
సాక్షి,ఢిల్లీ: బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే విషయంలో నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతలు నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయొద్దని మోదీ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద విషయాలపై మౌనంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమక్షంలో నాయకులు చేసే వ్యాఖ్యల్లో అణుకువ, బాధ్యత ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా, ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణికి దూరంగా ఉండాలని, అనవసర వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారతాయని హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు.
PM Narendra Modi tweets, "Participated in the NDA Chief Ministers' Conclave in Delhi. We had extensive deliberations about various issues. Various states showcased their best practices in diverse areas, including water conservation, grievance redressal, strengthening… pic.twitter.com/9Hd03QrWXG
— ANI (@ANI) May 25, 2025
మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ‘యావత్తు దేశ ప్రజలు, జవాన్లు తలలు వంచి ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ జవాబిచ్చిన తీరును ప్రశంసించడానికి మాటలు చాలవు అని వ్యాఖ్యానించారు. ఇలా ఆపరేషన్ సిందూర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా, ఎన్డీయే సమావేశంలో బీజేపీ నేతలకు ప్రధాని మోదీ పై ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఎన్డీయే సమావేశంలో ఆపరేషన్ సిందూర్పై స్పష్టత ఇచ్చిన మోదీ.. కాల్పుల విరమణ ఒప్పందంలో దేశానిదే తుది నిర్ణయం. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు సీజ్ఫైర్కు అంగీకరించాం. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో మరే ఇతర దేశం జోక్యం చేసుకోలేదన్నారు.