‘లగచర్ల’ ఘటన ఆందోళనకరం | National Human Rights Commission expresses anger at state government | Sakshi
Sakshi News home page

‘లగచర్ల’ ఘటన ఆందోళనకరం

Nov 22 2024 4:26 AM | Updated on Nov 22 2024 4:26 AM

National Human Rights Commission expresses anger at state government

రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం 

బాధితులలో చాలా మంది షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారే 

ఆ ఘటనలో గాయపడిన వారికి వైద్యం అందించారా? 

లగచర్లలో పరిశీలనకు బృందాన్ని పంపుతామని వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: ‘లగచర్ల’అరెస్టుల ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులు షెడ్యూల్డ్‌ కులాల వారని, వారిపై జరిగిన దాడి ఆందోళన కలిగించే ఘట న అని పేర్కొంది. ఈ అంశంలో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తి నివేది క ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గురువారం నోటీసులు జారీ చేసింది. లగచర్లలో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పర్యటించి పరిశీలిస్తుందని పేర్కొంది.
 
ఇది చాలా తీవ్రమైన సమస్య.. 
లగచర్ల బాధిత కుటుంబాల మహిళలు 12 మంది ఈ నెల 18న బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావులతో కలిసి ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘‘ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరింపుల కు పాల్పడుతున్నారు. మా జీవనాధారమైన భూ ములను ఇవ్వలేమని తేల్చి చెప్పినవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు’’అని పేర్కొన్నారు. 

కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సేకరించిన 16 వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ.. ఇక్కడ 1,374 ఎకరాలు సేకరించి ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. ఈ అంశాలను ఎన్‌హెచ్‌ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. ఫిర్యాదులోని అంశాలు నిజ మైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొంది. 

‘‘బాధితులు తమపై పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని, తప్పుడు నేరారోపణలు మోపారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎన్‌హెచ్‌ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. సరైన విధానాలను అనుసరించకుండా ప్రతిపాదిత ‘ఫార్మా విలేజ్‌’కోసం భూసేకరణ చేయడం, వ్యతిరేకించిన గ్రామస్తులపై దాడి చేయడం సరికా దు. తమపై దాడి జరిగిందని చెప్పివారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. 

పైగా బలవంతంగా భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయతి్నంచారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామస్తులపై దాడి చేశారని.. గర్భిణులను కూడా వదల్లేదని.. సాయం కోసం ఎవరినైనా అడిగే పరిస్థితి లేదని.. ఇంటర్నెట్, విద్యుత్‌ సేవలు సైతం నిలిపేశారని ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు భయంతో ఇళ్లు వదిలి అడవులు, సాగుభూముల్లో తలదాచుకుంటున్నారని ఫిర్యాదు చేశారు..’’అంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది.

రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి
‘లగచర్ల’ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తోపాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న గ్రామస్తుల వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. భయంతో అటవీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో దాక్కున్న గ్రామస్తుల స్థితిగతులను నివేదికలో పొందుపరచాలని సూచించింది. 

బాధిత మహిళలకు ఏవైనా వైద్య పరీక్షలు చేశారా?, గాయపడిన గ్రామస్తులకు వైద్యం అందించారా? అని కమిషన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో నివేదిక సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement