
ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న మంత్రి అనిల్
పోలవరం రూరల్/రంపచోడవరం/దేవీపట్నం: చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్కు ముప్పు ఏర్పడిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఆయన బుధవారం పోలవరం ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ కాఫర్ డ్యాం, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులతో పాటు ఎడమ కాలువకు, నావిగేషన్ కెనాల్కు సంబంధించిన సొరంగ మార్గాలను పరిశీలించారు. నిర్వాసితుల గృహాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, ప్రాజెక్టు పనుల పురోగతిపై మేఘ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
సీఎం జగన్ నిర్దేశించిన సమయానికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా స్పిల్వే పూర్తి చేసి.. కాఫర్ డ్యాం నిర్మించి.. వరదనీటిని మళ్లించాక డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉందన్నారు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోలేదన్నారు. దీంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెలిపారు.
చంద్రబాబు తీరు వల్ల సమయం, డబ్బు.. వృథా అయ్యాయని మండిపడ్డారు. వరదల సమయానికి నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా 41వ కాంటూరు పరిధిలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మే నెలాఖరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేసి ఏడు మండలాల పరిధిలోని 17 వేల కుటుంబాలను తరలిస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ ఎం.సుధాకర్బాబు, స్పెషల్ కలెక్టర్ ఆనంద్, ప్రాజెక్టు ఎస్ఈ కె.నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, మేఘ జీఎం ఎ.సతీష్బాబు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment