ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ | Nara Lokesh: TDP Faction Politics In Guntur And Palnadu District | Sakshi
Sakshi News home page

ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ

Jun 25 2022 4:23 PM | Updated on Jun 25 2022 4:31 PM

Nara Lokesh: TDP Faction Politics In Guntur And Palnadu District - Sakshi

వారిని ప్రలోభాలకు గురిచేసి ఎలాగొలా లాక్కొచ్చారు. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత పరామర్శ పేరుతో యాత్రచేస్తూ లోకేష్‌ అడుగడుగునా పూలమాలలతో సన్మానాలు చేయించుకోవడం విమర్శలకు దారితీసింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇటీవల హత్యకు గురైన బొల్లాపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించే పేరుతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రాజకీయ యాత్ర చేశారు. దీనిని జయప్రదం చేసేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. భారీగా జన సమీకరణకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయినా కార్యకర్తలను తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడ్డారు.
చదవండి: తుప్పల్లో టెంకాయ్‌.. మా బాబే!

వారిని ప్రలోభాలకు గురిచేసి ఎలాగొలా లాక్కొచ్చారు. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత పరామర్శ పేరుతో యాత్రచేస్తూ లోకేష్‌ అడుగడుగునా పూలమాలలతో సన్మానాలు చేయించుకోవడం విమర్శలకు దారితీసింది. బొల్లాపల్లికి గుంటూరు, నరసరావుపేట, వినుకొండ నుంచి నేరుగా మార్గం ఉన్నా అటు కాకుండా గుంటూరు, మేడికొండూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా రూట్‌ నిర్ణయించారు. గుంటూరు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక రచించుకోవడం, ఎక్కడికక్కడ జనసమీకరణ చేసుకుని ప్రతి చోటా దండలు, పూలు వేయించుకోవడంతో టీడీపీ నవ్వులపాలైంది.

ఫ్యాక్షన్, మైనింగ్‌ మాఫియాను వెంట పెట్టుకుని.. పక్కనే ఫ్యాక్షన్‌ , మైనింగ్‌ మాఫియా నేతలను పెట్టుకుని లొకేష్‌ పర్యటన ఆసాంతం నీతులు వల్లించారు. ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ ప్రగల్భాలు పలికారు. బొల్లాపల్లి చేరుకున్నాక కత్తితో బతికితే కత్తితోనే చస్తావంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారు. బ్రహ్మారెడ్డిని చూస్తే ఉచ్చపోసుకుంటావంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లినీ అసభ్యంగా దూషించారు.   

బ్రహ్మారెడ్డి వల్లే పడగ విప్పిన ఫ్యాక్షన్‌  
వాస్తవానికి ఫ్యాక్షన్‌  బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించిన తర్వాతే మాచర్లలో మళ్లీ హత్యలు మొదలయ్యాయి. దీనికి తెలుగుదేశం అధిష్టానమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన జల్లయ్యపై 2014–19 మధ్యలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పది కేసులు నమోదయ్యాయంటే అతని గత చరిత్ర ఏంటో అందరికీ అర్థమవుతోంది.  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బ్రహ్మారెడ్డి తల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె సొంత మండలంలో 15 ఫ్యాక్షన్‌  హత్యలు జరిగాయి.

అందులో ఏడు హత్యల్లో బ్రహ్మారెడ్డి ఏ1 ముద్దాయి. ఫ్యాక్షన్‌  పేరుతో సొంత బాబాయ్‌ని చంపిన కేసులోనూ ఆయన ఏ1గా ఉన్నారు. హత్యకు గురైన జల్లయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను హత్య చేశాడు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువర్గాలను కూర్చోబెట్టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజీ చేశారు. బ్రహ్మారెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వచ్చిన తర్వాతే మళ్లీ ఫ్యాక్షన్‌  పడగ విప్పుతోంది. ఈ విషయాలన్నింటినీ మరుగున పెట్టి వైఎస్సార్‌ సీపీ మీద బురదజల్లడమే ధ్యేయంగా లోకేష్‌ చేసిన పరామర్శ యాత్ర ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ  సాగడంతో టీడీపీ ప్రజల్లో మరింత అభాసుపాలైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement