Megha Infrastructures Give Oxygen Beds To Tamil Nadu Government Over Covid - Sakshi
Sakshi News home page

కరోనా: తమిళనాడుకు మేఘా స‌హాయం 

Published Thu, May 27 2021 12:56 PM | Last Updated on Thu, May 27 2021 2:36 PM

Megha Infrastructures Give Oxygen Beds To Tamil Nadu Government Over Covid - Sakshi

దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ. తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది.  ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్‌ను, ఆస్పత్రులకు వివిధ మౌళిక సదుపాయాలను కల్పించిన ఎంఈఐఎల్, తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఉచితంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్స్ను ఏర్పాటు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ ఇందులో భాగ‌స్తుల‌య్యాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. 

చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు
గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ  యుద్ధ‌పాత్రిప‌దిక‌న పనులు చేస్తోంది.  వీటితో పాటు ఇరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 660 బెడ్లను సిద్ధం చేసిన ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో 2500 బెడ్ల ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) తనవంతు సహాయంగా తమిళనాడుకు ఆక్సిజన్ బెడ్లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

మేఘాకు సేవల్లో పాలు భాగస్తులైన క్రెడాయ్, జి రియల్టర్స్
మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి.

జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు.  కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది.

అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు.  

క్రెడాయ్ తమిళనాడు అధ్యక్షుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “సిఎస్ఆర్ పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, లైఫ్ స్టైల్ (చెన్నై), ఒలింపియా, టిఎన్ ఇస్పాట్ పరిషత్ లిమిటెడ్, తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం వంటి అనేక సంస్థలు తమిళనాడు ప్రజల కోసం ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కేవలం 72 గంటల  తక్కువ వ్యవధిలో మేఘా సంస్థ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది”

జి స్క్వేర్ రియల్టర్స్ ప్రమోటర్ బాలా మాట్లాడుతూ, “మానవ జీవితం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) - జి స్క్వేర్ సంస్థలు కలిసి ప్రభుత్వానికి అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఈ ఆసుపత్రులను తమిళనాడు అంతటా ఏర్పాటు చేయడానికి గౌరవ ఆరోగ్య మంత్రి, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయన్నారు” 

బాధ్యతగా కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం: బి. శ్రీనివాస్ రెడ్డి
నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసి గుర్తింపు పొందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ సంస్థ కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిందని ఆ సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ర్టంలో 2500 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదురైలో కేవలం 72 గంటల్లోనే 200 పడకల ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు.

దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటు చర్యలు ప్రారంభించినట్లు బి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అలాగే క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.
చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement