
క్యాబిన్లోకి వెళ్లి స్పీకర్ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం
ముంబై: ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓబీసీ కోటాపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. స్పీకర్ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీ కోటాపై చర్చ ప్రారంభమైంది.
ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాధవ్ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. అనంతరం ఆయన క్యాబిన్లోకి వెళ్లి స్పీకర్ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాక.. సమావేశాన్ని వాయిదా వేశారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘మా ఎమ్మెల్యేలపై చేస్తున్నవన్ని అసత్య ఆరోపణలు. స్పీకర్ని దూషించడం, దాడి చేయడం అనేది అధికార పార్టీ అల్లిన కట్టుకథ. ఓబీసీల కోసం మేం మరికొంత మంది ఎమ్మెల్యేలను కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. స్పీకర్ కూడా మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అన్నారు.
ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్ జాధవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ.. దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్, సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ఎదురుగానే జరిగింది. కొందరు నాయకులు నా మీద చేయి చేసుకున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాను. దీనిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్ని కోరాను’’ అని తెలిపారు.