కేజ్రీవాల్‌ విడుదల | Delhi CM Arvind Kejriwal Released From Tihar Jail Video | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ విడుదల

Published Fri, Sep 13 2024 6:43 PM | Last Updated on Fri, Sep 13 2024 7:22 PM

Delhi CM Arvind Kejriwal Released From Tihar Jail Video

న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్‌ స్కాం కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

కేజ్రీవాల్‌కు బెయిల్‌ దక్కడంతో ఆప్‌ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. భారీగా తీహార్‌ జైలు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వాళ్లకు అభివాదం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. 

‘‘వర్షంలోనూ నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను జైల్లో బంధించి నా మనోస్థైర్యం దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు  నా బలం, నాలో ధైర్యం వంద రేట్లు పెరిగింది’’ ఆయన పేర్కొన్నారు. 

  • నేను నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడు
  • నన్ను జైల్లో వేస్తే బలహీనపడతానని అనుకున్నారు
  • జైలు గోడలు నన్ను బలహీనపర్చలేవు 
  • దేశాన్ని అమ్మే.. విచ్ఛిన్నం శక్తులకు వ్యతిరేకంగా పోరాడతా
  • దేశానికి నా సేవ కొనసాగిస్తా

కేజ్రీవాల్‌కు స్వాగతం పలికిన వాళ్లలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌, మంత్రి అతీషి, సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియా, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌.. తదితరులు ఉన్నారు. 

 

 

  • లిక్కర్‌ స్కాం కేసులో.. మనీలాండరింగ్‌ అభియోగాలపై ఈ ఏడాది మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.
  • లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.
  • ఆ గడువు ముగియడంతో జూన్‌ 2న తిరిగి లొంగిపోయారు.
  • ఈ కేసులో జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది.
  • అయితే.. దీనిపై ఈడీ (ED) అభ్యంతరం వ్యక్తంచేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.
  • అనంతరం జూన్‌ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
  • దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.
  • ఇక.. ఈడీ కేసులో రౌస్‌ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ.. ఆయన సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్‌ జైల్లో ఉండాల్సి వచ్చింది.
  • దాదాపు ఆరు నెలలపాటు లిక్కర్‌ స్కాం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్‌.. ఎట్టకేలకు బయటకు వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement