా వెళ్లిపోయిన హేస్టింగ్ తిరిగి 1773లో బెంగాల్ గవర్నర్గా వచ్చారు! మునుపటి కోపం నందకుమార్పై అతడికి అలాగే ఉంది. అది చాలదన్నట్లు నందకుమార్ అతడిపై అవినీతి ఆరోపణలు చేసి మరింత కోపానికి గురయ్యాడు. అప్పట్లోనే అది పది లక్షల రూపాయల అవినీతి. ఆ ఆరోపణల నుంచి హేస్టింగ్స్ తేలిగ్గానే తప్పించుకున్నాడు కానీ, నందకుమార్ని అతడు తేలిగ్గా తీసుకోలేదు. 1775లో నందకుమార్పై దస్తావేజుల ఫోర్జరీ కేసు పెట్టించి విచారణ జరిపించాడు. ఆ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే నందకుమార్కు ఉరిశిక్ష విధించాడు. పది లక్షల అవినీతికి సాక్ష్యాలున్నా హేస్టింగ్ దోషి కాలేదు కానీ, ఫోర్జరీ అని హేస్టింగ్ చేసిన చిన్న ఆరోపణతో నందకుమార్కు ఉరిశిక్ష పడింది. 1775 ఆగస్టు 5న ఆయన్ని ఉరి తీశారు. ఈస్టిండియా కంపెనీ ఉరిశిక్ష వేయించి చంపిన మొదటి భారతీయుడు నందకుమారే! ఉరి రోజున నందకుమార్ను జైలు నుంచి ఉరికొయ్యల దగ్గరకు తీసుకొస్తుంటే ఆయన చిరునవ్వుతో ఉన్నారని ఉరి శిక్ష అమలును పర్యవేక్షించిన కలకత్తా షరీఫ్ అలెగ్జాండర్ మక్రబీ రాశారు. చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 ముందడుగు -
చైతన్య భారతి: వైద్య ఉద్యమకారిణి కాదంబిని గంగూలీ
కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం అవుతుంది. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు! 1803లో ఒక్క కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని గైనకాలజిస్ట్ అయ్యారు. కానీ ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం. కాదంబిని గంగూలీ అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్ కు చెందిన చంద్రముఖి బసు. కాదంబిని వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. కాదంబిని బిహార్లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. ఇండియాలో విద్యాభ్యాసం అయ్యాక 1892లో కాదంబిని లండన్ వెళ్లారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి, ఆ వృత్తి నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. నేపాల్ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది. కాదంబిని ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు. భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబినియే. ఆమె బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన ట్రాన్స్వాల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు. -
బ్రిటన్ మెచ్చిన బలాఢ్యుడు: కోడి రామమూర్తి
‘కండగలవాడే మనిషోయ్’ అన్న గురజాడవారి భావనకి నిలువెత్తు రూపం కోడి రామమూర్తి నాయుడు. ఈ బలాఢ్యుడిని చూసి బకింగ్హ్యామ్ ప్యాలెస్ కూడా సంబరపడింది. రామమూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్లో ఆయన విన్యాసాలు మరింత కఠినమైనవి. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆహ్వానం మేరకు రామమూర్తి పుణె వెళ్లి సర్కస్ ప్రదర్శన నిర్వహించారు. రామమూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. వైస్రాయ్ లార్డ్ మింటో కారణంగా రామమూర్తి ఖ్యాతి దేశవ్యాప్తమైందని చెబుతారు. అంటే 1919–1920 ప్రాంతమన్నమాట. కారును ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతూ రామమూర్తినాయుడు చేసే ప్రదర్శనను మింటో చూశాడు. వైస్రాయ్ స్వయంగా కితాబిస్తే ఇంకేముంది? కొన్ని వందల మంది సభ్యులు ఉన్న తన సర్కస్ బృందం రామమూర్తి యూరప్ ఖండానికి వెళ్లారు. ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి బకింగ్హ్యామ్ ప్యాలెస్ ప్రాంగణంలోనే ఈ భారతీయుడి చేత ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ప్యాలెస్లో విందు చేసి, సత్కరించి ‘ఇండియన్ హెర్క్యులిస్’ అన్న బిరుదు ఇచ్చారు. తరువాత ఆసియాలో జపాన్, చైనా, బర్మా దేశాలలో కూడా ఆయన సర్కస్ ప్రదర్శించారు. బర్మాలో ఆయన మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే భారతదేశానికి వచ్చేశారు. బహుశా ఈర‡్ష్య వల్ల ఆయనను చంపాలని అక్కడి వాళ్లు అనుకుని ఉండవచ్చు. సర్కస్ ద్వారా ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు గడించారాయన. అందులో చాలా వరకు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా భారత స్వాతంత్యోద్య్రమానికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఒంటి నిండా శక్తి. దేశ విదేశాలలో కీర్తి. అయినా రామమూర్తినాయుడు అనే ఆ మల్లయోధుడు జీవిత చరమాంకంలో అనారోగ్యమనే సమస్యతో పోరాడాడు. బహుశా అందులో మాత్రం ఆయన అపజయం పాలయ్యారేమో! ఆయన ఒరిస్సాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు దాదాపు 1942 జనవరి 16 న అనామకంగా కన్నుమూశారు. రామమూర్తిగారు పూర్తి శాకాహారి. గురజాడ వారు తిరగాడిన ఉత్తరాంధ్రలోనే కోడి రామమూర్తి 1882 ఏప్రిల్లో జన్మించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం. ఊరి పేరే కాదు, ఆయన ఇంటి పేరుకు కూడా ఒక ఘనత ఉంది. కోడి వంశం మల్లయోధులకు ప్రసిద్ధి. -
చైతన్య భారతి: పతాక యోధుడు.. పింగళి వెంకయ్య
రెండో బోయర్ యుద్ధంలో పింగళి వెంకయ్యకీ, గాంధీజీకీ స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్యోద్య్రమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు. దక్షిణాఫ్రికాలోని విట్వాటర్సాండ్ బంగారు గనుల మీద ఆధిపత్యం గురించి ఆఫ్రికన్లు (బోయర్లు) చేసిన తిరుగుబాటుకే బోయర్ యుద్ధమని పేరు. దక్షిణాఫ్రికా రిపబ్లిక్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లు బ్రిటిష్ జాతితో చేసిన యుద్ధమిది. ఆ యుద్ధంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్ ఇండియన్ అంబులెన్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య బ్రిటిష్ సైనికునిగా అదే యుద్ధంలో పాల్గొన్నారు. తరువాత ఇద్దరూ స్వదేశం చేరుకుని స్వరాజ్యం కోసం పోరాడారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1921లో గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ఒక పతాకం అవసరమని భావించారు. ఆ పని పింగళి వెంకయ్యకు తనకు తానై స్వీకరించారు. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నారు. జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి ఆయన వెంకయ్యగారికి సూచించారు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్ ఉద్యమకారుడు లాలా హన్స్రాజ్ ధర్మచక్రాన్ని సూచించారు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉన్నది. బ్రిటిష్ వాళ్లు వారి జెండా యూనియన్ జాక్ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణాతీరంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1963 జూలై 4న బెజవాడలో పేదరికంతో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు. -
జైహింద్ స్పెషల్: అరెరె.. క్రూర వ్యాఘ్రమా ఓ భయభ్రాంతుడా
వి.ఓ. చిదంబరం పిళ్లైకి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో, దానికి నిరసనగా ప్రజలంతా గుమిగూడారు. దీన్ని చూసి బ్రిటిష్ అధికారికి చిర్రెక్కింది. అతని తుపాకీకి పిచ్చెక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అంతే. గాడిచర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘అరెరె ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా! ఓ భయభ్రాంతుడా! పొగరుబోతు’’ అంటూ ‘విపరీత బుద్ధి’ శీర్షికన సంపాదకీయం రాశారు. ‘రాజద్రోహాన్ని’ లెక్కచేయలేదు, కటకటాలనూ లెక్క చేయలేదు, హింసనూ లెక్క చేయలేదు. స్వాతంత్య్రోద్యమం కోసం ఎంతో మంది పాత్రికేయులు అక్షరాయుధాలుగా తయారయ్యారు. తిలక్ (కేసరి, మరాఠా), సుబ్రమణ్య అయ్యర్ (ద హిందూ), శిశిర్ కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్ (స్వదేశీయాభిమాని), మోతీలాల్ నెహ్రూ, మదన్మోహన్ మాలవ్య(ద లీడర్), గాంధీ (దక్షిణాఫ్రికాలో ‘వాయిస్ ఆఫ్ ఇండియా’కు కరస్పాండెంట్) వంటి జాతీయోద్యమ నాయకుల జీవితాలు పత్రికలతో పెనవేసుకునే మొదలయ్యాయి. దేశంలో తొలిసారిగా జైలుకెళ్లిన పాత్రికేయుడు సురే్రందనాథ్ బెనర్జీ. తెలుగునాట సంపాదకీయం రాసి జైలు జీవితాన్ని గడిపిన తొలి పాత్రికేయుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. తొలి తెలుగు దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’కు ఆయన తొలి సంపాదకుడు. ‘గాడి’ తప్పిన ఆగ్రహం గాడిచర్ల హరిసర్వోత్తమ రావు తండ్రి నేటి వైఎస్ ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన వారు. కర్నూలులో 1883లో జన్మించిన ఆయన, మద్రాసులో ఎం.ఏ., పూర్తి చేసి, రాజమండ్రిలో బీఈడీలో చేరారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ‘వందేమాతర’ ఉద్యమంలో అక్కడి విద్యార్థులంతా తరగతులను బహిష్కరించారు. విద్యార్థులకు జరిమానాతో సరిపెట్టిన ప్రిన్సిపాల్, వారికి నాయకత్వం వహించిన గాడిచర్లను కాలేజీ నుంచి బహిష్కరించి, ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా ఆదేశాలు జారీ చేశారు. గాడిచర్ల ఏడాది తరువాత విజయవాడ వచ్చి ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించారు. అదే సమయంలో తమిళనాడులో వి.ఓ. చిదంబరం పిళ్లైకి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో, దానికి నిరసనగా ప్రజలంతా గుమిగూడారు. దీన్ని చూసి బ్రిటిష్ అధికారికి చిర్రెక్కింది. అతని తుపాకీకి పిచ్చెక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అంతే. గాడిచర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జడ్జికి ‘అభిమాన’ భంగం ‘‘అరెరె ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా! ఓ భయభ్రాంతుడా! పొగరుబోతు’’ అంటూ ‘విపరీత బుద్ధి’ శీర్షికన సంపాదకీయం రాసినందుకు ఆయనపైన రాజద్రోహ నేరం మోపారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం భోగరాజు పట్టాభిసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఆ సమయంలోనే బాలగంగాధర్ తిలక్ పైన బొంబాయిలో రాజద్రోహ నేరం కేసు విచారణ జరుగుతోంది. ‘విపరీత బుద్ది’ తోపాటు ‘స్వరాజ్య’ లో వచ్చిన మిగతా వ్యాసాలు రోజద్రోహం కిందకు రావని, భారతీయుడైన కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి కెర్షాస్ప్ (పారశీ మతస్తుడు) కేవలం 6 నెలల సాధారణ శిక్షతో సరిపెట్టారు. గాడిచర్ల పైన అభిమానంతో శిక్షను తగ్గించి విధించారని భావించిన మద్రాసు హైకోర్టు జడ్జిలు కెర్షాస్ప్ పదవీ స్థాయిని తగ్గించేశారు. మరొక సారి పదవీ స్థాయిని తగ్గించడంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. హైకోర్టులో గాడిచర్ల తరపున ప్రకాశం పంతులు వాదించినప్పటికీ, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష తప్పలేదు. మొలకు గోచి.. తలకు టోపీ ఆ సమయంలో గాడిచర్ల వయసు పాతికేళ్లు. ఆయన సతీమణి రామాబాయి వయసు పదిహేనేళ్లు. ఆమె ఏడు నెలల గర్భవతి. జైల్లో ఉన్న భర్తను దూరం నుంచి చూసి చలించిపోయారు. మొలకు గోచీ, గుండు చేసిన తలకు మురికి టోపీ, కాళ్లకు, చేతులకు, మెడకు ఇనుప కడియాలు, మట్టి ముంతలో నీళ్లు, మట్టి చిప్పలో మట్టిపెళ్లలు, రాళ్లతో నిండిన రాగి సంగటి. పిండి విసరడం, రాళ్లు కొట్టడం ఆయన దినచర్య. మట్టితో పళ్లు తోముకోవడం, జైలరు చెప్పిన సమయానికి మలవిసర్జన, స్నానానికి 4 ముంతల నీళ్లు; ఇలా దేహబలాన్నే కాదు, మనో బలాన్ని కూడా దెబ్బతీయాలని చూసినా వారికి సాధ్యం కాలేదు. ఆ తరువాత గాడిచర్ల ‘నేషనలిస్టు’ అన్న ఇంగ్లీషు పత్రికను స్థాపించి, రౌలత్ చట్టం, చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, ప్రెస్ యాక్ట్ను నిశితంగా విమర్శిస్తూ ‘కట్ ఆఫ్ ద బుల్లెట్’ అన్న సంపాదకీయం రాశారు. దీంతో ఆయనపై మళ్ళీ రాజద్రోహ నేరం మోపారు. ఈ తడవ జైలు శిక్షపడలేదు కానీ, పత్రికను మూసేశారు. ‘నేషనలిస్టు’లో కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగా రెడ్డి వంటి వారు కూడా వ్యాసాలు రాసేవారు. జైలు నుంచి విడుదలైన గాడిచర్లతో మాట్లాడడానికి ఎవరూ సాహసించే వారు కాదు. ఆ స్థితిలో కాశీనాథుని నాగేశ్వరరావు 1914లో మద్రాసులో తెలుగు వారి తొలి దినప్రతికగా ఆంధ్రపత్రికను స్థాపించి గాడిచర్లను సంపాదకులుగా నియమించారు. – రాఘవ శర్మ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చదవండి: ఫడ్కే.. ఇప్పుడు నీకేం కావాలి? నీతో యుద్ధం.. -
చైతన్య భారతి: గృహిణి, ఉద్యమకారిణి.. కమలా నెహ్రూ
కమలా నెహ్రూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సతీమణి. ఇంటి పట్టునే ఉండే కమలా నెహ్రూ 1921లో సహాయ నిరాకరణోద్యమంలో మహిళల బందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు, దుస్తులు, మద్యం అమ్మకాలు తగవనే నినాదంతో ముందుకు సాగారు. రెండుసార్లు అరెస్ట్ అయ్యారు. కమల పాత ఢిల్లీ లోని కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1899 ఆగస్టు 1 రాజ్పతి, జవహర్మల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు. చాంద్ బహదూర్ కౌల్ , కైలాష్ నాథ్ కౌల్; ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు. కమలకు 1916 ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ. అత్తగారు శ్రీమతి స్వరూప రాణి. ఉద్యమాలు తెలియకుండా పెరిగి వచ్చిన కోడలు సహాయ నిరాకరణకు నడుము బిగించడంతో అత్తమామలు సంతోషించారని అంటారు. ఆమె మామగారు మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా ధారపోసింది. చివరకు తమ ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్గా మార్చి స్వాతంత్య్ర పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించారు. 1917 నవంబరు 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూలకు ఏకైక సంతానంగా అలహాబాద్ లో ఇందిర జన్మించారు. 1924 లో కమలా నెహ్రూ ఒక బాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందక ముందే జన్మించడం వలన రెండు రోజులలో బాబు చనిపోయాడు. 1934లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు అయి కలకత్తా, డెహ్రాడూన్ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం దెబ్బతినింది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ కూడా దిగులుతో అనారోగ్యానికి గురయ్యారు.. చికిత్స కోసం స్విట్జర్లాండ్కు వెళ్లి 1936లో టి.బి. జబ్బు మూలాన 36 ఏళ్ల వయసుకే మరణించారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు వెలశాయి. కమలా నెహ్రూ తండ్రి జవహర్మల్ కౌల్ప్రసిద్ధ వ్యాపారి. జవహర్ లాల్ నెహ్రూకు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి, వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కౌల్ కమలా నెహ్రూగా మారారు. -
మాల్గుడి మహాశయుడు: ఆర్.కె.నారాయణ్
మన దేశానికి గర్వ కారణంగా నిలిచిన భారతీయ ఆంగ్ల కథా సాహిత్యానికి పునాదులు వేసిన వైతాళికులు రాసిపురం కృష్ణస్వామి నారాయణ్! ఆయన 1906లో మద్రాసులోని ఒక సంప్రదాయ కుటుంబంలో ఎనిమిదవ సంతానంగా జన్మించారు. ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ ఆయన పెద్దన్నయ్య. ఆర్. కె. నారాయణ్ చిన్నతనం నుంచి కౌమార దశకు వచ్చేవరకు అమ్మమ్మ ఇంటి దగ్గరే పెరిగారు. మైసూరులో ఆయన తండ్రి మహారాజా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమితులైనప్పుడు నారాయణ్ మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నారు. చదువుకుంటున్నప్పుడు ఆయన ధ్యాస చదువు మీద ఉండేది కాదు. ఇంగ్లిష్ పాఠ్య పుస్తకం చదవడానికి చాలా విసుగనిపించడంతో చదవక, చదవలేక.. నారాయణ్ కళాశాల ప్రవేశ పరీక్షలో తప్పారు. తరువాత మళ్లీ ఎలాగో ప్రవేశ పరీక్ష రాసి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. నారాయణ్ కథా రచయితగా తన జీవితాన్ని 1935లో ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ అనే కథతో మొదలుపెట్టారు. ‘మాల్గుడి’ అనే ఊహా పట్టణం ఆయన తలపుల్లో రూపుదిద్దుకుని ఆయన నవలలకు నేపథ్యమైంది. ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ది ఇంగ్లిష్ టీచర్, మిస్టర్ సంపత్, ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ఎ టైగర్ ఫర్ మాల్గుడి పేరుతో వెలువడిన నారాయణ్ రచనలు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని సంపాదించుకున్నాయి. స్వామి అండ్ ఫ్రెండ్స్ను అచ్చు వేయడానికి మొదట నారాయణ్కు ప్రచురణకర్తలు లభించలేదు. రాత ప్రతిని ఆయన గ్రాహమ్ గ్రీన్కు చూపించారు. ఆయన దానిని చదివి, హృదయపూర్వకంగా ప్రశంసించి, దానిని ప్రచురించడానికి ఏర్పాట్లు చేశారు. ఇ.ఎం.పార్స్టర్, సోమర్ సెట్ మామ్ల మాదిరిగా నారాయణ్కు కూడా గ్రీన్ ఆరాధకుడిగా మారిపోయారు. విషాదం, హాస్యం మేళవిస్తూ ఆయన రాసే కథలు సహజంగానే ఆబాలగోపాలన్ని ఆకట్టుకున్నాయి. ఆయన జీవితానుభవాలనే ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని సృష్టించారు. 1958లో ది గైడ్కు ఆయనకు సాహిత్య అకాడెమీ అవార్డు లభించగా, 1980లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఆయనను ఎ.సి.బెన్సన్ అవార్డుతో సత్కరించింది. ఒక్కమాటలో.. సులభమైన భాష, శైలితో ఆర్.కె.నారాయణ్ రాసిన విషాద, హాస్య రచనలు ఆంగ్ల సాహిత్యంలో భారతీయ కథలకు కని విని ఎరుగని విధంగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. – అంజూ సెహ్గల్ గుప్తా, ‘ఇగ్నో’ ప్రొఫెసర్ -
మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్
జలియన్ వాలా బాగ్ హత్యాకాండ వార్త అది జరిగిన ఐదారు వారాలకు గాని.. పంజాబ్ నుంచి మిగిలిన భారతదేశానికి చేరలేదు. నాడు అంత దారుణంగా పత్రికల నోరు నొక్కింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితులలో హార్నిమన్ ఆ ఘోరాన్ని ఇంగ్లండ్లోని లేబర్పార్టీ పెద్దలకు రహస్యంగా చేరవేసి సంచలనం సృష్టించారు. అందుకే ఆయనను నాటి మహోన్నత స్వాతంత్య్రోద్యమ రథసారథులు మనసారా ‘భారత జాతి మిత్రుడు’ అని పిలుచుకున్నారు. బెంగాల్ను విభజిస్తున్నట్టు 1905 అక్టోబర్ 16న వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రకటించగానే భారతీయులు భగ్గుమన్నారు. హిందువులు, ముస్లింలు ఒకరి చేతికి ఒకరు రాఖీలు కట్టుకుని, ఐక్యతను చాటారు. బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, చిత్తరంజన్ దాస్ వంటివారితో పాటు కొన్నివేల మంది గంగానదిలో స్నానం చేసి, ప్రభుత్వం వంగదేశ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆనాటి ఆ చరిత్రాత్మక ఘట్టంలో ఒక్క వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా కనిపించారు. చిన్న గావంచా కట్టుకుని గంగలో స్నానమాచరించి, ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడతానని ప్రతిన పూనారు. కానీ, ఆయన భారతీయుడు కాదు. తెల్ల జాతీయుడు! ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది స్టేట్స్మన్ ’ సహాయ సంపాదకుడు. పేరు బెంజిమన్ గై హార్నిమన్. బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్షా మెహతా, మోతీలాల్, ఎంఏ జిన్నా, అనిబీసెంట్, సరోజినీ నాయుడు వంటి వారితో ఆయన భుజం భుజం కలిపి భారత స్వాతంత్య్రోద్యమంలో నడిచారు. నేడు బెంజిమన్ గై హార్నిమన్ జయంతి. 1873 జూలై 17న జన్మించారు. బ్రిటన్లో పుట్టి, ఇండియాలో స్థిరపడిన జర్నలిస్ట్ ఆయన. జలియన్ వాలా దురంతం మీద హార్నిమన్ ఒక పుస్తకమే రాశారు. దాని పేరు ‘బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది అమృత్సర్ మేసకర్’. ఈ పుస్తకాన్ని 1984లో భారతదేశంలో పునర్ ముద్రించారు కూడా. ఎలాంటి దేశం మీద, ఎలాంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్న ప్రజల మీద తెల్ల జాతీయులు దాష్టీకం చేస్తున్నారో, జలియన్ వాలా బాగ్ కాల్పుల వంటి రాక్షసకృత్యానికి పాల్పడ్డారో ఆయన అందులో ఎంతో అద్భుతంగా వర్ణించారు. రాజనీతి గురించి ప్రపంచానికి నీతులు చెప్పే ఇంగ్లండ్ భారతదేశంలో పత్రికల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో కూడా బహిర్గతం చేశారు. 1947లో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం అధీనం నుంచి విముక్తమైన గొప్ప దృశ్యాన్ని హార్నిమన్ వీక్షించారు. ఆ మరుసటి సంవత్సరం కన్నుమూశారు. -
చరిత్రాత్మక సినీ రూపకర్త: బిమల్ రాయ్
బిమల్ రాయ్ ప్రముఖ బెంగాలీ, హిందీ సినిమా దర్శకులు. దో బిఘా జమీన్, పరిణీత, బిరాజ్ బహు, దేవ్దాస్, మధుమతి, సుజాత, పరఖ్, బందిని వంటి వాస్తవిక, సామాజికాంశాలతో కూడిన చిత్రాలను ఆయన తీశారు. రాయ్ ఢాకా లోని సువాపూర్లో జన్మించారు. అక్కడి నుంచి వారి కుటుంబం కలకత్తా వచ్చాక సినిమాల్లో కెమెరా అసిస్టెంట్గా ఆయన తన కెరీర్ను ప్రారంభించారు. ఆ క్రమంలో గొప్ప సినిమా దర్శకునిగా అవతరించారు. అనేక అవార్డులను పొందారు. అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఆయన్ని వరించాయి. దురదృష్టం ఏమిటంటే.. 56 ఏళ్లకే ఆయన క్యాన్సర్తో మరణించారు. ఆయన సతీమణి మనోబినా రాయ్. వారికి ముగ్గురు కూతుళ్లు.. రింకీ భట్టాచార్య, యశోధరా రాయ్, అపరంజితా సిన్హా; ఒక కుమారుడు జాయ్ రాయ్. తండ్రి గురించి జాయ్ రాయ్ మాటల్లో మరికొంత తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది : ‘‘గదులన్నీ పుస్తకాలు, చలన చిత్రాలతో నిండిపోయి ఉండటం నాకు చిన్నప్పట్నుంచీ గుర్తే! నా తోబుట్టువులు, నేను ఆ పుస్తకాలను, ప్రపంచంలోని బొమ్మలను ఆశ్చర్యంగా చూసేవాళ్లం. తరచు మా నాన్నగారు అతిథులను ఆహ్వానించేవారు.చిత్ర రూపకల్పనను ఎంతో ప్రేమించే మా నాన్నగారు మమ్మల్ని మాత్రం అందులోకి దిగడానికి ప్రోత్సహించేవారు కాదు. సినిమా వాతావరణం కన్నా మా ఇంట్లో ఓ ప్రత్యేకమైన సంస్కృతి విలసిల్లుతూ ఉండేది. జమీందారు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన కుటుంబం మోసానికి గురవడంతో ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు. సినిమాల రూపకల్పన ఒక్కటే ఆయనకు మిగిలిన ఏకైక వ్యామోహం. 1960లలో ఆయనకు చరిత్రాత్మక సినీ రూపకర్తగా పేరు వచ్చింది. నిజానికి 1932 నుంచే ఆ రంగంలో ఆయన పని చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఆయన సినీ ఫొటోగ్రాఫర్గా పని చేశారు. ఆ తరువాత ఆయన తన భావోద్వేగాలను సెల్యులాయిడ్ పైకి తర్జుమా చేయడం ప్రారంభించారు. దో బిఘా జమీన్ చిత్రం ఆయన వ్యక్తిగత అనుభవానికి ప్రతిరూపమని నా భావన. ఆయన రూపొందించిన చిత్రాలన్నీ ఆయన ఆలోచనల్ని, అనుభవాలనే ప్రతిబింబించేందుకు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు. ఆయన తన వనరులన్నిటినీ చిత్ర నిర్మాణానికే ఖర్చుపెట్టేవారు. ఏదైనా సరే నిర్దుష్టంగా ఉండాలనే తపన వల్ల ఆయన శక్తి, సమయం ఖర్చయ్యాయి. ప్రతి చిన్న దాని మీదా ఆయన చూపిన ఆ శ్రద్ధాసక్తుల వల్లే ఇవాళ్టికీ ఆయన చిత్రాలు నిలబడుతున్నాయి’’ అంటారు జాయ్ రాయ్. -
మహోజ్వల భారతి: నెహ్రూకు నో ఎంట్రీ చెప్పిన దుర్గాబాయ్!
దుర్గాబాయి దేశ్ముఖ్ భారత స్వాతంత్య్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాద్లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను దుర్గాబాయే స్థాపించారు. రాజ్యాంగ సభలో, ప్రణాళికా సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. నేడు దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి. 1909 జూలై 15న రాజమండ్రిలో జన్మించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాల్పంచుకున్నారు. పన్నెండేళ్ల వయసులోనే ఆంగ్ల విద్యకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు. ఆంధ్రప్రదేశ్కు మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని ఆ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేశారు. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు.. టిక్కెట్ లేని కారణంగా నెహ్రూను ఆమె సభలోపలికి అనుమతించలేదు. కర్తవ్య నిర్వహణలో నిక్కచ్చిగా ఉన్నందుకు తిరిగి నెహ్రూ నుంచే ఆమె ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు -
చైతన్య భారతి: స్త్రీవాద వర్ణాలు-అమృతా షేర్గిల్
అమృత తన వర్ణచిత్రాల ద్వారా , తన వ్యక్తిత్వం ద్వారా ఈ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఆమె చిత్రాలలో కనిపించే ఎడతెగని మార్పులకు అమృత పుట్టుపూర్వోత్తరాలే ప్రధాన కారణం. అయితే, ఈ విషయంలో కాలాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. భారతదేశమే పరిణామక్రమంలో ఉన్న సమయంలో ఆమె జీవించారు. ఆమె మాతృమూర్తి హంగేరియన్. తండ్రి పదహారణాల భారతీయుడు. దాంతో తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే స్పృహ అమృతలో గాఢంగా ఉండేది. ఆమెకు తన శారీరక సౌందర్యానికి సంబంధించిన స్పృహ కూడా ఎక్కువే. ఆమె తన అందచందాలను అనేక రకాలుగా ప్రదర్శించారు. అందులో చాలాభాగం ఫొటోలను ఆమె తండ్రి ఉమ్రావ్ సింగ్ స్వయంగా తీశారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కలిగి, భారతదేశానికి వచ్చి సంచలనం సృష్టించిన ‘విమోచన పొందిన మహిళ’గా ఆమె చాలామందికి గుర్తుండిపోయారు. చనిపోవడానికి సుమారు రెండేళ్ల ముందు ఆమె హంగేరీలో ఉండగా వేసిన ‘టు ఉమెన్’ అరుదైన చిత్రం. అందులోంచి స్త్రీవాదం తొంగి చూస్తుంటుంది. స్త్రీత్వానికి తాను చెప్పిన భాష్యాన్ని తానే ఎదుర్కొన్న చిత్రం అది. ఆధునిక భారతీయ మహిళ అనే పదం అరిగిపోయినదిగా కనిపించవచ్చు. కానీ అంతిమంగా, నాకు అమృత.. ఆ పదానికి తగిన నిర్వచనంలా కనిపిస్తారు. ఆమె వర్ణచిత్రాలే అందుకు తార్కాణాలు. 28 ఏళ్ల వయసుకే అనారోగ్యంతో మరణించిన అమృత తను జీవించిన కొద్ది కాలంలోనే అమూల్యమైన చిత్రకారిణిగా పేర్గాంచారు. అప్పట్లో భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్లను చిత్రించిన మహిళ అమృతాయే. 1938లో గోరఖ్పూర్లోని తన ఎస్టేట్లో ఆమె గీసిన ‘ఇన్ ది లేడీస్ ఎన్క్లోజర్’ చిత్రం.. ఇటీవలే 2021 వేలంలో 37.8 కోట్లకు అమ్ముడయింది. చిత్రకారిణిగా ఆమె తన ఆర్ట్ వర్క్ను ప్రేమించినట్లే భారతదేశాన్నీ ప్రేమించారు. 1938లో అమృత తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టర్ ఈగాన్ను వివాహమాడారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో స్థిరపడ్డారు. 1941లో లాహోర్లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు తీవ్రమైన ఆనారోగ్యం బారిన పడ్డారు. ఆ ఏడాది డిసెంబర్ 6 అర్ధరాత్రి తను గీస్తున్న బొమ్మలపైనే ఒరిగిపోయారు. – వివాన్ సుందరం, అమృతా షేర్గిల్ బంధువు -
Mulk Raj Anand: చైతన్య భారతి.. దేశమే రచన.. ముల్క్ రాజ్ ఆనంద్
తొమ్మిదేళ్ల వయసు కలిగిన తన చుట్టాలబ్బాయి ఎందుకు మరణించాడని దేవుణ్ని అడుగుతూ తన 11 ఏళ్ల వయసులో రాసిన లేఖ ఆయన మొట్టమొదటి రచన. సుప్రసిద్ధ నవలా రచయిత చార్ల్స్ డికెన్స్ను గుర్తుకు తెస్తున్నావంటూ ప్రశంసలు పొందిన భారతీయ ఆంగ్ల నవలా రచయిత కూడా ఆయనే. ఆయనే ముల్క్రాజ్ ఆనంద్. వార్ధాలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో కూర్చొని తాను ప్రారంభించిన నవల ‘అన్టచబుల్’ ఆఖరి పుటలలో ఆనంద్.. భారతీయుల తత్వాన్ని ఒక కవి పాత్ర ద్వారా ఇలా రాశారు: మాకు జీవితం తెలుసు. దాని రహస్య ప్రవాహం తెలుసు. దాని లయలకు అనుగుణంగా మేం నర్తించాం. దాన్ని మేం ప్రేమించాం. వ్యక్తిగత అనుభూతుల ద్వారా భావావేశాలతో కాదు. హృదయాంతరాల నుంచి వెలుపలికి మా చేతులను చాస్తూ, విశ్వంలోకి వ్యాపిస్తూ ఇప్పటికీ, అవును, ఇప్పటికీ మాకొటే అనిపిస్తుంది. ఆ జీవితానికి హద్దులే లేవని, అపురూపమైన అద్భుతాలు సంభవమనీ’’. ఆనంద్ ఇలా రాయడానికి ఒక ప్రేరణ ఉంది. భారతీయులు తమని తాము పరిపాలించుకోలేని అసమర్థులనే వాదనను బ్రిటిష్ వారు ప్రచారం చేశారు. దానికి స్పందనగా ముల్క్ రాజ్ ఆనంద్ ఈ కవితను రాశారు. ఆయనను ప్రత్యేకంగా నిలిపింది స్వతంత్ర భారత నిర్మాణానికి ఆయన దీర్ఘకాలం పాటు నికరమైన ఆలంబనగా నిలవడం. 1905లో పెషావర్లో జన్మించిన ఆనంద్, అమృత్సర్లోని ఖల్సా కాలేజీలో విద్యనభ్యసించారు. జాతీయవాది అయిన ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు 1920లలో ఒక ప్రసంగం ఇవ్వడానికి అనీబిసెంట్ను తమ కళాశాలకు ఆహ్వానించారు. దాంతో బ్రిటిష్ పాలకులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. పోలీసులు ఆయనను నెలపాటు జైల్లో ఉంచారు. 1935లో ఆయన రాసిన అన్టచబుల్, 1936లో ఆయన రాసిన కూలీ నవలలు ఆయన ప్రతిష్టను పెంచాయి. ఆయన రాసిన లెటర్స్ ఆఫ్ ఇండియా (1942), అపాలీజ ఫర్ హీరోయిజం (1946) అనే కరపత్రాలు బ్రిటిష్ వారిలో కలకలం కలిగించాయి. ముల్క్రాజ్ తన రచనల్లో ప్రధానంగా సాంప్రదాయిక భారతీయ సమాజంలోని పేద ప్రజల జీవిత ఇతవృత్తాలను చిత్రించారు. ఆయన పద్మభూషణ్ పురస్కార గ్రహీత కూడా. – స్నేహల్ షింగవి, టెక్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
India@75: శతమానం భారతి పచ్చదనం
జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నారు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అతడికి ఆధారం భూమే. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్ వాతావరణ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు భారత్ కంకణం కట్టుకుంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. అలాగే ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. అందుకే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్ ’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే ‘గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రేమ, తపన ఉంటే చాలు. పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకుంటే భావితరాలు పచ్చగా ఉంటాయి. చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 అమృతమూర్తి -
అభ్యుదయ నృత్యకారిణి రుక్మిణీదేవి అరండేల్
రుక్మిణీదేవి అరండేల్ జీవితం సమ్మోహనపరిచేదిగా ఉంటుంది. ఆమె దార్శనికురాలు. దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు. నాట్యకారిణి. నృత్య దర్శకురాలు. జంతు ప్రేమికురాలు. సంప్రదాయ భారతీయ కళలు, హస్తకళల్ని ప్రోత్సహించిన వ్యక్తి, వక్త. అన్నిటినీ మించి మానవతావాది. మదురైలో సనాతన సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రుక్మిణీదేవి 16 ఏళ్ల వయసులో తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన బ్రిటిష్ దివ్యజ్ఞాన సమాజ వర్గీయుడు డాక్టర్ జార్జ్ ఎస్.అరండేల్ను పెళ్లి చేసుకుని తన వర్గంలో ప్రకంపనలు సృష్టించారు. ఆమె పై డాక్టర్అనీబిసెంట్, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమం, స్వదేశీ ఉద్యమాల ప్రభావం ఉంది. రుక్ష్మిణీదేవి 29 ఏళ్ల వయసులో మైలాపూర్ గౌరి అమ్మ దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అనంతరం పండనల్లూర్కు చెందిన గురు మీనాక్షీ సుందరం పిళ్లై వద్ద కూడా నృత్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె 31 ఏళ్ల వయసులో దివ్యజ్ఞాన సమాజంలో మొదటిసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు. 1936 లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ను ప్రారంభించారు. అదే కళాక్షేత్రగా మారింది. శాస్త్రీయ భారతీ నృత్య రూపమైన సాధిర్ను పునరుద్ధరించడంలో (అదే ఇప్పుడు భరతనాట్యం) అరండేల్ రుక్ష్మిణీదేవికి సహాయపడ్డారు. ఇ.కృష్ణయ్యర్ తరువాత సాధిర్కు గౌరవనీయతను తీసుకు వచ్చింది అరండేలే. నృత్య రూపకం విధానం ఆవిర్భావానికి అరండేల్ వైతాళికురాలిగా నిలిచారు. ఆమెలో స్త్రీవాద దృక్పథం లేదా విమోచన పార్శ్యం కూడా ఉండేది. భర్తలు చనిపోయినప్పుడు భార్యలు తల వెంట్రుకలు తీయించుకోవడం పూర్వం ఆచారంగా ఉండేది. రుక్మిణీదేవి తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లికి గుండు గీయించడాన్ని వ్యతిరేకించారు. తన భర్త చనిపోయిన తరువాత కూడా ఆమె తన నుదిటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని యథా ప్రకారం కొనసాగించారు. యువతరానికి, నృత్య చరిత్రకారులకు ఆమె ఒక పరిశీలనాంశం. నిజంగానే ఆమె పునరుజ్జీవనం తీసుకు వచ్చిన మహిళ. దేశాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఎక్కువ మంది మహిళలకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని తిరస్కరించిన వారూ ఎక్కువమంది లేరు. మొరార్జీ దేశాయ్ 1977లో వెండి పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపినప్పుడు రుక్మిణీదేవి అరండేల్ నిరాకరించారు. రాష్ట్రపతి భవన్లో ఉండటం కన్నా కళాక్షేత్రంలో ఉండడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. – లీలా శామ్సన్, అరండేల్ శిష్యురాలు, కళాక్షేత్ర ఫౌండేషన్ డైరెక్టర్ -
కలం యోధుడు: మున్షీ ప్రేమ్చంద్ / 1880–1936
గ్రామీణ భారతావనిని పట్టి పీడిస్తున్న దారిద్య్రం, దళితులను దోపిడీ చేయడం, మూఢ నమ్మకాలు, ధార్మిక క్రతువులు, పితృస్వామ్యం, జమీందారీ విధానం, వలసవాదం, మతతత్వం లాంటి అంశాలను ప్రేమ్చంద్ నిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేశారు. మున్షీ ప్రేమ్చంద్గా అందరికీ సుపరిచితులైన ధన్పత్రాయ్ను సామ్యవాద వాస్తవిక రచయితగా పేర్కొనవచ్చు. ప్రేమ్చంద్ను తరచూ గాంధేయవాది అని పొరపడుతూ ఉంటారు. రచనా జీవితం తొలి రోజుల్లో ఆయన గాంధేయవాద పోకడలు పోయారు. ఏదో మాయ జరిగినట్లుగా దోపిడీదారులందరూ తాము చేస్తున్న నేరాలను మానేసినట్లు ఆయన రాసేవారు. కానీ తరువాతి రచనల్లో ఆయన క్రమంగా సామ్యవాద సిద్ధాంతం వైపు మారారు. మరాఠీ రచయిత టి.టికేకర్తో సంభాషణ జరిపినప్పుడు ప్రేమ్చంద్ ఇలా అన్నారు. ‘‘నేను ఓ కమ్యూనిస్టుని. అయితే నా కమ్యూనిజమల్లా రైతులపై దౌర్జన్యం చేసే జమీందార్లను, సేనలనూ, ఇతరులను లేకుండా చేయడం వరకే పరిమితం’’ అని. అలాగే భారత జాతీయోద్యమం పట్ల ప్రేమ్చంద్ వైఖరి విమర్శనాత్మకంగా సాగింది. ఆయన దానిని గుడ్డిగా పొగిడేవారు కాదు. తవన్ (1931), ఆహుతి (1930) లాంటి కథానికల్లో జాతీయవాదాన్ని ఆయన ఆకర్షణీయంగా, ప్రేరణాత్మకంగా చిత్రించారు. ఆ తరువాత రంగ్భూమి (1925), కర్మభూమి (1932) లాంటి నవలల్లో ఈ సైద్ధాంతిక ‘ముఖతలం వెనుక ఉన్న మలిన’ వాస్తవాన్ని ఆయన బహిర్గతం చేశారు. ప్రముఖ విమర్శకులు సుధీర్ చంద్ర ఈ విషయాలు తెలిపారు. ఆధిపత్య వర్గం నుంచి తమ వర్గ ప్రయోజనాలను ప్రచారం చేసుకోవడం కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకోవడాన్ని ప్రేమ్చంద్ మున్షీ విమర్శించారు. స్త్రీవాద దృక్కోణం నుంచి ప్రేమ్చంద్పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇక వలసవాద భారతదేశంలోని లోబరుచుకొనే శక్తులపై ఆయన కథానికలు తీవ్రంగా దాడి చేస్తే, ఆయన రాసిన ‘గోదాన్’, ‘గబన్’, ‘నిర్మల’ వంటి నవలలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. సమాజంలోని అన్యాయాలపై ఆయన సూటిగా, నిర్మొహమాటంగా తన రచనల్లో విరుచుకుపడ్డారు. ఆయన రచనల్లో కొన్ని.. ఘాటైన విమర్శలకు గురైనప్పటికీ ఆయనను అనుకరించే రచయితలు పలువురు రంగ ప్రవేశం చేశారు. ఆయన రచనలు పాఠకులకే కాక, సాటి రచయితలకు కూడా ప్రేరణగా నిలిచాయంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. – మేఘా అన్వర్, ఢిల్లీ లేడీ శ్రీరామ్ కళాశాలలో బోధకులు -
మహోజ్వల భారతి: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు
వినాయక్ దామోదర్ సావర్కర్ స్వాతంత్య్ర సమరోద్యమ విప్లవకారులు. లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి రాజకీయ నాయకుల నుంచి ప్రేరణ పొందినవారు. ఉపకార వేతనంపై న్యాయవిద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఆయన సహచరుడు చేసిన ఒక హత్య కేసు నుంచి తప్పించుకోడానికి ఇంగ్లండ్ నుంచి పారిస్కు మకాం మార్చారు. ఆ సమయంలోనే ఆయన జీవితంలో కొన్ని ముఖ్య ఘటనలు సంభవించాయి. వాటిల్లో ఒకటి 1910 జూలై 7న సావర్కర్ తను ఉన్న ఓడ నుంచి సముద్రంలోకి దూకి తప్పించుకోవడం! భారత్లో వైస్రాయ్ని చంపడానికి బాంబుదాడి జరిగింది. అందులో సావర్కర్ సోదరుడు నారాయణ్ను అరెస్టు చేశారు. అలాగే లండన్లో ఉన్న సావర్కర్ను వెంటనే అరెస్టు చేయాలని టెలిగ్రామ్ ఆదేశాలు వెళ్లాయి. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. 1910 మార్చిలో ఆయన పారిస్ నుంచి ఇంగ్లండ్ రాగానే పోలీసులు అరెస్టు చేసి బ్రిక్స్టన్ జైలుకు తరలించారు. కొంత తర్జనభర్జన తరువాత ఆయనను భారతదేశంలోనే విచారించాలని భావించారు. దీనితో ఎస్ఎస్ మోరియా అన్న నౌకలో జూలై 1న ఎక్కించారు. ఏడో రోజుకు ఆ నౌక మార్సెల్స్ రాగానే సావర్కర్ సముద్రంలోంచి దూకి, తప్పించుకుని ఫ్రెంచ్ భూభాగం మీద అడుగు పెట్టారు. అయినా ఇంగ్లండ్ పోలీసులు మళ్లీ పట్టుకుని తీసుకుపోయారు. ఈ చర్యను సావర్కర్ అభిమానులు అంతర్జాతీయ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో బొంబాయి తీసుకువచ్చారు. రెండు జీవితకాలాల శిక్ష పడింది. పైగా ప్రవాసం. ఇది అప్పట్లో అంతర్జాతీయ వార్త అయింది. ఒక మనిషికి యాభై ఏళ్లు శిక్ష ఏమిటన్నది అందరి విస్మయం. -
సంక్షోభాల పరిష్కర్త.. జగ్జీవన్ రాం
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్త.. జగ్జీవన్ రాం. రాజకీయవేత్త. బిహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చారు. బాబూజీగా ప్రసిద్ధులు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా కూడా చేశారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో పాత్ర పోషించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. 1946లో ఆయన జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశ మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా. మరీ ముఖ్యంగా ఆయన 1971 ఇండో–పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగ్జీవన్ రాం అందించిన సహకారం అనితర సాధ్యమైనవి. 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు వెరవకుండా ఆయన అంగీకారం తెలియజేశారు. నేడు ఆయన వర్ధంతి. 1908 ఏప్రిల్ 5న జన్మించిన జగ్జీవన్ రామ్ తన 78 వ యేట 1986 జూలై 6న కన్నుమూశారు. -
మహోజ్వల భారతి: తొలి మహిళా న్యాయవాది
కార్నేలియా సొరాబ్జీ.. భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది. అలహాబాదు హైకోర్టులో పని చేశారు. సొరాబ్జీ బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైన తొలి మహిళ కూడా. అంతేకాదు, ఆక్స్ఫర్డు విశ్వ విద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించిన తొలి (1889)భారతీయురాలు. 2012లో ఆమె ప్రతిమను లండన్ లోని ‘లింకన్ ఇన్‘లో ఆవిష్కరించారు. సొరాబ్జీ సామాజిక సంస్కరణలలో చురుగ్గా పాల్గొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ ఉమెన్, బెంగాల్ లీగ్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఫర్ ఉమెన్ వంటి మహిళాభ్యున్నతి సంస్థలతో కలిసి పనిచేశారు. దేశానికి ఆమె చేసిన సేవలకు 1909లో కైసర్–ఇ–హింద్ బంగారు పతకం లభించింది. తన కెరీర్ ప్రారంభంలో సొరాబ్జీ మహిళల స్వయం పాలన కోసం కృషి చేయడం స్వాతంత్య్రోద్య మానికి ప్రచార బలాన్నిచ్చింది. అయితే 1920ల చివరి నాటికి, సోరాబ్జీ బలమైన దేశ వ్యతిరేక వైఖరిని అవలంబిం చారన్న విమర్శ ఉంది. దేశ హిందూ ‘సనాతన ధర్మం’ నమ్మ కాలు, ఆచారాలు, సంప్రదాయాలను జాతీయవాదం ఉల్లం ఘించిందని ఆమె నమ్మిన మాటైతే వాస్తవం అంటారు. నేడు సొరాబ్జీ వర్ధంతి. 1954 జూలై 6న తన 87 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. -
మలబార్ మేధావులు: కరుణాకరన్ కె. కరుణాకరన్ టి
కన్నోత్ కరుణాకరన్ రాజనీతిజ్ఞులు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి.) సభ్యులు. కేరళ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పని చేశారు. అక్కడి యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కరుణాకరన్ చొరవ ఫలితం గానే ఏర్పడింది. ఆయన ఇందిరాగాంధీకీ, రాజీవ్ గాంధీకి సన్నిహితులు. నేడు కరుణాకరన్ జయంతి. 1918 జూలై 5న మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని చిరక్కల్లో జన్మించారు. తెక్కెడతు రవున్ని మరార్, కన్నోత్ కల్యాణి అమ్మ ఆయన తల్లిదండ్రులు. కరుణాకర్కి ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఒక సోదరి. తండ్రి మలబార్ జిల్లాలో రికార్డు కీపర్గా పని చేసేవారు. కరుణాకరన్ తన 92 వ యేట కేరళలోని తిరువనంతపురంలో 2010 డిసెంబర్ 23న మరణించారు. తిరునల్లూరు కరుణాకరన్ కవి, ఉపాధ్యాయులు. కొల్లంలోని పెరినాడ్లో 1924 అక్టోబర్ 8న జన్మించారు. తండ్రి పి.కె.పద్మనాభన్, తల్లి ఎన్.లక్ష్మి. కాలేజ్లో ఉండగా కార్మిక వర్గ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ కవితలు, నినాదాలు రాశారు. కవిగా పేర్గాంచారు. తొలి పుస్తకం ఆలివర్ గోల్డ్స్మిత్ రాసిన దీర్ఘకవితకు మలయాళ అనువాదం. మలయాళ కవితాయుగంగా ప్రసిద్ధి చెందిన ‘పింక్ డికేడ్’లో ఆయన భాగస్వామ్యం కీలకమైనది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఆర్.సుగంధన్, ఎం.ఎన్.గోవిందన్ నాయర్ల స్ఫూర్తితో సీపీఐ సానుభూతిపరుడిగా మారారు. నేడు కరుణాకరన్ వర్ధంతి. 2006 జూలై 5న తన 81వ యేట ఆయన కన్నుమూశారు. -
మహోజ్వల భారతి: ‘సైమన్ గో బ్యాక్’ అన్నది ఈయనే!
యూసుఫ్ మెహర్ అలీ స్వాతంత్య్ర సమరయోధులు. సోషలిస్టు నాయకుడు. 1942లో బాంబే మేయర్గా ఎన్నికయ్యారు. నేషనల్ మిలీషియా, బాంబే యూత్ లీగ్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ.. ఈ మూడూ మెహర్ అలీ స్థాపించినవే. అలీ అనేక ఉద్యమాలను నడిపించారు. రైతులు, కార్మికులు ఆయన సారథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యంపై ఉద్యమించారు. ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదం ఆయనదే. అంతేకాదు, భారత్ నుంచి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన ఉద్యమ గర్జన ‘క్విట్ ఇండియా’ అనే మాట ఆయన ఆలోచన నుంచి ఉద్భవించినదే. అలీ గాంధీజీకి అత్యంత సన్నిహితులు. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి నినాదం ఇవ్వడంతో పాటు, ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కూడా అలీనే. ఆయన ముంబైలో 1903 సెప్టెంబర్ 23న జన్మించారు. 1950లో మరణించారు. నేడు ఆయన వర్ధంతి (జూలై 2). బోస్ అరెస్ట్ అయిన రోజు రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటన్.. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’తో కనీస సంప్రదింపులైనా లేకుండానే భారతీయులు బ్రిటన్ తరఫున యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయం తీసుకుంది వైశ్రాయ్ లార్డ్ లిన్లిత్గో. బోస్ ఉగ్రుడయ్యారు. మీ యుద్ధంలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం మనం చేయొద్దు అని గాంధీజీకి చెబితే ఆయన స్పందించలేదు! చివరికి బోస్ కలకత్తాలో కలకలం రేపారు. లిన్లిత్గో నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణలు, ప్రసంగాలు చేశారు. ఆ రోజు జూలై 2, 1940. పోలీసులు బోన్ ను చుట్టు ముట్టారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో వారం రోజులు నిరాహారదీక్ష చేశారు బోస్. దాంతో అతడిని విడుదల చేశారు. కానీ కలకత్తాలోని బోస్ ఇంటి చుట్టూ సి.ఐ.డి. పోలీసులను కాపలాగా పెట్టారు. అయినప్పటికీ మారువేషంలో తప్పించుకుని మద్ధతు కోసం హిట్లర్ను కలిసేందుకు బోస్ జర్మనీ వెళ్లారు. సిరాజ్ గెలిచి ఉంటేనా! సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ చిట్ట చివరి నవాబు. ప్లాసీ యుద్ధంలో అతడి ఓటమి, భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ పాలనకు ద్వారాలు తెరచింది. క్రమంగా ఉపఖండమంతటా వ్యాపించింది. సిరాజ్ యువకుడు. తన సైన్యంలో కమాండర్గా ఉన్న మీర్ జాఫర్ నమ్మకద్రోహం వల్ల యుద్ధంలో పట్టుబడి 24 ఏళ్లకే మరణించాడు. 1757 జూలై 2న ఈస్టిండియా సైన్యం అతడిని ఉరి తీసింది. (చదవండి: మహోజ్వల భారతి: వైద్యుడు, యోధుడు) -
మహోద్యమ వైద్యులు
గాంధీజీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆరోగ్య యాత్రలు చేసిన ఆయుర్వేద నిపుణులు ఆచంట లక్ష్మీపతి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంతో గొప్ప సేవ చేసిన బ్రహ్మ జ్యోస్యుల సుబ్రహ్మణ్యం.. ఇలా ఇంకా ఎంతో మంది డాక్టర్లు మనకు స్వాతంత్య్రోద్యమంలో తారసపడతారు. తొలి కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన ఎ.ఓ.హ్యోమ్ కూడా వైద్యులే. మరో వైద్య యోధుడు బి.సి.రాయ్! భారత స్వాతంత్య్రోద్యమంలో లాయర్లు చాలా మంది.. గాంధీజీ, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, ఆంధ్రకేసరి.. ఇలా ఎంతోమంది కనబడతారు! డాక్టర్లు లేరా అనే సందేహం వచ్చి తరచి చూస్తే 1885లో బొంబాయిలో తొలి కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన ఎ.ఓ.హ్యోమ్.. డాక్టరు కోర్సులో పట్టభద్రుడైన తర్వాత ఐసిఎస్ పూర్తి చేసిన స్కాట్లాండ్ వారని కొంచెం పరిశోధన చేస్తే బోధపడింది. 1849లో వారు భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వపు ఉద్యోగంలో చేరారు. తొలి స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఇరువైపులా జరుగుతున్న హింసాత్మక ఘటనలను గమనించి సున్నిత హృదయులైన హ్యోమ్ తల్లడిల్లేవారు. 1882లో ఐసిఎస్ పదవీవిరమణ తర్వాత భారతీయులు, ఆంగ్లేయుల మధ్య అగాధం పూడ్చాలని భావించారు. 1884లో మద్రాసులో జరిగిన దివ్యజ్ఞాన సమితి సమావేశంలో సంఘాలన్నింటిని ఏకతాటిపై తీసుకురావాలనే నిర్ణయం జరిగింది. అదే కాంగ్రెస్ పుట్టుకకు దారి తీసింది. తొలుత పూనాలో జరపాలని భావించినా కలరా మహమ్మారి కారణంగా బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో తొలి కాంగ్రెస్ సమావేశం జరిగింది. అయితే భారతీయులతో సన్నిహితంగా ఉన్నారని బ్రిటీషు వారూ, బ్రిటీషు వాడని కొందరు భారతీయులు భావించడంతో హ్యుమ్ బాగా కలత చెందారు. పక్షులను కూడా ప్రేమించే ఎ.ఓ.హ్యూమ్ 1892లో ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు, 1912లో గతించారు. కాంపౌండర్గా గాంధీజీ! ఒక డాక్టరు ప్రారంభించిన కాంగ్రెస్ సంస్థ.. డాక్టరు వంటి మరొక వ్యక్తి గాంధీజీ చేతిలో పూర్తి జవసత్వాలు పుంజుకుంది. నిజానికి డాక్టర్ కోర్సు చదవాలని గాంధీజీ ఎంతో ఉబలాట పడినా, కుటుంబ సభ్యుల కోసం బారిస్టరు చదివారు. దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న గాంధీజీకి మెడిసిన్ మీద మోజు తగ్గలేదు. 1908లో చివరిసారిగా డాక్టరు కోర్సు చదవాలని భావించినా, పరిస్థితులు అనుకూలించడం లేదని ఆశను చంపుకున్నారు. అయితే తర్వాత కొంతకాలం ప్రతిరోజు సాయంత్రం ఒక గంటపాటు కాంపౌండరుగా శిక్షణ పొందారు గాంధీజీ. అందులో గాంధీజీ నైపుణ్యం అమోఘం! గాంధీజీ పిలుపు, సూచనమేరకు దేశవ్యాప్తంగా ఆరోగ్య యాత్రలు చేసిన ఆయుర్వేద నిపుణులు ఆచంట లక్ష్మీపతి; ‘జన్మభూమి’ ఆంగ్ల వారపత్రికను నిర్వహించడంతో పాటు గాంధీజీకి కుడిభుజంగా మారిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంతో గొప్ప సేవ చేసిన బ్రహ్మ జ్యోస్యుల సుబ్రహ్మణ్యం.. ఇలా ఇంకా ఎంతో మంది డాక్టర్లు మనకు స్వాతంత్య్రోద్యమంలో తారసపడతారు. వైద్య మహాత్ముడు ‘డాక్టర్స్ డే’గా జూలై 1 న గుర్తు చేసుకోవల్సిన డాక్టరు బి.సి.రాయ్! రాయ్ గాంధీజీకి వ్యక్తిగత డాక్టరు, తర్వాతి దశలో డా. సుశీలా నయ్యర్ను గాంధీజీకి పరిచయం చేసింది కూడా ఆయనే! గాంధీజీ సూచన మేరకు 1948 జనవరి 23న బిసి రాయ్ బెంగాల్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యి, 14 సంవత్సరాలు గొప్ప సేవలందించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రారంభం కావడానికి ఆయనే కారణం. మన దేశంలో వైద్య విద్యను మలచిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ ఆయన ఆలోచనే. జీవితాంతం బ్రహ్మచారిగా సాగిన బిసి రాయ్ మరణానంతరం తన ఇల్లును తల్లి పేరున ఆస్పత్రి నడుపుకునేలా చర్యలు తీసుకున్నారు. పేదరికంలో పెరిగిన రాయ్ వైద్య విద్య చదువుకున్నప్పుడు బెంగాల్ విభజన ప్రకటించారు. లాలా లజపతిరాయ్, అరవింద్ ఘోష్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి వారి స్వాతంత్య్ర పోరాటాలు ఆయన్ని ఆకర్షించాయి. శారీరకంగా, మానసికంగా దేశం బాగా ఉన్నప్పుడే స్వరాజ్యం స్థిరమని భావించి వైద్యవిద్యను పూర్తి చేశారు. – డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: ధీరుడు గౌడప్ప.. ధీశాలి చెన్నమ్మ) -
చైతన్య భారతి: అంతరిక్ష బాలకుడు... విక్రమ్ సారాభాయ్
అహ్మదాబాద్లో సంపన్నులు, జౌళి పారిశ్రామిక వేత్తలు, జైనులు అయిన సారాభాయ్ల కుటుంబం మహాత్మాగాంధీకి సన్నిహితమైనది. విక్రమ్ సోదరి మృదుల స్వాతంత్య్ర సమరంలో పొల్గొని అనేక పర్యాయాలు జైలుకి వెళ్లారు. వారి కుటుంబానికి చెందిన 21 ఎకరాల స్థలంలోప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న ప్రయోగాత్మక పాఠశాలలో విక్రమ్కి, ఆయన ఏడుగురు తోబుట్టువులకు ప్రాథమిక విద్య చెప్పించారు. రవీంద్రనాథ్ టాగూర్, జవహర్లాల్ నెహ్రూ, రుక్మిణీదేవి అరండేల్ వంటి విశిష్ట సందర్శకులతో పరిచయాలను కూడా కల్పించేవారు. సుమారు పదకొండేళ్ల వయసులో విక్రమ్ సారాభాయ్కి ఇష్టమైన హాబీ.. వేగంగా సైకిల్ తొక్కుతూ, చేతులను ఛాతీ మీద పెట్టుకుని, కాళ్లను హ్యాండిల్బార్ మీద పెట్టి, సూటిగా ఉన్న రహదారి మీద కళ్లు మూసుకుని, సైకిల్ ఎంత దూరం పోతుందో అంత దూరమూ పోనివ్వడం! పనివారు ఆయన్ని వెంటబడి, అలా చేయవద్దని బతిమాలుతూ ఉండేవారు. తరువాతి జీవితకాలంలో 80 కి పైగా శాస్త్రీయ పరిశోధన పత్రాలను సమర్పించి, దాదాపు 40 సంస్థలను స్థాపించి, భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, 1960లలో అణు కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఘనుడు కూడా ఆయనే.స విక్రమ్ బెంగళూరుకు వెళ్లి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ వద్ద భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. తరువాత కాలంలో భారత అణు విద్యుత్ కార్యక్రమాన్ని నెలకొల్పిన హోమీ భాభాతో అక్కడే విక్రమ్కి స్నేహం ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విక్రమ్ సారాభాయ్ ఫిజికల్ రిసెర్చ్ లేబొరేటరీని, భారతదేశపు మొట్టమొదటి జౌళి పరిశోధనా సహకార సంఘమైన అహ్మదాబాద్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ రిసెర్చ్ అసోసియేషన్ (ఎ.టి.ఐ.ఆర్.ఎ) ని; దేశంలో మొదటి మార్కెటింగ్ పరిశోధనా సంస్థ అయిన ఆపరేషన్స్ రిసెర్చ్ గ్రూపు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) మొదలుగా ఎన్నెన్నో సంస్థలను స్థాపించారు. 1960లలో అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటానికి ఆలంబనగా నిలచిన అంతరిక్ష కార్యక్రమాన్ని ఒక బడుగు దేశమైన భారతదేశం చేపట్టడం బొత్తిగా అనూహ్యం. కానీ దానిని సుసాధ్యం చేయడమే కాక, కమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాలు, ఖనిజ నిక్షేపాలను కనుగొనడం వంటి శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్దేశించడం శాస్త్రవేత్తగా ఆయనలోని ప్రగతిశీలతను చాటుతుంది. ఉపగ్రహ బోధనా టెలివిజన్ ప్రయోగంలో ఆయన 1975–76లో నాసా ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని 2,400 నిరుపేద గ్రామాలకు పాఠాలను ప్రసారం చేశారు. చిరునవ్వు వీడని ముఖంతో రోజుకు 18 నుంచి 20 గంటల సేపు ఆయన పని చేసేవారు. 1971 డిసెంబర్ 30 వ తేదీన కేవలం 52 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. – అమృతా షా, సారాభాయ్ జీవిత చరిత్ర రచయిత్రి (చదవండి: మహోజ్వల భారతి: చాణక్య నరసింహ) -
మహోజ్వల భారతి: చర్చిలో నామకరణం మసీదులో అక్షరాభ్యాసం బ్రిటిష్ వేషం, భాష అతడే..
మైఖేల్ మధుసూదన్ దత్ 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత. 1824లో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని జెస్సోర్ సమీపములోని సాగర్దారి గ్రామంలో జన్మించారు. బెంగాలీ నాటకరంగ ఆద్యులలో ఒకరు. ఈయన ప్రసిద్ధ కృతి ‘మేఘ్నాథ్ బద్ద్ కావ్య’.. విషాదభరిత కావ్యం బెంగాలీ సాహిత్యంలో అద్వితీయమైనది. జీవితంలోని బాధలు, ప్రేమల గురించి ఈయన స్త్రీ గొంతుకతో కూడా అనేక కవితలు రాశారు. బాల్యంనుండే మధుసూదన్ ఆచార వ్యవహారాలలో ఆంగ్లేయుల్లా ఉండాలని ఉవ్విళ్లూరేవారు. హిందూ జమిందారీ కుటుంబంలో పుట్టిన మధుసూదన్, తన కుటుంబం అభీష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించి మైఖేల్ అనే పేరు పెట్టుకున్నారు. అనంతరకాలంలో తన ఆంగ్లేయ, పాశ్చాత్య మోజుకు పశ్చాత్తాపపడి తన మాతృభూమి ఉద్యమాలకు మద్దతునిచ్చారు. ఆ దశలో ఈయన రాసిన కవితలు, గేయాలలో ఆ పశ్చాత్తాపం ప్రతిఫలించింది. మధుసూదన్ దత్ను బెంగాలీ సాహిత్యపు గొప్ప కవులలో ఒకరిగా మాత్రమే కాక, బెంగాలీ సానెట్ పితగా కూడా పరిగణిస్తారు. మధుసూదన్ దత్ విద్యాభ్యాసం షేక్పూరా గ్రామంలోని పాతమసీదులో పర్షియన్ నేర్చుకోవడంతో ప్రారంభమైంది. అసమానమైన ప్రతిభ, బుద్ధి కలిగిన విద్యార్థిగా చిన్నతనం నుండే ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించారు. బాల్యంలో ఇంటి దగ్గర, కలకత్తాలో ఆంగ్ల విద్య, ఐరోపా సాహిత్యంతో పరిచయమేర్పడటం వల్ల దత్ను ఆంగ్లేయుల అలవాట్లు, ఆచార వ్యవహరాలు, పద్ధతులు, ఆలోచనా ధోరణి ఆ దారిలో నడిచేలా చేశాయి. దత్ జీవితంలో అలాంటి తొలి ప్రభావానికి హిందూ కళాశాలలో ఆయన గురువు కెప్టేన్ డి.ఎల్.రిచర్డ్సన్ కూడా ఒక కారణం. మేఘ్నాథ్ బద్ధ్ కావ్యంతో పాటు, ఆయన ఇతర రచనల్లోని తిలోత్తమ, రత్నావళి కూడా ప్రఖ్యాతిగాంచాయి. నేడు దత్ వర్ధంతి. 1873 జూన్ 29న ఆయన కలకత్తాలో మరణించారు. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ఈయన సంతతి వారే అని చెబుతారు. (చదవండి: మహోజ్వల భారతి: చాణక్య నరసింహ) -
మహోజ్వల భారతి: చాణక్య నరసింహ
భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పని చేసిన పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి నేడు (జూన్ 28). న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత. ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాది నేత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించగలిగారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. పూర్వపు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు. 1938 లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. అనంతరం ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్.ఎల్.బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో అనేక వ్యాసాలు రాశారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. తన ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఏడాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 1921లో జన్మించిన పీపీ 2004లో తన 88 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్ 23 న కన్నుమూశారు. (చదవండి: మహోజ్వల భారతి: ఐదు యుద్ధాల వీరుడు) -
చైతన్య భారతి: కింగ్ మేకర్
ఆయన మంచి మిత్రుడు. కానీ ప్రమాదకరమైన ప్రత్యర్థి. ఆయన చరిత్రను సృష్టించారు. కానీ అదంతా కీర్తించదగినదే కానవసరం లేదు. ఆయన పత్రికా స్వాతంత్య్రాన్ని గట్టిగా సమర్థించుకున్న వ్యక్తిగా గుర్తుండిపోతారు. నియంత్రణలు, ఆంక్షల ద్వారా దాని ఆత్మ నిర్భరత, స్వాతంత్య్రాలను దెబ్బతీయడానికి పన్నే ఎటువంటి కుతంత్రాల పైన అయినా ఆయన ఎదురొడ్డి పోరాడేవారు. అత్యవసర స్థితి (1975)ని వ్యతిరేకించడంలో అది శిఖర ప్రాయంగా కనిపించింది. సమస్యలను కొని తెచ్చుకోవడం ఆయన లక్ష్యం కాదు. కానీ తన ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తూ ఉన్నా, లేదా తనను వ్యతిరేకిస్తున్నా తన సర్వ శక్తులనూ ఒడ్డి ప్రత్యర్థులపై పోరాడటం ఆయన స్వభావం. ఆయన అకుంఠిత జాతీయవాది. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తనకు తానుగా కాంగ్రెస్కి క్వార్టర్ మార్షల్ జనరల్గా పని చేశారు. అంటే.. సైన్యంలో సరకులను సరఫరా చేసే వ్యక్తిగా! క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆజ్ఞాతవాసంలో ఉన్న విప్లవ ఉద్యమకారులకు ఆయన పేలుడు పదార్థాలు సరఫరా చేశారు. దేశ విదేశాలలో పంపిణీ చేసేందుకు, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్దేశించిన సాహిత్యాన్ని ముద్రించారు. ఆయన ప్రభుత్వంలో ఎన్నడూ లేరు. కానీ, ఆయనకున్న గణనీయమైన రాజకీయ సంబంధాల కారణంగా ఆయన ఒకరకమైన కింగ్మేకర్గా వ్యవహరించారు. కాంగ్రెస్ కార్యకర్తగా, స్వాతంత్య్రోద్యమ సేవకుడిగా అవి ఆయన తన చిన్నతనం నుంచి నిర్మించుకున్న సంబంధాలు. సమాచార సాధనాలు లేనిదే కాంగ్రెస్ సందేశం సామాన్య జనాలకు చేరడం కష్టమని ఆయన చాలా వేగంగా గ్రహించారు. అందుకు తగ్గట్లుగా ఆయన జాతీయతావాద బాకాను నిర్మించడాన్నే తన వ్యాపారంగా చేసుకున్నారు. ఫలితంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు ఎనిమిది భాషల్లో దేశవ్యాప్తంగా అనేక ఎడిషన్లను కలిగినదిగా వృద్ధి చెందింది. కాంగ్రెస్ 1969లో చీలిపోయిన తరువాత, ఆయన ఆ పార్టీకి దూరంగా జరిగారు. ఆయన ఆ తరువాత జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన బిహార్ ఉద్యమాన్ని బలపరిచారు. ఆర్థికంగా ఆదుకున్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ మొత్తం అధికార యంత్రాంగాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఉసిగొల్పినప్పటికీ ఆయన ఏ మాత్రం లొంగలేదు. ఆనాటి గోయెంకా అసామాన్య పోరాట పటిమ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆయనను మనం ప్రేమించవచ్చు. లేదా ద్వేషించవచ్చు. అభిమానించవచ్చు లేదా అయనను చూసి భయపడవచ్చు. కానీ రామ్నాథ్ గోయెంకా గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉండలేం. అంతేకాదు స్వర్గీయ బి. జి. వర్ఘీస్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు 1982–1986 మధ్య ఎడిటర్.ఽ (చదవండి: చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి) -
మహోజ్వల భారతి: బంకిమ్ని బయటే నిలబెట్టేశారు!
బంకిమ్ చంద్ర చటర్జీ మిడ్నాపూర్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ పాఠశాలలో ఉన్నప్పుడే ఆయన తన తొలి కవిత రాశారు. అక్కడ ఎఫ్.టీడ్ అనే ఉపాధ్యాయుడు బంకిమ్బాబును బాగా అభిమానించేవాడు. కారణం, చిన్నతనంలోనే బంకిమ్బాబు చదువులో చూపిన చురుకుదనం. టీడ్కు, జిల్లా మేజిస్ట్రేట్ మాలెట్కు మంచి పరిచయం ఉండేది. ఓసారి పిల్లలతో పాటు, బంకిమ్బాబును కూడా మాలెట్ ఇంటికి తీసుకెళ్లాడు టీడ్. కొంతసేపు గడిచిన తర్వాత ఆంగ్లేయుడైన టీడ్, తన పిల్లలను మాత్రం మాలెట్ తేనీటి కోసం లోపలికి పిలిచాడు. బంకిమ్బాబును పట్టించుకోలేదు. అది సహజంగానే బంకిమ్బాబును బాధించింది. అదే సమయంలో ఇంగ్లిష్వాళ్ల మనస్తత్వం ఏమిటో ఆ వయసులోనే అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఆ సంఘటన కల్పించింది. బంకిమ్బాబు చదువు ప్రశాంతంగా సాగలేదు. అప్పుడే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఎగసింది. అలాగే ఆ రోజుల్లో అంతగా ఇంగ్లిష్ చదువుకున్నా కూడా ఆయన జీవితం నల్లేరు మీద బండిలా సాగలేదు. కంపెనీ పాలనలో గానీ, ఆ తరువాత రాణి పాలనలో గానీ ఎంత పెద్ద చదువు చదివినా అది ఇంగ్లిష్ చదువే అయినా, ఇంగ్లిష్ వారు భారతీయుల పట్ల వ్యవహరించే తీరు ఆయకు నచ్చేది కాదు. ఉద్యోగిగా సంకెళ్ల మధ్య ఉన్నప్పటికీ ఆయన తన ప్రవృత్తిని మాత్రం స్వేచ్ఛగా ఉండనిచ్చారనిపిస్తుంది. ఉద్యోగం, సామాజిక పరిస్థితుల నుంచి సృజనాత్మ కతను రక్షించుకున్నారనిపిస్తుంది. ఫలితమే ‘అనందమఠ్ వంటి మహోన్నత రచన. అందులోనిదే వందేమాతర గీతం. నేడు (జూన్ 26) బంకిమ్ చంద్ర చటర్జీ జయంతి. ఆయన 1838 లో వంగభూమిలోని కాంతల్ పడా (ఇరవైనాలుగు పరగణాల జిల్లా) లో జన్మించారు. తండ్రి యాదవ్చంద్ర, తల్లి దుర్గాదేవి. (చదవండి: స్వతంత్ర భారతి... భారత్–పాక్ యుద్ధం) -
Dadabhai Naoroji: భరతజాతి హితామహుడు
లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలేలను గాంధీజీ గురుతుల్యులుగా భావించేవారు. అంతటి గురుతుల్యులకే గురుపాదుడుగా సంభావించిన మేధావి దాదాభాయ్ నౌరోజీ! ఏమిటి ఆయనలోని ప్రత్యేకత? విజ్ఞతా, మరేదైనా విలక్షణతా? ‘‘పిల్లలు తమ తండ్రి వైపు ఆశగా చూసినట్లుగా భారతీయులు మీ వంక చూస్తున్నారు; అదీ ఇక్కడ నెలకొని వున్న మనోభావ’’మన్నారట గాంధీజీ, దాదాభాయ్ నౌరోజీకి ఓ లేఖ రాస్తూ. లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలను గాంధీజీ గురుతుల్యులుగా భావించేవారని మనకు తెలుసు. వారిద్దరూ గురుపాదుడుగా సంభావించిన మేధావి దాదాభాయ్ నౌరోజీ! ‘‘ఘనమైన భారతీయ వృద్ధుడు’’గానూ, ‘‘అనధికార భారతీయ రాయబారి’’గానూ ఖండఖండాంతరాల్లో ప్రసిద్ధుడయ్యాడు నౌరోజీ. అల్పసంఖ్యాక వర్గమయిన పార్సీ (జొరాస్ట్రియన్) మతానికి చెందిన నౌరోజీ, విశాల విస్తృత జాతీయ ప్రయోజనాలను తీర్చగల రాజకీయ వేదిక రూపుదిద్దుకోవడానికీ, అనేక అంతర్జాతీయ వేదికలపై భారత జాతీయ ప్రయోజనాలను ధ్వనింపచెయ్యడానికీ కారకులు కావడం ఓ విశేషం. ప్రపంచం గుర్తించిన గొప్ప వక్తల్లో నౌరోజీ ఒకరు. అరుదైన వ్యక్తిత్వం! చారిత్రక నేపథ్యంలో భారతదేశ స్థితిగతులను విశ్లేషిస్తూ బ్రిటిష్ పార్లమెంటుతో సహా ఎన్నో వేదికలపై ప్రసంగించినవాడు. ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలను సవిమర్శకంగా వివరించి, స్వతంత్రంగా కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించినవాడు. ఐరిష్ హోంరూల్ ఉద్యమం లాంటి అంతర్జాతీయ స్వభావం కలిగిన ప్రాంతీయ ఉద్యమాలను గుర్తించి వాటికి మద్దతు ప్రకటించినవాడు. ఫ్రీమ్యాసన్ తత్వం మొదలుకుని పత్రికా నిర్వహణలో విలువల వరకూ ప్రతి ఒక్క ప్రమాణాన్నీ నిష్టగా పాటించినవాడు. చదువుకున్నది గణితం–తత్వశాస్త్రం అయినప్పటికీ, బ్రిటిష్ విద్యార్థులకు గుజరాతీ భాషాసాహిత్యాలను బోధించేందుకు వెనకాడనివాడు. కేవలం మూడు సంవత్సరాలే బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడిగా వున్నప్పటికీ, ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించిన ‘పెద్దమనిషి’ దాదాభాయ్ నౌరోజీ. ఇవి ఆయన వ్యక్తిత్వంలో ప్ర«ధానమైన లక్షణాలు మాత్రమే! ఆర్థిక జాతీయవాది! ఆర్థిక జాతీయవాదాన్నీ, రాజకీయ జాతీయవాదాన్నీ పొందికగా మేళవించినవాడిగా దాదాభాయ్ నౌరోజీని లోకం ప్రశంసించింది. స్వయంగా పత్తి వర్తకుడయిన నౌరోజీ, వర్తకవాణిజ్య వర్గాల ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం సహజం. పందొమ్మిదో శతాబ్దిలోనే షేర్ మార్కెట్ మర్మాలు తెలుసుకుని అందుకు తగిన రీతిలో తమ వాణిజ్య నైపుణ్యాన్ని దిద్దితీర్చుకున్న పార్సీ వర్తకులు కొందరున్నారు. కామాలూ, టాటాలూ, మెహ్తాలూ, గోద్రెజ్లూ, వాడియాలూ అప్పుడూ ఇప్పుడూ కూడా పెద్ద ఎత్తున జాతీయ–అంతర్జాతీయ మార్కెట్లలో ప్రముఖ పాత్ర వహించారు. పత్తి – ఇనుము – ఉక్కు మొదలుకుని ఐటీ వరకూ వాళ్ళు ప్రభావితం చెయ్యని వర్తక వాణిజ్య పరిశ్రమలు లేవంటే అతిశయోక్తి కాదు. అయితే వాళ్ళకీ, నౌరోజీకీ ఓ ప్రధానమయిన తేడా వుంది! జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఏయే శక్తు్తలు ఏ పాత్ర వహిస్తున్నాయో వాళ్ళలో ఎవ్వరూ విశ్లేషించి సిద్ధాంతీకరించలేదు! దాదాభాయ్ నౌరోజీ ఒక్కరే ఆ పని చేశారు! అలా చెయ్యడంలో ఇమిడివున్న ప్రమాదాన్ని మనం నౌరోజీకి వివరించాల్సిన అవసరం లేదు. పార్సీలకు వాణిజ్య ప్రయోజనాలను ఇతరులు నేర్పాల్సిన పని లేదు కదా! ఇక్కడే, నౌరోజీ వ్యక్తిత్వంలోని విశేషాంశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భారతీయ పెట్టుబడిదారుల వర్గ ప్రయోజనంతో పాటు, పరాధీనమయివున్న భారత జాతి ప్రయోజనాల గురించి కూడా పట్టించుకోవడమే నౌరోజీ వ్యక్తిత్వంలోని విశేషాంశ. నౌరోజీ, ఓ చరిత్రాత్మ! తన సొంత వాణిజ్య ప్రయోజనాన్ని మించిన వర్గ ప్రయోజనాన్ని, జాతీయ ప్రయోజనాన్ని గుర్తించి, అందుకు తగిన రీతిలో స్పందించడంతో దాదాభాయ్ నౌరోజీ ఆగిపోలేదు! బ్రిటిష్ వలసవాదం నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారాయన. భారతీయులు బ్రిటిష్ సర్కారుకు కట్టే పన్నులను నౌరోజీ ‘కప్పం’గా అభివర్ణించేవారు. నిరుపేద భారతీయులు నిష్కారణంగా బ్రిటిష్ సర్కారుకు ‘కప్పం’ కడుతున్నారనీ, పాలితుల ప్రయోజనాల పట్ల బ్రిటిష్ సర్కారుకు కనీసమైన లక్ష్యం కూడా లేదనీ రాజకీయ విమర్శలు గుప్పించి ఊరుకోలేదు నౌరోజీ. తన ఆరోపణలు రుజువు చేసే క్రమంలో లోతయిన విశ్లేషణతో కూడిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేంత వరకూ నౌరోజీ విశ్రమించలేదు. – మందలపర్తి కిషోర్ (చదవండి: లక్ష్యం ఒక్కటే దారులు వేరు) -
రాణి దుర్గావతి వీర మరణం
రాణి దుర్గావతి 1505–1564 మధ్య గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించారు. ధైర్య సాహసాలకు మారుపేరుగా ఆమెను చరిత్రకారులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బందాలో 1524లో ఆమె జన్మించారు. రాజ్యంపైకి దండెత్తి వచ్చిన మొఘల్ సేనలతో హోరాహోరీగా పోరాడి ఆ యుద్ధంలోనే ఆమె వీరమరణం పొందారు. నేడు (జూన్ 24) రాణి దుర్గావతి కన్నుమూసిన రోజు. -
మహోజ్వల భారతి: బొబ్బిలిపై గెలిచారు!
వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణంలోని వరాహగిరి వెంకట జోగయ్య, సుభద్రమ్మ దంపతులకు ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో 1894 ఆగస్టు 10 న జన్మించారు. తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్లారు. వి.వి.గిరి 1913లో డబ్లిన్లోని యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. కానీ ఐర్లండ్ లో సీన్ఫెన్ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆ ఉద్యమకాలంలోనే ఆయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ తదితర రాజకీయ ప్రముఖులతో సన్నిహితం ఏర్పడింది. భారతదేశం తిరిగివచ్చిన తర్వాత ఇక్కడి కార్మిక ఉద్యమాలలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యారు. రెండుసార్లు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు. 1969లో భారత రాష్ట్రపతి అయ్యేవరకు.. ఉపరాష్ట్రపతిగా, మైసూరు రాష్ట్ర గవర్నరుగా; కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్గా, మద్రాసు ప్రెసిడెన్సీలో కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆ పదవులకు వన్నె తెచ్చారు. 1980 జూన్ 24న 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. (చదవండి: చైతన్య భారతి: అనితా దేశాయి ) -
శతమానం భారతి: కార్మిక వర్గం
భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్ పాలనకు నిరసనగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరురోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్ కమ్యూన్ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్ సెషన్లోకి దూసుకెళ్లడం పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్ సభ, వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యాచరణలు.. యునైటెడ్ ప్రావెన్స్లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. 1946లో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటుకు ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు బ్రిటిష్ రాజ్కి చివరి సమాధి రాయిగా మారింది. ఈ కాలంలోనే, దేశంలో మొట్టమొదటి కార్మిక వర్గ సమాఖ్య అయిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు బలమైన రాజకీయ మద్దతు లభించింది. లాలా లజపతి రాయ్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సరోజిని నాయుడు వరకు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. మరోవైపున 1944లో ‘ఎ బ్రీఫ్ మెమొరాండమ్ అవుట్లైనింగ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా’ (బాంబే ప్లాన్ గా సుప్రసిద్ధమైంది) ప్రచురితమైంది. పూచీ తీసుకునే ప్రభుత్వం, ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యత ఉండే ఆర్థిక వ్యవస్థను బాంబే ప్లాన్ ప్రబోధించింది. ఆ భావన సాకారమయ్యేలా వచ్చే ఇరవై ఐదేళ్లలో ఆచరణీయతకు భారత్ సంకల్పం పెట్టుకుంది. (చదవండి: చైతన్య భారతి: అణుశక్తిమాన్) -
ఏడైతే దడ! నిజాంకు వ్యతిరేకంగా మూడు భాషల్లో వార్తలు
స్వాతంత్య్ర సమరం గురించి గానీ, ప్రజల ఇక్కట్ల గురించి గానీ బ్రిటీషు ప్రభుత్వం నిర్వహించే రేడియో కేంద్రాలలో ప్రసారాలు ఉండేవి కావు. కనుకనే ఆజాద్ హింద్ రేడియో, ఆజాద్ రేడియో వంటివి అవసరమయ్యాయి. ఇలా చరిత్రలో తళుక్కుమన్న ప్రజా రేడియో కేంద్రాలు.. భాగ్యనగర్ రేడియో, ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ రేడియో ప్రసార పటిమ గురించి నిన్నటి సంచికలో తెలుసుకున్నాం. ఇక భాగ్యనగర్ రేడియో! నైజాం పాలనకు వ్యతిరేకంగా, హైదరాబాద్ సంస్థానం సరిహద్దులో ఉండే కర్నూలు నుంచి నడిచింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రసారాలు చేసిన ఘన చరిత్ర ‘భాగ్యనగర్ రేడియో’ కు దక్కుతుంది. ‘భాగ్యనగర్’ కీర్తి బావుటా వెల్దుర్తి మాణిక్యరావు తన పుస్తకం ‘హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం’లో ఇలా పేర్కొన్నారు : ‘‘భాగ్యనగర్ రేడియో ప్రసారాల వల్ల హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్ర సమరానికి అనేక ప్రయోజనాలు కలిగాయి. మొదటి స్టేట్ కాంగ్రెస్ నాయకత్వాన జరుగుతున్న విముక్తి ఉద్యమం గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయగలిగారు. రజాకార్లు, మజ్లీసువారు, ముస్లిం కాందిశీకులు, మతోన్మాదులైన నిజాం పోలీసులు, సైనికులు సంస్థానంలో ప్రజల పై జరిపే అత్యాచారాలను, దుండగాలను, దోపిడీలను, దురంతాలను బట్టబయలు చేసి వారి నిజస్వరూపాల్ని బహిర్గతం చేసే వీలు కలిగింది. సంస్థానంలో ఎటువంటి రాక్షసత్వం స్వైరవిహారం చేస్తూ ఉన్నదో అందరూ తెలుసుకోగలిగారు. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు నిజాం దుష్టశక్తులను ఎలా ఎదుర్కొంటున్నారో ప్రజలు తెలుసుకోవడానికీ, వారికి ధైర్యం, మనో నిబ్బరం కలిగించడానికి ఈ రేడియో కేంద్రం ఎంతగానో ఉపకరించింది.’’ అదీ భాగ్యనగర్ రేడియో కీర్తి బావుటా! ఈ రేడియో వెనుక భాసించే సాహసి పాగా పుల్లారెడ్డి (1919 మే 10– 2010 అక్టోబర్ 20). గద్వాల ప్రాంతం మనోపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో జన్మించిన పుల్లారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో చదువుకున్నారు. 1947–48 కాలంలో హైదరాబాదు సంస్థానం విముక్తం కావడానికి చేపట్టిన ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. రెడ్డిగారు – రేడియో గద్వాల పురపాలక సంఘం ఛైర్మన్ (1968)గా, గద్వాల శాసన సభ్యులు (1972)గా సేవలందించిన పుల్లారెడ్డి తొలుత 1952లో గద్వాల – అలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. హైదరాబాదు, ఆంధ్రరాష్ట్రాల విలీనం సమయంలో కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును పాగా పుల్లారెడ్డి సూచించగా బూర్గుల రామకృష్ణారావు బలపర్చారు. మరి భాగ్యనగర్ రేడియోకు, పాగా పుల్లారెడ్డికి అనుబంధం ఏమిటి? దీనికి సంబంధించిన కొంత సమాచారం.. గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ ‘శతపత్రము’లో ‘స్టేట్ కాంగ్రెస్ పునరుద్ధరణ – నిజాం విముక్తి పోరాటం’ అనే అధ్యాయంలో కనబడుతుంది. అన్ని సంస్థానాలు భారత దేశంలో చేరిపోగా ఒక నిజాం నవాబు మాత్రం తాను స్వతంత్రంగా ఉంటానని 1947 జూన్ నెలలో ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే స్టేట్ కాంగ్రెస్ ప్రథమ మహాసభ హైదరాబాదులో జరిగింది. దీని తర్వాత జూన్ నెల చివరలో షోలాపూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో.. హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో జరపాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, మరాట్వాడా ప్రాంతీయ సమితులు సంస్థానం బయట సరిహద్దులలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. పాగా పుల్లారెడ్డిని కర్నూలుకు, టి. హయగ్రీవాచారిని బెజవాడకు సర్వాధికారులుగా నియమించి సర్దార్ జమలాపురం కేశవరావు జైలుకు పోయారు. ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటికలపాడు, ఉండవెల్లి గ్రామాలలో ఎవరెవరు సత్యాగ్రహం చేస్తారో వివరాలను గడియారం రామకృష్ణ శర్మ ముందుగానే అలంపూరు పోలీసు స్టేషన్కు అందించారు. పాగా పుల్లారెడ్డి నేతృత్వంలో ఉద్యమ కార్యక్రమాలు పెద్ద స్థాయిలో కర్నూలులో విజయవంతంగా జరిగాయి. ఆ సమయంలోనే బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన రేడియో ట్రాన్స్మీటర్ ను ‘లోకనాయక్’ జయప్రకాష్ నారాయణ్ ద్వారా వనపర్తి రాజారామేశ్వరరావు బొంబాయి నుంచి తెప్పించి పాగా పుల్లారెడ్డి కార్యాలయానికి ఇచ్చారు. రోజూ సాయంత్రం 7 గంటలకు ఈ ట్రాన్స్మీటర్ దక్కన్ రేడియో కంటే శక్తివంతమైనది. ఫలితంగా ‘భాగ్యనగర్ రేడియో’ ప్రసారాలు విజయవాడ, మద్రాసుకు కూడా వినబడేవి. కర్నూలులో స్టేట్ కాంగ్రెస్ కార్యాలయం పక్కన ఉండే పల్లెపాడు జాగీర్దారు చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ట్రాన్స్మీటర్ ను రహస్యంగా ఉంచారు. చంద్రశేఖర్ రెడ్డి కుమారులు జనార్దన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ట్రాన్స్మీటర్ ను ఇంట్లో ఉంచుకోవడమే కాక, దాన్ని చక్కగా నడిపించేవారు. ఈ రేడియో ప్రసారాలు ఏరోజు మొదలు అయ్యాయో సమాచారం ప్రస్తుతం లభ్యం లేదు గానీ ప్రసారాలు ప్రతిరోజూ సా. 7 గంటల నుంచి 8 గం. దాకా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో నడిచేవి. మొదట అరగంటలో మూడు భాషల్లో వార్తలు, తర్వాత మూడు భాషలలో ప్రసంగా లుండేవి. వార్తా బులెటిన్ల ప్రచురణ, రేడియో ప్రసార బాధ్యతలు గడియారం రామకృష్ణ శర్మకు అప్పగించారు. గొట్టుముక్కల కృష్ణమూర్తి సహాయకులు. ఉర్దూ ప్రసారాల బాధ్యతను వకీలు నాగప్ప చూసేవారు. దక్కన్ రేడియోలో కురుగంటి సీతారామయ్య కాంగ్రెస్నూ, స్వాతంత్య్రోద్యమాన్ని అవహేళన చేస్తూ ప్రసంగాలు చేస్తుండేవారు. వీటిని ఖండిస్తూ, నిజాం ప్రభుత్వ దురాగతాలను హాస్యధోరణిలో విమర్శిస్తూ ప్రసంగాలు, వార్తలు రూపొందించేవారని గడియారం రామకృష్ణ శర్మ ‘శతపత్రము’లో వివరించారు. వనపర్తి రాజా, పాగా పుల్లారెడ్డి మధ్య అభిప్రాయ విభేదాలు రావడంతో రేడియో ట్రాన్స్ మీటర్ తిరిగి ఇచ్చేయమని రాజారామేశ్వరరావు నిర్బంధం చేయడంతో వెనక్కి ఇచ్చేశారు. 1948 జనవరి 30 న గాంధీజీ కన్నుమూశారనే పెనువిషాద వార్తను చివరిసారిగా ప్రసారం చేసి భాగ్యనగర్ రేడియో చరిత్ర పుటల్లో కలిసిపోయింది! – డా. నాగసూరి వేణుగోపాల్ (చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు) -
మహోజ్వల భారతి అధికారమంతా భారతీయులకే
భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సుభాస్ చంద్రబోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన రోజు ఇది (జూన్ 22). ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలో ఈ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా తిరిగి దానిని స్థాపించారు. పార్టీకి నేడు ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికి ఉంది. పార్టీ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేబబ్రత బిశ్వాస్. స్వాతంత్య్రినంతర కాలంలో, శరత్ చంద్రబోసు (సుభాష్ చంద్రబోసు సోదరుడు), చిత్త బసులు పార్టీ నాయకులుగా ప్రఖ్యాతి గాంచారు. గాంధీజీతో విభేదాలు వచ్చిన సుభాస్ చంద్రబోస్ 1939 ఏప్రిల్ 29న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం కలకత్తాలో నిర్వహించిన ర్యాలీలో ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటును బహిరంగంగా ప్రకటించారు. పార్టీలో చేరాక ఎవరూ కూడా ఎన్నటికీ బ్రిటిషు వారి వైపు తిరగాల్సిన అవసరం ఉండదని, వారి రక్తంతో సంతకం చేసి, ప్రతిజ్ఞ ఫారమ్ను పూర్తి చెయ్యాలని బోసు ఆ సందర్భంగా ఆదేశించారు. ముందుగా పదిహేడు మంది యువతులు వచ్చి ప్రతిజ్ఞా పత్రంలో సంతకం చేశారు. ప్రారంభంలో ఫార్వర్డ్ బ్లాక్ లక్ష్యం కాంగ్రెస్లోని అన్ని వామపక్ష విభాగాలను సమీకరించడం, కాంగ్రెస్ లోపల ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం. బోసు ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడయ్యారు. జూన్ చివరిలో బొంబాయిలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రాథమిక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని, కార్యక్రమాన్నీ ఆమోదిం చారు. జూలైలో సుభాష్ చంద్రబోసు ఫార్వర్డ్ బ్లాక్ కమిటీని ప్రకటించారు. కమిటీ అధ్యక్షులుగా సుభాష్ చంద్రబోసు, ఉపాధ్యక్షులుగా పంజాబ్కు చెందిన ఎస్ఎస్ కవిషర్, ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీకి చెందిన లాల్ శంకర్ లాల్, కార్యదర్శులు గా బొంబాయికి చెందిన విశ్వంభర్ దయాళు త్రిపాఠి, ఖుర్షీద్ నారిమన్లు ఎంపికయ్యారు. ఇతర ప్రముఖ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మద్దూరి అన్నపూర్ణయ్య, బొంబాయికి చెందిన సేనాపతి బాపట్, హరి విష్ణు కమ్నాథ్, తమిళనాడుకు చెందిన పసుంపన్ యు.ముత్తురామలింగం తేవర్, బీహార్ నుండి షీల్ భద్ర యాగీ ఉన్నారు. పార్టీ బెంగాల్ ప్రావిన్సు కార్యదర్శిగా సత్య రంజన్ బక్షి నియమితుడయ్యాడు. బోసు తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు కూడగడుతూ దేశవ్యాప్తంగా పర్యటించారు. మరుసటి సంవత్సరం 1940 జూన్ 20–22 న ఫార్వర్డ్ బ్లాక్ తన మొదటి అఖిల భారత సమావేశాన్ని నాగపూర్లో నిర్వహించింది. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ను సామ్యవాద రాజకీయ పార్టీగా ప్రకటించారు. జూన్ 22 ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపక తేదీగా తీసుకున్నారు. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కోసం మిలిటెంట్ చర్యను కోరుతూ ‘అధికారమంతా భారతీయులకే’ అనే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది. (చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు) -
అడవి నుంచి రేడియో బాణాలు
947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం సిద్ధించినా, గోవా వంటి పోర్చుగీసు నియంత్రణ ప్రాంతం ఇంకోవైపు ఉంది. నాలుగు వందల యాభై ఏళ్లకు పైగా గోవా ప్రాంతం పోర్చుగీసు వారి కబంధ హస్తాలలో అతలాకుతలమైంది. అటువంటి చోట విముక్తి పోరాటానికి దన్నుగా ఒక సీక్రెట్ రేడియో కూడా నిలిచింది. అదే.. ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రహస్య రేడియో. అదొక ఉద్యమ చరిత్ర. విముక్తి లభించిన రోజు ఆ రోజు, ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రహస్య రేడియో కేంద్రం సిబ్బంది.. విమానానికి రేడియో ట్రా¯Œ ్సమీటర్ బిగించారు. లౌడ్ స్పీకర్ అమర్చారు. వారంతా ఆ విమానం ఎక్కారు. పూలు చల్లుతూ 450 సంవత్సరాల చరిత్రలో అపురూపమైన వార్తను ప్రకటిస్తూ ఒక రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ఆకాశయానం చేశారు. 1961 డిసెంబరు 19న స్వేచ్ఛ సిద్ధించి గోవా ప్రాంతం స్వతంత్ర భారతంలో కలసిన వేళ.. అలాంటి చారిత్రక సందర్భంలో రహస్య రేడియో కేంద్రం వేదిక కావడం విశేషం. గోవా స్వాతంత్య్రం కోసం మొదలైన ‘ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’.. ఒక అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్. 1955 నవంబరు 25న మొదలైన ఈ రేడియో స్టేషన్ గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజు విజయోత్సవంలో పాల్గొని తన ప్రసారాలు ఆ రోజుతో నిలిపివేసి, విలువైన చరిత్రలో విలక్షణ పుటగా మారిపోయింది! ఆర్థిక నిర్బంధంతో దారికి 1510లో గోవా ప్రాంతం పోర్చుగీసు స్థావరంగా మారిపోయింది. బ్రిటీషువారు భారతదేశపు చాలా భాగాలు ఆక్రమించినా పాండిచ్చెరి ఫ్రెంచి వారి చేతిలోకి వెళ్లిపోయినట్టు.. గోవా, డయ్యు, డమన్ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. గోవాకూ, మిగతా భారతదేశానికి పెద్దగా సంబంధాలు లేకుండా పోయాయి. 1932లో గోవా గవర్నర్ గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. భారత్ పోర్చుగల్ సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల మీద ఆధారపడి బెడిసికొట్టాయి. 1940 వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. 1954లో దాద్రా నగర్ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆలోచనలకు ద్వారాలు తీసింది. 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్ బ్లాకేడ్’ ప్రకటించడంలో గోవా పరిస్థితి ఎలా ఉందంటే బంగాళ దుంపలు (నెదర్లాండ్); వైన్ (పోర్చుగీసు); కూరలు, బియ్యం (పాకిస్తాన్); టీ (శ్రీలంక), సిమెంట్ (జపాన్), ఉక్కు (బెల్జియం నుంచి) దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి తారస్థాయికి వచ్చింది. అనంతర పరిణామమే పోర్చుగీసు నంచి గోవా విముక్తి. అడవి నుంచి ప్రసారాలు! గోవా విముక్తి కోసం అంతకు ఐదేళ్ల ముందు.. 1955 నవంబరు 25న ఉదయం 7 గం.లకు ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే సీక్రెట్ రేడియో గోవా సరిహద్దు రాష్ట్ర ప్రాంతం అంబోలి అడవుల నుంచి మొదలైంది. 1947లో స్వాతంత్య్రం లభించి భారతదేశంలో వీచిన స్వేచ్ఛా పవనాల స్ఫూర్తితో వామన్ సర్దేశాయి, లిబియా లోబో అనేవారు కలసి ఈ సీక్రెట్ రేడియో సర్వీసును పోర్చుగీసు, కొంకణి భాషల కార్యక్రమాలతో ప్రారంభించారు. వారిరువురూ గోవా స్వాతంత్య్రం కోసం ప్రారంభించిన ‘ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో స్టేషన్ ట్రాన్స్మీటర్ ను ఒక ట్రక్కుకు బిగించి, దట్టమైన అడవుల నుంచి ప్రసారాలు చేసేవారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు లభించేది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసపాలనకు వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలు కూడా ఇచ్చేవారు. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కలిగించి, ధైర్యం నూరిపోయడానికి వారి వార్తల పరిధిని పెంచారు. వినోభా రేడియో ప్రసంగం ఈ రేడియో ఛానల్ ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక గోవాలో జరిగే పోరాటానికి మద్దతు ఇస్తూ భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న వినోబాభావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్లిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయం పై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోతలకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెంబరులో విలీన కార్యక్రమం మొదలయ్యాక ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతానికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీ నుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్ 1961 డిసెంబరు 15న ఈ సీక్రెట్ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబరు 17 న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటలు వాయు, సముద్ర, భూ తలాలపై కూడా భీకర పోరాటం నడిచింది. తర్వాత డిసెంబరు 19 న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలసిపోయింది. ఆ రోజున... ఈ వ్యాసం మొదట్లో ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంపై వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ రేడియో బృందం గోవా విముక్తి వార్తను ఆకాశమార్గం గుండా ప్రకటించింది. 1955 నవంబరు 25 నుంచి 1961 డిసెంబరు 19 దాకా ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ సీక్రెట్ రేడియోలో వామన్ దేశాయి, లిబియా లోబో జంట తమ బృందంతో అడవులలో పడిన ఇబ్బందులు ఎన్నో, అవి ఏమిటో మనకు తెలియవు. అయితే ఈ ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో ప్రసార కాలంలో వారిరువురూ భార్యాభర్తలుగా మారిపోయారు. ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో ఘన చరిత్ర.. భారత స్వాతంత్య్ర సమరం లోనే కాకుండా, ప్రపంచ రేడియో ప్రసారాల చరిత్రలోనే ఒక అద్భుతమైన, స్ఫూర్తి వంతమైన ఘట్టం! – డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: స్వతంత్ర భారతి 1967/2022) -
మహోజ్వల భారతి: ఆక్స్ఫర్డ్ నుంచి తొలి ముస్లిం
సయ్యద్ జఫరుల్ హసన్ పాకిస్తానీ ముస్లిం పండితులు. అలీఘర్లో ఎం.ఎ., ఎల్.ఎల్.బి. చదువుకున్నారు. జర్మనీలోని ఎర్లాంజెన్, హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయాలు; యు.కె.లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్లను పొందారు. డాక్టర్ జఫరుల్ హసన్ తత్వశాస్త్రంలో ఆక్స్ఫర్డ్ నుండి పిహెచ్.డి. పొందిన భారత ఉపఖండంలోని మొదటి ముస్లిం పండితులు. అతని డాక్టోరల్ థీసిస్ అంశం.. రియలిజం ఒక క్లాసిక్ వంటిదని ప్రముఖ తత్వవేత్తలు, విద్యావేత్తలు ప్రశంసించారు. వారిలో జఫరుల్ గురువు ప్రొఫెసర్ జాన్ అలెగ్జాండర్ స్మిత్ (1863–1930), అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ కూడా ఉన్నారు. జఫరుల్ 1911లో భారతదేశంలోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో బోధకునిగా చేరారు. 1913లో పెషావర్లోని ఇస్లామియా కళాశాలలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. 1924 నుండి 1945 వరకు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ లో ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉన్నారు. అక్కడ ఫిలాసఫీ విభాగానికి ఛైర్మన్గా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్గా కూడా పనిచేశారు. 1939లో డాక్టర్ అఫ్జల్ హుస్సేన్ ఖాద్రీతో కలిసి ‘అలీఘర్ స్కీమ్’ని ముందుకు తెచ్చారు. అందులో మూడు స్వతంత్ర రాష్ట్రాలను ప్రతిపాదిస్తూ ఒక పథకాన్ని (‘భారత ముస్లింల సమస్య‘) ప్రతిపాదించారు. 1945 నుండి ఉపఖండం విడిపోయే వరకు, డాక్టర్ హసన్ అలీఘర్లో ఎమెరిటస్ ప్రొఫెసర్గా ఉన్నారు. 1947 ఆగస్టులో పాకిస్తాన్లోని లాహోర్కు వలసవెళ్లి ఒక పుస్తకాన్ని రాసే పనిలో నిమగ్నం అయ్యారు అయితే 1949లో ఆయన మరణించిన కారణంగా ఒక సంపుటం (‘ఫిలాసఫీ – ఎ క్రిటిక్‘) మాత్రమే బయటికి వచ్చింది. 1988 లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్ ఆ పుస్తకాన్ని ప్రచురించింది. జఫరుల్ 1949 జూన్ 19న కన్నుమూశారు. చదవండి: (జైహింద్ స్పెషల్: తొలి నిప్పుకణం ఇతడేనా?) -
సామ్రాజ్య భారతి: ముఖ్యమైన ఘట్టాలు, చట్టాలు, జననాలు
ఘట్టాలు ► వేల్స్ రాకుమారుడు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ (ఫొటోలో ఏనుగు పాదం వైపు నిలబడి ఉన్న వ్యక్తి) ఇండియాను సందర్శించారు. ఇండియా రాణి క్వీన్ విక్టోరియా తరఫున ఆ రాజమాత కుమారుడైన ఆల్బర్ట్ ఎడ్వర్డ్ అధికారిక హోదాలో ఇండియా వచ్చి, ఇండియా నచ్చి ఇక్కడే ఏడాది పాటు ఉండి వెళ్లారు. ► ఇప్పటి ఉత్తర ప్రదేశ్లోని అలీఘర్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ‘ముహమ్మదన్ ఆంగ్లో–ఓరియెంటల్ కాలేజ్’ స్థాపించారు. ఆ కాలే జే 1920లో ‘అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది. ► స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. చట్టాలు ► మెజారిటీ యాక్ట్, టోల్స్ ఆన్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ యాక్ట్ జననాలు ► సర్దార్ వల్లభాయ్ పటేల్: రాజనీతి జ్ఞులు, భారతదేశ తొలి ఉప ప్రధాని. నందకిశోర్ బల్ : ఒరియా కవి; అన్వర్ షా కశ్మీరీ : కశ్మీరీ ముస్లిం పండితులు, ఢిల్లీలోని మదరసా అమీనియాకు తొలి ప్రిన్సిపాల్ (ఉత్తర ప్రదేశ్); తేజ్ బహదుర్ సప్రూ: స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయవాది, రాజకీయవేత్త, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన నిపుణులలో ఒకరు; హమిద్ అలీఖాన్ బహదూర్ : రాంపుర్ సంస్థానాదీశులు; రాజా సర్ మార్తాండ భైరవ తొండైమాన్ బహదూర్ : పుదుక్కోట్టై సంస్థానాధీశులు; దౌలత్ సింగ్ : ఐదర్ మహారాజు, కమాండర్ (గుజరాత్); టి.విజయ రాఘవాచార్య : ఐ.ఎ.ఎస్, కొచ్చిన్ దివాను (తమిళనాడు). -
విశ్వమానవుడు: అమర్త్యసేన్ (1933)
మహాత్మాగాంధీ గురించి ఎరిక్ ఎరిక్సన్ అన్న మాటలు అమర్త్య సేన్కు కూడా వర్తిస్తాయి. ఇతర ప్రపంచ దేశాల ప్రజలను దిగువ నుంచి లేదా పైనుంచి కాక సమాంతరంగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడగల సామర్థ్యం ఆయనది. అమర్త్యసేన్ వయసు స్వతంత్ర భారతదేశ వయసు కన్నా కేవలం 14 ఏళ్లు ఎక్కువ. కాబట్టి సహజంగానే ఆయనకున్న స్థాయి స్వతంత్ర యువ భారత ఆశలు, ఉద్వేగాలతో ముడివడి ఉంటుంది. విస్తృత స్థాయిలో చూస్తే ఆయన వ్యక్తిగత విజయాలన్నీ జాతీయ విజయాలే. ఇతర రంగాల వృత్తి నిపుణులను ఆయన పేదరికం, అసమానత్వం, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించేలా చేశారు. అందుకే ఆయన విజయాలు భారతదేశానికి, భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. అంతకుముందు ఆ అంశాలను ఏదో పైపైన పట్టించుకునేవారు. ఆయన భారతదేశ పాస్పోర్టును వదులుకోని ప్రపంచ పౌరుడు. దేశభక్తి కలిగిన విశ్వమానవుడు. సంక్లిష్టతను ప్రాచుర్యంతో మేళవించిన సేన్ను జాన్ మేనార్డ్ కీన్స్తో మాత్రమే పోల్చగలం. ఆయనకు ప్రాచుర్యం లభించడానికి చాలా కారణాలే ఉన్నాయి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో చదువుకున్న సేన్ 22 ఏళ్లకే జాదవ్పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు! ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీలలో వివిధ హోదాలలో పని చేశారు. ఎన్నో సత్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్న సేన్ 1998లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన చరిత్రను, నైతిక, రాజకీయ తత్వ శాస్త్రాలను కూడా బాగా అధ్యయనం చేశారు. హార్వర్డ్లో తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రాల ప్రొఫెసర్గా ఉన్నారు. సేన్ కృషికి తగినట్లుగా ఎన్నో పురస్కారాలు లభించాయి. భారతదేశం ఆయనకు అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇచ్చింది. స్వతంత్ర భారత ప్రజ్ఞావంతుల చరిత్రలోని ముఖ్యులలో ఒకరైన సేన్ ఈ స్థాయిని అందుకోవడానికి ప్రధాన కారణం ఆయన వైయక్తిక ఆలోచనా విధానంతో విద్యా సంబంధమైన వాతావరణంలో ఒక ఆర్థికవేత్తగా వికసించడమే. ఆర్థిక శాస్త్రమనేది సామాజిక శాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి మధ్యలో ఉంటుందని చెప్పాలి. ఇది సాధారణంగా గణితశాస్త్ర పద్ధతిలో హేతుబద్ధమైన సంక్లిష్టమైన క్రమశిక్షణను ఉపదేశి స్తుంది. కానీ, సేన్ రచించిన పుస్తకాలు ప్రజాదరణ పొందిన ఇతర ఆర్థికవేత్తల్లాగా వ్యక్తుల విశ్లేషణకు పరిమితం కాలేదు. ఆయన తన రచనల్లో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రధానంగా చర్చించారు. – ఎస్. సుబ్రహ్మణ్యన్, ఆర్థిక శాస్త్రవేత్త, అమర్త్యసేన్ శిష్యుడు -
సామ్రాజ్య భారతి 1874/1947: ఈస్టిండియా కంపెనీ రద్దు
చట్టాలు: మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ జెయిల్స్ యాక్ట్, ఈస్టిండియా యాన్యుయిటీ ఫండ్స్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, కోర్ట్స్ (కొలోనియల్) జ్యూరిస్డిక్షన్ యాక్ట్, కొలొనియల్ క్లెర్జీ యాక్ట్. జననాలు: కవి కలాపి : గుజరాతీ కవి. ‘కలాపి’ అన్నది కలంపేరు. అసలు పేరు సుర్సిన్హ్జీ టఖ్టాసిన్హ్జీ గోహిల్. అతడి కవిత్వం నిండా భావోద్వేగమే ఉంటుంది. సాహు మహరాజ్ : మరాఠాల భోంస్లే వంశానికి మహారాజు. కొల్హాపూర్ సంస్థానానికి తొలి మహారాజు. భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర : వైష్ణవ హిందూ గురువు. అసలు పేరు విమల ప్రసాద్ దత్. పూరీలో జన్మించారు. షాపూర్జీ సక్లత్వాలా : కమ్యూనిస్టు కార్యకర్త. పార్సీ వంశీయుడు (ముంబై) టి.ఆర్.వెంకట్రామశాస్త్రి : న్యాయవాది. రాజకీయ నేత. మద్రాస్ ప్రెసిడెన్సీకి 1924 నుంచి 1928 వరకు అడ్వొకేట్ జనరల్గా పని చేశారు. జన్మస్థలం తమిళనాడులోని మాయవరం. (చదవండి: మనల్ని మనవాడిలా పాలించాడు!) -
Azadi Ka Amrit Mahotsav: ఆక్రమణ.. నిష్క్రమణ
సిపాయిల ధిక్కారం.. జాగీర్దారుల విద్రోహం.. బద్ధలైన స్వాతంత్య్ర కాంక్ష.. వీటిల్లో ఏది 1857 తిరుగుబాటు చరిత్ర? 165 ఏళ్ల తర్వాత కూడా మనకింకా సంశయమే. ఒక్క విషయంలో మాత్రం స్పష్టత ఉంది. అత్యంత శక్తిమంతమైన ఒక మహా సామ్రాజ్యంతో భారతీయులు తెగించి పోరాడారు. వట్టి చేతులతో, ఉక్కు గుండెలతో బ్రిటిష్ ఫిరంగుల వైపు ప్రతి గర్జన చేశారు. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల గుండా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన ఆ తిరుగుబాటు స్ఫూర్తి 1857–59 మధ్య.. దేశాన్ని యుద్ధభూమిగా మార్చింది. రెండు వైపులా హింస.. రక్తమై ప్రవహించింది. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్లోని సతీచౌరా ఘాట్లో అమాయక ఆంగ్ల వనితలు, పిల్లల ఊచకోత.. తిరుగుబాటు దారుల ఆగ్రహోన్మాదానికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది. బ్రిటిష్ వారు కూడా అదే ‘యుద్ధ రీతి’లో ప్రతీకారం తీర్చుకున్నారు. 1757 నుంచి 1857 వరకు దేశమంతటా శాంతి పునఃస్థాపన జరిగినట్లు 1859 జూలై 8 న అధికార ప్రకటన వెలువడే నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం దాదాపుగా డీలా పడి ఉంది. ఆ ముందటి ఏడాదే 1858 చివరిలో ఇంగ్లండ్ ప్రభుత్వం ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని రద్దు చేసి, భారతదేశాన్ని పూర్తిగా తన పాలన కిందికి తెచ్చుకుంది. అప్పటికి 250 ఏళ్ల పూర్వమే వాణిజ్య ప్రయోజనాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లిమెల్లిగా ఇక్కడి భూభాగాలపైన కూడా ఆధిపత్యం సంపాదించడం మొదలుపెట్టింది. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్ను, మరికొందరు ప్రాంతీయ పాలకులను గద్దె దించింది. అలా 1857 నాటికి యావద్భారతాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అప్పుడు జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర పోరాటం కూడా అని కొందరు చరిత్రకారులు అంటారు. మంగళ్ పాండే ధిక్కార స్వరం తర్వాత తొలిసారి మీరట్లో (యూపీ) భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్రిటిష్ సైనిక అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (యూపీ) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తదితరులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ప్రారంభంలో పోరు విజయవంతంగా సాగినప్పటికీ చివరికి భారతీయులు ఓడిపోయారు. ఝాన్సీరాణి, తాంతియా తోపే ఆ పోరులో మరణించారు. ఝాన్సీరాణి యుద్ధ క్షేత్రంలో వీర మరణం పొందితే తోపేని బ్రిటిష్ వాళ్లు పట్టి బంధించి ఉరి తీశారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేశారు. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. తిరుగుబాటుతో శకం ముగిసింది సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం.. ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైస్రాయ్లను, గవర్నర్ జనరల్స్ని పెట్టి భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయోద్యమం సాగింది. మనం చదువుకున్న చరిత్ర పుస్తకాలలో కాస్త అటు ఇటుగా ఇదీ మన స్వాతంత్య్ర సమరగాథ. అయితే భారతదేశ చరిత్రకారులు కొంతమంది మౌలిక పరిశోధనలకు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఏవో తమకు లభ్యమైన ఆధారాలతో, తోచిన విధంగా చరిత్రను రాస్తున్నారన్న విమర్శ ఉంది. 1857 తిరుగుబాటు పైన, బహదూర్ షా జఫర్ పైన భారతీయ చరిత్రకారులు ఎన్నో రచనలు చేసినప్పటికీ అందుబాటులో ఉన్న అనేక రికార్డుల వైపు వెళ్లనే లేదని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అంటున్నారు! ‘‘వివిధ సిద్ధాంతాలు, దృక్పథాల ప్రభావంతో భారతదేశంలో మౌలిక సూత్రాల నుంచి చరిత్ర రచన దారి తప్పింది. ఇందువల్ల పరిశోధన కొరవడి చరిత్ర వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చే పరిస్థితి ఉండదు. శూన్యస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చరిత్ర వక్రీకరణ జరిగి, అదే నేపథ్యంలో వర్తమాన సమాజం అవాంఛనీయ చర్యలకు, విధానాలకు పాల్పడుతుంది..’’ అంటారు డాల్రింపుల్ 1957లో శతాబ్ది ఉత్సవాలు 1957 నాటి ‘తొలి తిరుగుబాటు శతాబ్ది’ వేడుకల సమయానికి స్వతంత్ర భారతదేశం వయసు 10 ఏళ్లు. 1857 మే 10న బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్.. ‘కులమతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివర్ణించారు. స్వాతంత్య్రానంతర స్వార్థపూరిత పోకడలకు వ్యతిరేకంగా తిరిగి ఆ స్థాయిలో ఉద్యమించవలసిన అవసరం ఉందని కూడా నెహ్రూ ఓ మాట అన్నారు. కలకత్తా యూనివర్సిటీ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంధాన్ని ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించింది. ‘‘మతాన్ని కాపాడుకొనేందుకు మొదలైన పోరాటం స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించారు. పుస్తకం రాస్తున్నప్పుడు పాలక్షపక్షం ఒత్తిళ్ల మేరకు ఆయన తన అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చిందని అంటారు. అలాంటి అనుభవమే సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్కూ ఎదురైంది. ‘ది సిపాయ్ మ్యూటినీ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857’ గ్రంథ రచన విషయంలో బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ కార్యదర్శితో ఆయనకు అభిప్రాయభేదాలు వచ్చాయి. బ్రిటిష్ వారిని ఇండియా నుంచి వెళ్లగొట్టేందుకు ఒక పథకం ప్రకారం సిపాయిల తిరుగుబాటు జరిగినట్లు రాయాలని ఆ కార్యదర్శి కోరడం మజుందార్కు నచ్చలేదు. చరిత్రను వక్రీకరించడం తన వల్ల కాదని చెప్పి, బోర్డు నుంచి బయటికి వచ్చి సొంతంగా పుస్తకం తీసుకువచ్చారు. శతాబ్ది ఉత్సవాలలోనే ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో 1857 నాటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయమై ఈనాటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
కర్మయోగి: బి.సి. రాయ్ / 1882–1962
బిధాన్ చంద్ర రాయ్ ప్రముఖ వైద్యులు. కాంగ్రెస్ నాయకులు. విద్యావేత్త, ధార్మికుడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ఆ రాష్ట్రాన్ని సమస్యల నిలయం స్థాయి నుంచి సంపదకు నెలవుగా మార్చేశారు. ఎన్నో కీలకమైన పదవులు అధిష్టించారు. కలకత్తా మేయర్గా, కలకత్తా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 1948లో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవిని స్వీకరించడానికి నిరాకరించారు. నిజానికి నాల్గవ కింగ్ జార్జి ఆయనను ఆ పదవికి ఎంపిక చేశారు. కానీ, క్రియాశీలక రాజకీయాలలో కొనసాగాలని భావించిన రాయ్ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విద్యార్థి దశ నుంచే రాయ్ చాలా పట్టుదల కలిగిన మనిషిగా గుర్తింపు పొందారు. ఇంగ్లండులోని సెయింట్ బార్తోలోమ్యూలో ప్రవేశం కోసం ఆయన పట్టు వీడకుండా 29 సార్లు దరఖాస్తు చేసి చివరకు విజయం సాధించారు. రాయ్ జీవితంలో చాలామంది విస్మరించిన ముఖ్యమైన అంశాలు అనేకం ఉన్నాయి. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన షిల్లాంగ్ హైడ్రో–ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్, ఎయిర్వేస్ ఇండియా సంస్థలను నెలకొల్పారు. పాత్రికేయుడిగా ఆయన చిత్తరంజన్దాస్ ప్రారంభించిన కొన్ని జర్నల్స్ను నడిపించే బాధ్యతను స్వీకరించారు. రాయ్ అసలు సిసలు కర్మయోగి. ఆయన మరణించే చివరి క్షణం వరకూ పని చేస్తూనే ఉన్నారు. ఈ స్థిరచిత్తుడైన మృదుస్వభావి 1962 జూలై 1న తుదిశ్వాస విడిచారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే. బ్రాహ్మో గీతం అంటే ఎంతో ఇష్టపడే రాయ్, తాను చనిపోయే రోజున కూడా దాన్ని ఆలపించారు. ఆయన జన్మదినోత్సవాన్ని భారత జాతి ‘వైద్యుల దినం’గా జరుపుకుంటోంది. – స్వర్గీయ నితీశ్ సేన్గుప్తా (లోక్సభ మాజీ ఎంపీ) మాటల్లో.. -
సామ్రాజ్య భారతి: 1871/1947 చట్టాలు
క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్కి రూపకల్పన జరిగింది. 160 రకాల తెగల్ని క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించారు. వారంతా వారసత్వంగా నేరాలు చేస్తున్నవారిగా చట్ట పరిగణనలోకి వచ్చారు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చాక 1949లో ఆ చట్టం రద్దయింది. ఇంకా.. ఈ ఏడాది పెన్షన్స్ యాక్ట్, క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ఇండియా స్టాక్ డివిడెండ్స్ యాక్ట్ అమల్లోకి వచ్చాయి. జననాలు అబనీంద్రనాథ్ టాగోర్ : రచయిత, తైలవర్ణ చిత్రకారుడు. బ్రహ్మానంద సరస్వతి: గురుదేవ్గా ప్రసిద్ధులు. అయోధ్యలో జన్మించారు. ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ శంకరాచార్యులు. కె.కృష్ణస్వామి అయ్యంగార్ : చరిత్రకారులు. విద్యావేత్త. ద్రవిడాలజిస్టు. మద్రాసులో జన్మించారు. -
ఏకాభిప్రాయ సారథి: రాజేంద్ర ప్రసాద్ (1884–1963)
ఉత్తర బిహార్లోని ఒక కుగ్రామం నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి అకుంఠితమైన అనుచరుడిగా పేరు పొందారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్కి, చక్రవర్తి రాజగోపాలాచారికి సన్నిహితంగా మెలిగారు. ఆ ముగ్గురినీ కలిపి తక్కినవారు కాంగ్రెస్లోని మితవాద పక్షంగా వ్యవహరించేవారు. జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాస్ చంద్రబోస్లు అనుసరించిన వామపక్ష అనుకూల రాజకీయాలను ఈ ముగ్గురూ వ్యతిరేకించేవారు. చాలా విషయాలలో రెండు వర్గాల విభేదాలు చరిత్ర ప్రసిద్ధి పొందాయి. ఉదాహరణకు, మంత్రి అయిన సర్దార్ పటేల్ అంత్యక్రియలకు రాష్ట్రపతి హాజరు కావడం సముచితం కాదని నెహ్ర ఇచ్చిన సలహాను తోసిరాజని, రాష్ట్రపతి హోదాలో ఆయన 1950లో పటేల్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక రాజ్యాంగ నిర్ణాయక సభ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ అభిప్రాయం సరిపోదనీ, ఏకాభిప్రాయం తప్పనిసరి అనీ ప్రారంభంలోనే సూత్రీకరించారు. దీంతో మెజారిటీ వాదులు మైనారిటీల ఆక్షేపణలను అర్థం చేసుకుని, సర్దుబాట్ల ద్వారా వారిని కూడా కలుపుకుని పోవలసిన పరిస్థితి అభివృద్ధి చెందింది. ఏకాభిప్రాయాన్ని సాధించే వరకు నిర్ణయాన్ని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని వల్ల రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి మూడేళ్లకు పైగా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు 1950 నాటికి భారతీయులకు రాజ్యాంగం లభించింది. అది భారతీయులందరూ గర్వించదగిన స్థాయిలో ఉందంటే, ఆ ఖ్యాతి రాజేంద్ర ప్రసాద్కు దక్కవలసిందే. రెండు పర్యాయాలు భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్, తన హయాంలో రాష్ట్రపతి వ్యవస్థ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా అభివృద్థి చెందకుండా సకల జాగ్రత్తలూ వహించారు. అయితే జాగృతమైన, అప్రమత్తమైన వ్యవస్థగా రాష్ట్రపతి పదవీ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆర్భాటానికి తావివ్వని మృదు స్వభావిగా, నిరాడంబరునిగానే ప్రసాద్ తన జీవితమంతా గడిపారు. – సలీల్ మిశ్రా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకులు -
మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది
దేశ విభజన రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్ (1904–1971) అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. తల్లి మీద ప్రేమతో బూర్కి (ఆమె ఇంటిపేరు) పేరును కూడా మార్గరెట్ తన పేరులో చేర్చుకున్నారు. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ఆమె ప్రఖ్యాత ‘లైఫ్’లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. అలాగే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రష్యా) మీద నాజీ సేనల దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ మార్చి, 1946లో భారతదేశానికి వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీసిందే. ఇంకా చాలా పోజులలో గాంధీజీ ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశం కోసం తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్రపురుషుల పోర్ట్రయిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్ పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సమరం అహింసాయుతంగా మొదలై, దారుణమైన హింసతో ముగిసింది. ఇదొక వైచిత్రి. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతాన్ని చూశారు. నేడు (జూన్ 14) మార్గరెట్ జయంతి. గాంధీజీ నూలు వడికే మగ్గం దగ్గర ఉన్న చరిత్రాత్మకమైన ఫొటోను తీసింది మార్గరెటే! (పైఫొటో:) మార్గరెట్ బూర్కి వైట్ -
సామ్రాజ్య భారతి: 1870/1947 ఘట్టాలు
►యు.కె. నుంచి ఇండియా వచ్చిన తొలి జలాంతర్గామి టెలిగ్రాఫ్ కేబుల్.. బాంబే తీరం (ఇన్సెట్) : కేబుల్ కేస్ ►యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ (యు.ఎస్.ఐ.) సంస్థాపన. ►కేశవ్ చంద్రసేన్ అధ్యక్షుడిగా ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఏర్పాటు చట్టాలు ►కోర్ట్–ఫీజ్ యాక్ట్, కాయినేజ్ యాక్ట్, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్, ఫారిన్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ జననాలు దాదాసాహెబ్ ఫాల్కే: సినీ దిగ్గజం. భారతీయ సినిమా పితామహుడు. త్రయంబకంలో జన్మించారు. చిత్తరంజన్ దాస్: స్వాతంత్య్రఉద్యమ నేత. ప్రసిద్ధ న్యాయవాది. ‘దేశబంధు’గా ప్రఖ్యాతి. కలకత్తాలో జన్మించారు. మౌల్వీ అబ్దుల్ హక్ : ఉర్దూ పండితులు. భాషావేత్త. ఉర్దూ భాషను పాకిస్థాన్ జాతీయ భాషగా మార్చాలని డిమాండ్ చేసిన వారిలో ముఖ్యులు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో జన్మించారు. ఉపాసనీ మహరాజ్ : అసలు పేరు కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసని. సద్గురు ఉపాసకులు. షిర్డీకి సమీపాన జన్మించారు. జాదూనాథ్ సర్కార్ : ప్రసిద్ధ చరిత్రకారులు. బంగ్లాదేశ్లో జన్మించారు. మొఘల్ సామ్రాజ్య రచనల్లో నిపుణులు. హరిసింగ్ గోర్ : న్యాయవాది, విద్యావేత్త, సంఘ సంస్కర్త. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, నాగపూర్ యూనివర్సిటీలకు తొలి వైస్–చాన్స్లర్.. -
సామ్రాజ్య భారతి: 1869/1947 ఘట్టాలు
లక్నోలో లా మార్టినియర్ గర్ల్స్ కాలేజ్ స్థాపన. లా మార్టినియర్ కళాశాల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఒక ఉన్నతమైన ప్రైవేట్ విద్యా సంస్థ. కళాశాలలో బాలురు, బాలికల కోసం వేర్వేరు క్యాంపస్లలో రెండు పాఠశాలలు ఉన్నాయి. లా మార్టినియర్ బాయ్స్ కాలేజ్ 1845లో, లా మార్టిని యర్ గర్ల్స్ కళాశాల 1869లో ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోనే ‘బ్యాటిల్ ఆనర్స్’ గౌరవాన్ని పొందిన ఏకైక కళాశాల లా మార్టినియర్ బాయ్స్ కాలేజ్! 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో లక్నోను సురక్షితంగా ఉంచడంలో ఈ కాలేజీ పోషించిన పాత్రకు దక్కిన గౌరవం అది. ఫ్రెంచి అడ్వెంచర్ మేజర్ జనరల్ క్లాడ్ మార్టిన్ ఈ గొలుసు కట్టు కళాశాలల్ని నెలకొల్పారు. లక్నోలోని ఈ రెండు కాలేజీలు కాకుండా కలకత్తాలో రెండు, ఫ్రాన్స్లోని లయోన్ ప్రాంతంలో మూడు మార్టినియర్ కళాశాలలు ఉన్నాయి. ఐదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు వారికి ఈ విద్యాలయాలలో తక్కువ ఫీజులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుంది. లక్నోలోని బాలుర పాఠశాల క్యాంపస్లో చర్చి, మసీదు, హిందూ దేవాలయం ఉన్నాయి. ప్రసిద్ధ బ్రిటన్ పత్రిక ‘ది ఎకనామిస్ట్’ ఈ కళాశాల భవనాన్ని.. ‘బహుశా లక్నోలో ఉత్తమంగా సంరక్షించబడిన కాలనీల సామరస్య (కాన్స్టాంటియా) భవనం’ గా అభివర్ణించింది. చట్టాలు డైవోర్స్ యాక్ట్, ఈస్ట్ ఇండియా ఇరిగేషన్ అండ్ కెనాల్ యాక్ట్ జననాలు కస్తూర్బా గాంధీ (పోర్బందర్), మోహన్దాన్ కరంచంద్ గాంధీ : (పోర్బందర్); భగవాన్ దాస్ : తత్వవేత్త, స్వాతంత్య్ర సమరయోధులు (వారణాసి); హబీబ్ మియా : 138 ఏళ్ల సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఎక్కువ కాలం పింఛను పొందిన వ్యక్తిగా గిన్నిస్బుక్లో నమోదు అయ్యారు. (జైపుర్); వలంగైమన్ శంకర నారాయణ శ్రీనివాస శాస్త్రి : విద్యావేత్త, భారత స్వాతంత్య్ర సమర ఉద్యమ కార్యకర్త (వలంగైమన్, తమిళనాడు); ముహమ్మద్ హబీబుల్లా : ట్రావంకోర్ దివాను (మద్రాస్); డాక్టర్ ఉమేద్రమ్ లాల్భాయ్ దేశాయ్ : ప్రసిద్ధ వైద్యులు (వైరా, గుజరాత్). -
సిరాజుద్దౌలాను హతమార్చేందుకు రాబర్ట్ క్లైవ్ బయల్దేరిన రోజు
1757లో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో బెంగాల్ యువ నవాబు సిరాజుద్దౌలా ఈస్టిండియా కంపెనీకి పట్టుబడి, హతుడు కావడంతో ఇండియాలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలన మొద లైంది. సిరాజుద్దౌలాపై యుద్ధానికి రాబర్ట్ క్లైవ్ ఆ ఏడాది జూన్ 13 న ముర్షిదాబాద్ బయలుదేరి వెళ్లాడు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ.. బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రుల కూటమిపై నిర్ణయా త్మక విజయం సాధించిన ఆ యుద్ధం చరిత్రలో ప్లాసీ యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్ అంతటా విస్తరించింది. బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద ఆనాటి యుద్ధం జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషు వారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. బెంగాల్ ప్రెసిడెన్సీకి బ్రిటిష్ గవర్నర్ అయిన రాబర్టు క్లైవ్, సిరాజుద్దౌలా సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపి, తన పక్షానికి తిప్పుకున్నాడు. సిరాజుద్దౌలాను ఓడించారు. ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. బ్రిటిషు వారు రాబర్టు క్లైవ్ నాయక త్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవ్ ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్నగర్ కోటను వశపరచుకు న్నాడు. బ్రిటిషువారికీ, సిరాజుద్దౌలాకూ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు ప్లాసీ యుద్ధానికి దారితీశాయి. సంఖ్యపరంగా సిరాజు ద్దౌలా సైన్యం, బ్రిటిషు సైన్యం కంటే చాలా పెద్దది. ఈ విషయమై ఆందోళన చెందిన క్లైవ్.. మీర్ జాఫరు, మరికొంతమందితో కలిసి కుట్ర పన్నాడు. ఆ ప్రకారం వాళ్లంతా యుద్ధభూమికి తమ సైన్యాలతో వచ్చినప్పటికీ సిరాజుద్దౌలా తరఫున యుద్ధంలో పాల్గొనలేదు. ఫలితంగా 18,000 మందితో కూడిన సిరాజుద్దౌలా సైన్యం, కేవలం 3,000 క్లైవ్ సైన్యం చేతిలో పరాజయం పొందింది. యుద్ధం కేవలం 40 నిముషాల్లో ముగిసి పోయింది. తర్వాత సిరాజుద్దౌలాను బ్రిటిష్ వాళ్లు హతమార్చారు. గణేశ్ దామోదర్ సావర్కర్ గణేష్ దామోదర్ సావర్కర్ స్వాతంత్య్ర సమర యోధుడు. 1879 జూన్ 13న జన్మించారు. ‘అభినవ్ భారత్ సంఘం’ వ్యవస్థాపకులు. భారతదేశంలో బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమానికి నాయ కత్వం వహించారు. ఫలితంగా ఆయన జీవితాంతం బహిష్కరణ శిక్ష గురయ్యారు. అందుకు ప్రతీకారంగానే అప్పటి నాసిక్ కలెక్టర్ జాక్సన్ను గణేష్ సన్నిహిత అనుచరుడు అనంత లక్ష్మణ్ కన్హేర్ హత్య చేశాడు. కన్షేర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఆశ్రయించిన సమర యోధుడు. ప్రముఖ హిందుత్వ వాది వినాయక్ దామోదర్ సావర్కర్.. గణేశ్ తమ్ముడే. -
రాడికల్ అహింసావాది: జయప్రకాశ్ నారాయణ్(1902–1979)
నేను చూసిన వక్తలలోకెల్లా గొప్ప వక్త జయప్రకాశ్ నారాయణ్. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఆయన ప్రసంగాలు వినడానికి వేల మంది ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ, అదంతా ఆయన జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. మరొక వైపు చూస్తే ఆయన చాలా ప్రశాంతమైన వ్యక్తి. మార్క్సిజం మీద పుస్తకాలను అధ్యయనం చేయడమంటే ఆయనకు ఎంతో ప్రీతి. అనుభవాలు ఆయనను మలిచాయి. బిహార్లోని ఒక చిన్న గ్రామం లాలోటిలో జన్మించిన జేపీ పైచదువుల కోసం అమెరికా వెళ్లడంతో కొత్త ప్రపంచం ఆయన కళ్ల ముందు నిలిచింది. కళాశాలలో చదివేటప్పుడు, తన చదువుకయ్యే ఖర్చుల కోసం ఆయన ఒక ప్యాకేజింగ్ కంపెనీలో పని చేసేవారు. ఎం.ఎన్.రాయ్ రాసిన పుస్తకాల ద్వారా మార్క్సిజం ఆయనకు అక్కడే పరిచయం అయింది. భారతదేశానికి తిరిగి వచ్చి, మహాత్మాగాంధీని కలుసుకున్న మీదట, ఆయనను గురువుగా చేసుకున్నారు. అయితే చాలా కాలం కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తన ఆదర్శాలకు, కాంగ్రెస్ ఆదర్శాలకూ పొత్తు కుదరడం లేదని భావించారు. ఎట్టకేలకు తన మిత్రులు యూసఫ్ దేశాయ్, రామ్ మనోహర్ లోహియాలతో కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని కాంగ్రెస్లోనే అంతర్భాగంగా ఏర్పాటు చేశారు. రాడికల్ మార్క్సిజానికి సమర్థించిన జేపీని గాంధీ అహింసావాదం ప్రభావితం చేయడం ఆశ్చర్యమే. 1975లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల అసంతృప్తి అంతటినీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దింది. ఆ సమయంలో బిహార్ అంతటా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ప్రజ్వరిల్లడం కన్నా జేపీ పలుకుబడికి వేరే నిదర్శనం అక్కర్లేదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, అమానుషాలే ప్రజల ఆగ్రహావేశాలకు కారణమని జేపీ అనేవారు. అప్పుడు నేను కళాశాలలో చదువుతున్నాను. వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఒక ధర్నాలో ఆయనకు నన్నొకరు పరిచయం చేశారు. ‘నీ గురించి చాలా విన్నానయ్యా’ అని ఆయన నాతో అన్నారు. అవి బహుశా నా జీవితంలో చాలా గొప్ప క్షణాలు. కెరటాలకు ఎదురీదిన జయప్రకాశ్ నారాయణ్ చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన తన నమ్మకాల కోసం జీవించారు. వాటి కోసం మరణించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. (దివంగత సోషలిస్టు రాజకీయవేత్త రఘువంశ్ ప్రసాద్ సింగ్ మాటల్లో..) -
చైతన్య భారతి: శక్తివంతమైన నాయకుడు! అతని తర్వాత ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ 1889–1964: నెహ్రూ మరణించడానికి ఏడాది ముందు ఒక ప్రముఖ అమెరికన్ పాత్రికేయుడు ‘ఆఫ్టర్ నెహ్రూ, హూ?’ అనే పుస్తకం రాశారు. నిజానికి ఆయన తరువాత పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రపంచమంతటికీ వచ్చిందే. ఆయన మరణించిన దాదాపు నాలుగు దశాబ్దాలకు గానీ, నెహ్రూ భావజాలం దేశంలో చెక్కు చెదరనంత శక్తిమంతమైన నాయకత్వం నెహ్రూది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదటి పదిహేడేళ్లు నెహ్రూయే భారతదేశం, భిన్న ధ్రువాల విచిత్ర సంగమం ఆయన. సదుపాయాల భోగంలో పెరిగిన కులీన కుటుంబీకుడు కష్టజీవుల నిత్య వేదనకు సానుభూతితో స్పందించడం ఆయనలో ఒక చిత్రం. భావోద్వేగాలతో స్పందించే ఆదర్శవాద మేధావి, ఉదాత్తమైన సమతా వాద భావాలకు పట్టం కట్టిన నెహ్రూ... హారో, కేంబ్రిడ్జ్లలో ఆంగ్లోపాసన చేసిన విద్యావేత్త. బ్రిటిష్ జైళ్లలో పదేళ్లకు పైగా కాలం గడిపిన వ్యక్తి కూడా. మహాత్మా గాంధీ నుంచి అనూహ్యంగా ప్రత్యేక ప్రోత్సాహం పొందిన నాయకుడు. భారతదేశానికి నెహ్రూ అందించిన వారసత్వానికి నాలుగు మూల స్తంభాలు : ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణం లౌకికవాదం, స్వదేశంలో సమతా వాద ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానంలో అలీన మార్గం. భారతదేశ నైతిక, నాగరిక చరిత్ర మీద ఆధారపడి, ప్రపంచంలో భారతదేశానికి ఒక పాత్రను నెహ్రూ నిర్దేశించారు. దళితులకు, దగా పడిన వారికి గళం కల్పించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఆయన తెచ్చిన ప్రతిష్ట కొన్ని ఏళ్ల పాటు పనికొచ్చింది. కానీ, 1962లో చైనాతో తలెత్తిన యుద్ధం కారణంగా కలిగిన అవమానం అటువంటì ప్రతిష్టకు గల పరిమితులను చాటింది. అధికారంలో సమున్నత స్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన ఒక వ్యాసం రాసి, తన పేరు లేకుండా ప్రజల్లోకి వదిలారు. నియంత కావాలనే ప్రేరణలు తనలో కలుగకుండా అడ్డు కట్ట వేయాలని దానిలో ప్రబోధించారు. ‘‘ఆయనను హద్దుల్లో ఉంచాలి. మనం సీజర్లను కోరుకోవడం లేదు’’ అని నెహ్రూ తన గురించి తానే దానిలో రాశారు. తన లోటుపాట్ల వల్ల కానీ, అనుచరుల లోటు పాట్ల వల్ల కానీ ప్రజలలో తన స్థాయి ఏమాత్రం దెబ్బతినని అరుదైన నాయకుడు నెహ్రూ. భారతదేశానికి ఎలాంటి వారసత్వాన్ని అందించాలని మీరు ఆశిస్తున్నారని అమెరికన్ సంపాదకుడు నార్మన్ కజిన్స్ ఒకసారి నెహ్రూను ప్రశ్నించారు. ‘‘నలభై కోట్ల మంది ప్రజలు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యం.. ’’ అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. – శశి థరూర్ పుస్తకం ‘నెహ్రూ : ది ఇన్వెషన్ ఆఫ్ ఇండియా’ నుంచి (చదవండి: ఘట్టాలు: టాటా గ్రూపు ఆవిర్భావం) -
జైహింద్ స్పెషల్: ఖిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం భారతదేశంలో ఎగసిపడిన చిన్న నిప్పు రవ్వ కూడా స్వాతంత్య్ర సమరజ్వాలకు ఆజ్యం పోసినదే. నేటి పాకిస్థాన్లోని ఖిస్సా ఖ్వామీ బజార్లో 90 ఏళ్ల క్రితం 1930 ఏప్రిల్లో చెలరేగిన అలాంటి జ్వాలే ఒకటి భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తన వంతుగా నిప్పందించింది. ఆనాటి ఘటనకు ఈనాటి చేదు జ్ఞాపకమే.. ‘ఖిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత’. నేటి పాకిస్థాన్లోని ప్రస్తుత ప్రావిన్సులలో ఒకటైన ఖైబర్ పక్తున్క్వా రాజధాని పెషావర్లోని ఒక వీధి పేరే ఖిస్సా ఖ్వానీ. ఖిస్సా ఖ్వానీ అంటే ‘కథలు చెప్పేవాళు’్ల అని. మన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సరిగ్గా నూరేళ్ల క్రితం ఆ ఖిస్సా ఖ్వానీ వీధిలోనే జన్మించారు! మరో నటుడు రాజ్ కపూర్ పుట్టింది కూడా ఖిస్సా ఖ్వానీలోనే. షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులు కొందరు కూడా ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు. ఆ వీధికి ఇంతకుమించి ఉన్న చారిత్రక గుర్తింపు మాత్రం అక్కడ జరిగిన ఊచకోతే. ఆ రోజు.. ఏప్రిల్ 23 న ఖిస్సా ఖ్వానీలో ‘ఖుదాయి కిద్మత్గార్’ ఉద్యమకారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింసాయుత ప్రదర్శన జరుపుతున్నారు. వారి నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్. ఖుదాయీ కిద్మత్గార్ (దేవుని సేవకులు) ఉద్యమకర్త ఆయనే. నాటి వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని ఉత్మాన్జాయ్ పట్టణంలో గఫార్ ఖాన్ తన ప్రసంగం పూర్తి చేసి వేదిక కిందికి దిగుతుండగానే గఫార్ ఖాన్ను, మరికొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదర్శనా స్థలానికి చేరుకున్న బ్రిటిష్ బలగాలు అందుకు నిరసనగానే అనేక ప్రాంతాలతో పాటు ఖిస్సా ఖ్వానీలోనూ ప్రదర్శనలు జరిగాయి. గఫార్ ఖాన్ను తక్షణం విడుదల చేయాలని ప్రదర్శనకారులు నినాదాలిచ్చారు. ‘గుమికూడి ఉన్న మీరంతా తక్షణం నినాదాలు మాని ఎవరిదారిన వారు వెళ్లకుంటే తగిన సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అని ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన బ్రిట్రిష్ సైనిక బలగాలు హెచ్చరించాయి. ఆ బలగాలలో ఉన్నది కూడా భారతీయులే. ప్రదర్శనకారులు కదల్లేదు. సైనికులు తుపాకులు తీశారు. ప్రదర్శనకారులు బెదరలేదు. దాంతో సైనిక వాహనాలు క్రూరాతిక్రూరంగా వారిని తొక్కిపడేశాయి. ఆ ఘటనలో ప్రదర్శనకారులతో పాటు, నిలబడి చూస్తున్న కొందరు పౌరులు కూడా అక్కడికక్కడే మరణించారు. తుపాకీ కాల్పులకు మరికొందరు ప్రాణాలు వదిలారు. ఆ బలగాలు ‘గర్వాల్ రెజిమెంట్’వి. అందులోని కొందరు సైనికులు నిరాయుధులైన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు నిరాకరించారు. కానీ పైనుంచి ఆదేశాలు రావడంతో రెజిమెంట్లోని మిగతా సైనికులు తమ ‘డ్యూటీ’ తాము చేసేశారు. కాల్పులు జరిపేందుకు నిరాకరించిన సైనికులపై బ్రిటిష్ అధికారులు ఆ తర్వాత సైనిక విచారణ జరిపించి ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధించారు. ఊచకోత తర్వాత కూడా పెషావర్, ఆ పరిసర ప్రాంతాలలో ఖుదాయి కిద్మత్గార్ కార్యకర్తలు తీవ్రమైన అణచివేతలను ఎదుర్కొన్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ .. ‘హింసాత్మకమైన ఉద్యమకారుడికన్నా, అహింసాయుతంగా పోరాడుతున్న ఒక పష్తూన్ తెగ మనిషి ఎక్కువ ప్రమాదకారి అని బ్రిటిష్ ప్రభుత్వం భావించినట్లుంది..’ అని గఫార్ ఖాన్ రాశారు. ఈ కారణంగానే తరచు తమ ఉద్యమం తేలికపాటి ప్రదర్శనకే భగ్గుమనేటంతటి ఘర్షణగా మారేది అని కూడా రాసుకున్నారు. ఖిస్సా ఖ్వామీ ఊచకోత దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. దేశంలో తిరుగుబాటు ధోరణులు వ్యాప్తి చెందాయి. ఖిస్సా ఖ్వామీ ఊచకోత విషయం బ్రిటన్ రాజు ఆరవ జార్జి దృష్టికి వెళ్లి, ఘటనపై ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. నాటి లక్నో ప్రొటెక్టరేట్కు చెందిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నైమతుల్లా చౌదరికి కేసు బాధ్యతను అప్పగించారు. ఆయన ఘటనాస్థలి వద్దకు అనేకమార్లు స్వయంగా వెళ్లి, సాక్షులతో మాట్లాడి ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ’దే తప్పు అంటూ.. 200 పేజీల నివేదికను రాజుకు సమర్పించారు. రాజు ఆయన నిబద్దతను గుర్తించి, గౌరవించారు. ఖుదాయీ కిద్మత్గార్ దేశ విభజనను వ్యతిరేకించింది. అయితే స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడేందుకు అలాంటి వ్యతిరేకత ప్రతికూలాంశమౌతుందని ఎక్కువశాతం పాక్ నాయకులు భావించారు. అబ్డుల్ గఫార్ఖాన్కు ఇష్టం లేకుండానే ఒక దేశం రెండు దేశాలుగా విడిపోయింది. ఖిస్సా ఖ్వామీ ఊచకోత.. స్వాతంత్య్ర సంగ్రామాల జ్ఞాపకాల్లోంచి కాలంతో పాటు దాదాపుగా కరిగిపోయింది. -
ఆచరణే సిద్ధాంతం: ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ (1909–1998)
ప్రపంచంలోనే మొదటిసారిగా, కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మార్క్సిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ద్వారా, భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్ 1957లో చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొదటి ప్రకటన.. సోషలిజం తీసుకురావడానికి తన ప్రభుత్వం ప్రయత్నించగలదని స్పష్టం చేయడం కాదు. దానికి బదులు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను తగ్గించడానికి తన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఇ.ఎం.ఎస్. కేరళలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రైవేట్ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. సనాతన సంప్ర దాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పురిగిన ఇ.ఎం.ఎస్. తన సొంత వర్గ తిరోగమన విధానాలపై పోరాడటం ద్వారా ప్రజాహిత జీవనంలోకి అడుగుపెట్టారు. బాల్యంలో ప్రాచీన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. సంపన్న భూస్వామ్య పెత్తందారీ విధానాన్ని అంతం చేయడంలో అగ్రభాగంలో నిలిచారు. అక్షరాస్యత, స్త్రీ పురుష వివక్ష లేకుండా చూడటం, ప్రజారోగ్యం, సమగ్ర భూ సంస్కరణలు ఆయన మొదటి ప్రభుత్వ ఘన విజయంగా చెప్పాలి. చదవండి: (శతమానం భారతి: ఆహార భద్రత) కాంగ్రెస్ తన ప్రజాస్వామిక ముసుగును వదిలి, నియంతృత్వ పోకడలను బయట పెడుతూ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు సి.పి.ఐ. భ్రమలు తొలగిపోయాయి. సి.ఐం.ఐ.(ఎం) బలంగా ఉన్న చోటల్లా నక్సలైట్ తీవ్రవాద రాజకీయాలు బయట పడటంతో ఆ ఉద్యమమూ సడలిపోయింది. ఇ.ఎం.ఎస్. 1978 నుంచి 1980ల చివరి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన కాలంలో పార్టీ అనేక ఒత్తిడులను, సంక్షోభాలను ఎదుర్కొంది. 1980ల చివరిలో ఆయన విశ్రాంత జీవితం మొదలైంది. అయితే, ఆయన ఖాళీగా ఉండకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎదగాల్సిందిగా తన రచనల ద్వారా కేరళీయులకు పిలుపునిచ్చారు. సమగ్ర వికేంద్రీకరణ కార్యక్రమమైన ప్రజా ప్రణాళికా విధానాన్ని రూపొందించడం ప్రారంభించారు. ఆయన రచనలు 150 సంపుటాలుగా వెలువడ్డాయి. భారతీయ కమ్యూనిస్టు విధానాల ఆచరణకు తోడ్పడిన నవీన ప్రయోగాలను సిద్ధాంతీకరించడానికి ఇ.ఎం.ఎస్. విముఖత చూపడం విమర్శలకు లోనైంది. సిద్ధాంతం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ఇ.ఎం.ఎస్. -
స్వతంత్ర భారతి: మోహన్దాస్-ఘనశ్యాం దాస్
జీ.డి. బిర్లాగా ప్రఖ్యాతులు.. ఘనశ్యామ్ దాస్ బిర్లా. భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని. 50 లక్షల పెట్టుబడి దాటిన తరువాత తన సోదరులతో కలిసి 1919లో గ్వాలియర్ పట్టణంలో సొంతంగా బట్టల మిల్లు స్థాపించారు. తరువాత రాజకీయాలలోనూ రాణించారు. 1926లో బ్రిటిష్ వారి హయాంలో శాసనసభకు వెళ్లారు. అనంతరం కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940లో హిందూస్తాన్ మోటార్స్ అనే సంస్థను స్థాపించారు. అటు తరువాత సిమెంట్, ఇనుము, కెమికల్స్, ప్లాస్టిక్ పరిశ్రమలలో రాణించారు. 1943 ప్రాంతంలో కలకత్తాలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ను (యూకో) స్థాపించారు. 1983 జూన్ 11 న తన 90 వ ఏట మరణించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్తో గౌరవించింది. దాస్ తన జీవితాంతం గాంధీ మార్గాన్నే అనుసరించారు. గాంధీజీకి ఆయన అనుచరుడిగా కూడా ఉన్నారు. గాంధీజీ చనిపోవడానికి ముందు నాలుగు నెలలు ఢిల్లీలోని బిర్లా హౌస్లోనే ఉన్నారు! -
సామ్రాజ్య భారతి: జననాలు, ఘట్టాలు, చట్టాలు
జననాలు ► సిస్టర్ నివేదిత : వివేకానందుడి శిష్యురాలు. హిందూమతాన్ని స్వీకరించిన ఐ్లరండ్ మహిళ ►గగనేంద్రనాథ్ టాగోర్ బెంగాలీ పెయింటర్, కార్టూనిస్ట్, టాగోర్ కుటుంబీకుడు (కలకత్తా) ►చిలకమర్తి లక్ష్మీ నరసింహం : తెలుగు రచయిత, నాటకకర్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఖండవల్లి (ప.గో.జిల్లా) ►శ్రీమద్ రాజాచంద్ర జైన కవి, తాత్వికుడు, మార్మిక మేధావి (గుజరాత్) ఘట్టాలు ►ఉర్దూ స్థానంలో హిందీని అధికార భాషగా చేయాలని ఉమ్మడి ప్రావిన్సులైన ఆగ్రా, అవద్లలో హిందువుల డిమాండ్. ►మే–ఏప్రిల్గా ఉన్న ఆర్థిక సంవత్సరం.. బ్రిటన్లోని పాలనకు అనుగుణంగా ఏప్రిల్–మార్చిగా మార్పు. ► ‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ (ఇ.ఐ.ఎ.) ను స్థాపించిన దాదాభాయ్ నౌరోజీ. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఆవిర్భావానికి ముందు నాటి సంస్థలలో ఇ.ఐ.ఎ. కూడా ఒకటి. చట్టాలు ►మర్డరస్ అవుట్రేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ ►పబ్లిక్ గ్యాంబ్లింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్ ►ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ -
మహోజ్వల భారతి: భగత్సింగ్కి నచ్చిన కవి
రామ్ ప్రసాద్ బిస్మిల్ విప్లవకారుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర కేసులలో నిందితుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాశారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. అలాగే ఆర్య సమాజ్ సంస్థతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. ఆర్య సమాజ్ బోధకులు స్వామి సోమ్ దేవ్ ఆయన గురువు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ కూడా ఒకరు. భగత్ సింగ్ ఆయనను ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా ఆయన ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించారు. ‘సర్ఫరోషీ కీ తమన్నా’తో సహా అనేక స్ఫూర్తిదాయ కమైన దేశభక్తి గీతాలు రచించారు. రాం ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11లో బ్రిటిష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని షాజహాన్ పూర్లో జన్మించారు. ఇంట్లో తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక మౌల్వీ నుండి ఉర్దూ అభ్యసించారు. రామ్ ప్రసాద్ తండ్రికి ఇంగ్లిష్ అంటే ఇష్టం లేకున్నా తన కుమారుడిని ఆంగ్ల భాష పాఠశాలలో చేర్పించారు. విప్లవ యోధుడిగా మారాక, ముప్పై ఏళ్ల వయసులో ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబర్ 19న ఉరి తీసింది. -
జైహింద్ స్పెషల్: చంద్రయ్య, జగ్గయ్య.. రంపలో రఫ్ఫాడించారు..
‘‘భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అమరులైన వారి వివరాలతో కూడిన ఒక నిఘంటువు తయారు కావాలి. దేశ చరిత్రలో ఒక ముఖ్య భాగమైన వారిని గురించి లేదా చరిత్రను సృష్టించిన వారిని స్మరించుకోని, గౌరవించుకోని దేశానికి భద్రమైన భవిష్యత్తు ఉండదు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల ఆరంభ సందర్భంలో అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ వీర ఘట్టాలను, స్వాతంత్య్ర సమరయోధుల అసమాన ధైర్య సాహసాలను స్మరించుకోవాలి, అలాంటి విలువలను పెంపొందించుకోవాలి. మన స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భాగస్వాములైన ఆదివాసీ నాయకుల అసమాన ధైర్య సాహసాలను సైతం స్మరించుకొంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపాలి. అడవి బిడ్డలపై బ్రిటిష్ దౌర్జన్యం తూర్పు గోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలలో మన్యం అటవీ ప్రాంతం విస్తరించి వుంది. అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను ముఠాదార్లు, భూస్వాములూ, జమీందార్లూ, బ్రిటిష్ ప్రభుత్వం దౌర్జన్యంగా, పోడు వ్యవసాయం చేయరాదని, అటవీ వస్తువులను సేకరించరాదనీ, అడవి జంతువులను వేటాడరాదనీ, కాయలూ, పండ్లూ, కట్టెలూ ఏరుకోరాదనీ అటవీ చట్టం అమలు చేసింది ఎవరైనా వీటిని అతిక్రమిస్తే శిక్షార్హులని హెచ్చరించింది. అడవిని ఆధారంగా చేసుకుని బ్రతికే అడవి బిడ్డలు అమాయకులు. ఎక్కడికి పోగలరు? ఎలా బ్రతకగలరు? వీరిని దౌర్జన్యంగా అణగతొక్కుతూ పంటలను దోచుకుంటూ ఉండేవారు. దానితో అన్ని విధాలా విసిగిపోయి.. నాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1879 లో ద్వారబంధాల చంద్రయ్య లేదా చంద్రారెడ్డి నాయకత్వం లో ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును బ్రిటిష్ అధికారులు ‘రంపా పితూరీ‘ ఉద్యమం అని పిలిచారు. అడుగో... చంద్రయ్య! ద్వారబంధాల లక్ష్మయ్య, లక్ష్మమ్మల కుమారుడే ద్వారబంధాల చంద్రారెడ్డి లేక ద్వారబంధాల చంద్రయ్య, తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం, నెల్లిపూడిలో తన మేనమామల ఇంట పెరిగాడు. ఆరు అడుగుల ఆజానుబాహువు, తేనె రంగు శరీర ఛాయ, ఉంగరాల జుత్తూ, వెనక జులపాలు కలిగి గుర్రంపై తుపాకీతో కూర్చుని వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవాడు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, రేఖపల్లి నుండి విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ ప్రాంతం వరకూ తన ఆధిపత్యంలో ఉండేది. ఈయనకు సహచరులుగా పులిచింత సాంబయ్య, బాదులూరి అంబుల్రెడ్డి, ఎలుగూరి జగ్గయ్య, జంపా పండయ్య, కోడుం నరసయ్యలు ఉండేవారు. వారి సహాయంతో చంద్రయ్య పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. నాటి బ్రిటిష్ అధికారులలో గిరిజన ఆడపిల్లల పై అత్యాచారం చేసిన వారి తలలు తెగనరికేవాడు. బ్రిటిష్ వారికి దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతూ అడవి లో దాక్కునేవాడు. 1879 ఏప్రిల్ లో అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి అక్కడి నుండి అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే అదే సంవత్సరం నవంబర్ లో ఇతని అనుచరులను 79మందిని అత్యంత నేర్పుతో వలపన్ని పట్టుకుని ‘విల్లాక్‘ అనే పోలీసు అధికారి ఉరి తీయించాడు. అప్పటికే లాగరాయి కేంద్రంగా దుచ్ఛేర్తి దగ్గర ద్వారబంధాల చంద్రయ్య తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ గొడవలన్నీ చూశాక సైన్యాన్ని రప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. సెంట్రల్ ప్రావిన్స్ నుండి ‘కల్నల్ లోబ్’ నాయకత్వం లో పోలీసు బలగాలు వచ్చాయి. పిఠాపురం సంస్థానం నుంచి 500 మంది గైడ్లను దింపారు. ద్వారబంధాల చంద్రయ్యను పట్టించిన వారికి 2000 రూపాయలు బహుమానం ప్రకటించారు. బ్రిటిష్ వారు తనకు నమ్మకస్థుడు, అనుయాయుడుగానున్న జంపా పండయ్యను ఉసిగొల్పితే, 1880 ఫిబ్రవరి 12న గుర్తేడు లో అతడు చంద్రయ్యను పట్టించాడు. ద్వారబంధాల చంద్రయ్యను కాల్చి చంపారు. అయినా రంపా పితూరీ (ఉద్యమం) ఆగలేదు. ఆ ఉద్యమాన్ని ఎలుగూరి జగ్గయ్య కొనసాగించాడు. అడుగడుగో.. జగ్గయ్య! ఎలుగూరి జగ్గయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వెడ్ల గెడ్డ వాసి. 1879 లో ద్వారబంధాల చంద్రయ్యకు కుడిభుజంగా పని చేశాడు. ఇతను అడవి పక్షులను, జంతువులను వేటాడి తన పొట్ట పోసుకునేవాడు. అడవి పక్షులను చంపడం నేరమని అలా చేస్తే శిక్షార్హమవుతుందని అధికారులు హెచ్చరించారు. పైగా అతనిపై వేటకు వెళ్లకుండా నిఘా పెట్టారు బ్రిటిష్ వారు. తద్వారా తన జీవనోపాధిని కోల్పోయాడు. ద్వారబంధాల చంద్రయ్య తో కలసి పోరాటం ప్రారంభించాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను రెండు సార్లు తగలబెట్టడానికి మూలకారకుడు ఎలుగూరి జగ్గయ్యే. ఈయన్ని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ ఎంగ్లిడో ను నియమించారు బ్రిటిష్ వారు. జడ్డంగిలో క్యాంపు ను ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు రచించారు. ఎలుగూరి జగ్గయ్య ఆచూకీ చెప్పిన వారికి 2000 రూపాయల బహుమానం ప్రకటించి ‘కొటుమ్ నరసయ్య‘ అనే తన అనుచరుడికి డబ్బుపై ఆశ చూపారు, ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎలుగూరి జగ్గయ్య వెలగలపాలెం అడవిలో దాక్కున్న సంగతి నరసయ్యకు తప్ప మరెవ్వరికీ తెలియదు. డబ్బుకు ఆశపడి వెలగలపాలెం ఎలా వెళ్లాలో మార్గం కూడా చెప్పాడు కొటుమ్ నరసయ్య. కొటుమ్ నరసయ్య ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఇన్స్పెక్టర్ ఎంగ్లిడో 10 మంది శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ను తీసుకుని వెలగలపాలెం లో తిరుగుబాటుదారులు దాక్కున్న స్థావరానికి నేరుగానే వెళ్లి చుట్టుముట్టాడు. అక్టోబర్ 31, 1880 సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ఎలుగూరి జగ్గయ్యను కాల్చగా అది సరిగ్గా బొడ్డు కింద భాగంలో తగిలింది, పారిపోవాల నుకున్నాడు. ఓ 100 గజాలు పరుగెత్తి కింద పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఓ పెద్ద కర్రకు కట్టి తమ ‘జడ్డంగి క్యాంపు‘ కు తీసుకు వస్తూండగా దారిలోనే చనిపోయాడు. ఇలా ఎందరో అడవి బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం త్యాగం చేశారు. జాతీయోద్యమంలో సైతం ఆటవికులు చురుగ్గా పాల్గొని తమ దేశభక్తి ని చాటుకున్నారు. స్వాతంత్య్రం కొరకు, మాతృదేశ దాస్య విముక్తికై పోరాడి అసువులు బాసారు. – కాశింశెట్టి సత్యనారాయణ విశ్రాంత ఆచార్యుడు -
స్వతంత్ర భారతి: భిన్నత్వంలో ఏకత్వంలా... భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దాని వల్ల కుల మత పరమైన వైషమ్యాలు అణగిపోతాయని ఆశించారు. 1956 లో చేపట్టిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఈ సూత్రమే ఆధారం. దీనిని మూడు విడతలుగా.. 1956లో దక్షిణాది రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం), 1960 నాటికి పశ్చిమ రాష్ట్రాలలో (గుజరాత్), 1966 నాటికి వాయవ్య ప్రాంతంలో (పంజాబ్, హర్యానా, హిమాచల్) అమలు పరిచారు. తర్వాత ఈశాన్య ప్రాంత విభజన (1964, 71) గిరిజన జనాభా ప్రాతిపదికన జరిగింది. జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్గఢ్ రాష్ట్రాలనూ ఏర్పాటు చేస్తూ 2000 లో ఉత్తరాది కేంద్రభాగంలో మినీ–పునర్వ్యవస్థీకరణ జరిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ఇది ఒక అరుదైన ప్రయోగం. భాషాపరమైన వ్యవస్థీకరణ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు పుష్టిని ఇచ్చింది. 1956లో మొదలైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నిరంతరం కొనసాగేలానే ఉంది. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విదర్భ కోసం డిమాండ్లు నేటికీ వినిపిస్తూ ఉన్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్లో 1953 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఆ ముందు రోజే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మూడేళ్లకు 1956 నవంబర్ 1న ఆంధ్రా, తెలంగాణాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. -
సామ్రాజ్య భారతి: ఘట్టాలు, జననాలు
ఘట్టాలు ► ఒరిస్సా దుర్భిక్షంలో 4 కోట్ల 70 లక్షల జనాభా ఆకలితో అలమటించారు. 45 లక్షల మంది మరణించారు. ► దాదాభాయ్ నౌరోజీ లండన్లో ఈస్టిండియా అసోసియేషన్ను స్థాపించారు. ► ఐరోపా సేనల కోసం బ్రిటిష్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌసీ కంటోన్మెంట్ను, బక్లో ప్రాంతాన్ని 5 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. ► భారతీయ సైనికులకు తొలిసారిగా ప్రమోషన్ ఇవ్వడం మొదలైంది. అప్పటి వరకు వారు సుబేదార్లు గానే ఉండేవారు. జననాలు గోపాలకృష్ణ గోఖలే, హైదరాబాద్ నిజామ్ ఆరవ అసఫ్ జాహీ (మహబూబ్ అలీ ఖాన్), కాళహస్తి జమీందార్ పానగల్ రాజా, కచ్ స్టేట్ మహారాజా ఖేంగర్జీ, శ్యామానంద్ ముఖోపాధ్యాయ (గణిత శాస్త్రజ్ఞుడు), చలన చిత్ర ఛాయాగ్రహకుడు హీరాలాల్ సేన్ జన్మించారు. -
భళా భల్లా.. పదిహేడేళ్ల వయసులోనే ఉద్యమంలోకి, సర్టిఫికెట్లు జప్తు!
బాల్ రాజ్ భల్లా విప్లవాత్మక స్వాతంత్య్ర సమరయోధుడు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఇతర విప్లవకారులతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బాల్ రాజ్ భల్లా ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న గుజ్రాన్ వాలా జిల్లాలోని వజీరాబాద్ తహసీల్లో జన్మించారు. పాఠశాల విద్యను వజీరాబాద్లో పూర్తి చేసి, లాహోర్లోని డి.ఎ.వి. కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1911లో ఎంఏ పట్టా పొందారు. భల్లా విప్ల కార్యకలాపాలు ఆయన విద్యా సర్టిఫికేట్లను ప్రభుత్వం జప్తు చేయడానికి దారితీశాయి. భల్లా పదిహేడేళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు. దాదాభాయ్ నౌరోజీ, బంకిం చంద్ర ఛటర్జీ, బాల గంగాధర్ తిలక్, రమేశ్ చందర్ దత్ల దార్శనికత, ఆలోచనల నుండి ప్రేరణ పొందారు. తన తండ్రికి సన్నిహితుడైన లాలా లజపతిరాయ్కి ఆరాధకుడు. భల్లా ఆధునిక, సాంకేతిక విద్య అవసరాన్ని చాటి చెప్పారు. పాఠ్యాంశాల్లో సంస్కృతం, హిందీతో పాటు ఆంగ్లం, సైన్స్ను తప్పనిసరి చేయాలని సూచించారు. భల్లా సంఘ సంస్కర్త కూడా. అంటరానితనం, కుల వ్యవస్థ, వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. మరో వైపు వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు కోసం పనిచేశారు. 1919లో గవర్నర్ జనరల్పై బాంబు విసిరే కుట్రలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. మూడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలయ్యారు. తిరిగి 1927లో అరెస్టు అయ్యారు. పోలీసు అధికారి జేపీ సాండర్స్ హత్యకు గురైన లాహోర్ కుట్ర కేసులో భాగస్వామిగా ఉన్నందుకు కూడా రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. తిరుగుబాటుదారులను రాజకీయ ఖైదీలుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్తో కలిసి నిరాహార దీక్ష చేసిన ఖైదీల్లో భల్లా ఒకరు. మహాత్మా గాంధీ ప్రభావం తర్వాత హింసాత్మక విప్లవ మార్గాలను విడిచిపెట్టారు. హిందీ, పంజాబీ, ఆంగ్ల భాషల్లో ప్రసంగాలు, రచనల ద్వారా గాంధీ మార్గాన్ని ప్రబోధించారు. జర్మనీ ఇంగ్లండ్లను కూడా పర్యటించారు. నేడు (జూన్ 10) భల్లా జయంతి. -
నిప్పు కణిక.. నెల్లూరు పొణకా కనకమ్మ గురించి ఈ విషయాలు తెలుసా?
పొణకా కనకమ్మ సుప్రసిద్ద సామాజిక కార్యకర్త. నెల్లూరు పట్టణంలోని కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రం కనకమ్మ స్థాపించినదే. కనకమ్మ 1892 జూన్ 10 న జన్మించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళల్లో కనకమ్మ ఒకరు. తనే కాదు, తన కుటుంబం మొత్తాన్నీ ఆమె సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా ప్రేరణ కలిగించారు. ఖద్దరు ధరించమని ప్రచారం చేశారు. రాజకీయరంగంలో కనకమ్మకు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది. సాహిత్య రంగంలో కూడా ఎంతో కృషి చేశారు. 1930 సత్యాగ్రహ ఉద్యమకాలంలో జైలుకు వెళ్లారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. 1963 సెప్టెంబర్ 15న మరణించారు. కనకమ్మ రాసిన ఒక పద్యంలో పంక్తులు ఈ విధంగా సాగుతాయి : ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి / తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి / జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి. దీనిని బట్టి పొణకా కనకమ్మలో స్త్రీవాద కోణం కూడా గోచరిస్తుంది. -
శతమానం భారతి: విద్యుత్ రంగం
స్వాతంత్య్రం వచ్చిన వెనువెంటనే బ్రిటిష్ కాలం నాటి విద్యుత్ చట్టాలను రద్దు చేసి, 1948 లో కొత్త స్వదేశీ చట్టాన్ని అమల్లోకి తేవడంతో జాతీయ ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డులు ఏర్పడ్డాయి. దాంతో మన విద్యుత్ వ్యవస్థ విస్తృతం అయింది. అనంతరం 1998 విద్యుత్ నియంత్రణ చట్టంతో విద్యుత్ చార్జీలు, విద్యుత్ బోర్డుల కార్యకలాపాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో మండళ్లు ఏర్పాటయ్యాయి. విద్యుత్ సరఫరా, పంపిణీల రంగంలోకి ప్రైవేటు సంస్థలకూ ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈ మార్పులన్నీ కూడా నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడానికే అయినప్పటికీ.. ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరిందని చెప్పలేం. వచ్చే పాతికేళ్లలో శతవర్ష స్వాతంత్య్ర వేడుకల నాటికి విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం ద్వారా దేశ అభివృద్ధి ప్రమాణాలను పెంచే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యం 1300 మెగావాట్లు కాగా, తలసరి వార్షిక వినియోగం 17 యూనిట్లుగా ఉండేది! నేడు ఉత్పత్తి సామర్థ్యం నాలుగు లక్షల మెగావాట్లకు పెరిగి, తలసరి వినియోగం 1000కి పైగా యూనిట్లకు చేరుకుంది. భవిష్యత్తులోని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉత్త్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, అదే సమయంలో వినియోగాన్ని తగ్గిస్తూ విద్యుత్ కొరతను అధిగమించడం అన్నది కూడా స్వతంత్ర భారతి ఏర్పచుకున్న లక్ష్యాలలో ఒకటి. -
సామ్రాజ్య భారతి: 1865/1947, ఘట్టాలు, చట్టాలు, జననాలు
ఘట్టాలు ► బిహార్, గయ ప్రాంతంలోని షెర్గాటీ అనే ప్రదేశంలో గ్రహశకలం పడింది. ఆ శకలానికి షెర్గాటీ అని పేరుపెట్టారు. ► ముంబైలో ప్రతిష్టాత్మకమైన బహుళ వ్యాపారాల ‘షాపూర్జీ పల్లోంజీ గ్రూపు’ స్థాపన జరిగింది. ► బ్రిటిష్ ఇండియా భూటాన్ ఓడించి.. అస్సాం, బెంగాల్ లలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. చట్టాలు ఇండియన్ సక్సెషన్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇండియా ఆఫీస్ సైట్ అండ్ అప్రోచ్ యాక్ట్, ఇండియన్ హైకోర్ట్ యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లకు రూపకల్పన జరిగింది. జననాలు లాలా లజపతి రాయ్, రుడ్యార్డ్ కిప్లింగ్, ఆనందిని గోపాల్ జోషి, మహారాజ భగవత్సింహ్జీ సాహిబ్, శాస్త్రీజీ మహరాజ్, సతీశ్చంద్ర ముఖర్జీ జన్మించారు. రాయ్ (పంజాబ్) భారత స్వాతంత్య్ర సమరోద్యమ నాయకులు. కిప్లింగ్ (బాంబే) రచయిత. ఆనందిని (బాంబే) భారతదేశ తొలి వైద్యురాలు. భగవత్సింహ్జీ (గుజరాత్) గోండల్ సంస్థానాధీశులు. శాస్త్రీజీ మహరాజ్ స్వామినారాయణ్ (గుజరాత్) సంప్రదాయ యజ్ఞపురుషుడు, సతీశ్చంద్ర ముఖర్జీ (హూగ్లీ) జాతీయ విద్యా విధాన సంస్థాపకులు. -
విషజ్వరమా? విష ప్రయోగమా?
గిరిజనోద్యమాలలో బిహార్లోని ఛోటానాగ్పూర్, రాంచీ పరిసరాలలో ముండా తెగ గిరిజనులు నిర్వహించిన పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడే.. బీర్సా ముండా. భూమి మీద తన తెగ ప్రజలు, ఇతర గిరిజన తెగల సోదరులు కోల్పోయిన హక్కు ఆయనను ఒక పెద్ద ఉద్యమానికి పురికొల్పింది. వలస పాలన, దాని చట్టాలు అడవులలో వ్యవసాయక విధానాన్ని భూస్వామిక వ్యవస్థలో భాగం చేసింది. దీనికి వ్యతిరేకంగానే అక్కడ ఉద్యమం వచ్చింది. బీర్సా జన్మించడానికి (1875) ఒక్క సంవత్సరం ముందే ముండా, ఒరాన్ గిరిజన తెగలు తమ భూములను పూర్తిగా కోల్పోయి, థికాదారుల పొలాలలో కూలీలుగా పనిచేస్తూ బతికే స్థితికి చేరుకున్నారు. 1875 నాటికి 150 అటవీ గ్రామాల మీద పూర్తి ఆధిపత్యం సాధించారు. ఫలితంగా వలస పాలకులకు, వీరికి మధ్య ఘర్షణ ఉద్ధృతం అయింది. 1900 మార్చి 3న బీర్సా అడవిలో ఆదమరచి నిద్రపోతూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు 460 మంది మీద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. విచారణలో ఉండగానే ఆరుగురు మరణించారు. ఇదంతా రాంచీ జైలులో జరిగింది. అక్కడే 1990 జూన్ 9 న బీర్సా హఠాత్తుగా కన్నుమూశాడు. అధికారులు మాత్రం అతడు విష జ్వరంతో మరణించాడని చెప్పారు. కానీ విషప్రయోగం వల్లనే చనిపోయాడని సాటి ఖైదీల వాదన. ఈ ఉద్యమానికే చరిత్రలో ఉల్గులాన్ అని పేరు. -
India@75: బ్రిటిష్ ఇండియా వేసవి రాజధానిగా సిమ్లా!
సామ్రాజ్య భారతి 1864/1947 జననాలు కామినీ రాయ్, స్వామీ అఖండానంద జన్మించారు. కామిని బెంగాలీ రచయిత్రి. సామాజిక కార్యకర్త, స్త్రీవాది. బ్రిటిష్ ఇండియాలో ఆనర్స్లో డిగ్రీ చేసిన తొలి మహిళ. బంగ్లాదేశ్లోని ఝలోకటిలో జన్మించారు. స్వామి అఖండానంద రామకృష్ణ పరమహంస శిష్యులు. రామకృష్ణ మిషన్కు మూడవ అధ్యక్షులు. కలకత్తాలో జన్మించారు. ఘట్టాలు సిమ్లాను బ్రిటిష్ ఇండియా వేసవి రాజధానిగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. జర్మన్–బ్రిటిష్ వృక్షశాస్త వేత్త డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసును ఏర్పాటు చేశారు. విద్యావేత్త సర్ సయ్యడ్ అహ్మద్ ఖాన్ ‘సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ను నెలకొల్పారు. చట్టాలు ఇండియన్ టోల్స్ యాక్ట్, నేవల్ ప్రైజ్ యాక్ట్, ఇండియా ఆఫీస్ సైట్ యాక్ట్ అమల్లోకి వచ్చాయి. -
మహోజ్వల భారతి: కయ్యర్ కిన్హన్న రాయ్
కయ్యర్ కిన్హన్న రాయ్ స్వాతంత్య్ర సమరయోధులు, రచయిత, కవి, పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు, రైతు. రాయ్ 1915 జూన్ 8 న తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. 12వ ఏటే ‘సుశీల’ అనే చేతిరాత పత్రికను ప్రచురించారు. మహాత్మాగాంధీ వల్ల ప్రభావితులై భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆయన భార్య ఉన్యక్క. ఎనిమిది మంది సంతానం. రాయ్ సెకండరీ స్కూల్ టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. జర్నలిజంలో ప్రావీణ్యం ఉంది. స్వాభిమానం, మద్రాస్ మెయిల్, ది హిందూ వంటి వార్తాపత్రికలకు రచనలను అందించాడు. 1969లో ఉత్తమ ఉపాధ్యాయునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. నాటకరంగం, వ్యాకరణం, పిల్లలపై పుస్తకాలు రాసిన రచయిత, కవి. ఆయన రచించిన కొన్ని ప్రసిద్ధ కవితలు శ్రీముఖ, ఐక్యగణ, పునర్ణవ, చేతన, కోరగా. అలాగే కన్నడ కవి గోవింద పాయ్ జీవిత చరిత్రను రచించారు. కయ్యర్కు మంగళూరు విశ్వవిద్యాలయం 2005 లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మంగళూరులో జరిగిన 66వ అఖిల కన్నడ సాహిత్య సమ్మేళనానికి (కన్నడ సాహిత్య సదస్సు) ఆయన అధ్యక్షత వహించారు. పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన పాదువారిల్లి పండవారు అనే కన్నడ చిత్రానికి ఆయన రాసిన కొన్ని కవితల్ని పాటలుగా ఉపయోగించారు. రాయ్ ఆసక్తిగల వ్యవసాయదారుడు. అరేకా, రబ్బరు, బియ్యం సాగులో మెళకువలు కనిపెట్టారు. రాయ్ తన 100 వ ఏట కేరళలోని కాసరగోడ్ , బదియాడ్కా సమీపంలోని కల్లాకాలియాలో తన నివాసంలో వృద్ధాప్యం కారణంగా 2015 ఆగస్టున సహజ మరణం పొందారు. -
స్వతంత్ర భారతి: భారత రత్నాలు
తొలి భారత రత్నలు రాజాజీ (సి.రాజగోపాలాచారి) సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్లు కాగా.. తాజా (2019) భారత రత్నలు.. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ . భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం.. భారతరత్న. తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ 1954లో ఈ అవార్డును నెలకొల్పారు. కళ, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, తదితర రంగాలలోని వ్యక్తుల అత్యుత్తమ కృషికి భారత రత్నను ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై తొమ్మిది మంది ఈ పురస్కారాన్ని అందుకు న్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు. జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం లభిస్తుంది. పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. 1954లో ఆ ఏడాది జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది భారతరత్న కాగా రెండవది ఆ తర్వాత స్థానంలోని మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. 1955 జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు. భారతరత్నను కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరిసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్కు ఆయన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో సచినే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు ఆయన 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో ఆయనే అతి పెద్ద వయస్కులు. చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు అయింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌర పురస్కారాలను ఆయన రద్దు చేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరణ అయ్యాయి. 1992లో ఈ పురస్కారాల ‘రాజ్యాంగ సాధికారత‘ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో అప్పుడు ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది. -
సామ్రాజ్య భారతి: రెండవ బహదూర్ షా జఫర్ మరణం
ఢిల్లీ రాజు 2వ బహదూర్ షా జఫర్ బర్మాలోని రంగూన్లో బ్రిటిష్ వారి బందీగా మరణించారు. బహదూర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. ‘జఫర్’ ఇతని కలంపేరు. 1857 తిరుగుబాటులో బహదూర్ షా పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి రక్షకునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. 1862లో తన 87వ సంవత్సరంలో ఆయన బలహీన పడ్డారు. బందీగా ఉండగా 1862లోనే ఆయన ఆరోగ్యస్థితి క్షీణదశకు చేరుకుంది. అదే ఏడాది నవంబరు 7 శుక్రవారం ఉదయం 5 గంటలకు ఈ చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ తుదిశ్వాస వదిలారు. చట్టాలు:హైకోర్ట్స్ యాక్ట్ కింద కలకత్తా హైకోర్టు ఏర్పాటైంది. బాంబేలోని జార్జి ఫోర్ట్ ధ్వంసం అయింది. నగర విస్తరణలో భాగంగా ప్రభుత్వమే దీనిని పడగొట్టింది. 1769లో ఆ జార్జి ఫోర్ట్ నిర్మాణం జరిగింది. ఇండియన్ స్టాక్ ట్రాన్స్ఫర్ యాక్ట్, హెబియస్ కార్పస్ యాక్ట్, ఫైన్ ఆర్ట్స్ కాపీరైట్ యాక్ట్ అమల్లోకి వచ్చాయి. జననాలు: విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతి చెందిన రఘుపతి వెంకట రత్నం నాయుడు అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించారు. 1939 మే 26న మరణించారు. 19వ శతాబ్దపు తొలి మహిళా హక్కుల కార్యకర్త రమాబాయి రనడే జనవరి 25న బొంబాయిలో జన్మించారు. భారతదేశంలోని మహిళలకు స్వేచ్ఛ, హక్కులు లేని సమయం అది. వారిని సంకెళ్ల నుండి విముక్తి చేయడానికి రమాబాయి కృషి చేశారు. -
మహోజ్వల భారతి: ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం
జూన్ 6, 1674 న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీ తనను తను ‘ఛత్రపతి’గా ప్రకటించుకున్నారు. ఛత్రపతి అయ్యాక 50 వేల బలగాలతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న రాయఘడ్ కోటలో మరణించారు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే 1927 ఫిబ్రవరి 19న జన్మించారు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని డీకొన్నారు. శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవారు. అయితే నిజాంషాహీ ప్రభువు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావ్ అనే మరాఠా యోధుణ్ణి హత్య చేయించడంతో అది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికారు. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసుకునేవారు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవానికి నోచుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమానికి, శివాజీ జీవించిన కాలానికి సంబంధం లేకున్నా.. ఆయన వ్యక్తిత్వం ఆ తర్వాతి కాలాలకు ఒక స్ఫూర్తిగా ఉంటూ వచ్చింది. -
ఆకుపచ్చని అమృతం
మనదేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు మరొక సందర్భంగా నేటి ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ జతకూడింది. స్వాతంత్య్రానికి 75 ఏళ్లయితే, పర్యావరణ దినోత్సవ ఆలోచన ఆవిర్భావానికి ఇది 50వ సంవత్సరం. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా సంభవించిన వినాశనంతో మొత్తం ప్రపంచం తల్లడిల్లింది. ఈ విషాదాన్ని ఇంకా మరవకముందే రెండో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చిన విపత్తు మరింత పెద్దది. అణ్వాయుధాల కారణంగా గాలి, నీరు, భూమి కాలుష్యమైన విషయం ఒక దశాబ్దం గడిస్తే కానీ ప్రపంచ దేశాలకు బోధపడలేదు. అలా మొదలైన అవగాహన, సమిష్టి కృషితో 1972 జూన్ 5న స్టాక్ హోమ్ లో ఒక పన్నెండు రోజులపాటు ‘యూ.ఎన్. కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్ మెంట్’ సదస్సు నడిచింది. ఈ సమావేశం మొదలైన జూన్ 5 వ తేదీన పర్యావరణ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం మొదలైంది! మొదలైంది మనదేశంలోనే! ఆలోచన లేదా ప్రతిపాదన... విశ్లేషణ లేదా సిద్ధాంత వివరణ... అటు తర్వాత ఆచరణ, అనువర్తన! అనంతరం.. తెలిసిన విషయాన్ని, అనుభవాన్ని మరింతమందికి, మరిన్ని ప్రాంతాలకు తీసుకుపోవడం! ఇది ఒక మనిషి మస్తిష్కం నుంచి బయలుదేరిన ఆలోచనా తరంగం ఎలా జనసంద్రంలో మమేకమవుతుందో చెబుతుంది. పర్యావరణ ఉద్యమశీలి, సంఘసేవకుడు సుందర్ లాల్ బహుగుణ (1927–2021) ప్రకృతి ప్రేమైక జీవనగమనాన్ని గమనిస్తే.. ఆ దంపతుల స్ఫూర్తికర్తల గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. బహుగుణ భార్య విమలకు మార్గదర్శి సరళాబెన్ (1901–1982) కాగా, బహుగుణకు మార్గనిర్దేశనం చేసింది మీరాబెన్ (1892–1982)! పరవళ్ళు తొక్కే గోదావరిని గమనించి, ఆ నది ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే త్రయంబకేశ్వరం వెళ్ళాలి. అలాగే సరళాబెన్, మీరాబెన్ కంటే ముందు తారసపడే మహనీయుడు జె సి కుమారప్ప (1892–1960). ఇంకొంచెం మూలాల్లోకి వెళితే తారసపడే పర్యావరణ వెలుగు.. గాంధీజీ! ఆలోచన గాంధీజీది కాగా, సిద్ధాంత వివరణను 1920 దశకంలో ఇచ్చింది ఆర్థిక శాస్త్రవేత్త జె సి కుమారప్ప. ఆచరణ, అనువర్తన దిశగా ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్ళినవాళ్ళు మీరాబెన్, సరళాబెన్ ద్వయం! ఈ క్రమంలో వారి కృషి, విజయాలు గమనిస్తే, మనదేశంలో రూపు దిద్దుకున్న ఆధునిక పర్యావరణ ఉద్యమం తొలిరూపు మన కళ్ళకు కడుతుంది. కనుకనే జె.సి.కుమారప్పను ‘గ్రీన్ గాంధియన్’ గా గౌరవిస్తే, మీరాబెన్ ను తొలి భారతదేశపు ‘ఎకో ఫెమినిస్ట్’ గా కొనియాడుతారు. ఇక సరళాబెన్ 1950, 60 దశాబ్దాలలో చండి ప్రసాద్ భట్, సుందర్ లాల్ బహుగుణ, విమలా బహుగుణ, రాధాభట్ వంటి ఎంతోమంది సామాజిక కార్యకర్తలను తీర్చిదిద్దారు. అంటే మనం చిప్కో ఉద్యమం పూర్వపు విషయాలు చెప్పుకుంటున్నామని గుర్తించాలి. అంటే ప్రపంచం గమనించకముందే పర్యావరణ సమస్య గుర్తించి రకరకాల ఆలోచనలు మొదలైంది మనదేశంలో! 1974 మార్చిలో మొదలైన చిప్కో ఉద్యమాన్ని.. ప్రపంచ దేశాలలో కూడా తొలి పర్యావరణ ఉద్యమంగా పరిగణిస్తారు. దీనికి నేపథ్యం ఏమిటో పరిశీలిస్తే భారతదేశపు పర్యావరణ త్రిమూర్తులనదగ్గ ముగ్గురు మహనీయుల ఉత్కృష్టమైన సేవ కనబడుతుంది. ఈ ముగ్గురూ క్రెస్తవులు కావడం ఒక విశేషం కాగా, అందులో మీరాబెన్, సరళాబెన్ ఇద్దరు ‘గాంధీజీ ఆంగ్లేయ కుమార్తెలు’గా గుర్తింపు పొందారు. జెసి కుమారప్ప అసలు పేరు జోసెఫ్ చెల్లాదురై కార్నోలియన్, మీరాబెన్ పేరు మ్యాడలిన్ స్లేడ్. సరళాబెన్ పూర్వపు పేరు క్యాథలిన్ మేరీ హెయిల్ మన్. గాంధీజీ ప్రతిపాదనలు అర్థిక స్థితిగతులు, ప్రజల బాగోగులు, పేదరికం, ఆకలి వంటి విషయాలు చర్చిస్తున్నపుడు గాంధీజీ ప్రకృతి వనరులు, వ్యవసాయం ప్రకృతిని రక్షించడం వంటి విషయాలు ప్రస్తావిస్తారు. అప్పటికి గాంధీజీ పర్యావరణం, ఎకాలజి, సస్టెయిన్ బుల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ వంటి మాటలు వాడలేదు. నేటికి వందేళ్ళ క్రితం తనకు ఆర్థికశాస్త్రం అంత బాగా తెలియదు అంటూనే మనుషులుగా మన బాధ్యత ఏమిటి, ఇతర వ్యక్తులతో, ప్రకృతితో ఎలా నడుచుకోవాలో గాంధీజీ చాలా సందర్భాలలో చెప్పారు. గాంధీజీ ఆలోచనలను ఒక సిద్ధాంతంగా మనకు ఇచ్చిన దార్శనికుడు! ప్రపంచం ఇంకా కళ్ళు తెరుచుకోని సమయంలో పర్యావరణ భావనను గాంధీజీ, కుమారప్ప ప్రతిపాదిస్తే, ఆ భావనలను ఆచరించడమే కాక పరివ్యాప్తం చేసిన మహిళా ద్వయం మీరాబెన్, సరళాబెన్! భారతదేశపు స్వాతంత్య్రోద్యమం కేవలం రాజకీయ హక్కుల ఉద్యమం కాదు. గాంధీజీ భావనలో అది సమగ్ర అభ్యుదయ ఉద్యమం, అందులో ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, సహజవనరుల పొదుపు కూడా అంతర్భాగాలే! ఆ సమగ్ర స్ఫూర్తిని అందుకోలేకపోవడం మనదేశపు సామూహిక వైఫల్యం! పర్యావరణ ఉద్యమాలు మన నేల నుండి ఇతర దేశాలకు పాకాయి, స్ఫూర్తినిచ్చాయి. అంతకుమించి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వాదులంతా గాంధీజీ అహింసను ఆచరణాత్మకంగా విశ్వసిస్తారు. సంరక్షణ అహింసే కదా! – డా‘‘ నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
చైతన్య భారతి: ఇందిరాగాంధీ 1917–1984
ఇందిరాగాంధీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి. జనాకర్షకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పాశ్చాత్య వ్యతిరేక విధానాల సమ్మేళనంతో పరిపాలన కొనసాగించారు. మధ్య తరగతి జీవితాలను సుస్థిరం చేయడానికి ఆమె ప్రవేశపెట్టిన చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పన్ను మినహాయింపులు ఇప్పటికీ కొనసాగడమే కాదు, రాజకీయార్థిక కోణంలో వాటికున్న ఆకర్షణ ఎంతగానో పెరిగింది. బంగ్లాదేశ్ ఏర్పాటు ఆమె నాయకత్వ సామర్థ్యానికి ఒక మచ్చుతునకగా మిగిలిపోతుంది. ఆ ప్రాంతంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆమె యుద్ధం అనే సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అమెరికా నాయకత్వానికి ఎదురొడ్డి నిలవడం, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర పరిశోధన, సైన్యం వంటి రంగాలకు ఆమె ఇచ్చిన ఇతోధిక ప్రాధాన్యం దేశానికి బలమైన దిశా నిర్దేశం చేసింది. చాలామంది చెప్పినట్లు, ఇందిరా గాంధీ వ్యక్తిత్వంలో, విశ్వాసాలలో వైరుధ్యాలు బాగా కనిపిస్తాయి. ఆమెలోని వైరుధ్యాలు చాలా వరకు అత్యవసర పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చాయి. స్వతంత్ర భారత దేశంలో ఏకైక అత్యవసర పరిస్థితిని విధించి, ప్రజాస్వామ్యయుతమైన హక్కులను కాలరాసిన ప్రధానిగా ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతారు. అందుకు ఆమె పట్ల వ్యక్తమైన నిరసన కూడా ఎప్పటికీ భరతజాతికి గుర్తుండిపోతుంది. అయితే అత్యవసర పరిస్థితిని తొలగించి, ఎన్నికల బరిలోకి దిగాలని 1977లో ఆమె స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం, ‘ఇంతటితో ప్రజాస్వామ్యం సమాధి అయిపోయినట్లే’నని భావించిన నిపుణుల అంచనాలను తలకిందులు చేసింది. ఆమె లోని దేశభక్తిని, దేశం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సిక్కులను చేర్చుకోవడం మంచిది కాదని ఎందరో సూచించినా ఆమె దానిని లెక్క చేయలేదు. చివరికి ఆ కారణం వల్లే ఆమె మరణించారు. అలా ఆమె మరణం కూడా ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా వివరించింది. ఆమె సంక్లిష్ట సాహసిక నాయకురాలని చాటి చెప్పింది. – దీపేశ్ చక్రవర్తి , చికాగో యూనివర్సిటీలో చరిత్ర అధ్యయనాల ప్రొఫెసర్ -
సామ్రాజ్య భారతి 1861/1947.. స్వతంత్ర భారతి 1951/2022
సామ్రాజ్య భారతి 1861/1947 రవీంద్రనాథ్ టాగోర్, కాదంబిని గంగూలి, దేవకీ నందన్ ఖత్రీ, భికైజీ కామా, బాబా తాజుద్దీన్ నాగ్పురి జన్మించారు. టాగోర్ విశ్వకవి, నోబెల్ గ్రహీత. కాందబిని భారతదేశపు తొలినాళ్ల మహిళా డాక్టర్. దేవకీ నందన్ మార్మిక నవలల తొలి రచయిత. భిఖైజీ కామా స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమకారిణి. మేడమ్ కామా అని కూడా అంటారు. బాబా తాజుద్దీన్ ప్రసిద్ధ సాధువు. టాగోర్ కలకత్తాలో, కాందబిని భగల్పూర్ (బెంగాల్ ప్రెసిడెన్సీ)లో, దేవకీ నందన్ నమస్తిపుర్ (బిహార్)లో, మేడమ్ కామా నవ్సరీ (బాంబే ప్రెసిడెన్సీ)లో, బాబా తాజుద్దీన్ కంప్టీ (మహారాష్ట్ర)లో జన్మించారు. ఘట్టాలు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్–1861 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్పంచుకునే అవకాశం కల్పించింది. అంతకు నాలుగేళ్ల క్రితం 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. (అంతకుముందు ఈస్టిండియా కంపెనీ పాలన ఉండేది). అందులో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నిటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొన్నారు. భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరు మీద చట్టాలను రూపొందించడం వల్ల వాటిని కౌన్సిల్ చట్టాలుగా పరిగణించారు. అలహాబాద్లో గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్ని నెలకొల్పారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ స్థాపన జరిగింది. చట్టాలు ఈ ఏడాదే.. ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, ఇండియన్ హైకోర్ట్ యాక్ట్, పోలీస్ యాక్ట్, స్టేజ్–క్యారేజస్ యాక్ట్, ఫారిన్ లా అసెర్టెయిన్మెంట్ యాక్ట్, మేలీషియస్ డ్యామేజన్ యాక్ట్, విల్స్ యాక్ట్, డొమైసిల్ యాక్ట్.. అమల్లోకి వచ్చాయి. స్వతంత్ర భారతి 1951/2022 పంచవర్ష ప్రణాళికలు భారతదేశం రిపబ్లిక్గా మారిన రెండు నెలలకే ఉజ్వల భవితను అందుకోవడం కోసం ఐదేళ్లకోసారి ప్రణాళికను రూపొందిం చేందుకు ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారు. అయితే 1960లో యుద్ధాలు, దుర్భిక్షాల వల్ల, 1970లలో యుద్ధం, ఆయిల్ సంక్షోభం వల్ల ప్రణాళికా లక్ష్యాలను పూర్తిగా సాధించలేక పోయాం. అయినప్పటికీ యోజనా భవన్ పెద్ద పెద్ద కలలు కనడం మానలేదు. 2014లో మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టింది. -
మహోజ్వల భారతి: సాహితీ కుబేరుడు
కుబేర్నాథ్ రాయ్ హిందీ సాహితీవేత్త. సంస్కృత పండితులు. రచయిత. ఉత్తర ప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలోని మత్స గ్రామంలో భూమిహార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి వకుంత్ నారాయణ్ రాయ్. కుబేర్నాథ్ తన ప్రాథమిక విద్యను మత్స గ్రామంలో అభ్యసించారు. వారణాసిలోని క్వీన్ కాలేజీలో మెట్రిక్యులేషన్ చదివారు. ఉన్నత చదువుల కోసం బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేశారు.. విద్యావేత్తగా ‘విక్రమ్ విశ్వవిద్యాలయ’ లో కెరీర్ను ప్రారంభించాడు. ఆ కొంతకాలానికే ఇంగ్లిష్ లిటరేచర్ లెక్చరర్గా అస్సాంలోని నల్బరీకి మారారు. స్వామి సహజానంద మహావిద్యాలయ ప్రిన్సిపాల్గా పని చేశారు. భారతీయ జ్ఞానపీఠం నుంచి మూర్తిదేవి అవార్డు; యు.పి., పశ్చిమబెంగాల్, అస్సాం ప్రభుత్వాల నుంచి గౌరవ పురస్కారాలు పొందారు. 1933 మార్చి 26 న జన్మించిన కుబేర్నాథ్ 1996 జూన్ 5న మరణించారు. -
ఆపరేషన్ బ్లూ స్టార్
సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 38 ఏళ్లు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సుమారు 4 దశాబ్దాలుగా స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984లో సైనిక చర్యకు ఆదేశించారు. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది చనిపోగా, అనంతరం ప్రతీకారంగా జరిగిన ఇందిర హత్య, పర్యవసానంగా జరిగిన మూకుమ్మడి హత్యాకాండలలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ఆనాడు ఇందిరా గాంధీ మరణించారు. మరోవైపు స్వర్ణదేశాలయంపై మిలటరీ దళాలు చేసిన ఆపరేషన్ లో బ్రిటిష్ సైన్యం పాత్ర కూడా ఉందని బ్రిటిష్ సిక్కు కమ్యూనిటీ నమ్ముతోంది. ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటిష్ సైన్యం పాత్రపై యూకే విదేశీ కార్యాలయంలో ఉన్న పత్రాలు మాయమయ్యాయని కూడా అక్కడి బ్రిటిష్ సిక్కు మతస్తులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఇండియాకు నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ పాలకవర్గం సహకరించిందని, బ్రిటిష్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ సోల్జర్స్.. ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్నారని బ్రిటన్లోని సిక్కులు బలంగా విశ్వసిస్తున్నారు.