
ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని చెప్పారు. శివాజీ విధానాలు, పాలనా వ్యవస్థ ఈనాటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరాఠా రాజుగా ఛత్రపతి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్గఢ్ కోటపై రాష్ట్రస్థాయి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం పంపించారు. శివాజీ దార్శనికత, అరుదైన వ్యక్తిత్వం చరిత్రలోని ఇతర రాజుల కంటే భిన్నమని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ శివాజీ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింబమని వివరించారు. ఆయన వీరత్వం, భయానికి తావులేని కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
అమెరికా కాంగ్రెస్లో 22న మోదీ ప్రసంగం
వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ జూన్ 21నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో అధికారికంగా పర్యటించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్నుద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ భారతం, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 22న వైట్హౌస్లో అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. ఉభయసభలైన ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి మోదీ మొదటిసారిగా 2016లో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment