
న్యూఢిల్లీ: 2022–23 విద్యా సంవత్సరానికి 11, 12వ తరగతుల సిలబస్లో సీబీఎస్ఈ పలు మార్పులు ప్రకటించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ కాలం, ఆసియా–ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సామ్రాజ్యాల అవతరణ, మొగలుల పాలన, పారిశ్రామిక విప్లవం పాఠ్యాంశాలను తొలగించింది. 10వ తరగతిలో ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లోని ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్ను తీసేసింది.
ఉర్దూ కవి ఫయీజ్ అహ్మద్ ఫయిజ్ అనువాద కవితలను, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్లను తీసేసింది. సిలబస్లో హేతుబద్ధత కోసమే ఈ మార్పులు చేసినట్టు చెప్పింది. గత విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా నిర్వహించిన ఫైనల్ పరీక్షను ఈసారి ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించింది. 2020లోనూ 11వ తరగతి రాజనీతి శాస్త్రంలో పలు చాప్టర్లు తొలగించిన సీబీఎస్ఈ, నిరసనలతో మరుసటి ఏడాది నుంచి వాటిని పునరుద్ధరించింది.