
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. మోదీ నివాసంలో ప్రధానితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటన్నరపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకురావాల్సిన బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది.
అయితే, కేంద్రం ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. కాగా, ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఆదిత్య–ఎల్1 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం