
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు(Covid-19 In India) అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,302కి చేరింది. గత 24 గంటల్లో 276 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 3,281 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, గుజరాత్లో కేసుల సంఖ్య గణనీయంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రాల వైద్య శాఖలు అప్రమత్తమయ్యాయి. తాజా గణాంకాల్లో మొత్తం ఏడు కోవిడ్ మరణాలు సంభవించగా(Covid Deaths India Latest).. ఒక్క మహారాష్ట్రలో నలుగురు చనిపోయారు. అయితే ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉంటోందని అధికారులు అంటున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం తొలి కోవిడ్ కేసు(First Covid Case) నమోదు అయ్యింది. సిర్మూర్ జిల్లా నహాన్లో 82 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య విభాగం ప్రకటించింది. వైరస్ కొత్త వేరియెంట్లు భారత్లో ప్రభావం చూపిస్తుండడమే కేసుల పెరుగుదలకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అదే సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.