
పూర్ణకుంభంతో ఎడపాడికి స్వాగతం పలుకుతున్న అన్నాడీఎంకే కార్యకర్తలు
తిరువళ్లూరు (చెన్నై): అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు ఎడపాడి పళణిస్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే కేఎస్ విజయకుమార్ కుమార్తె వివాహానికి ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం హాజరయ్యారు. ఎడపాడి పళణిస్వామికి పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వధూవరులను ఆశ్వీరించిన మాజీ ముఖ్యమంత్రి, ఈగువారిపాళ్యం వెళ్లి యూనియన్ చైర్మన్ శివకుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.
అనంతరం మీడియా సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేతో టచ్లో ఉన్నారనే వార్తలు అవాస్తమన్నారు. డీఎంకే ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విసిగిపోయారని, వారిపై ఉన్న అసంతృప్తి త్వరలో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని త్వరలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మేయర్, డిప్యూటి మేయర్లను వెనుక సీట్లు కేటాయించడం వివాదస్పదంగా మారిన విషయంపై స్పందిస్తూ, డీఎంకే కార్పొరేట్ కంపెనీ లాంటింది. ఇక్కడ సీఈఓలుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళికి ఉన్న ప్రాధాన్యత ప్రజాప్రతినిధులకు వుండదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధిను షాడో సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు.
శశికళ– దినకరన్లకు చోటులేదు
అన్నాడీఎంకేలోకి శశికళ, టీటీవీ దినరకన్ ఓపీఎస్ ఆహ్వానించడం హర్షిందగ్గ విషయం కాదన్నారు. అన్నాడీఎంకేలో కార్యకర్తలే పాలకులని, గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామన్నారు. అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయంపై ఎడపాడి సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకు మించి తాము మాట్లాడనన్నారు.
వేగంగా స్పందించలేదు
అన్నాడీఎంకే కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పళణి స్వామి ఆరోపించారు. డీఎంకే హయాంలో సాధారణ ప్రజలకే భద్రత లేనప్పుడు తమ కార్యాలయానికి భద్రత కల్పిస్తారనే నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పునరాలోచన చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment