VK Sasikala
-
మాతో టచ్లో 10 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే పార్టీలోకి
తిరువళ్లూరు (చెన్నై): అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు ఎడపాడి పళణిస్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే కేఎస్ విజయకుమార్ కుమార్తె వివాహానికి ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం హాజరయ్యారు. ఎడపాడి పళణిస్వామికి పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వధూవరులను ఆశ్వీరించిన మాజీ ముఖ్యమంత్రి, ఈగువారిపాళ్యం వెళ్లి యూనియన్ చైర్మన్ శివకుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేతో టచ్లో ఉన్నారనే వార్తలు అవాస్తమన్నారు. డీఎంకే ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విసిగిపోయారని, వారిపై ఉన్న అసంతృప్తి త్వరలో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని త్వరలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మేయర్, డిప్యూటి మేయర్లను వెనుక సీట్లు కేటాయించడం వివాదస్పదంగా మారిన విషయంపై స్పందిస్తూ, డీఎంకే కార్పొరేట్ కంపెనీ లాంటింది. ఇక్కడ సీఈఓలుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళికి ఉన్న ప్రాధాన్యత ప్రజాప్రతినిధులకు వుండదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధిను షాడో సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. శశికళ– దినకరన్లకు చోటులేదు అన్నాడీఎంకేలోకి శశికళ, టీటీవీ దినరకన్ ఓపీఎస్ ఆహ్వానించడం హర్షిందగ్గ విషయం కాదన్నారు. అన్నాడీఎంకేలో కార్యకర్తలే పాలకులని, గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామన్నారు. అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయంపై ఎడపాడి సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకు మించి తాము మాట్లాడనన్నారు. వేగంగా స్పందించలేదు అన్నాడీఎంకే కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పళణి స్వామి ఆరోపించారు. డీఎంకే హయాంలో సాధారణ ప్రజలకే భద్రత లేనప్పుడు తమ కార్యాలయానికి భద్రత కల్పిస్తారనే నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పునరాలోచన చేయాలని కోరారు. -
పళణి కోటలోకి శశికళ!
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి సొంత జిల్లాలో పర్యటించేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. చెన్నై నుంచి బుధవారం ఆమె తంజావూరు మీదుగా పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతుదారులను ఏకం చేస్తూ పర్యటనలపై దృష్టి పెట్టారు. ఈసారి ఆమె అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జిల్లాను టార్గెట్ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య వివాదం సాగుతోన్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సేలం, నామక్కల్ జిల్లాలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. పళణి స్వామి ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి తంగమణి మద్దతుదారుల్ని తన వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటనలో చిన్నమ్మ వ్యూహరచన చేసినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో తాను జైలుకు వెళ్తూ పళణి స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పళణి స్వామి సాగనంపి ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పళణి సొంతజిల్లాలో పర్యటించే చిన్నమ్మ శశికళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. రెండు రోజుల పర్యటన ఖరారు సేలం, నామక్కల్లో చిన్నమ్మ శశికళ పర్యటన రెండు రోజులు సాగనుంది. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్ను మంగళవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం టీ నగర్ నివాసం నుంచి తంజావూరు వైపుగా శశికళ పర్యటన ప్రారంభమవుతుంది. గురువారం తిరుత్తొరై పూండిలో కొత్తగా నిర్మించిన షిరిడీ సాయిబాబా ఆలయ కుంభాభిషేకం వేడుకల్లో ఆమె పాల్గొంటారు. తంజావూరు, తిరువారూర్, సేలం, నామక్కల్, పుదుకోట్టై, ఈరోడ్ జిల్లాల నేతలతో 9.10 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం తంజావూరు నుంచి తిరువయ్యారు. తిరుమానూరు, కీల పలలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల వైపుగా ఆమె పర్యటన ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం సేలంలో పలు ప్రాంతాల్లో శశికళ పర్యటించనున్నారు. పార్టీ కేడర్, నాయకులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ రాత్రి సేలంలో బస చేసి 12వ తేదీ నామక్కల్ జిల్లాలో, అరియలూరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శశికళ పర్యటన నేపథ్యంలో తన మద్దతు దారులు, సర్వ సభ్య సభ్యులు, ముఖ్యులు చేజారకుండా పళణిస్వామి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
Tamil Nadu: నాలుగు స్తంభాలాట
అనుకున్నంతా అయింది. ఎంజీఆర్ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్ సెల్వమ్ (ఓపీఎస్)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్ కౌన్సిల్ తాజా భేటీకి ముందు జూన్ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్ ప్రత్యర్థులదే పైచేయి అయింది. నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్గా ఉంటే, ఓపీఎస్ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్ కౌన్సిల్లో ఈపీఎస్కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్పై బహిష్కరణ వేటు. దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్ – ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం. సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి? -
శశికళకు షాక్
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు చెందిన సుమారు రూ.15 కోట్లను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. చెన్నై టీ నగర్లో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ బిల్డింగ్ను శుక్రవారం మనీల్యాండరింగ్ చట్టం కింద సీజ్ చేసింది. 2017-21 మధ్య దివంగత జయలలిత, శశికళలకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఆ సమయంలో ఆమె బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2020లో ఐటీ శాఖ.. శశికళ, ఆమె బంధువులకు చెందిన 84 ప్రాపర్టీలను రెండు ఫేజ్ల రైడ్లలో జప్తు చేసింది.నిందులో సిరుసతవూర్ ఫామ్ హౌజ్తో పాటు కొడనాడు ఎస్టేట్లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసై, సుధాగరన్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. -
సంచలన కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ బంగ్లా వద్ద దొపిడీ, ఆపై వరుస మరణాల ఉదంతాలు కలకలం రేపాయి. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ఎస్టేట్లో ఉన్న పలటియల్ బంగ్లాలోకి ప్రవేశించిన దుండగలు.. ఓ వాచ్, ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఈ దొపిడీ కేసుగానే భావించినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. పలు అనుమానాలకు తావిచ్చాయి. ఈ దోపిడీలో కీలక అనుమానితుడిగా భావించిన జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ ఎడపాడి వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది మాజీ సీఎం పళనిస్వామి సొంతవూరు. అదే రోజు రెండో నిందితుడు సయన్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతను బతికినా.. అతని భార్య, కూతురు చనిపోయారు. ఆ తర్వాత ఎస్టేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు.. జయలలిత మరణానికి ముడిపెడుతూ రాజకీయంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన టైంలో.. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ మిగతా హత్యలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంతో కొడనాడు మిస్టరీ కేసుల్ని దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్ చెప్పారు. అయితే ఇది తనను ఇరికించే ప్రయత్నమని పళనిస్వామి ఆరోపిస్తుండగా.. కోర్టు అనుమతులతోనే తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జయలలిత అంతరంగికురాలు అయిన శశికళకు ఈ ఎస్టేట్లో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శశికళకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ -
VK Sasikala: శశికళకు ఎదురు దెబ్బ
అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కును కోరుతూ వీకే శశికళ వేసిన పిటిషన్ను చెన్నై కోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకేలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. 2017లో పార్టీ నుంచి తనను మహిష్కరిస్తూ అన్నాడీఎంకే పార్టీ సాధారణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, లీగల్ వింగ్ జాయింట్ సెక్రెటరీ ఏఎం బాబు మురుగవేల్ ఇంటర్లోక్యూటరీ(సంభాషణ) దరఖాస్తు దాఖలు చేయడంతో శశికళ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. 2017లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం.. అప్పటి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించించింది. ఈ వేటుపై శశికళ గతంలో చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్నీర్సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని అప్పటి విడివిడి వర్గాల విలీనం తర్వాత ఈ కౌన్సిల్ భేటీ జరిగి.. శశికళను పార్టీ నుంచి వెలేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్ -
శశి‘కలకలం’.. రీఎంట్రీ కోసం చిన్నమ్మ చిచ్చు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్హౌస్ కావడం విశేషం. ఎడపాడి అలక? బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూసిన తరువాత పన్నీర్సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్సెల్వమే చినమ్మ, దినకరన్కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు. పళనివర్గం అత్యవసర సమావేశం పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. -
శశికళ, ఇళవరసికి సమన్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలులో ఖరీదైన జీవితం చిన్నమ్మ శశికళను మళ్లీ కష్టాలపాలు చేసింది. జైలు పక్షిలా కారాగారానికి పరిమితం కాకుండా జల్సా కోసం చేసిన పని ఆమెను చిక్కుల్లో పడేసింది. అంతేకాదు ఆమెతోపాటూ జైలు అధికారులు, వైద్యుడు సైతం కోర్టు బోనెక్కే పరిస్థితి నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ నాలుగేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడులయ్యారు. శిక్షాకాలంలో శశికళ తన పలుకుబడిని వినియోగించి ప్రత్యేకసెల్, లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించారు. తన వదిన ఇళవరసికి సకల సౌకర్యాలు సమకూర్చడంతోపాటూ ఇరువురూ చెట్టాపట్టాల్ వేసుకుని బెంగళూరు నగరంలో షాపింగ్ చేసి గుట్టుగా జైలుకు చేరుకునేవారు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విషయం బట్టబయలైంది. అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప తీగలాగడంతో డొంక కదిలింది. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు రూ.2 కోట్లు లంచం ముట్టజెప్పి శశికళ తన దందాను నడిపినట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఆమె నివేదిక పంపారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపించగా డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు నిజమయ్యాయి. షాపింగ్ ముగించుకుని శశికళ, ఇళవరసి జైల్లోకి వస్తుండగా సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇందుకు సంబంధించి చెన్నై ఆళ్వార్పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్టు 25వ తేదీన తొలివిడత చార్జిషీటు దాఖలైంది. పోలీసులకు లంచం ఎరవేసిన వ్యవహారంలో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ తుది చార్జిషీటు దాఖలు చేశారు. తొలి నిందితునిగా (ఏ వన్)గా పోలీస్ అధికారి కృష్ణకుమార్, ఏ 2గా డాక్టర్ అనిత, ఏ 3గా సురేష్, ఏ 4గా గజరాజ్ మాకనూరు, ఏ 5గా శశికళ, ఏ 6గా ఇళవరిసిని చార్జిషీటులో చేర్చారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి లక్ష్మీ నారాయణన్ భట్ ముందుకు శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. చార్జిషీటులో చేర్చిన మొత్తం ఆరుగురూ మార్చి 1వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. అంటే చిన్నమ్మ, ఇళవరసి మరోసారి కోర్టు బోనెక్క తప్పదన్నమాట. -
పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు; అన్నాడీఎంకేలో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశముందా?.. తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శశికళను ఉద్దేశించి చేశారని ప్రచారం మొదలైంది. అయితే శశికళను క్షమించేది లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. చెన్నైలోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పార్టీ కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఒక చిన్న కథ చెప్పారు. అయితే శశికళను ఇరుకున పెట్టేందుకే పన్నీర్ సెల్వం ఇలా మాట్లాడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి జయకుమార్ స్పందిస్తూ.. ‘శశికళ లేకుండా అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఎన్నికలొస్తున్నాయిగా.. మీకోసమే ఐయామ్.. వెయిటింగ్) శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఇప్పటికీ అన్నాడీఎంకే నాయకురాలినని చెప్పుకుంటున్నారని శశికళపై పోలీసులకు జయకుమార్ ఫిర్యాదు చేశారు. పార్టీతో ఆమె ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ శశికళ తన అధికారిక ప్రకటనలలో 'ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ'ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై పన్నీర్సెల్వం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. గత అక్టోబర్లోనూ శశికళపై అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎన్నికలుంటే ఇలా.. లేకుంటే అలా!) -
తమిళనాట కొత్త ట్విస్ట్.. రజనీకాంత్తో శశికళ భేటీ.. అందుకోసమేనా?!
సాక్షి, చెన్నై: రాజకీయ పునరాగమనంపై దృష్టి సారించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ సోమవారం సాయంత్రం చెన్నై పోయెస్ గార్డెన్లోని ఆయన నివాసంలో నటుడు రజనీకాంత్ను కలిశారు. శశికళ కొత్తపార్టీని స్థాపిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రజనీకాంత్తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తన పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగమే ఈ భేటీ అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. సంబంధిత వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే శశికళ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో..'శశికళ రజనీకాంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో రజనీకాంత్ భార్య లత కూడా హాజరయ్యార'ని ఆ ప్రకటనలో తెలిపారు. కాగా, సోమవారమే అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్, ఈపీఎస్ సఫలమయ్యారు. -
నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నప్పుడే కాదు గతించిన తరువాత కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జయ కుమార్తెను అని చెప్పుకుని గతంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు హడావిడి చేసి.. ఆ తరువాత మిన్నకుండి పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చారు. తగిన ఆధారాలతో జయ కుమార్తెను అని త్వరలో నిరూపించుకుంటానని చెన్నైలో శనివారం స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జీవితాంతం కుమారిగానే మెలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక కుమార్తె ఉందని దశాబ్దాల తరబడి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని జయ ఏనాడు ఖండించలేదు. అలాగని సమర్ధించనూ లేదు. జయ మరణం తరువాత తమను వారసులుగా గుర్తించాలంటూ ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో బెంగళూరు, మైసూరు నుంచి వేర్వేరుగా ఇద్దరు యువతులు, ఓ యువకుడు వచ్చారు. కొన్నాళ్లు పోరాడారు. అయితే వారి వాదన పెద్దగా నిలవక పోవడంతో తెరమరుగై పోయారు. నేనే జయ కుమార్తెను..: ఇదిలా ఉండగా, తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చింది. చిన్నపాటి మందీ మార్బలంతో శనివారం సాయంత్రం చెన్నై మెరీనాబీచ్లోని జయ సమాధి వద్దకు చేరుకుని ఆమె నివాళులర్పించారు. సమాధికి ప్రదక్షిణ చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె హావభావాలు, కట్టూబొట్టూ, బాడీ లాంగ్వేజ్ అంతా జయను పోలినట్లుగా ఉండడంతో పరిసరాల్లోని వారు ఆశ్చర్యంగా అనుసరించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధుల వద్ద జయ కుమార్తెగా పరిచయం చేసుకున్నారు.. ‘‘మాది మైసూరు. చెన్నై పల్లవరంలో స్థిరపడ్డాను. చాలా ఏళ్ల క్రితమే నేను జయ కుమార్తెను అని తెలుసు. అయితే ఇష్టం లేక, కొన్ని సమస్యల వల్లనే ఇన్నేళ్లూ బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు, అందుకే అప్పట్లో రాలేదు. అమ్మను కోల్పోయిన షాక్ నుంచి బయటకు వచ్చేందుకు ఇంత సమయం పట్టింది. చదవండి: (Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే!) చెన్నై పోయస్ గార్డెన్ ఇంటిలో మొదటిసారి అమ్మతో మాట్లాడాను. ఆ తరువాత అపోలో ఆసుపతిలో కలిశాను. అమ్మ పీఏ అపోలో ఆసుపత్రి వెనుకమార్గం గుండా లోనికి తీసుకెళ్లారు. అమ్మతో నేరుగా మాట్లాడాను. చెక్కిలిపై ఆమె ముద్దు పెట్టుకుంది. ఉద్వేగానికి లోనై ఇద్దరం కన్నీరు పెట్టుకోవడంతో బేబీని తీసుకెళ్లండని అక్కడి సిబ్బందికి చెప్పింది. దీప, దీపక్ నాతో మాట్లాడేందుకు యత్నించారు, అయితే ఇష్టం లేక దూరంగా మెలిగాను. ఇప్పటికే కొందరు జయ కుమార్తెలు అని వచ్చారు, అయితే అందరికీ ఆమె అమ్మ కాలేదు కదా.. వారు ఫేక్ అని రుజువైంది కదా. జయ కుమార్తెను అని వైద్యపరంగా కూడా నిరూపణకు అన్ని ఆధారాలు ఉన్నందునే ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. మంచి రోజు చూసి మీడియా వద్ద బహిరంగ పరుస్తాను. మైసూరులో నన్ను పెంచిన వారు ఇటీవలే మరణించారు. నాకు ఇప్పటికీ చిన్నమ్మ శశికళ మాత్రమే అండగా ఉంది. చిన్నమ్మతో కూడా ఇంకా మాట్లాడలేదు. మూడు నాలుగు రోజుల్లో శశికళను కలుస్తాను. అపాయింట్మెంట్ కూడా ఆమె ఇచ్చారు. రాజకీయాల గురించి ఇప్పుడు ప్రశ్నలు వేయవద్దు, త్వరలో రాజకీయం గురించి అన్ని విషయాలు చెబుతాను. నా పేరు ప్రేమ, అమ్మ నన్ను జయలక్ష్మి అని ముద్దుగా పిలుచుకునేది’’ అని ఆమె వివరించింది. -
AIADMK: అన్నాడీఎంకేలో ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సంస్థాగత ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. వాయిదా వేస్తూ వస్తున్న ఎన్నికలను డిసెంబర్ 31వ తేదీలోగా ముగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. పార్టీ అధినేత్రి జయలలిత 2014లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అది జరగలేదు. 2020లో కరోనా కారణంగా వాయిదా వేశారు. 2021లో కరోనా రెండోదశ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల వల్ల నిర్వహించలేదు. జయలలిత మరణం తర్వాత సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని అన్నాడీఎంకే నాయకుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు డిసెంబర్ 31వ తేదీలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతోంది. చదవండి: (పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఉత్తర్వులు జారీ) ముల్లైపెరియార్ జలాల వ్యవహారంలో తమిళనాడు హక్కులను కాపాడడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 9న తేని, దిండుగల్లు, మదురై, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో అన్నాడీఎంకే ఆందోళన చేపట్టనుంది. ఈ ఆందోళన ముగియగానే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం, కోకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ ప్రధా న కార్యాలయానికి చేరుకుని సంస్థాగత ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం ప్రధానమైన రెండు పదవులకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉంది. మరోవైపు శశికళను పార్టీలోకి తీసుకోవడమా, లేదా అనే చర్చ జరుగుతోంది. పార్టీలో శశికళకు స్థానం లేదని ఎడపాడి, అందరి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం గందరగోళానికి దారితీసింది. అంతేగాక జోడు పదవులు వద్దని, ఏక నాయకత్వ మే ముద్దు అనే నినాదం కూడా ఎంతోకాలంగా సాగుతోంది. అలాగే పార్టీలో ప్రతి ఒక్క కీలక పదవికీ పోటీ నెలకొనే పరిస్థితి ఉత్పన్నమైంది. పోటీ విషయంలో ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదని పార్టీ హుకుం జారీచేసింది. శశికళ పునః ప్రవేశంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం సవాలుగా మారింది. పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశాలు జరపాలంటే సీనియర్ నేతలతో పన్నీర్ సెల్వం, ఎడపాడి ఒకేసారి సమావేశం నిర్వహించి ఒక అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: (మారియప్పన్కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్) ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం, రెండుసార్లు కార్యవర్గ సమావేశం జరపాలి. కరోనా కారణంగా గత ఏడాది జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ నుంచి గడువు పొందారు. డిసెంబరు 31వ తేదీన జనరల్ బాడీ సమావేశం జరపాలంటే ఈలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంస్థాగత ఎన్నికలపై ఈ నెల 10వ తేదీన కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. -
అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్క వనితామణి కుమారుడు దినకరన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నమ్మ ప్రతినిధిగానే ఆయన రాజకీయ పయనంలో ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలికతో ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేశారు. తొలుత చిన్నమ్మ ఈ కళగంకు ప్రతినిధిగా పేర్కొన్నా, చివరకు తానే ప్రధాన కార్యదర్శి ఆయన చాటుకున్నారు. అన్నాడీఎంకే కైవసంలో చిన్నమ్మకు కోర్టుల్లో చట్టపరంగా కొత్త చిక్కులు ఎదురు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో తాజాగా చిన్నమ్మ దూకుడు పెంచారు. అన్నాడీఎంకే కేడర్ను తన వైపుకు తిప్పుకుని పార్టీ కైవశంకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. చదవండి: (స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం) శశికళ పర్యటన ఇలా.. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన్న చిన్నమ్మ శశికళ ఈనెల 27న తంజావూరులో , 28న మదురైలో, 29న రామనాథపురంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పలు కార్యక్రమాలు, కేడర్తో పలకరింపుల దిశగా ఆమె పయనం సాగనుంది. ఈ పర్యటనల విజయవంతంతో పాటుగా ఆమెకు బ్రహ్మరథం పట్టేందుకు అమ్మమక్కల్ మున్నేట్ర కళగం సేనల్ని రంగంలోకి దించేందుకు దినకరన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, చిన్నమ్మకు తన మద్దతు అని శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రకటించారు. -
శశికళ చట్టానికి చిక్కేనా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శశికళపై చట్టపరమైన చర్యలకు అన్నాడీఎంకే సిద్ధమైంది. ఈ విషయమై ఆపార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసుశాఖ న్యాయశాస్త్ర నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. అయితే చట్టం ఉచ్చులో ఆమె చిక్కక తప్పదని అన్నాడీఎంకే న్యాయనిపుణులు, సాధ్యం కాదని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు. జయ మరణం తరువాత చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల వల్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, పార్టీ అగ్రనేతలంతా కలిసి శశికళ, టీటీవీ దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద శశికళ, దినకరన్ చేసిన పోరు చివరికి విఫలమైంది. పన్నీర్, ఎడపాడి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం సొంతమని ఢిల్లీ హైకోర్టు సైతం అప్పట్లో తీర్పు చెప్పింది. దీంతో టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించి శశికళ కనుసన్నల్లోనే నడిపించారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలునుంచి విడుదలైన శశికళ కొద్దినెలలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా మెలిగినా ఇటీవల మరలా దూకుడు ప్రదర్శించారు. చదవండి: (స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం) స్వర్ణోత్సవాల వేళ కలకలం అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీన శశికళ తన అనుచరవర్గంతో కలిసి హడావుడి చేశారు. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో చెన్నై మెరీనాబీచ్లోని ఎంజీఆర్, జయసమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మరుసటి రోజున ఎంజీఆర్ స్మారక మందిరం వద్దకు చేరుకుని ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందులో ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ’ అని పొందుపరిచి ఉంది. అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ గృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శశికళ తీరు అన్నాడీఎంకే అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ హోదాను, పతాకాన్ని ఆమె అక్రమంగా వాడుకున్నారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. చెన్నై టీ నగర్లో శశికళ నివసిస్తున్నందున అదే పరిధిలోని మాంబళం పోలీస్స్టేషన్లో మాజీ మంత్రి జయకుమార్, పార్టీ న్యాయసలహాదారు బాబు మురుగవేల్తో కలిసి బుధవారం రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేని శశికళ చట్టవిరుద్ధంగా వ్యవహరించినందున తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్ ఆదేశాలను దిక్కరించిన శశికళపై చట్టపరమైన చర్యల సాధ్యాసాధ్యాలపై పోలీసు యంంత్రాగం న్యాయనిపుణులతో చర్చలు జరపడం ప్రారంభించింది. శశికళపై ఎఫ్ఐఆర్ నమోదు దిశగా పోలీస్శాఖ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యలను ఆమె న్యాయవాది రాజా సెందూర్పాండియన్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు శశికళపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని ఆయన అన్నారు. న్యాయస్థానం ద్వారా శశికళపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుందని అన్నాడీఎంకే న్యాయసలహాదారులు చెబుతున్నారు. చదవండి: (నటుడు శింబుపై భారీ కుట్రలు) ఎడపాడి దిష్టిబొమ్మ దహనం ఇదిలా ఉండగా, శశికళ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తిరునెల్వేలీ వన్నార్పేటలో ఆమె అభిమానులు అన్నాడీఎంకే పతాకాన్ని, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. 26 నుంచి చిన్నమ్మ పర్యటన అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సాగుతుండగా, చిన్నమ్మ శశికళ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా రాజకీయ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 26వ తేదీన తంజావూరులో తన పర్యటనకు శ్రీకారం చుట్టి వారం రోజులపాటూ దక్షిణ జిల్లాలను చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు. -
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నేనే..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరోమారు చాటుకున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఓ శిబిరంగా, శశికళ నేతృత్వంలో మరో శిబిరంగా అన్నాడీఎంకే కేడర్ విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధులను శనివారం శశికళ సందర్శించి నివాళులరి్పంచిన విషయం తెలిసిందే. ఆదివారం అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని చాటుకునే ప్రయత్నం శశికళ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏకమవుదాం.. పార్టీని గెలిపిద్దాం పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. శశికళ నేతృత్వంలో చెన్నై టీనగర్లోని ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అని రాసి ఉంది. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. ముందుగా టీనగర్లో జరిగిన సేవా కార్యక్రమంలో శశికళ మాట్లాడారు. అందరం ఏకం అవుదాం.. అన్నాడీఎంకేను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఎంజీఆర్, జయలలిత తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని, ఈ వైభవం మళ్లీ రావాలంటే అందరం ఒక్కటి కావాలి్సందేనని స్పష్టం చేశారు. తనను గతంలో సమస్యలు చుట్టుముట్టినా, అన్నాడీఎంకేకు చెందిన వారినే ప్రభుత్వ పాలనలో కూర్చోబెట్టానని పరోక్షంగా పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడు, తమిళ ప్రజలే తనకు ముఖ్యమని.. ఎంజీఆర్, అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమని తేల్చిచెప్పారు. అయితే, శశికళ చర్యలను అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తుచేశారు. శిలాఫలకంలో ఆమె పేరును ఎలా పొందుపరిచారు? అని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కార చర్య అని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’
సాక్షి ప్రతినిధి,చెన్నై: అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’ ప్రారంభమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడిన తరువాత జైలుకెళుతూ జయ సమాధి వద్ద చిన్నమ్మ శశికళ శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగున్నరేళ్ల తరువాత శనివారం మళ్లీ అమ్మ సమాధి వద్ద నివాళులర్పించిన చిన్నమ్మ.. ఈసారి మౌనం పాటిస్తూ మళ్లీ శపథం చేశారా? అవును, నాటి శపథానికి ఇది కొనసాగింపు అంటున్నారు.. కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇదీ నేపథ్యం.. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరి 27వ తేదీన శశికళ విడుదలయ్యారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఆమె వచ్చినపుడు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆమె ఆశించినట్లుగా అన్నాడీఎంకే అగ్రనేతలు ఎవ్వరూ దరి చేరకపోవడంతో నిరాశచెందారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. చదవండి: (జయలలితకు నెచ్చెలి నివాళి) కారుకు పార్టీ జెండా కట్టుకుని.. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే స్వర్ణోత్సోవాల సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు చెన్నై టీ నగర్లోని వదిన ఇళవరసి ఇంటి నుంచి అమ్మ సమాధికి బయలుదేరారు. కారుకు అన్నాడీఎంకే పతాకాన్ని అమర్చుకోవడం, ఆమెను అనుసరించిన కార్యకర్తలు సైతం అదే పతాకాన్ని చేతబూని అనుసరించడం చర్చనీయాంశమైంది. 11.30 గంటలకు ఎంజీ రామచంద్రన్, జయ సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. జయ సమాధి వద్ద పది నిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు కార్చారు. గత కొన్నేళ్లు మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద ఆమె అన్నారు. దీంతో ఆమె మాటల్లోని అంతరార్థం ఏమిటని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైలు కెళ్లేముందు జయ సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరిచి పెదాలు కొరుకుతూ ఏదో శపథం చేస్తున్నట్లుగా ఆమె వ్యవహరించారు. జైలు నుంచి విడుదల కాగానే, ఆ తరువాత అనేక సందర్భాల్లో జయ సమాధి వద్దకు వెళ్లాలని శశికళ ప్రయత్నించినా వెళ్లలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే చతికిలబడగా డీఎంకే ప్రభుత్వం దూసుకెళుతున్న పరిస్థితుల్లో అమ్మ పార్టీకి తానే దిక్కనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జయ సమాధి వద్దకు శశికళ రాక కలకలం రేపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నై టీనగర్ లోని ఎంజీఆర్ స్మారక నిలయానికి, అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ నివాసానికి ఆమె వెళతారని సమాచారం. ఆదివారం ఆమె కార్యక్రమా లు అంతవరకే పరిమితమా లేక ఏదైనా దూకుడు ప్రదర్శిస్తారా అనే అనుమానాలు అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొన్నాయి. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హడావుడి పార్టీని కైవసం చేసుకోవడంలో భాగంగా అమ్మ సమాధి నుంచి శశికళ నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో చెన్నై రాయపేటలోని పార్టీ మెయిన్ గేటు ప్రవేశద్వారం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉదయం 10 గంటలకే మాజీ మంత్రులు, అగ్రనేతలు, జిల్లాల కార్యదర్శులు కుర్చీలు వేసుకుని అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారనే సమాచారం అందిన తరువాత మధ్యాహ్నం అందరూ వెళ్లిపోయారు. చిన్నమ్మ ఆస్కార్కు అర్హురాలు : మాజీ మంత్రి జయకుమార్ చిన్నమ్మ శశికళ ఒక మహానటి..ఆస్కార్ అవార్డుకు ఆమె అర్హురాలని మాజీ మంత్రి జయకుమార్ ఎద్దేవా చేశారు. చెన్నై మెరీనాబీచ్లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద శశికళ కన్నీ రు కార్చడంపై మీడియాతో ఆయన మాట్లాడారు. అంతా ఒక నాటకమని వ్యాఖ్యానించారు. జయ సమాధిని రోజూ లక్షలాది మంది సందర్శిస్తుంటా రు, శశికళ రాక కూడా అందులో భాగమేనని.. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, దాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తానంటూ.. శశికళ అనడం అవివేకమన్నారు. అన్నాడీఎంకే అనేది ఒక గజరాజు, దానిపై ఒక దోమ కూర్చుని ఆ గజరాజును నేనే నడిపిస్తున్నానని భావించినట్లు శశికళ కూడా ప్రగల్భాలకు పోతున్నారని దుయ్యబట్టారు. నేడు 50 ఏళ్ల వేడుకలు అన్నాదురై శిష్యునిగా డీఎంకేలో కొనసాగిన ఎంజీ రామచంద్రన్ తన గురువు మరణం తరు వాత డీఎంకేలో ఇమడలేక పోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో విభేదించి 1972 అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకేను స్థాపించారు. రాజకీయాల్లో అప్రతిహతంగా సాగిన అన్నాడీఎంకే 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయి. -
నేడు అమ్మ సమాధి వద్దకు శశికళ.. కీలక ప్రకటన చేసే అవకాశం..!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే శనివారం జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించి అక్కడి నుంచే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చినమ్మ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, అక్టోబర్ 17కి అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: (నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం) అయితే జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి: (బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య) -
నేనొస్తున్నా.. అన్నాడీఎంకే అందరిదీ.. అందరూ సమానమే: శశికళ
సాక్షి, చెన్నై: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేందుకు దివంగత సీఎం జె.జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమవుతున్నారు. నేనొస్తున్నా అంటూ కేడర్ను ఉద్దేశించి ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజా ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్
చెన్నె: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు మరో భారీ షాక్ తగిలింది. ఆమెకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద బుధవారం ఆమెకు సంబంధించిన 11 ఆస్తిపాస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నె శివారులోని పయ్యనూర్లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది. ఆస్తిపాస్తుల జప్తు ఇలా.. చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్ చేసింది. 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి. 1991 జూలై నుంచి ఏప్రిల్ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్ సుధాకరన్ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 66 ఏళ్ల శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి శశికళ విడుదలవడంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. చదవండి: Tamil Nadu: మా వల్ల కాదు బాబోయ్.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం! -
VK Sasikala: చిన్నమ్మకు ఐటీ ఝలక్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు ఆదాయ పన్నుశాఖ ఝలక్ ఇచ్చింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించా యి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు. అయితే ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటీ వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది శశికళ తరపున కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. ఈ పిటì షన్ల విచారణ గురువారం హైకోర్టు న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, శక్తికుమార్ బెంచ్ ముందుకు వచ్చింది. శశికళ తరపు న్యాయవాదులు వాదిస్తూ.. ఇటీవల ఐటీ చెల్లింపు, బకాయిలు, జరిమానా విషయంగా కేంద్రం ఇచ్చిన మినహాయింపులకు సంబంధించిన ఉత్తర్వుల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ మొత్తాన్ని శశికళ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు. కాగా అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ శశికళకు ఈ మినహాయింపు వర్తించదని, బకాయిలు చెల్లించాల్సిందేనని ఐటీశాఖ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. వాదనల అనంతరం శశికళ తరపు వాదనల్ని పిటిషన్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ కేసును సెప్టెంబరు 8వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా -
అమ్మ సమాధి నుంచే రాజకీయ ప్రయాణం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరలా రాజకీయ ప్రవేశ సంకేతాలు ఇస్తున్నారు. ఈనెల 5వ తేదీ తరువాత లాక్డౌన్ ఎత్తివేయగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నట్లు సెల్ఫోన్ ద్వారా శనివారం కొందరికి చెప్పినట్లు సమాచారం. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కామరాజ్, పార్దిబన్, శివగంగై జిల్లాకు చెందిన ఉమాదేవన్, దిండుగల్లుకు చెందిన అరుస్వామి, చెన్నై తాంబరానికి చెందిన నారాయణన్లతో శశికళ శనివారం సెల్ఫోన్ ద్వారా సంభాషణ ఇలా సాగిందని తెలుస్తోంది. ‘ఎంజీ రామచంద్రన్, జయలలిత మనల్ని విడిచివెళ్లినా వారి ఆత్మ మనందరినీ గమనిస్తూనే ఉంది. అన్నాడీఎంకే శ్రేణుల నుంచి గత నాలుగేళ్లగా నాకు ఉత్తరాలు అందుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తరువాత కూడా వస్తున్న ఉత్తరాలను చదివినపుడు ఎంతో ఆవేదన కలుగుతోంది. అన్నాడీఎంకేను అమ్మ జయలలిత ఎలా నడిపించారో అలానే నడిపించాలని ఆశిస్తున్నాను. ఈనెల 5వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుందని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తివేయగానే చెన్నై మెరీనా బీచ్లోని జయ సమాధి వద్దకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను’అని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. -
శశికళ వ్యాఖ్యలపై తమిళనాట కలకలం
-
శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే
కృష్ణగిరి: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, బహిష్కృత నేత వీకే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిం చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చింది. ఏఐఏడీఎంకేను తిరిగి గుప్పిట్లోకి తెచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ మేరకు సోమ వారం ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడీఎంలోకి రానివ్వ బోమని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ కో ఆర్డినేటర్ మునుస్వామి స్పష్టం చేశారు. ‘శశికళకు ఏఐఏడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదు’ అని మునుస్వామి తేల్చిచెప్పారు. పార్టీ కేడర్ దృష్టి మరల్చి, వారిలో అయోమయం సృష్టించేందుకు శశికళ సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడలేద న్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని తెలిపారు. ఏఐఏండీఎంకేపై తిరిగి పట్టు సాధిస్తానంటూ శశికళ తన అనుయా యులతో అన్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: (పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!) -
AIADMK: పార్టీని విచ్ఛిన్నం చేయడానికే..శశికళ రాజకీయ ప్రవేశం
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. దీంతో ఏఐఏడీఎంకేలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆమె రాజకీయ ప్రవేశంతో పార్టీకి మేలు జరకపోగా..కీడు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. శశికళ రాజకీయ ప్రవేశం డీఎంకేకు మరింత మేలు చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళనాడులోని రాజకీయ వర్గాలు ఇప్పుడు శశికళ తదుపరి చర్యపై నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. (చదవండి: చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ) -
VK Sasikala: పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. గతంలో ఏఐఏడీ ఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆమె ఆ పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. త్వరలోనే మంచి నిర్ణయం ప్రకటిస్తానంటూ తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలతో పేర్కొనడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లకు ముందు శశికళ..అంతర్గతపోరు కారణంగా పార్టీ నాశనమైపోవడం తాను చూడలేననీ, రాజకీ యాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆమె ఆ సమయంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, ఏఐఏడీఎంకే నాయకత్వం కోసం అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య విభేదాల గురించేనని స్పష్టమైంది. తాజాగా, శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారాయి. మొదటి వీడియోలో శశికళ ‘పార్టీని కచ్చితంగా గాడిలో పెడదాం, నేను తప్పక వస్తాను’అని అన్నట్లుగా ఉంది. రెండో ఆడియోలో ఏఐఏడీఎంకేను ఉద్దేశించి.. ‘నాతోపాటు అనేక మంది నేతల కృషితోనే పార్టీ ఏర్పడింది. ఆ ఇద్దరి మధ్య పోరుతో పార్టీ నాశనమై పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కరోనా వేవ్ తగ్గాక మద్దతుదారులతో మాట్లాడతా. ఆందోళన వద్దు. త్వరలోనే వస్తా. పార్టీని బలోపేతం చేస్తా్త’అని శశికళ అన్నట్లుగా ఉంది. ఈ ఆడియో క్లిప్పులు చర్చనీయాంశమయ్యాయి. శశికళ ఏఐఏ డీఎంకేపై మళ్లీ పట్టుబిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తానంటూ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. జయలలిత మరణా నంతరం 2016లో శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యారు. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టయి జైలుకు వెళ్లిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీపై పట్టు కోల్పోయారు. -
నాన్ స్టాప్గా చిన్నమ్మ రాజకీయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాలకు రాంరాం చెప్పేశారు. అస్త్ర సన్యాసం తీసుకున్న తరువాత ఆధ్యాత్మిక పర్యటనలో మునిగిపోయారు. కానీ, అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగడం ఆశ్చర్యకరం. జయలలిత జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. జయ మరణించిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్సెల్వంను బలవంతంగా బాధ్యతల నుంచి తప్పించి సీఎం సీటును అధిరోహించడమే తరువాయి అనే స్థితిలో చిన్నమ్మ జైలు పాలయ్యారు. కథ అడ్డం తిరగడంతో జైలు కెళ్లే ముందు తన ప్రియశిష్యుడైన ఎడపాడి పళనిస్వామిని తనకు బదులుగా శాసనసభాపక్ష నేత (సీఎం)ను చేశారు. అలాగే తన అన్న కుమారుడు టీటీవీ దినకరన్ను అన్నాడీఎంకే ఇన్చార్జ్గా నియమించారు. పార్టీ, ప్రభుత్వం రెండునూ పరోక్షంగా తన చెప్పుచేతుల్లో ఉన్నాయనే సంతృప్తితో జైలు జీవితం ప్రారంభించారు. అయితే, తన చేత బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిన శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్సెల్వం అనతికాలంలోనే ఎడపాడితో చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి టీటీవీ దినకరన్ను పార్టీ నుంచి సాగనంపారు. శశికళ, దినకరన్లను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేశారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ, దినకరన్ న్యాయస్థానంలో జరిపిన విఫలమైంది. పార్టీ కోసం పట్టుబట్టి.. రాజకీయాలు విడిచిపెట్టి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ అన్నాడీఎంకే తన చేతుల్లోకి వచ్చేస్తుందని ఆశించారు. అది జరగకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించి అన్నాడీఎంకేను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. అనేక రకాలుగా పావులు కదిపారు. అయితే అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శశికళ అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. జయలలిత ఎంతగానే ప్రేమించిన అన్నాడీఎంకేను దెబ్బతీయడం, అమ్మ తీవ్రంగా ద్వేషించిన డీఎంకేకు సహకరించడమే అవుతుందనే ఆలోచనతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు శశికళ స్పష్టం చేశారు. అంతటితో ఆమె ఆగలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజుల్లో ఆధ్యాత్మిక బాటపట్టారు. రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తూ కాలం గడిపారు. కోర్టులో కొనసాగుతున్న పోరు: అయితే, రాజకీయ అస్త్రసన్యాసం తీసుకున్నా అన్నాడీఎంకేపై ఆమె పోరు కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం. న్యాయస్థానం సాక్షిగా ఈ విషయాన్ని నమ్మక తప్పదు. ఆదాయానికి మించిన ఆస్తు కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 సెప్టెంబర్ 12న అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశం జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, నిర్వాహకునిగా టీటీవీ దినకరన్లను గత సమావేశంలో ఎన్నుకోవడం చెల్లదని పేర్కొంటూ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశికళ, దినకరన్ సదరు జనరల్ బాడీ సమావేశం చెల్లదని ప్రకటించాల్సిందిగా మద్రాసు సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. అంతేగాక ఆనాటి సమావేశంలో చేసిన 12 తీర్మానాలు చెల్లవని ప్రకటించాలని కోరారు. ఇదిలాఉండగా, తాను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను స్థాపించి పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు టీటీవీ దినకరన్ కోర్టుకు తెలిపాడు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన శశికళ ఈ కేసును మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇదే సమయంలో శశికళ కేసును కొట్టి వేయాలని కోరుతూ అన్నాడీఎంకే తరఫున మరో పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే వేసిన పిటిషన్కు బదులివ్వాల్సిందిగా న్యాయస్థానం గత విచారణ సమయంలో శశికళను కోరింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, న్యాయమూర్తి సెలవుపై ఉన్నందున జూన్ 18వ తేదీకి వాయిదావేశారు. శశికళ వైఖరి ఏమిటో వాయిదా తేదీ విచారణ వరకు వేచిచూడాల్సిందే. -
శశికళ పిటిషన్ను నిరాకరించండి
చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి వ్యతిరేకంగా శశికళ దాఖలు చేసిన పిటిషన్ను నిరాకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు నోటీసులిచ్చింది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆస్తులు కూడబెట్టిన కేసులో శశికళ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ను తొలగించారు. వారిని పార్టీ నిర్వాహకులుగా ఎన్నుకోవడం చెల్లదంటూ 12 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాలు చెల్లవని ప్రకటించా లని కోరుతూ శశికళ, టీటీవీ దినకరన్ మద్రాసు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా అమముక పార్టీని స్థాపించి నడుపుతున్నందున ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు టీటీవీ దినకరన్ తన న్యాయవాది ద్వారా తెలియజేశారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో శశికళ దాఖలు చేసిన కేసును నిరాకరించాలని అన్నాడీఎంకే తరపున పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయమూర్తి రవి పిటిషన్కు బదులివ్వాలంటూ శశికళకు నోటీసు పంపాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు. అనంతరం విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. శశికళ పోయెస్ గార్డెన్ ఇంటి సందర్శన శశికళ శుక్రవారం పోయెస్ గార్డెన్లో నిర్మిస్తున్న తన ఇంటిని సందర్శించారు. ఆ సమయంలో వివేక్ జయరామన్, శశికళ బంధువులు ఆమె వెంటవున్నారు. వేదనిలయం తరహాలో ఈ ఇంటి నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడి పనులను త్వరగా ముగించాలని శశికళ సూచించినట్లు తెలిసింది. చదవండి: అమిత్ షా రాజీనామా చేయాలి -
పాపం శశికళ: ఓటర్ జాబితాలోనూ తొలగింపు?
చెన్నె: జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో సంచలనం రేపుతారని అందరూ భావించే సమయంలో అకస్మాత్తుగా ‘రాజకీయాలకు స్వస్తి’ పలికిన వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది. శశికళ పేరు ఓటర్ జాబితాలో లేదు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చదవండి: ముఖ్యమంత్రికి భారీ ఊరట -
దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ నిర్ణయం ఏమిటో?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉపకార్యదర్శి పదవీ వ్యవహారంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ యూటర్న్ తీసుకున్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు కోర్టుకు దినకరన్ సూచించారు. దీంతో ఈ వ్యవహారంలో శశికళ నిర్ణయం ఎమిటో అన్న ప్రశ్న బయలుదేరింది. జయలలిత మరణంతో 2017లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికైన విషయం తెలిసిందే. ఆమె ప్రతినిధిగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దినకరన్ చేపట్టారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడం తర్వాత పరిణామాలతో అన్నాడీఎంకే నుంచి ఇద్దరు గెంటి వేయబడ్డారు. పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి రద్దయింది. అన్నాడీఎంకేలో కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటైంది. దీనిని వ్యతిరేకిస్తూ శశికళ, దినకరన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెనక్కి తగ్గిన దినకరన్.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని చిన్నమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి తానేనంటూ దినకరన్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ మూడేళ్లుగా మద్రాసు హైకోర్టులో సాగింది. తర్వాత ప్రత్యేక కోర్టుకు మార్చారు. అదే సమయంలో ఈ పిటిషన్ను తిరస్కరించాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో– కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ రిట్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్లన్నీ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు రాగా, దినకరన్ తరఫున న్యాయవాదులు హాజరై యూటర్న్ వాదనలు వినిపించారు. దినకరన్ తరఫున కోర్టుకు లేఖ సమర్పించారు. అందులో తాను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేసినట్టు, ఈ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు. ఈ దృష్ట్యా, అన్నాడీఎంకే వ్యవహారాలపై తాను దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు దినకరన్ స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో మరో పిటిషనర్ కూడా ఉన్నారని, వారి మాటేంటో అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో మరో పిటిషనర్గా ఉన్న శశికళ తన నిర్ణయం ఏమిటో ఏప్రిల్ 9వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని పేర్కొంటూ, అదే రోజుకు పిటిషన్ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్కు.. -
శశికళ ఆధ్యాత్మిక పర్యటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేసిన శశికళ ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గుచూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్యటన చేయాల్సిన ఆమె ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని జనవరి 27న జైలు నుంచి విడుదలైన శశికళ గతంలో నిర్ణయించుకున్న ప్రకారం క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి ఉంది. చేజారిపోయిన అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి రావడం ఆమె లక్ష్యాలుగా ఉండేవి. అయితే అన్నాడీఎంకే–బీజేపీ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో శశికళ ప్రస్తావన బెడిసికొట్టడంతో పరిస్థితి మారిపోయింది. బీజేపీలోని ఒక కీలకవ్యక్తి, కుటుంబసభ్యుని సూచనల మేరకు రాజకీయాల నుంచి ఆమె తాత్కాలికంగా వైదొలిగారు. ఈనెల 11వ తేదీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నై టీనగర్లోని అగస్తీశ్వరాలయంలో పూజలు జరపనున్నారు. 15వ తేదీ నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు దిగుతారు. -
అక్క రౌద్రం... చిన్నమ్మ శాంతం!
‘అక్క’ స్వభావం అంతే. ఏదైనా పోరాడి సాధించుకోవడమే. ఛాత్ర పరిషత్ (కాంగ్రెస్ విద్యార్ధి సంఘం) కార్యకర్తగా కల కత్తాలో వీధి పోరాటాలకు నాయకత్వం వహించేది. ఇరవై తొమ్మిదేళ్ల వయసులో లోక్సభకు ఎన్నికయ్యింది. అదీ మార్క్సిస్టు దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించి. ఫలితంగా ఎర్ర చొక్కాల ఆగ్రహానికి గురైంది. తర్వాతి ఎన్నికల్లో ఒక సాధారణ మహిళను నిలబెట్టి అక్క (దీదీ)ను ఓడించారు. ఓటమిని అంగీ కరించడం దీదీ స్వభావం కాదు. మరింత పట్టుదలగా పోరా డింది. మార్క్సిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పోరా డింది. తాను పోరాడుతున్నది కమ్యూనిస్టు భీష్మ–ద్రోణులైన జ్యోతిబసు–దాస్గుప్తాల కాంబినేషన్తోనని తెలుసు. కొండతో ఢీకొంటున్నాననీ తెలుసు. అయినా కొట్లాడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పదేళ్లు కొట్లాడింది. కాంగ్రెస్ నాయకత్వంలో సమర శీలత కొరవడిందని ఆమె నిర్ధారణకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ స్థాపించింది. కమ్యూనిస్టు వృద్ధ నేతలు తప్పుకున్న తర్వాత బుద్ధదేవ్–బిమన్ బసుల కాంబినేషన్తోనూ పోరాడింది. మరో పదేళ్ల పోరాటం తర్వాత దీదీ సాధించింది. మమతా బెనర్జీ ఉరఫ్ దీదీ క్రీ.శ. 2011లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆమె రౌద్రం ఇంకా తగ్గలేదు. తరుముకొస్తున్న బీజేపీతో తలపడేందుకు సర్వశక్తులూ కూడదీసుకుంటున్నది. బీజేపీ విసు రుతున్న బాణాలు తనువున విరుగుతున్నా తలొగ్గడం లేదు. దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రిస్తున్నది. బ్రిగేడ్ పరేడ్ మైదానం దద్దరిల్లేలా గాండ్రిస్తున్నది. వివేకానందన్ కృష్ణవేణి శశికళా నటరాజన్ స్వభావరీత్యా శాంతమూర్తి మాత్రం కాదు. మమతా బెనర్జీని మించిన ఫైర్ బ్రాండ్ నేత జయలలిత. మూడు దశాబ్దాలపాటు ఆమె వెన్నంటి నడిచిన నీడ శశికళ. ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ...’ అన్నారు. జయ పాలిటి ఆ భాగ్యం శశికళ. శశికళకు దొరికిన ఆ స్వర్గం జయలలిత. జయలలిత ఆవేశ కావేశాలను కంట్రోల్ చేసే రిమోట్గా శశికళ ఎదిగింది. ఫైర్ బ్రాండ్ అడుగులో అడుగేసి నడిచినందువల్ల ఆ ధిక్కార స్వభావమూ చిన్నమ్మకు అలవడింది. తన నెచ్చెలికి చిరకాల ప్రత్య ర్థిగా నిలబడిన కరుణానిధి చాణక్యాన్ని దగ్గరగా చూసినందు వల్ల సందర్భాన్ని బట్టి మసలుకునే లగువు బిగువుల లౌక్యమూ ఆమెకు అలవడింది. జయలలిత మరణానంతరం ముసురు కొస్తున్న ఒత్తిళ్లకు హెచ్చరిక అన్నట్టుగా జయ సమాధిపై ప్రతిజ్ఞ చేసి రెండుసార్లు గట్టిగా చరిచినప్పుడు శశికళ ఎక్కుపెట్టిన ఏకే– 47 తుపాకీలా కనిపించింది. నాలుగేళ్లు జైలు జీవితం గడిపి వచ్చినప్పుడు తనకు తమిళనాట వీరస్వాగతం లభించినప్పటికీ, తను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించి అంద రినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడామె గోడమీద వేలాడదీసిన తుపా కీలా కనబడుతున్నది. ఆ తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు పడేంత వరకే శాంత ముద్ర. నాలుగు రాష్ట్రాలూ, ఒక కేంద్రపాలిత ప్రాంతం శాసన సభల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ విజిల్ ఊదింది. కానీ, అంత కంటే చాలాకాలం ముందునుంచే ఆ రాష్ట్రాలు వేడెక్కాయి. ఇందులో పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడులను కలిపితే ఉత్తరప్రదేశ్ లోక్సభ సీట్లకంటే ఒకటెక్కువే. పుదుచ్చేరిలో ఒక్కటే లోక్సభ స్థానం. ఆ ఎన్నికల ప్రాధాన్యం కూడా అంతే. కేరళ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ఒకసారి ఎల్డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్. నాలుగు దశాబ్దాలుగా ఇదే కేరళ తీరు. కానీ ఈసారి అధికారంలో వున్న ఎల్డీఎఫ్ కూటమే మళ్లీ గెలుస్తుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే కేరళ ప్రజలు సంప్రదాయాన్ని ఉల్లంఘించినట్టే. కేరళ గోల్డ్ స్కామ్లో నిందితురాలైన యువతి ఈ పాపంలో ముఖ్య మంత్రికి కూడా భాగం ఉందని కస్టమ్స్ అధికారులకు చెప్పిం దట. అది కూడా అరెస్టయిన అనేక నెలల తర్వాత సరిగ్గా ఎన్నికల ముందే చెప్పిందట. ఈ కారణంగా కేరళ రాజకీయాలు తలకిందులై మూడో పక్షమైన బీజేపీ అవకాశాలు ఏమేరకు పెరుగుతాయో చూడాలి. బహుశా, ఇటువంటి అంచనా ఏదో బీజేపీ నాయకత్వానికి ఉన్నట్టుంది. అందుకే ఎనభై ఎనిమిదేళ్ల నవయువకుడైన మెట్రో శ్రీధరన్కు వీరకంకణం కట్టి నుదుట తిలకం దిద్ది సర్వసేనానిగా ప్రకటించి రంగంలోకి దింపారు. ఎన్నికల రణరంగంలో ఆయన ఏమేరకు వీరవిహారం చేస్తారో చూడాలి. అస్సాంలో ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ కూటమే గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ కూటమి నుంచి అధికార కూటమి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నట్టు కనిపి స్తున్నది. ఫలితం తిరగబడే అవకాశం లేకపోలేదు. మిత్రపక్షా లతో కలిసి కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టగలిగే అవకాశాలున్న రాష్ట్రాలు కేరళ, అస్సాం మాత్రమే. అందుకే ఆ రాష్ట్రాల్లో రాహుల్, ప్రియాంకలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కి స్తున్నారు. కేరళ గజ ఈతగాళ్ల సమక్షంలో రాహుల్ సముద్రం లోకి దూకి కాస్సేపు క్రీడించారు. అస్సాం టీ ఎస్టేట్లో ప్రియాంక తేయాకు తెంపే కార్మికురాలి వేషంలో దర్శన మిచ్చింది. కాంగ్రెస్ ప్రచారాన్ని మెయిన్ ట్రాక్లో రాష్ట్రాల నేతలు నడిపిస్తుంటే సైడ్ట్రాక్లో రాహుల్, ప్రియాంకల చమత్కార షోలు నడుస్తున్నాయి. పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు ఎన్నికలే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ సాంస్కృతిక వారసత్వమే గొప్పదని బెంగాలీలు ఎంత గట్టిగా నమ్ముతారో అంతకంటే గట్టిగా తమిళులూ విశ్వసిస్తారు. వాళ్లు రవీంద్రనాథ్ టాగోర్ను చూపెడితే వీళ్లు సుబ్రమణ్య భారతిని చూపెడతారు. వాళ్లకు సత్యజిత్రే ఉంటే వీళ్లకు కె. బాలచందర్ ఉంటారు. వాళ్లకు మృణాల్సేన్ ఉంటే వీళ్లకు మణిరత్నం ఉన్నాడు. ఆర్డి బర్మన్ బెంగాలీ–ఏఆర్ రెహమాన్ తమిళ్. ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ ఎందరో ఉద్దండులు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. సాంబార్ రసం, రసగుల్లాలతో కూడా జైత్ర యాత్ర చేసిన రాష్ట్రాలివి. ఎకనామిక్స్లో ఇద్దరు నోబెల్ గ్రహీ తలు బెంగాల్లో ఉంటే సైన్స్లో ముగ్గురు నోబెల్ గ్రహీతలు తమిళనాడువారు. కళా, సాహిత్య, విద్యా, వైజ్ఞానిక, సంగీత రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రెండూ ప్రధానమైనవి. పురోగామి ఆలోచనలున్న ప్రజలు విస్తారంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాతీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా ఉండడం సహజం. ఫైర్బ్రాండ్ నాయకులను ఇష్టపడే స్వభావం బెంగాలీలది. అందుకే గాంధీ నెహ్రూలకంటే ఎక్కువగా సుభాష్ చంద్ర బోస్ను ఆరాధిస్తారు. బెంగాలీ భగత్సింగ్గా భావించే చిట్ట గాంగ్ హీరో సూర్యసేన్ను ప్రేమిస్తారు. కమ్యూనిస్టులను ఆద రించారు. నక్సల్బరీని గుండెలకు హత్తుకున్నారు. జ్యోతిర్మయ బసు వంటి ఫైర్బ్రాండ్ పార్లమెంటేరియన్లను భారీ మెజా రిటీతో గెలిపించారు. ఆయన తర్వాత ఆ లక్షణాన్ని మమతా బెనర్జీలో బెంగాలీలు గుర్తించారు. ఆమె సుదీర్ఘకాలం పోరాడిన తర్వాతనే అధికారాన్ని అప్పగించారు. ఆ తెగువను మరోసారి ప్రదర్శిస్తూ నందిగ్రామ్ ఒక్కచోట నుంచే బరిలోకి దిగుతూ దీదీ బీజేపీకి చాలెంజ్ విసిరింది. ఈ నియోజకవర్గం తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి కంచుకోట. ఈ సాహసం బెంగాలీలకు నచ్చే అవకాశం ఉంది. ఈస్టిండియా కంపెనీ సేనలు 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించిన తర్వాతనే భారతదేశంలో బ్రిటిష్ పాలన విస్తరించడం సాధ్యమైంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలిస్తే దక్షిణభాగం మినహా భారతదేశంలో ఆ పార్టీ రాజకీయ విస్తరణ దాదాపుగా పూర్తయినట్టే. అందుకే తృణమూల్ శ్రేణులు బీజేపీని నాన్– బెంగాలీ పార్టీగా బ్రాండింగ్ చేసి ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ గట్టిగానే తిప్పికొట్టగలిగింది. బీజేపీకి జన్మ నిచ్చిన జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాలీయేనన్న విషయాన్ని వారు ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లోనే బెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు జనసంఘ్ తరఫున గెలిచిన సంగతిని కూడా గుర్తుచేస్తున్నారు. సర్వేలన్నీ మమతా బెనర్జీ పార్టీ విజయాన్నే సూచిస్తున్నప్ప టికీ వాటిని పూర్తిగా విశ్వసించలేము. ఎందుకంటే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్కు కేవలం 2.6 శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓట్లు అధికంగా బీజేపీకి పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గాలు మనసు మార్చుకున్నా యనడానికి ఎటువంటి దాఖలాలు లేవు. దళితుల్లో తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య దక్షిణ ప్రాంతంలో (ముఖ్యంగా 24 పరగణాలు) బాగా ఎక్కువ. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఫలితంగా ఈ వర్గానికి మేలు జరిగింది. కనుక ఇప్పుడు మరింత ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఈ ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ చట్టం వల్ల నష్టపోయిన ముస్లిం వర్గం ఓట్లు 2019 ఎన్నికల్లోనే గంపగుత్తగా తృణమూల్కు పడ్డాయి. ఇప్పుడు కొత్తగా తృణమూల్కు కలిసివచ్చే దేమీ లేదు. పైగా ఇప్పుడు ముస్లిమ్ ఓట్లలో ఎంతోకొంతమేర చీలిక వచ్చే అవకాశం ఉంది. ఫర్ఫురా షరీఫ్కు చెందిన అబ్బాస్ సిద్దిఖీ నాయకత్వంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో కొత్త పార్టీ ఊపిరిపోసుకుంది. బెంగాలీ మాట్లాడే ముస్లిములలో సిద్దిఖీకి బాగా పట్టుంది. ముఖ్యంగా యువతలో. ఇప్పుడు ఐఎస్ఎఫ్ లెఫ్ట్–కాంగ్రెస్ కూటమిలో చేరిపోయింది. ఇది ఏదో ఒకమేరకు తృణమూల్కు నష్టం కలిగించే అంశం. అయితే దీదీని వేటాడుతున్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు బూమెరాంగ్ అయ్యే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తున్నది. అదే జరిగితే బెంగాలీ జాతీయభావం నిద్రలేస్తే మాత్రం దీదీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. స్వాతంత్య్రోద్యమ కాలంలో బెంగాల్ రెండు ప్రాంతాలు కలిసి వున్నప్పుడే జాతీయ భావంతో ప్రజలు ‘బంగ మాత’ను సృష్టించుకున్నారు. ఆ తర్వాతనే భారతమాత అనే భావన వెలుగులోకి వచ్చింది. బెంగాలీల జాతీయభావం ప్రగాఢమైనది. అందుకే మమత తనను తాను రాయల్ బెంగాల్ టైగర్గా అభివర్ణించుకొంటున్నది. కలకత్తా కాళీమాతను గుర్తు చేస్తున్నది. ఈ సున్నిత అంశంపై జాగ్రత్తగా లేకపోతే బీజేపీకి భంగపాటు తప్పకపోవచ్చు. ఫలితం ఎలా ఉన్నా బెంగాల్లో ప్రచారం మాత్రం కొత్తపుంతలు తొక్కుతున్నది. ‘దీదీమోనీ తొమియా చాయి’ (అక్కా నువ్వే రావాలి) అనే పాట మార్మో గుతున్నది. దానికి పోటీగా ప్రముఖ గాయకుడు, పార్లమెంట్ సభ్యుడైన బాబుల్ సుప్రియోతో బీజేపీ మరో పాట పాడిం చింది. ‘ఏయీ తృణమూల్ ఆర్ నా’ (ఈ తృణమూల్ మళ్లీనా... వద్దువద్దు) అనే పాట కూడా ఆదరణ పొందింది. తమిళనాడుకు సంబంధించినంతవరకూ సర్వే సంస్థలన్ని టిదీ ఒకటే మాట. ఈసారి డీఎంకే కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఒకసారి డీఎంకే కూటమి గెలిస్తే మరోసారి అన్నాడీఎంకే గెలవడమనే సంప్రదాయం తమిళనాడులో కూడా ఉండేది. 2016లో దాన్ని బ్రేక్ చేసి జయలలిత విజయఢంకా మోగించింది. ఇప్పటికి రెండుసార్లు వరసగా అన్నాడీఎంకే అధి కారంలో ఉన్నందువల్ల, జయలలిత లేకపోవడంవల్ల ఓటర్లు డీఎంకేకు ఒక అవకాశం ఇవ్వచ్చునన్న అభిప్రాయం ఉంది. వరసగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ప్రభు త్వంపై ఎటువంటి ప్రజావ్యతిరేకత లేకపోవడం ఒక విశేషం. ఏ దశలో చూసుకున్నా కూడా రాష్ట్రంలో డీఎంకే ఓటుబ్యాంకు కంటే అన్నాడీఎంకే ఓటుబ్యాంకు పెద్దది. అందుకు కారణం ఎంజీఆర్ కాలం నుంచి జయలలిత వరకు ఆ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు. పళనిస్వామి కూడా అదే ఒరవడిని కొన సాగిం చారు. అయినప్పటికీ చిన్న పార్టీలతో ఏర్పాటుచేసుకునే అల యెన్స్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, పీఎంకే డీఎంకేతో ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. శశికళ ఈసారి అస్త్రసన్యాసం చేయడం వెనుక బీజేపీ పెద్దల దౌత్యం కూడా పనిచేసిందని సమాచారం. ఆమె రంగంలో ఉంటే అన్నాడీఎమ్కేలో చీలిక వస్తుంది. ఎటూ తప్పించుకోలేని ఓట మికి కారణం శశికళేననే ముద్ర పడుతుంది. భవిష్యత్తులో పార్టీ గంపగుత్తగా తన చేతికి వచ్చే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా మౌనంగా ఉండిపోతే ఎన్నికల తర్వాత ఓటమి బాధ్యత ఈపీఎస్, ఓíపీఎస్ల మీద పడుతుంది. శశికళ నాయకత్వం కావాలన్న డిమాండ్ పెరుగు తుంది. కార్యకర్తలు ఆందోళన చేస్తారు. నిరాహారదీక్షలు చేస్తారు. పార్టీకోసం, కార్యకర్తల కోసం ఒట్టును తీసి గట్టున పెట్టి శశికళ రాజకీయ ప్రవేశం చేస్తారు. అన్నాడీఎంకే తిరుగులేని నాయ కురాలిగా అవతరిస్తారు. ఈవిధంగా ఆమెకు గురుమూర్తి రాజ కీయ ఉపదేశం చేశారని వినికిడి. ఈ వాదన చిన్నమ్మకు నచ్చింది. తుపాకీని గోడకు తగిలించింది. ఇది తాత్కాలిక యుద్ధవిరమణే. బెంగాల్ ఎన్నికల్లో ఒకవేళ మమత గెలిస్తే (సర్వేలు చెబుతున్న ప్రకారం) వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మోదీ వ్యతిరేక కూటమికి నాయకురాలిగా మమత అవతరించవచ్చు. కాంగ్రెస్ పరిస్థితి రాజకుమారి పక్కనుండే ప్రధాన చెలికత్తె వేషం వేసే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగజారవచ్చు. ఒకవేళ దీదీ ఓడిపోతే పార్టీ నాయకత్వాన్ని ఆమె మేనల్లుడికి అప్పగించ వచ్చు. పోరాట చరిత్ర లేని ఆ మేనల్లుడు ఏం చేస్తాడన్నది వేచి చూడాల్సిందే. తమిళనాడులో డీఎంకే గెలిస్తే (సర్వే అంచనాల ప్రకారం) అన్నాడీఎంకే నాయకత్వం శశికళ చేతికి లభిస్తుంది. బీజేపీ కూటమిలో ఒక కీలక మద్దతుదారుగా అవతరిస్తుంది. ఏమో... గుర్రం ఎగరావచ్చు అన్న చందంగా అన్నాడీఎంకే గెలిస్తే శశికళ భవిష్యత్తుపై బీజేపీ నాయకత్వం పునరాలోచన చేయవలసి ఉంటుంది. రేపు మహిళా దినోత్సవం రోజున మమతక్క, శశి పిన్నీ పునరుత్తేజితులై రాబోయే యుద్ధాలకు సిద్ధపడతారని భావించవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆ ఇద్దరి సూచన మేరకే తప్పుకున్న చిన్నమ్మ
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి శశికళ అకస్మాత్తుగా తప్పుకోవడంలో ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని శశికళ భావించారు. కుదిరితే అన్నాడీఎంకేను చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం లేదా టీటీవీ దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్లాలని ఆశించారు. ఇదే విషయాన్ని గత నెల 24న జయలలిత జయంతి రోజున బహిరంగంగా ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే స్వాధీనంలోకి వచ్చే పరిస్థితులు కనపడలేదు. దినకరన్ వైఖరి వల్ల అతడిని దూరం పెట్టారు. ఏం చేయాలి చెప్మా అని ఆమె ఆలోచనలోపడ్డారు. ఇదే సమయంలో తమ కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని పట్టుదలతో ఉన్న శశికళను బుజ్జగించేందుకు బీజేపీకి చెందిన ఒక దూత ఆమెను స్వయంగా కలుసుకున్నారు. మనం మనం కీచులాడుకుంటే ఓట్లు చీలిపోయి అధికార పీఠాన్ని డీఎంకే తన్నుకు పోగలదు, రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో సమీప బంధువొకరు శశికళను కలిసి మరో కోణంలో మాట కలిపారు. ఒంటరిగా బరిలోకి దిగితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది, ఆన్నాడీఎంకే ఓటమి పాలైతే ఆ చెడ్డపేరు నీకు చుట్టుకుంటుందని హితవు పలికారు. వీరిద్దరి సలహాతోనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకున్నారనే సమాచారం శుక్రవారం బహిర్గతమైంది. శశికళ వెనుక వెన్నుపోటుదారులు.. టీటీవీ దినకరన్, మరికొందరు వెన్నుపోటుదారుల వల్లనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకోవాల్సి వచ్చిందని స్వయానా ఆమె తమ్ముడు,‘అన్నా ద్రావిడర్ కళగం’ప్రధాన కార్యదర్శి దివాకరన్ వ్యాఖ్యానించారు. తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను కూటమిగా మలుస్తూ అన్నాడీఎంకేను ఆహ్వానించడం వంటి పిల్లచేష్టలకు పాల్పడిన దినకరన్తో ఆమె విరక్తి చెందారని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: శశికళ నిష్క్రమణ వెనుక.. రాజకీయాలకు చిన్నమ్మ గుడ్బై.. కారణాలు ఇవే -
శశికళ నిష్క్రమణ వెనుక..
సాక్షి ప్రతినిధి, చెన్నై: జింకను వేటాడేటప్పుడు పులి రెండు మూడు అడుగులు వెనక్కి వేసి, ఒక్కసారిగా ముందుకు లంఘించి నోట కరుచుకుంటుందట! తమిళనాడులో అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడానికి శశికళ ఇదే సూత్రం పాటిస్తున్నారేమో! రాజకీయాల నుంచి ఆమె నిష్క్రమణ వెనుక పెద్ద ఎత్తుగడ ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జైలు నుంచి శశికళ విడుదల తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తుందని భావించారు. అలాంటిదేమీ జరగలేదు. అక్క కుమారుడు దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అమ్మ ముక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ద్వారా జనంలోకి వెళ్లాలని ఆమె నిర్ణయానికొచ్చారు. ఇంతలో అన్నాడీఎంకే కూటమిలో చేరాలన్న ఆఫర్ బీజేపీ నుంచి వచ్చింది. దీన్ని అన్నాడీఎంకే అడ్డుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుపైనే పోటీ చేయాలన్న బీజేపీ షరతును దినకరన్ అంగీకరించలేదు. దినకరన్ వల్లనే అన్నాడీఎంకే నేతలు తనకు దూరమయ్యారన్న సమాచారం అందడంతో శశికళ అతడిని దూరం పెట్టడం ప్రారంభించారు. న్నికల్లో చురుకైన పాత్ర పోషించేందుకు అనుకూల వాతావరణం లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారు. వ్యూహం అదే.. శశికళ ఏఎంఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరించి, అన్నాడీఎంకే, డీఎంకే కూటములను ఎదుర్కొని, అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఓట్లను చీల్చి, ఆ పార్టీకి ద్రోహం చేశారన్న అపవాదు తప్పదు. అందుకే తాత్కాలికంగా వెనక్కి తగ్గడమే మంచిదని శశికళ తీర్మానించుకున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే.. తనను ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టిన వ్యక్తులను క్షమించి, తన ఓటు బ్యాంకును వారికి అనుకూలంగా మళ్లించిన ఖ్యాతిని పొందవచ్చు. చిన్నమ్మ సహకారం వల్లనే గెలుపు అనే క్రెడిట్ కొట్టేయవచ్చు. ఒకవేళ అన్నాడీఎంకే ఓడిపోతే అది పళనిస్వామి, పన్నీర్సెల్వం ఖాతాలో పడిపోతుంది. దాంతో భవిష్యత్తులో అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతికి రావొచ్చు. అన్నాడీఎంకే గెలిచినా, ఓడినా శశికళకు రాజకీయంగా లాభమే. అలాగే ప్రతిపక్ష డీఎంకేను నిలువరించేందుకు సహకరించానంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపర్చుకోవచ్చు. ఈ వ్యూహంతోనే శశికళ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దినకరన్ ఒంటరి పోరు! శశికళ ప్రోద్బలంతోనే ఏఎంఎంకే ఆవిర్భవించింది. బీజేపీతో సఖ్యత కుదరకుంటే తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ 234 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు టీటీవీ దినకరన్ సన్నద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే– బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ముగిసే వరకు వేచి ఉండాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు.. శశికళ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ శశికళ పేరవై పేరిట మద్దతుదారులు చెన్నైలో ఆమె బస చేసిన ఇంటి ముందు గురువారం ధర్నా చేపట్టారు. -
వ్యూహాత్మక వెనకడుగు!
దశాబ్దాలుగా సినీ రంగ ప్రభావం అపారంగా వున్న తమిళనాడు రాజకీయాలు అచ్చం ఆ రంగాన్నే అనుకరిస్తూ జనంలో ఉత్కంఠను రేపుతున్నాయి. నిరుడు డిసెంబర్ 4న రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించి, ఆ నెలాఖరుకల్లా యూటర్న్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ మాదిరే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత సహచరి శశికళ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు బుధవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శశికళ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించి నిండా నెల్లాళ్లు కాలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి, ఆ తర్వాత కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కొని గత నెల 8న ఆమె బెంగళూరు నుంచి చెన్నై వచ్చారు. ఆ సందర్భంలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. కేవలం 24 రోజుల వ్యవధిలో ఆమె మనసు మార్చుకోవటానికి కారణమేమిటి? శశికళ రాష్ట్రంలో అడుగుపెట్టాక ఆమెపై చాలా చర్చే జరిగింది. అన్నా డీఎంకేతో ఆమెకు సామరస్యత ఏర్పడటం మాట కల్లని కొందరు... మిత్రభేదం కనుక సర్దుబాటు కష్టం కాదని మరికొందరు జోస్యం చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పళనిస్వామి మొదలుకొని అన్నా డీఎంకే నేతలందరికీ ఆమె కంట్లో నలుసు మాదిరే కనబడ్డారు. పార్టీని కబ్జా చేయాలన్న శశికళ ప్రయత్నాలు ఫలించబోవని పళనిస్వామి నేరుగానే అన్నారు. శశికళ సైతం వారిని అదే భాషలో దుయ్యబట్టారు. వారిని పిరికివాళ్లుగా అభివర్ణించారు. పళనిస్వామి అయినా, మరో మాజీ సీఎం పన్నీరుసెల్వమైనా గత నాలుగేళ్లుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ అధినేతల ఆశీర్వాద బలంతోనే కావొచ్చుగానీ... సొంతంగా నిర్ణయాలు తీసుకో గలుగుతున్నారు. జయలలిత హయాంలోనూ, ఆ తర్వాత శశికళ ఏలుబడిలో స్వల్పకాలం పార్టీ నేతలంతా ఎంత ఒదిగి వుండాల్సివచ్చిందో ఎవరికీ తెలియనిది కాదు. స్వతంత్రంగా వ్యవహరించటం తెలియనప్పుడు వేరే సంగతికానీ... అలవాటుపడ్డాక దాన్ని కోల్పోవటానికి సిద్ధపడేదెవరు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాన్నాళ్ల సమయం వుందనుకున్నప్పుడే అక్కడి రాజకీయాలు వింత మలుపులు తిరిగాయి. సూపర్స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ సంగతిని ప్రకటించాక రాష్ట్ర రాజకీయాలెలా వుండబోతున్నాయో చాలామంది కష్టపడి కూడికలు, తీసివేతలూ వేశారు. అవి ఇంకా పూర్తికాకుండానే ఆయన నిష్క్రమణ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడూ అలాగే జరిగింది. శశికళ రాకతో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవచ్చునో అంచనాలు వేసిన వారందరిదీ వృధా ప్రయాసగా మిగిలిపోయింది. శశికళ ఏం చెప్పినా...ఆమెలో కలిగిన ఈ హఠాత్ రాజకీయ వైరాగ్యానికి అసలు కారణమేమిటన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఆమెకు లభించిన మద్దతు చిన్నదేమీ కాదు. బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వెళ్లటానికి గరిష్టంగా 5, 6 గంటల సమయం మించి పట్టదు. కానీ ఆమె ఆ దూరాన్ని 23 గంటలు ప్రయాణించారు. మధ్యలో దేవాల యాల సందర్శనలున్నాయి. కానీ ఎక్కడికక్కడ ఎదురుచూసిన మద్దతుదార్లవల్లనే ఈ జాప్యం చోటుచేసుకుందని శశికళ అనుచరులు చెప్పారు. ఇది చరిత్రాత్మకమని ఆమె బంధువు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్ ఉత్సాహపడ్డారు. ఇప్పుడు ఆయన కూడా శశికళ నిర్ణయంతో ఇరకాటంలో పడినట్టు కనబడుతోంది. ఆమె తాజా నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు ప్రభావితం చేసివుండొచ్చన్న ఊహాగానాలు కొంతమేరకు నిజమే కావొచ్చు. ఆమెతో సర్దుబాటు చేసుకోవాలని ప్రతిపాదించినట్టు కూడా కథనాలొచ్చాయి. పళనిస్వామి, పన్నీరుసెల్వం ససేమిరా అన్నారని చెబుతున్నారు. శశికళ ప్రత్యక్ష రాజకీయానుభవం తక్కువే కావొచ్చుగానీ... ఆమె జయలలిత వద్ద చాలానే నేర్చుకున్నారు. సునిశిత పరిశీలననూ ఒంటబట్టించుకున్నారు. కనుక ఆమె వస్తానన్నా, రానన్నా ఆ మాటల వెనక పరమార్థం వుంటుంది. తాజాగా తమిళనాట డీఎంకే గాలి వీస్తున్నదని ఇప్పటికే వచ్చిన ఒకటి రెండు సర్వేలు నిర్ద్వంద్వంగా ప్రకటించాయి. రజనీకాంత్ వస్తానన్నప్పుడు డీఎంకేకు ఏమేరకు నష్టం జరగొచ్చునని అందరూ లెక్కలు వేశారు తప్ప రజనీ సీఎం అవుతారని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు శశికళ రాక తర్వాత కూడా అంతే. ఆమె వల్ల నష్టం కలిగేది అన్నాడీఎంకే పార్టీకేనని తీర్మానించారు. ఆ పార్టీకి జరిగే నష్టమంతా శశికళకు లాభంగా మారదు. అది డీఎంకేకు తోడ్పడుతుంది. ఈమాత్రం దానికి ఇప్పుడు రాకపోతేనేం అని శశికళ ఆలోచించివుండొచ్చు. అయితే ఇదే ఆమె ఆఖరి నిర్ణయం అని చెప్పలేం. ఇప్పటికైతే ఇది విరామచిహ్నమే. ఆమె గత నిర్ణయాలే ఇందుకు ఉదాహరణ. 2011లో ఆమెను జయలలిత అన్నాడీఎంకేనుంచి బహిష్కరించినప్పుడు శశికళ క్షమాపణ చెప్పి, తనకు అక్కే(జయలలిత) ముఖ్యం తప్ప రాజకీయాలు కాదని ప్రకటించారు. మూడు నెలలు తిరక్కుండా మళ్లీ అధినేతకు చేరువయ్యారు. ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే బలహీనపడిన పక్షంలో ఆమెకు అది సువర్ణావకాశమవుతుంది. అప్పటికి పళనిస్వామి, పన్నీరు సెల్వం ప్రభావం క్షీణిస్తుంది. ఇప్పుడు కాదన్నవారే శశికళకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. అందుకే వ్యూహాత్మకంగా ఆమె వెనక్కి తగ్గివుండొచ్చు. ఏదేమైనా మున్ముందు తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా వుంటాయి. -
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్బై.. కారణాలు ఇవే
-
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్బై..రాజీకి షా ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరి కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు దివంగత అన్నాడీఎంకే నేత జయలలితకు సన్నిహితురాలైన శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్టీ అధినేత్రి జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తానన్నారు. అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంతో పనిచేసి జయలలిత బంగారు పాలన కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు.‘రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నేను దైవంగా పరిగణించే పురచ్చితలైవి (జయలలిత) బంగారు పాలన కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఓడించాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అధినేత్రికి సన్నిహితురాలిగా.. జయలలిత నెచ్చెలిగా నీడలా వెన్నంటి ఉండి పార్టీ రాజకీయాల్లో శశికళ తనదైన ముద్రవేశారు. పార్టీపై పెత్తనం జయలలితదైనా శశికళకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం తీసుకునేవారు కాదని ఆపార్టీ నేతలే చెబుతుంటారు. అందుకే అమ్మ మరణం తరువాత శశికళ చిన్నమ్మగా మారారు. ప్రధాన కార్యదర్శిగా మారి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. నాటి సీఎం పన్నీర్సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తెరపైకి రావడంతో పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నాలుగేళ్ల శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలయ్యారు. రాజీకి అమిత్ షా ప్రయత్నాలు అన్నాడీఎంకేలో కీచులాటలు డీఎంకేకు లాభదాయకమనే కారణంతో ఇరువర్గాలకు రాజీచేసేందుకు అమిత్షా ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు 60 సీట్లు కేటాయిస్తే అందులో 50 శాతం శశికళ వర్గానికి ఇస్తామని బీజేపీ బేరం పెట్టింది. అదే జరిగితే పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా ఆమె చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావించిన అన్నాడీఎంకే అందుకు ససేమిరా అంది. అదే సమయంలో బీజేపీ ద్వారా పొందే సీట్లలో కమలం గుర్తుపై పోటీచేయాలన్న అమిత్షా షరతును దినకరన్ తోసిపుచ్చారు. అన్నాడీఎంకే అంత అయిష్టతను కనబరుస్తున్నపుడు ఆ కూటమి నుంచి పోటీకై బీజేపీ వద్ద సాగిలపడాల్సిన అవసరం లేదని దినకరన్ను శశికళ గట్టిగా మందలించారు. ఎడపాడి, శశికళ తీరుతో అన్నాడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన నెలకొంది. డీఎంకే లాభపడకుండా.. శశికళ చేత బీజేపీనే రాజకీయ అస్త్రసన్యాసం చేయించినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ భావించింది. రాజకీయ క్రీడ నుంచి శశికళను డ్రాప్ చేయించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చని, డీఎంకే దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యూహం పన్నింది. శశికళ నిర్ణయం తనకే ఆశ్చర్యం కలిగించిందని టీటీవీ దినకరన్ అన్నారు. రాజకీయాల నుంచి వైదొలగినంత మాత్రాన ఆమె వెనకడుగు వేసినట్లు భావించరాదని వ్యాఖ్యానించారు. -
చిన్నమ్మ సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎంకే పార్టీని ఓడించాలని అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ పిలుపునిచ్చారు. జయలలిత బంగారు పాలన తమిళనాడు కొనసాగాలని ఆమె పేర్కొన్నారు. శశికళ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకనొక సమయంలో మూడో కూటమి తలుపులు మూసుకుపోవడంతో ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) నేతృత్వంలో నాలుగో కూటమికి చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. జైలు నుంచి విడుదలైన శశికళ ప్రకటనపై కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవల నటుడు శరత్కుమార్ చిన్నమ్మను కలిసి రాజకీయాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. -
చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ!
సాక్షి , చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడో కూటమి తలుపులు మూసుకుపోవడంతో ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) నేతృత్వంలో నాలుగో కూటమికి చిన్నమ్మ శశికళ సిద్ధం అవుతున్నారు. తమిళనాట ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే పోటీ అనే ఆనవాయితీకి మూడో కూటమి ఏర్పాటుతో గండి కొట్టాలని ప్రతిసారి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవి విఫలం కావడం కూడా పరిపాటిగా మారింది. అయినా యథాప్రకారం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మూడో కూటమి పుట్టుకొచ్చింది. డీఎంకే కూటమి నుంచి వైదొలగిన ‘ఇండియా జననాయక కట్చి’మూడో కూటమిని ఏర్పాటు చేసి అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన నటుడు శరత్కుమార్ అధ్యక్షునిగా ఉన్న ’సమత్తువ మక్కల్ కట్చి’ని చేర్చుకుంది. ఆ మరుసటి రోజునే ఐజేకే అధ్యక్షుడు రవి పచ్చముత్తు, శరత్కుమార్ ‘మక్కల్ నీది మయ్యం’అధ్యక్షులు కమల్హాసన్ను కలుసుకుని మూడో కూటమిలోకి ఆహ్వానించారు. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండమని ఆఫర్ కూడా ఇచ్చారు. ఇందుకు సమ్మతించిన కమల్..శశికళ, దినకరన్ సారథ్యం లోని ఏఎంఎంకేను చేర్చుకోకుంటేనే వస్తానని షరతు విధించారు. చదవండి: (తమిళనాడు: 21 సీట్లిస్తాం.. వాటితోనే సర్దుకోండి) ఆర్థిక నేరాల కేసులో శిక్షను అనుభవించిన శశికళ వల్ల మూడో కూటమిపై అవినీతి మచ్చపడుతుందని కమల్ వాదించగా సమ్మతించారు. డీఎంకే కూటమిలో సర్దుబాటు కుదరక కాంగ్రెస్ సైతం మూడో కూటమివైపు రావచ్చని కమల్ అంచనా వేస్తున్నారు. అయితే, అలాంటి సూచనలు ఏవీ కనపడడం లేదు. మూడో కూటమిలో చేరే ముందు శరత్కుమార్ శశికళతో భేటీ కావడంతో కొత్త కూటమి వెనుక ఆమె ప్రోద్బలం ఉందని పరిశీలకులు అంటున్నారు. రెండు కూటముల్లోని అసంతృప్త వాదులు వలసలు ముగిసిన తరువాత మూడో కూటమిలోకి ప్రవేశించి పగ్గాలు చేపట్టాలని శశికళ, దినకరన్ ఆశించారు. అయితే శశికళ కంటే కమల్ వస్తేనే బలమని మూడో కూటమి తీర్మానించుకోవడంతో శశికళ నాలుగో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బుధవారం ఉదయం శశికళను కలిసి నాలుగో కూటమి ఏర్పాట్లను ముమ్మురం చేశారు. ఒత్తిళ్లు, బెదిరిం పులకు లోనై బయటకు వెళ్లగక్కలేక మదన పడుతున్న అన్నాడీఎంకే అగ్రనేతలు తమవైపు వస్తారని శశికళ ఎదురు చూస్తున్నారు. అంతర్గత కీచులాటతో నష్టపోయి ప్రభుత్వాన్ని డీఎంకే చేతుల్లో పెట్టేకంటే శశికళతో సర్దుకుపోవడమే మేలని బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకే అధిష్టానంతో చెప్పడం, వారు విముఖత వ్యక్తం చేయడం జరిగిపోయింది. ఈ రకంగా బీజేపీ తమ పట్ల సాఫ్ట్కార్నర్తో ఉందని శశికళ నమ్ముతున్నారు. సీట్ల కేటాయింపు వ్యవహారంలో అన్నాడీఎంకేపై బీజేపీ అసంతృప్తితో ఉంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న టీటీవీ దినకరన్ చెన్నైలో అమిత్షాను రహస్యంగా కలిశారు. ఏఎంఎంకేకు 10–15 సీట్లు ఇస్తాం, అయితే కమలం చిహ్నంపై పోటీచేయాలని అమిత్షా షరతు విధించినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగో కూటమిలో బీజేపీ చేరడం ఖాయమని దినకరన్ ధీమాతో ఉన్నారు. అయితే బీజేపీ చిహ్నంపై పోటీ చేసేందుకు మాత్రం దినకరన్ అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా బీజేపీతో చర్చలపై ముందుకెళ్లలేక వెనక్కిరాలేక సతమతం అవుతున్నారు. అన్నాడీఎంకే, బీజేపీలకు ఆహ్వానం: దినకరన్ టీటీవీ దినకరన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏఎంఎంకే సారథ్యంలో నాలుగో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఎంఎంకే–అన్నాడీఎంకే మధ్య రహస్య సయోధ్య వ్యూహంపై ప్రస్తుతానికి ఏమీ చెప్పకూడదని అన్నారు. డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవమే లక్ష్యంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే, బీజేపీలను సైతం తమ నాలుగో కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. -
తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనే ఆనవాయితీకి చెక్పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు కూటముల్లోని అసంతృప్త పార్టీలను కూడగట్టడం ద్వారా మూడో కూటమి సన్నాహాలు జోరందుకున్నాయి. మూడో కూటమి ఏర్పాట్లలో తెరవెనుక శశికళ, తెరముందు శరత్కుమార్ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేతోపాటు ఒకటి రెండు చిన్నపార్టీలున్నాయి. డీఎంకేలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలున్నాయి. ఇండియా జననాయక కట్చి (ఐజేకే) డీఎంకే కూటమి నుంచి బయటకొచ్చి మూడో కూటమి ఏర్పాటుకు నడుం బిగించింది. తమిళనాడులో పెద్దగా ప్రాచుర్యం లేని ఐజేకే ప్రస్తుతానికి కూటమికి సారథ్యం వహిస్తున్నా తెరవెనుక నుంచి శశికళ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్కుమార్ కొద్దిరోజుల క్రితం శశికళతో భేటీ కావడం కలకలం రేపింది. తర్వాత అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకేలో శరత్ చేరారు. పదేళ్లు అన్నాడీఎంకే కూటమితో కలిసి ప్రయాణించానని, సీట్ల కేటాయింపుపై కనీసం తనకు ఆహ్వానం లేకపోవడం వల్లనే వైదొలిగానని శరత్కుమార్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని శరత్కుమార్ కూటమిని బలోపేతం చేయడంలో కూడా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ను శరత్కుమార్ శనివారం కలిసి కూటమిలో చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. డీఎంకే కూటమిలో చేరాలని ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న కమల్హాసన్కు నిరాశే ఎదురుకాగా ఐజేకే ఆహ్వానాన్ని మన్నించే అవకాశం ఉంది. మూడో కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం కాదు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసంక్షేమం కోసం పాటుపడే పార్టీలను సంఘటితం చేసి గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శరత్కుమార్ తెలిపారు. కమల్ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని శరత్కుమార్ అన్నారు. ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న రెండు కూటముల్లోని ఆశావహులపై కూడా ఐజేకే ఒక కన్నేసింది. మూడో కూటమిలోని ఏదో పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం లేదా కూటమి తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించేందుకు ఐజేకే సిద్ధంగా ఉంది. డీఎంకే నేతలు జారిపోకుండా ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మార్చి 2వ తేదీ నుంచి ఆశావహులను ఇంటర్వ్యూ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే తమ సామాజికవర్గమైన వన్నియర్లకు రిజర్వేషన్ల డిమాండ్ను తెరపైకి తెచ్చి సాధించింది. అదే జరగకుంటే పీఎంకే సైతం అన్నాడీఎంకే నుంచి వైదొలిగి డీఎంకే లేదా మూడో కూటమి వైపు మొగ్గి ఉండేది. అన్నాడీఎంకే అగ్రనేతలతో శనివారం జరిగిన చర్చల్లో సామరస్యం కుదరగా 23 సీట్లతో పీఎంకే సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ 60 సీట్లను కోరుతుండగా, 20–25 సీట్లకు మించి దక్కే పరిస్థితి కనపడడం లేదు. తమిళనాడులోని మొత్తం 234 సీట్లలో పోటీచేసేందుకు బహుజన సమాజ్ పార్టీ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మూడో కూటమిలో చేరినా చేరవచ్చు. అదే జరిగితే ఒంటరిపోటీపై బీఎస్పీ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నటుడు రజనీకాంత్ స్థాపించదలుకున్న పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్మూర్తి ‘ఇండియా మక్కల్ మున్నేట్ర కట్చి’అనే పార్టీని స్థాపించారు. బీజేపీ నేపథ్యం కలిగిన అర్జున్మూర్తికి ‘ఆల్ ది బెస్ట్’అంటూ రజనీకాంత్ ఆశీస్సులు అందజేశారు. మూడో కూటమికి అధికారంలోకి వచ్చేంత సంఖ్యా బలం సమకూరకున్నా రెండు కూటముల్లోని అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడవచ్చు. తమిళనాడులో రాహుల్, అమిత్షా.. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ మూడు రోజులపాటు తమిళనాడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదివారం కారైక్కాల్, విల్లుపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పీఎంకేకు 23 సీట్లు ♦ఏఐఏడీఎంకే అంగీకారం ♦బీజేపీతో కొనసాగుతున్న చర్చలు చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను సీట్ల పంపకాలు జోరందుకున్నాయి. అధికార ఏఐఏడీఎంకే, ఎస్.రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ మధ్య సీట్ల పంపిణీపై శనివారం అంగీకారం కుదిరింది. దీని ప్రకారం పీఎంకే రాష్ట్రంలోని 23 సీట్లలో పోటీ చేయనుంది. కాగా, సీట్ల సర్దుబాటుపై ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్లు ఏఐఏడీఎంకేకు చెందిన సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలతో శనివారం చర్చలు జరిపారు. తాము గెలిచేందుకు అవకాశమున్న 60 స్థానాలను కోరుతున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు. సూత్రధారి చిన్నమ్మ.. మూడో కూటమి ఏర్పాటుకు శశికళ సూత్రధారి అని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి ఆశించిన స్థాయిలో అగ్రనేతలు శశికళ వైపు రాకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. అందుకే శశికళ అక్క కుమారుడు దినకరన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూడా మూడో కూటమిలో చేరిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ కోసం ఐజేకే యత్నిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాటు పూర్తయితేగానీ అసంతృప్తవాదులు బయటపడరు. అప్పటి వరకు ఐజేకే వేచిచూడక తప్పదు. మూడో కూటమి ఏర్పాటు ఒక కొలిక్కిరాగానే దాని స్వరూపం మారి శశికళ తెరపైకి రావచ్చని అంచనాలున్నాయి. -
12 లక్షల విలువైన కుక్కర్లు.. తమిళనాడులో కలకలం
చెన్నె: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 24 గంటలు కూడా కాలేదు.. అప్పుడే ఓటర్లకు ప్రలోభాల పర్వం మొదలైంది. తమిళనాడులో ప్రెజర్ కుక్కర్లు పంచిపెట్టారు. అయితే వాటి సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడంతో తమిళనాడులో కలకలం రేపింది. శశికళ వర్గానికి చెందిన వారు ఈ కుక్కర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని అరియలూరు జిల్లాలో రెండు లారీల్లో భారీగా ప్రెజర్ కుక్కర్లు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. మొదట వరణాసి సమీపంలోని సమతువపురం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక లారీని తనిఖీ చేయగా డ్రైవర్లు ఖాళీ డబ్బాలు అని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. అనంతరం రెండో లారీ కూడా వచ్చింది. అనుమానం వచ్చి తనిఖీ చేయగా 1,500 ప్రెజర్ కుక్కర్లు కనిపించాయి. వెంటనే మొదట లారీని కూడా ఆపేసి చూడగా అందులో 1,700 కుక్కర్లు ఉన్నాయి. మొత్తం 3,300 కుక్కర్లను (విలువ రూ.12 లక్షలు) పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కుక్కర్లపై మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత, శశికళ, ఏఎఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, ఆ పార్టీ నాయకుడు వేలు కార్తికేయన్ ఫొటోలతో ఆ కుక్కర్లు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో తంజావూరుకు తీసుకెళ్తున్నారని తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే దినకరన్ పార్టీ ఏఎఎంకే గుర్తు ప్రెజర్ కుక్కరే కావడం గమనార్హం. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నారని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ
చెన్నె: జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ అన్నాడీఎంకే పార్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ తనదేనని.. పార్టీ గుర్తుపై ఇప్పటికే కేసు వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకే గుర్తు రెండాకులు వినియోగిస్తోంది. తాజాగా బుధవారం జయలలిత జయంతి సందర్భంగా శశికళ తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకుంది. ఈ మేరకు అదే హోదాతో ప్రకటన విడుదల కావడం విశేషం. కాగా తమిళనాడులో బుధవారం జయలలిత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరి అమ్మగా పేరుపొందిన జయలలితను అన్ని పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జయలలితకు ఘన నివాళులర్పించారు. అయితే పోయెస్ గార్డెన్లో శశికళ తన స్నేహితురాలు జయలలితకు ఘన నివాళులర్పించింది. టీటీవీ దినకరన్తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ తనదేనని శశికళ మరోసారి పునరుద్ఘాటించారు. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు డీఎంకే అని తెలిపారు. ఈ క్రమంలోనే శశికళ నివాసానికి సినీ ప్రముఖులు వరుస కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా శరత్కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా శశికళను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వారు శశికళను కలవడం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే సమావేశంలో రాజకీయంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నా.. దీనిపై వారు స్పష్టత ఇచ్చారు. శశికళ అనారోగ్యానికి గురవడం.. జైలు నుంచి రావడంతో ఆమెను పరామర్శించేందుకే వచ్చామని రాధికా శరత్కుమార్ తెలిపారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చినట్లు వివరణ ఇచ్చారు. అయితే రాధికా శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. -
శశికళ వర్గానికి తమిళ సీఎం స్ట్రాంగ్ కౌంటర్
చెన్నె: జైలు శిక్ష అనుభవించి చెన్నె చేరుకున్న శశికళపై తమిళనాడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది. నిన్న ఆస్తుల జప్తు చేయగా తాజాగా నేడు ముఖ్యమంత్రి నేరుగా ఆమెపై, ఆమె వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దివంగత నాయకురాలు జయలలితకు అసలైన వారసులం తామేనని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. అన్నాడీఎంకేని నాశనం చేయడానికి విష శక్తులు కుట్రలు పన్నుతున్నాయంటూ వి.కె.శశికళపై పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పళని మాట్లాడారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన వాళ్లు పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి పార్టీ నుంచి తొలగించామని, మళ్లీ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా.. వారి ఆటలు సాగవని పేర్కొన్నారు. టీటీవీ దినకరన్ వర్గం తలకిందులుగా తపస్సు చేసినా వారు అనుకున్నది ఎన్నటికీ జరగదని ప్రకటించారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని సీఎం పళని స్వామి తెలిపారు. తమిళనాడులో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శశికళ రాకతో రాజకీయం రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే తన పార్టీనేనని, రెండాకుల గుర్తు కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
23 గంటలపాటు శశికళ ప్రయాణం
సాక్షి, చెన్నై: బెంగళూరు నుంచి చెన్నైకు చిన్నమ్మ శశికళ సుదీర్ఘ పయనం చేశారు. అభిమానులు, మద్దతుదారుల ఆహ్వాన నీరాజనాలు అందుకుంటూ 23 గంటలు ఆమె కారులో ప్రయాణం చేశారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు చెన్నైలోని టీనగర్లో తన నివాసానికి చేరుకున్నారు. హారతి పట్టి కుటుంబీకులు ఆహ్వానం పలికారు. గో పూజ తర్వాత ఇంట్లోకి చిన్నమ్మ వెళ్లారు. బ్రహ్మరథం పట్టిన అభిమానులు.. బెంగళూరు నుంచి శశికళ సోమవారం ఉదయం 7.45 గంటలకు చెన్నైకు బయలుదేరిన విషయం తెలిసిందే. అడుగడుగునా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం ఉదయం 4గంటల సమయంలో రామాపురం తోట్టంలోని దివంగత ఎంజీఆర్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన విగ్రహానికి శశికళ నివాళులర్పించారు. అక్కడి నుంచి మద్దతుదారుల ఆహ్వానాన్ని అందుకుంటూ 6.45 గంటలకు టీ నగర్ హబీబుల్లా రోడ్డులోని తన వదినమ్మ ఇలవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటికి చేరుకున్నారు. హారతి పట్టి కుటుంబీకులు ఆహ్వానం పలికారు. గోపూజ తర్వాత ఇంట్లోకెళ్లారు. రెండ్రోజుల విశ్రాంతి తర్వాత కార్యకర్తలను కలుసుకోబోతున్నారు. శశికళ అన్నాడీఎంకే జెండాను ఉపయోగించిన కారులో పయనించడం, ఆ కారుకు యజమానిగా ఉన్న కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్ ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శి సంపంగితో పాటు ఆరుగుర్ని అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ, ఆ పార్టీ సమన్వయ కమిటీ ప్రకటన చేసింది. చిన్నమ్మ అండ్ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ తీయడానికి అన్నాడీఎంకే పాలకులు సిద్ధమైనట్టున్నారు. చదవండి: (పార్టీని ఆధీనంలోకి తెచ్చుకుంటా) -
చిన్నమ్మకు గట్టి షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నె: తమిళనాడు రాష్ట్రంలోకి అడుగుపెట్టి 24 గంటలు గడిచాయో లేదో అప్పుడే తమిళనాడు ప్రభుత్వం శశికళకు షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ అడుగుపెట్టిన వెంటనే ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని సోమవారం చెన్నైకు చేరుకున్న శశికళకు అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జయలలితకు తానే వారుసురాలిని, అన్నాడీఎంకే తనదేనని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుందని సమాచారం. ఈ క్రమంలోనే వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. -
పార్టీని ఆధీనంలోకి తెచ్చుకుంటా
సాక్షి ప్రతినిధి, చెన్నై: క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడతానని, అన్నాడీఎంకేను ఆధీనంలోకి తెచ్చుకుంటానని, తననెవరూ అడ్డుకోలేరని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి గత నెల 27న విడుదలై బెంగళూరు శివార్లలోని రిసార్టులో రెస్ట్ తీసుకున్న శశికళ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. కృష్ణగిరి జిల్లా కందికుప్పంతోపాటూ పలు చోట్ల ఆమె కారులో నుంచే ప్రసంగించారు. ‘అణగదొక్కాలనే వారి ప్రయత్నాలు ఫలించవు. క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా. త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరిస్తా. కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే నేను బానిసను. వారికి దాసోహం అవుతా. అమ్మ సమాధి సందర్శనకు వీలులేకుండా అకస్మాత్తుగా ఎందుకు మూసివేశారో ప్రజలందరికీ తెలుసు. అన్నాడీఎంకే పతాకాన్ని నేను వినియోగించడంపై పోలీసులకు ఆ పార్టీ నేతలు, మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో నెలకొన్న భయానికి నిదర్శనం. నా అభిమానులైన కార్యకర్తల సహకారంతో విజయం సాధించవచ్చు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమ్మ ఆశీర్వాద బలంతో అధిగమిస్తా. ప్రాణం ఉన్నంతవరకు, తుదిశ్వాస విడిచేవరకు అఖిల భారత అన్నాడీఎంకే ద్వారా ప్రజా సంక్షేమాన్ని కాపాడుతా. కరోనా బారిన పడినా అమ్మ ఆశీర్వాదం వల్ల కోలుకున్నా’ అని అన్నారు. అన్నాడీఎంకే పతాకంతోనే చిన్నమ్మ రాక సోమవారం ఉదయం 8 గంటలకు రిసార్టు నుంచి చెన్నైవైపు కారులోనే బయలుదేరారు. 10.45 గంటలకు ఆమె కారు తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పోలీసులు ఆమె కారును అడ్డుకుని అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించాలని కోరగా శశికళ నిరాకరించారు. అన్నాడీఎంకే తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఒక నేత ‘అది నా అధికారిక కారు, అడ్డుకునే హక్కు లేదు’అని వాదించడంతో పోలీసులు వెనక్కితగ్గారు. శశికళకు ఘన స్వాగతం పలికేందుకు వచ్చిన కార్లు రెండు బాణసంచాతో పేలడంతో కాలి బూడిదయ్యాయి. శశికళ రాకదృష్ట్యా చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది. కృష్ణగిరి జిల్లాలో శశికళకు స్వాగతం పలుకుతున్న మద్దతుదారులు, అభిమానులు -
చెన్నై చేరుకున్న చిన్నమ్మ
చెన్నై: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని ఎంజీఆర్ నివాసానికి చేరుకుని జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు తన అనుచరులతో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించారు. కర్నాటక రాజధాని బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించి జనవరి 27న విడుదల అయ్యారు. అయితే ఆమె ఇటీవల కరోనా బారినపడడంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తీసుకున్న అనంతరం క్వారంటైన్ కాలం పూర్తి చేసుకుని సోమవారం బెంగళూరు నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శశికళకు పెద్ద ఎత్తున అభిమానులు, ఆమె అనుచరులు భారీ స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కాన్వాయ్లు బారులు తీరాయి. వేలాది మంది అభిమానులు ఆమె వెంట ఉన్నారు. అయితే శశికళ జైలు నుంచి విడుదల కాకముందే అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కేసు వేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఇంకా తన పార్టీగా పేర్కొంటూ శశికళ రెండాకుల పార్టీ పతాకాన్ని ఆమె తన వాహనానికి వినియోగించుకున్నారు. తాజాగా తమిళనాడుకు చేరుకున్న సమయంలో కూడా అదే గుర్తు ఉన్న జెండాలు కనిపించాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాలతో శశికళ బిజీ కానున్నారు. దీంతో తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే శశికళ రాకపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. జయలలిత సమాధి, స్మారక మందిరం మూసివేయగా.. శశికళ పోస్టర్లు అతికించవద్దని నిషేదాజ్ఞలు విధించింది. దీంతోపాటు రెండాకుల గుర్తు వాడకంపై ఇప్పటికే అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 కేసులు నమోదు చేయించిన విషయం తెలిసిందే. -
నేడు చెన్నైకి శశికళ.. ఘనంగా స్వాగత ఏర్పాట్లు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ సోమవారం చెన్నైకు రానున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లు చేశాయి. చిన్నమ్మ వస్తే అడ్డుకొనేందుకు అన్నాడీఎంకే కార్యాలయం, మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ముగించుకుని సోమవారం చెన్నైకు శశికళ రానున్నారు. టీనగర్ హబీబుల్లా రోడ్డులో ఆమె బస చేయడానికి తగ్గట్టుగా ఓ భవనం సిద్ధమైంది. ఇది ఆమె వదినమ్మ ఇలవరసి కుటుంబానికి చెందింది. తమిళనాడు సరిహద్దులోని హొసూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. దీంతో ఆయా జిల్లాల్లో 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు జరిగాయి. అన్నాడీఎంకే జెండా కల్గిన కారులోనే ఆమె రానున్నట్టు సమాచారం వెలువడింది. శశికళకు భద్రత కల్పించాలని కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ తరఫున ఓ విజ్ఞప్తి ఆదివారం కమిషనరేట్కు చేరింది. శశికళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన పక్షంలో ఆమెను అడ్డుకునేందుకు అధికార పక్షం ముందస్తు చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయం చుట్టూ ఉన్న మార్గాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. అలాగే, జయలలిత సమాధి సందర్శనకు అనుమతి రద్దు చేసిన దృష్ట్యా, శశికళ వెళ్లిన పక్షంలో అక్కడ కూడా అడ్డుకునేందుకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
జైలు నుంచి విడుదలైన శశికళ
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. దీంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేశామని జైలు అధికారులు ప్రకటించారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. శశికళ జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. (శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
నేడు శశికళ విడుదల
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆమె కోవిడ్ బారిన పడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఆమెకు పూర్తి విడుదల కలుగుతుందని, దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న ఆమెకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఎప్పుడు విడుదలవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమెకు కరోనా లక్షణాలేమీ లేవని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. -
కరోనాతో చిన్నమ్మ పోరాటం
బెంగళూరు జైలులో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రి పాలైన చిన్నమ్మ కరోనా వైరస్తో పోరాడుతున్నారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలు బయటపడడంతో శశికళ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి,చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఈనెల 27న ఆమె విడుదల కావాల్సిన తరుణంలో అస్వస్థకు గురయ్యారు. జ్వరం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈనెల 20న బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆమెకు వెంటిలేటర్ అమర్చి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఇప్పటికే బీపీ, షుగర్ ఉండడంతో వైద్యులు దగ్గరుండి తరచూ పరీక్షిస్తున్నారు. శశికళకు గురువారం రాత్రి జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో రక్తపరీక్షలు చేయగా తీవ్రమైన నిమోనియా వ్యాధి ఉన్నట్లు తేలింది. ఆమెను ఉంచిన వార్డులు నిరంతర ప్రాతిపదికపై వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బందిని నియమించారు. ఈనెల 24వ తేదీ వరకు ఆస్పత్రిలోనే ఆమెను ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పలు వ్యాధులకు గురికావడంతో బెంగళూరుకు చేరుకున్న చిన్నమ్మ బంధువులు ఆందోళన చెందుతున్నారు. టీటీవీ దినకరన్ను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారు. ఆస్పత్రి వెలుపల పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు చేరుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. శశికళ ఉంటున్న జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న శశికళ వదిన ఇళవరసికి సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు. విడుదలలో జాప్యం.. శశికళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కనీసం 15 రోజులు ఐసోలేషన్లో పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు తోడు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఈనెల 27న శశికళ విడుదల కాకపోవచ్చని అంటున్నారు. దీంతో ఆమె అభిమానులు డీలా పడిపోయారు. 27న శశికళ విడుదల కాగానే కర్ణాటక నుంచి తమిళనాడు వరకు కార్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఆమె ఎప్పుడు విడుదలవుతారో ఎవరూ నిర్ధారించలేని పరిస్థితులు చుట్టుముట్టాయి. దీనిపై అధికారులు మాట్లాడుతూ విడుదలకు ముందు ఆమె జైలు దుస్తులు తమకు అప్పగించి, రికార్డుల్లో సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కరోనా సోకినందున అది సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో శశికళ విడుదల గురించి తీసుకోవాల్సిన నిర్ణయంపై చట్ట నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. -
శశికళకు కరోనా
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు. ‘‘ప్రస్తుతం ఆమెకు కోవిడ్ 19 సోకింది. ఇతర ఏ అనారోగ్యాలు లేవు. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది’’అని ఆస్పత్రి సూపరిండెంట్ రమేశ్ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో బాధపడుతున్న శశికళను బుధవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు అధికారులు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సిఉంది. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్ ఆరోపించారు. తమిళనాడు మన్నార్కుడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈమేరకు కర్ణాటక రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. -
శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బంధువు, సహచర నిందితురాలు ఇళవరసి ఇంకొంత కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. (చదవండి: ముందస్తు విడుదల విఫలమవడంతో శశికళలో ఆధ్యాత్మికత) శశికళ, ఇళవరసి, మరో బంధువు వీఎన్ సుధాకర్లు 2017, ఫిబ్రవరి నుంచి పరప్పన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో ఇళవరసి కంటే కొంత ముందే శశికళ అరెస్టయి జైల్లో గడపడంతో ముందే విడుదల కానున్నారు. ఇతరత్రా కస్టడీ రోజులను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27తో శశికళ శిక్షా కాలం ముగుస్తుందని జైలు వర్గాలు తెలిపాయి. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ. 10 కోట్లను చెల్లించారు. సుధాకర్ ఇంకా కట్టలేదని తెలిసింది. (చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
జనవరి 27న విడుదలకానున్న చిన్నమ్మ..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు శశికళ మార్గం సుగమమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నారు. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ ముగ్గురూ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. గతనెల 17న శశికళ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో చెల్లించారు. ఆ తరువాత ఇళవరసి సైతం జరిమానాను చెల్లించారు. వీఎన్ సుధాకరన్ మాత్రం ఇంకా చెల్లించలేదు. సుధాకరన్ శిక్షాకాలం త్వరలో ముగుస్తున్నందున జరిమానా చెల్లింపునకు అనుమతి, విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన న్యాయవాదులు సెప్టెంబర్ 8న అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తుదితీర్పు వెలువడే నాటికి 122 రోజులు జైల్లో గడిపినందున నాలుగేళ్ల శిక్షాకాలంలో వీటిని మినహాయించుకుని వెంటనే విడుదల చేయాల్సిందిగా సుధాకరన్ న్యాయవాదులు కోర్టుకు విన్న వించారు. విడుదలపై ఆదేశాలు జారీకాగానే జరిమానాను చెల్లిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా, జరిమానా చెల్లించగానే శిక్షాకాలం రోజులను కలుపుకుని సుధాకరన్ను వెంటనే విడుదల చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జరిమానా సొమ్ము చెల్లింపునకు న్యాయవాదులు సిద్ధం అవుతుండగా, రెండు మూడు రోజుల్లో సుధాకరన్ విడుదల కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. చదవండి: (కమల్ హాసన్కు నిరాశ.. టార్చ్లైట్ పోయే..) వచ్చేనెల 27న శశికళ విడుదల.. ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకరన్ విడుదలపై స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన శశికళకు సైతం జైలు నుంచి విముక్తి పొందే రోజు ఆసన్నమైనట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బెంగళూరు జైలు వద్దకు చేరుకుని శశికళ ఘనస్వాగతం పలికే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు ఆమె చేరే వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్శాఖకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. దీంతో వచ్చేనెలాఖరులో శశికళ విడుదల ఖాయమని భావించవచ్చు. -
శశికళ ఆశలు అడియాశలు..!
సాక్షి, చెన్నై: బాహ్యప్రపంచంలోకి ఎప్పుడెప్పుడు అడుగుపెడదామాని ఉవ్విళ్లూరుతున్న శశికళ ఆశలు అడియాశలయ్యాయి. గడువు కంటే ముందుగా విడుదల చేసే అవకాశం లేదని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ శుక్రవారం స్పష్టం చేయడంతో ఆమె అభిమానులు డీలా పడిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానాకు గురైన శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది. (మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం) అయితే సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి “ 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని’ జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు ఇటీవలే ఆమె చెల్లించారు. కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి శశికళకు మొత్తం 129 రోజుల సెలవులనుగా విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించాడు. ఈనేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బెంగళూరులోని విధానసౌధలో మీడియా ప్రతినిధులు శుక్రవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్షకాలం ఉంటుంది, ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని పేర్కొన్నారు. వెంటనే విడుదలకు కోర్టులో పిటిషన్.. ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో శుక్రవారం పిటిషన్ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయా లని కోరుతూ పిటిషన్ ధాఖలు చేయనున్నారు. -
చిన్నమ్మే..జేజమ్మా..?
-
రూ. 237 కోట్ల రధ్దైన నోట్లను మార్చిన శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి చెల్లనినోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది. ప్రభుత్వ పౌష్టికాహార కాంట్రాక్టర్ను బెదిరించి రూ. 237 కోట్ల రద్దైన నోట్లకు వడ్డీ సహా కొత్తనోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకున్న సంగతిని కోర్టుకు సమర్పించిన పత్రం ద్వారా ఐటీశాఖ బయటపెట్టింది. నోట్ల రద్దప్పుడు శశికళ ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి రద్దైన నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొన్నట్లు పేర్కొంది. ‘రుణం కింద రూ.240 కోట్ల పాత నోట్లిస్తాం. బదులుగా ఏడాది తర్వాత 6 శాతం వడ్డీ సహా కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుమారస్వామి అనే వ్యాపారితో శశికళ ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఐటీశాఖ పేర్కొంది. -
శశికళకు షాక్.. బినామీ ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళకు చెందిన రూ. 1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖ మంగళవారం స్వాధీనం చేసుకుంది. 2016 నవంబర్లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై, పుదుచ్చెరీల్లో వేర్వేరు చోట్ల ఉన్న 9 ఆస్తులను ఆమె కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు రూ. 1500 కోట్ల విలువైన రద్దైన నోట్లతో ఆ ఆస్తులను శశికళ బినామీ పేర్లతో కొన్నట్లు, నగదు చెల్లింపుల ద్వారానే ఆ కొనుగోలు జరిగినట్లు నిర్ధారించారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని జైళ్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2017లో ఐటీ అధికారులు శశికళతో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై భారీగా దాడులు నిర్వహించారు. చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆ సమయంలోనే ఈ 9 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. -
అధికారం కోసం అమ్మను పొట్టనపెట్టుకున్నారు..
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వైద్య చికిత్స అందకుండా శశికళ కుటుంబం అడ్డుకుందని, అధికారం చేజిక్కించుకునేందుకు జయలలిత మరణం కోసం వారు వేచిచూశారని ఏఐడీఎంకే ఆరోపించింది. అధికార దాహంతో అమ్మ(జయలలిత)కు తదుపరి చికిత్సను అందించకుండా, ఆమె మరణం కోసం శశికళ కుటుంబం వేచిచూసిందని పార్టీ అధికార పత్రిక నమదు అమ్మ పత్రిక పేర్కొంది. ప్రజల సొమ్ముతో శశికళ కుటుంబం కోట్లు గడించిందని ఆరోపించింది. 2016 డిసెంబర్లో జయలలిత మరణించిన వెంటనే శశికళ పార్టీ చీఫ్గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే అవినీతి కేసులో ఆమె జైలు పాలవడంతో ఏఐఏడీఎంకేలో శశికళ ప్రస్ధానం ఎక్కువకాలం సాగలేదు. అనంతర పరిణామాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న నేతలు సైతం రెబెల్ నేత, ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్సెల్వం పక్షాన చేరారు. చివరికి పార్టీ అధికారిక చిహ్నం సైతం పన్నీర్, పళనిస్వామిల వశమైంది. -
భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు..
-
శశికళ భర్త కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళ ప్రజల అమ్మ జయలలితకు నెచ్చెలి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్(75) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. పుదియ పార్వై పత్రిక సంపాదకుడు అయిన నటరాజన్ గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అనేక చికిత్సల అనంతరం ఆయన కోలుకు న్నట్టు కుటుంబీకులు భావించారు. నుంగం బాక్కం మహాలింగపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ఆయన గతవారం గుండెపోటుకు గురయ్యారు. చెన్నై శివారులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున 1.30 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని పోరూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఎంబామింగ్ చేశారు. అనంతరం చెన్నై బీసెంట్ నగర్లోని నివాసంలో మధ్యాహ్నం వరకు ఉంచారు. అనంతరం తంజావూరు జిల్లాలోని నటరాజన్ స్వగ్రామం విలార్కు తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఎండీఎంకే నేత వైగో, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తదితరులు నటరాజన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శశికళకు పెరోల్ మంజూరు నటరాజన్ మరణంతో బెంగళూరు జైల్లో ఉన్న శశికళకు 15 రోజుల పెరోల్ మంజూరైంది. ఆమెను రోడ్డుమార్గంలో తంజావూరుకు తీసు కెళ్లేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. -
శశికళను చూసి షాకైన రేఖా శర్మ
సాక్షి, బెంగళూర్ : పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళకు స్పెషల్ ట్రీట్మెంట్ కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నిర్ధేశించిన జైలు యూనిఫాంను కూడా ధరించడం లేదు. బెంగళూర్ జైలుని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ సందర్శించిన క్రమంలో తోటి ఖైదీలు, ఆమెకు మధ్య ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు. అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఇదే జైలులో ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. తాను జైలును సందర్శించిన సమయంలో శశికళ, ఇళవరసి జైలు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో కనిపించారని రేఖా శర్మ నిర్ధారించారు. ఇదే విషయమై తాను జైలు అధికారులను ప్రశ్నించగా ఆమె అత్యున్నత కేటగిరీకి చెందిన వారు కావడంతో సొంత దుస్తులు వాడేందుకు అనుమతిస్తామని చెప్పినట్టు తెలిపారు. జైలులో శశికళ ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్నారని, విజిటర్స్ను ప్రైవేటు ప్రదేశంలో కలుస్తున్నారని, ప్రత్యేకంగా తయారుచేసిన ఆహారం స్వీకరిస్తున్నారని, ప్రత్యేక సెల్స్ను వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని తొలుత జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప తొలుత వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక జైళ్లలో ఖైదీలంతా తెలుపు రంగు దుస్తులు వాడాల్సి ఉండగా, శశికళ, ఇళవరసి మాత్రం చీరలు, సల్వార్ కమీజ్ సహా తమ సొంత దుస్తులను వాడుతున్నారని రూప గతంలోనే వెల్లడించారు. యూనిఫాం విషయంలో ఖైదీల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆమె స్పష్టం చేశారు. -
దినకరన్ వస్తే ఒక్క మాట మాట్లడలేదా?
సాక్షి, బెంగళూర్ : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఘన విజయం తర్వాత ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లి కలిసొచ్చిన విషయం తెలిసిందే. బెంగళూర్ పరప్పన అగ్రహార జైలులో దాదాపు ఆర గంట సేపు వీరు భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె మౌన వ్రతం పాటించటమేనంట. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తొలి వర్థంతి సందర్భంగా ఆమె నెచ్చెలి అయిన శశికళ మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఏఐఏడీఎంకే శశికళ వర్గం సెక్రెటరీ వీ పుహళెంది మీడియాకు వెల్లడించారు. దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారని పుహళెంది చెప్పారు. కేవలం చూపులతోనే పలకరించారని, చిరునవ్వే ఆమె మాటలైనాయని ఆయన అన్నారు. జనవరిలో ఆమె తన మౌనవ్రతాన్ని విరమిస్తారని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లే సమయంలో అమ్మ సమాధిపై చిన్నమ్మ తట్టి శపథం చేయటం గుర్తుంది కదా. -
శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా..
-
ఐటీ దాడుల షాక్.. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా..
సాక్షి, చెన్నై: ఆదాయపన్న శాఖ (ఐటీ) పెద్ద ఎత్తున జరిపిన దాడులతో శశికళ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శశికళ ఆర్థిక సామ్రాజ్యం లక్ష్యంగా, ఆమె బంధువులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి ఏకంగా 30 చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ ఐటీ దాడులపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని, రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారుకు మద్దతుగా కేంద్రం తమ ఆస్తులపై ఐటీ దాడులు చేయించిందని శశికళ వర్గం ఆరోపించింది. ఐటీ సోదాల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకరన్ మీడియాతో మాట్లాడారు. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా.. బయటకు వచ్చిన అనంతరం తిరిగి రాజకీయాల్లో పాల్గొంటారని దినకరన్ అన్నారు. దాడులు తమకు కొత్త కాదని, అన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే తమపై ఐటీ దాడులు జరిగాయని, ఎవరి బెదిరింపులకు లొంగబోమని దినకరన్ అన్నారు. పడిలేచిన కెరటంలో మళ్లీ విజృంభిస్తామని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని, శశికళ వర్గాన్ని రాజకీయాల నుంచి తొలగించడానికే ఈ కుట్ర జరుగుతోందని దినకరన్ ఆరోపించారు. -
జయ చానెల్కు ఐటీ ఝలక్..!
-
తమిళనాడులో అనూహ్య పరిణామం!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అనూహ్య పరిణామం.. ప్రస్తుతం జైల్లో ఉన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఆదాయపన్నుశాఖ (ఐటీ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శశికళ, ఆమె బంధువుల ఆస్తుల లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి 80మందికిపైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ’జయ టీవీ’, అన్నాడీఎంకేకు చెందిన నమధు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ కార్యాలయంలో దాదాపు పదిమంది ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. టార్గెట్ శశికళ.. జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం జయటీవీ, నమధు ఎంజీఆర్ పత్రిక శశికళ కుటుంబసభ్యుల అధీనంలో ఉన్నాయి. శశికళను పార్టీ నుంచి బహిష్కరించి.. ఈపీఎస్-ఓపీఎస్ శిబిరాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఈ సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయటీవీ, ఎంజీఆర్ పత్రిక పనిచేస్తున్న నేపథ్యంలోనే వీటిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా శశికళ బంధువులైన దినకరన్, దివాకరన్, శశికళ వదిన ఇళవరసి, ఆమె మేనకోడలు కృష్ణప్రియ ఇంట్లో ఐటీ దాడులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. తంజావూరులోని శశికళ భర్త నటరాజన్ ఇంట్లో, బెంగళూరులోని శశికళ సన్నిహితుడు పుహళేంది ఇంట్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. జయలలిత ఆస్తులు ప్రస్తుతం శశికళ కుటుంబసభ్యుల నియంత్రణలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శశికళ టార్గెట్గా ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదాయాన్ని దాచిపెట్టడం, పన్ను ఎగవేయడం వంటి సమాచారం ఆధారంగానే చానెల్ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ‘చానెల్ పన్ను ఎగ్గొట్టేందుకు ఆదాయ వివరాలను దాచిపెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. చానెల్ కార్యకలాపాలు, ముఖ్య సిబ్బంది తీరుపై ప్రస్తుతం దృష్టి పెట్టాం’ అని ఐటీ అధికారులు చెప్పారు. జయ చానెల్తోపాటు శశికళ కుటుంబానికి చెందిన జాజ్ సినిమా థియేటర్పై, వివేక్ నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. -
చెన్నై చేరుకున్న శశికళ.. సంబరాలు
సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త నటరాజన్ను బాగోగులు చూసేందుకు పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేసుకోగా ఐదు రోజుల పెరోల్ రావడంతో కర్ణాటక పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన శశికళ తన బంధువు కృష్ణప్రియ నివాసానికి చేరుకున్నారు. ఆమెతో పాటు టీటీవీ దినకరన్, పలువురు బంధువులు ఆ నివాసానికి వచ్చారు. చిన్నమ్మ శశికళ రావడంతో కృష్ణప్రియ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. శశికళకు హారతి ఇచ్చి ఆమె మద్ధతుదారులు ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తమిళనాడుకు రావడంతో శశికళను చూసేందుకు భారీగా మద్దతుదారులు తరలి వచ్చారు. శశికళ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆమె మద్దతుదారులు హోరెత్తించారు. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో శశికళకు నేడు ఐదు రోజుల పెరోల్ లభించింది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి శశికళ చెన్నైకి వచ్చారు. -
శశికళ భర్తకు అవయవదానం వెనుక ఏం జరిగింది?
సాక్షి, చెన్నై: జైలుపాలైన శశికళ భర్త ఎం నటరాజన్కు బుధవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అవయవమార్పిడి ఆపరేషన్ జరిగింది. 74 ఏళ్ల నటరాజన్కు ప్రాణాలను రక్షించే ఎంతో కీలకమైన కిడ్నీ, లివర్ టాన్స్ప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఆయనకు అవయవదానం చేసిన తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ టీనేజ్ యువకుడి దేహాన్ని బెయిన్డెడ్ స్థితిలో విమానంలో చెన్నైకి తరలించి.. నటరాజన్కు అవయవదానం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆపరేషన్ నిర్వహించిన గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ హాస్పిటల్ తోసిపుచ్చింది. అవయవ మార్పిడి ఆపరేషన్ కోసం నటరాజన్ గత నెల గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి బాధ్యతల నుంచి ఉద్వాసనకు గురైన శశికళ భర్త నటరాజన్కు చాలాకాలంగా దూరం ఉంటున్న సంగతి తెలిసిందే. శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల కార్తీక్ అనే యువకుడి అవయవాలను నటరాజన్కు సమకూర్చారు. కార్తీక్ బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉండగా అతన్ని చెన్నైకి తరలించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆస్పత్రి తిరస్కరించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చిన అనంతరం.. అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వైద్య సలహాకు వ్యతిరేకంగా కార్తీక్ను చెన్నైకి కుటుంబసభ్యులు తరలించారని పేర్కొంది. అయితే, తీవ్రంగా గాయపడిన అతన్ని విమానంలో తరలించారా? లేక ఎలా తీసుకువచ్చారా? అనే విషయాన్ని ఆస్పత్రి వెల్లడించలేదు. అంతేకాదు నిబంధనలకు వ్యతిరేకంగా వీఐపీ కావడంతో నటరాజన్కు అవయవదానం ప్రక్రియను చేపట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, అవయవ దానం స్వీకరించే 'వెయిటింగ్ లిస్ట్'లో నటరాజన్ టాప్స్థానంలో ఉన్నారని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆయనకు అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని ఆస్పత్రి తెలిపింది. -
శశికళకు ఎదురుదెబ్బ
-
శశికళకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళకు మరోసారి ఎదురుదెబ్బ తగిలించింది. జైలు నుంచి బయటపడాలనుకున్న ఆమె ఆశలపై సర్వోన్నత న్యాయస్థానం నీళ్లు చల్లింది. తన విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శిక్షను రద్దు చేయడానికి ఎటువంటి కారణం కనబడటం లేదని న్యాయస్థానం పేర్కొంది. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమె కారాగారవాసం గడుపుతున్నారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ మే నెలలో ఆమె రివ్యూ పిటిషన్ వేశారు. శశికళ ప్రభుత్వ పదవులు నిర్వహించలేదని, అక్రమాస్తుల కేసులో ఆమెకు శిక్ష విధించడం తగదని ఆమె తరపు న్యాయవాది చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఆమెను విడుదల చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. శశికళ, ఆమె ఇద్దరి బంధువులకు విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఎటువంటి లోపాలు కనబడటం లేదని స్పష్టం చేసింది. ప్రధాన నిందితురాలు జయలలిత చనిపోయినందున తనను విడుదల చేయాలన్న అభ్యర్థనను కోర్టు మన్నించలేదు. తనను జైలుకు పంపడానికి ముందు కూడా ఇదేవిధమైన వాదనను సుప్రీంకోర్టులో శశికళ వినిపించారు. అప్పుడు కూడా న్యాయస్థానం ఈ వాదనను తిరస్కరించింది. రివ్యూ పిటిషన్ను తిరస్కరించడంతో శశికళ చివరి ప్రయత్నం కూడా అయిపోయింది. ఇక శిక్ష పూర్తయ్యే దాకా జైలు నుంచి ఆమె బయటకు వచ్చే అవకాశాలు లేవు. -
శశికళ జైలు నుంచి బయటకు వచ్చిందా?
బెంగళూరు: నల్లరంగు కుర్తా వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని శశికళ జైలులోకి దర్జాగా వస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి అయిన శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, రూ. రెండు కోట్ల మేర లంచాలు ముట్టజెప్పి జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని, వీఐపీ తరహాలో జైలులో ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని జైళ్లశాఖ డీఐజీ డీ రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఆరోపణలను సాక్ష్యంగా జైలు ప్రవేశద్వారంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను ఏసీబీకి సమర్పించారు. సాధారణ దుస్తుల్లో శశికళ జైలు లోపలికి దర్జాగా వస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఆమెకు రక్షణగా ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు. శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించిన డీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీచేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ బాధ్యతలను అప్పగించింది. జైలులో శశికళకు రాజభోగాల వ్యవహారంపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సీసీటీవీ కెమెరా దృశ్యాలను డీ రూప సమర్పించారు. -
దినకరన్కు చుక్కెదురు!
చెన్నై: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను కలిసేందుకు వెళ్లిన అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్కు చుక్కెదురైంది. గురువారం శశికళను కలవడానికి దినకరన్ వెళ్లగా ఆయన కారును జైలు ప్రాంగణంలో రెండవ నిఘా కేంద్రం వద్ద నిలిపివేశారు. దీంతో ఆయన దాదాపు రెండు గంటలపాటు అక్కడే వేచి ఉన్నా శశికళను కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో నిరాశ చెందారు. జైలులో శశికళను విచారిస్తుండటంతో అనుమతి లభించడం లేదని తెలుసుకున్న దినకరన్ గురువారం అక్కడే ఉన్నారు. శుక్రవారం రోజు మరోసారి ఆమెను కలిసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో చెన్నైకి తిరిగి వచ్చేశారు. అయితే ఈ నెల 24న దినకరన్ మరోసారి పరప్పన అగ్రహార జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. వీఐపీ ట్రీట్మెంట్ కోసం శశికళ రూ.2 కోట్లు ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలను దినకరన్ కొట్టిపారేశారు. ముడుపుల వ్యవహారం ఆరోపణలపై చర్చించేందుకు శశికళను కలవడానికి దినకరన్ వెళ్లినట్లు ప్రచారంలో జరుగుతోంది. -
ఆమె కోసం రూ.2కోట్లతో జైల్లో స్పెషల్ కిచెన్
జైలులోనూ చిన్నమ్మకు రాచమర్యాదలు.. వీఐపీ ట్రీట్మెంట్ చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళకు జైల్లోనూ రాచమర్యాదలు దక్కుతున్నాయి. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తోంది. ఆమెకు నచ్చిన ఆహారం అందించేందుకు జైల్లో ఏకంగా ప్రత్యేక వంటగదిని ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఏకంగా రూ. రెండు కోట్లను జైలు అధికారులకు లంచంగా ఇచ్చారు. జైలులో శశికళకు లభిస్తున్న వీఐపీ మర్యాదలపై సీనియర్ జైలు అధికారి డీ రూప రూపొందించిన నివేదికలో వెలుగుచూసిన వాస్తవాలివి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అనుభవిస్తున్న శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని వినిపిస్తోందని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. అందుకే జైల్లో శశికి ప్రత్యేక మర్యాదలు దక్కుతున్నా ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 10న పరప్పన అగ్రహార జైలులో తనిఖీలు నిర్వహించిన జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. -
జైలు నుంచి శశికళ విడుదల!
- 30 రోజుల పెరోల్పై చెన్నైకి చిన్నమ్మ బెంగళూరు: తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జైలు నుంచి విడుదలకానున్నట్లు తెలిసింది. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమెకు 30 రోజుల పెరోల్ లభించినట్లు పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. సోమవారం సాయంత్రమే ఆమె జైలు నుంచి విడుదలై, నేరుగా చెన్నైకి వెళతారని సమాచారం. ఏప్రిల్లో మేనల్లుడు మహదేవన్(47) మరణించిన సందర్భంలో శశికళ పెరోల్ కోసం ఎంతగానో అభ్యర్థించినా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ‘చిన్నమ్మకు పెరోల్’ వచ్చిందన్న వార్తలు ఆమె అభిమానుల్లో ఉత్తేజం నింపగా, ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ నాయకత్వంలో మాత్రం అలజడి రేపాయి. ఇప్పటికే శశికళ సహా ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్లను పార్టీ పదవుల నుంచి తొలగించిన నేపథ్యంలో చిన్నమ్మ స్పందన ఎలా ఉంటుందోనని పళని వర్గీయుల్లో చర్చ మొదలైంది. శశితో దినకరన్ భేటీ: బెంగళూరులోని పణప్పర అగ్రహారం జైలులో ఉన్న శశికళను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కలిశారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపడం, అక్రమ ఆస్తుల కేసుల్లో గతవారం అరెస్టయిన దినకరన్.. శుక్రవారం బెయిల్పై విడుదలయ్యారు. సోమవారం ఉదయం అగ్రహారం జైలులో శశితో భేటీ అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళేనని, ఉప ప్రధాన కార్యదర్శి తానేనని దినకరన్ చెప్పారు. అక్క కొడుకుగా కాకుండా పార్టీ ఉపనాయకుడిగానే చిన్నమ్మతో భేటీ అయ్యానని వివరించారు. -
చిన్నమ్మకు ఎన్ని కష్టాలు..!
బెంగళూరు: జయలలిత బతికున్న రోజుల్లో ఆమె నెచ్చెలి శశికళ ఓ వెలుగు వెలిగారు. జయ నివాసం పోయెస్ గార్డెన్లో మహారాణిలా బతికారు. చిన్నమ్మకు పార్టీ నాయకులు, అధికారులు వంగివంగి దండాలు పెట్టేవారు. జయలలిత మరణించాక అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ.. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారనుకున్న సమయంలో ఆమె జాతకం మారిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడటంతో సీఎం పదవి చేజారింది. బెంగళూరు అగ్రహార జైలుకు ఆమె వెళ్లాక పార్టీలోనూ పరిస్థితులు మారిపోయాయి. చిన్నమ్మ తన నమ్మినబంటు పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టినా పార్టీలో ప్రతికూలత తప్పలేదు. పార్టీ ఉపప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు దినకరన్ లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమెను వ్యతిరేకించి మాజీ సీఎం పన్నీరు సెల్వంతో జత కట్టేందుకు పళని స్వామి సుముఖంగా ఉండగా, పార్టీలో ఆమెకు విధేయలుగా ఉన్నవారు దూరమయ్యారు. చిన్నమ్మతో సహా ఆమె బంధువులను పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. జైల్లో చిన్నమ్మ కష్టంగా కాలం గడుపుతున్నారు. జైలులో చిన్నమ్మను చూసేందుకు వచ్చేవారే కరువయ్యారు. ఈ నెల 15 నుంచి ముగ్గురు మాత్రమే వచ్చారు. మార్చి, ఏప్రిల్ మొదట్లో ఎక్కువ సందర్శకులు వచ్చినా ఇటీవల వీరి సంఖ్య తగ్గింది. గత 14 రోజుల్లో ముగ్గురు మాత్రమే రాగా, వీరిలో ఒకరు శశికళ దగ్గరి బంధువైన డాక్టర్ ఉన్నారు. ఇక జైల్లో శశికళను సాధారణ ఖైదీగా పరిగణిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె వదిన ఇళవరసి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా అనారోగ్య సమస్యల వల్ల ఇళవరసి ఎక్కువగా జైలు ఆస్పత్రిలో ఉండటంతో సెల్లో శశికళ ఒంటరిగా ఉంటున్నారు. చిన్నమ్మ ఎక్కువ సమయం టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాలు శశికళను కలవరానికి గురిచేస్తున్నాయని, జైలుకు మొదట్లో వచ్చినప్పటితో పోలిస్తే ఆమెలో ఆత్మవిశ్వాసం తగ్గిందని తెలిపారు. అంతేగాక అనారోగ్య సమస్యలు చిన్నమ్మను వేధిస్తున్నట్టు సమాచారం. -
మంతనాల్లో బిజీ
♦ చర్చలు షురూ.. ♦ భద్రత పెంపు ♦ తొలి గెలుపుతో పన్నీరు జోష్ ♦ టీటీవీకి భంగపాటు ♦ దూకుడు పెంచిన పళని ♦ ఏకం అయ్యేదెన్నడో ♦ పదవుల చర్చ..ప్రచార హోరు టీటీవీ దినకరన్ను సాగనంపుతూ మంత్రులు చేసిన ప్రకటనతో అన్నాడీఎంకేలో రాజకీయ చర్చ తారాస్థాయికి చేరింది. బుధవారం పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ సాగింది. ఓ వైపు పన్నీరు శిబిరం, మరో వైపు సీఎంతో మంత్రులు, ఇంకో వైపు టీటీవీ దినకరన్ ఎవరికి వారు వేర్వేరుగా మంతనాల్లో బిజిబిజీ అయ్యారు. సీఎంకు చెక్ పెట్టే రీతిలో టీటీవీ నిర్ణయం తీసుకునేనా అన్న చర్చ ఊపందుకుంది. దీంతో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఊహాగానా లు, ప్రచారాలకు చెక్ పడినా, ఇక, పన్నీరుతో చర్చలు షురూ అని సీఎం టీం ప్రకటించడంతో రాజకీయ ఆసక్తి సాఫీగా సాగింది. అయితే, చర్చల్లో పదవుల పందేరాల వ్యవహారం చర్చ హోరెత్తే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి నిత్యం అన్నాడీఎంకేలో ఏదో ఒక వివాదం, చర్చ సాగుతూనే వస్తున్నది. చిన్నమ్మ శశికళ జైలు జీవితంతో పార్టీకి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్కు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని మంగళవారం మంత్రులు తీసుకోవడం మరో పెద్ద చర్చకు, ఉత్కంఠకు దారి తీసింది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ రాష్ట్రంలో బయలు దేరింది. సీఎంకు చెక్ పెట్టే రీతిలో దినకరన్ దూకుడు పెంచవచ్చన్న సంకేతాలతో అందరి దృష్టి అన్నాడీఎంకే పరిణామాల మీద పడింది. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కల్గేనా అన్నంత ఉత్కంఠ బయలు దేరడంతో ఆగమేఘాలపై చెన్నైతో పాటు పలు నగరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం, సీఎం, మాజీ సీఎం, దినకరన్ ఇంటి పరిసరాల్ని అయితే, భద్రతా వలయంలోకి తెచ్చారు. మంతనాల్లో బిజీ బిజీ... ఈ ఉత్కంఠకర పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారు మంతనాల్లో బిజీ కావడంతో మీడియా దృష్టి అంతా అన్నాడీఎంకే వైపుగా మరలింది. రాష్ట్రంలో ఎక్కడచూసినా అన్నాడీఎంకే అంతర్గత సమరం చర్చే. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు తగ్గట్టు ఉదయాన్నే దినకరన్ ప్రయత్నాల్లో పడ్డారని చెప్పవచ్చు. తనకు మద్దతుగా కనీసం యాభై మంది వరకు ఎమ్మెల్యేలు కదిలి వస్తారని ఆశించినా, భంగపాటు తప్పలేదు. ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రం ప్రత్యక్షం కావడంతో వారితో మంతనాల్లో దినకరన్ మునిగారు. చివరకు మీడియా ముందుకు వచ్చి ఉత్కంఠకు తెర పడేలా చేశారు. పోలీసులకు కాస్త పని తగ్గినట్టు చేశారు. మీడియాతో మాట్లాడే సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడుతున్నానని, దూరం నిర్ణయం తనకు ఎలాంటి బాధను కల్గించలేదంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతం అని, పదవికి రాజీనామా అన్నది మాత్రం చిన్నమ్మ శశికళ నిర్ణయం మేరకే నంటూ ముందుకు సాగారు. పన్నీరు జోష్ : దినకరన్కు వ్యతిరేకంగా మంత్రుల ప్రకటనతో పన్నీరు శిబిరంలో ఆనందం తాండవం చేసిందని చెప్పవచ్చు. ఇక, చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టినట్టేనన్నంత ధీమాలో మునిగారు. ఉదయాన్నే గ్రీమ్స్ రోడ్డులోని ఆయన నివాసం వద్దకు మద్దతు నేతలు, కేడర్ తరలి రావడంతో ఆ పరిసరాలు చాలా రోజు అనంతరం మళ్లీ కిక్కిరిశాయి. ఈసందర్భంగా మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ధర్మయుద్ధంలో ఇది తొలి గెలుపుగా అభివర్ణించారు. పళని దూకుడు : దినకరన్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదేని వ్యూహాలకు పదును పెట్టిన పక్షంలో తిప్పికొట్టేందుకు తగ్గ అస్త్రాల్ని సిద్ధం చేసుకునే రీతిలో ఉదయాన్నే సీఎం ఎడపాడి పళనిస్వామి సైతం మంతనాల్లో బిజీ అయ్యారు. ఇరవై మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో హడావుడి పెరిగింది. దూకుడు పెంచే రీతిలో తరచూ ఎవరో ఒక మంత్రి బయటకు వచ్చి మీడియా ముందు దినకరన్కు హెచ్చరికలు చేసి వెళ్లడం గమనార్హం. పార్టీ కార్యాలయం వైపుగా అడుగులు పెడితే తీవ్ర పరిణామాలు తప్పదన్నట్టుగా హెచ్చరికలు సైతం అందులో ఉండడం గమనార్హం. ఈ మంతనాల జోరుసాగుతున్న సమయంలో దినకరన్ మీడియాతో స్పందించి తీరును పరిగణించి ఇక విలీనం విషయంగా దూకుడు పెంచేందుకు పళని సిద్ధమయ్యారు. చర్చలు షురూ : ఇక, అన్నాడీఎంకే ఒకే వేదిక అన్నట్టుగా నేతలు ముందుకు సాగే సమయం ఆసన్నం అవుతోన్నట్టు స్పష్టమైంది. గతంలో శశి అండ్ కోను అమ్మ జయలలిత సాగనంపితే, ప్రస్తుతం దినకరన్ అండ్ కోను సాగనంపుతూ తీసుకున్న నిర్ణయం పళనిస్వామి మీద ప్రజల్లో కాస్త క్రేజ్ పెంచినట్టు అయింది. పన్నీరు పంతనం నెగ్గడం, పళని దూకుడు పెంచడం వెరసి ఇక, అన్నాడీఎంకేకు మంచి రోజులు మళ్లీ వస్తాయా అన్న ఆశలు కేడర్లో మొలకెత్తుతున్నాయి. ఇక, శశికళ, దినకర్ అండ్ కోకు చెక్ పెట్టడాన్ని ఆహ్వానించే రీతిలో ప్రజల మధ్య చర్చలు సాగడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో విలీనం విషయంగా చర్చలు సాగించేందుకు పన్నీరు, పళని శిబిరాలు సిద్ధం అయ్యాయి. గురువారం నుంచి సాగే చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు, షరతులు తెర మీదకు రానున్నాయో అన్న కొత్త ఉత్కంఠ బయలు దేరింది. ముందుగా ఇరు పక్షాల ప్రత్యేక కమిటీలో సమావేశాలు సాగించి, చివరగా పళని, పన్నీరు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు తగ్గట్టు కార్యచరణ సాగనుంది. అయితే, ఈ చర్చల్లో తెర మీదకు రానున్న అంశాలపై రక రకాల ప్రచారాలు, పుకార్లు అప్పుడే ఊపందుకున్నాయి. పన్నీరు సీఎం అన్నట్టుగా, కాదు..కాదు ప్రధాన కార్యదర్శి అంటూ ఓ వైపు, మరో వైపు పళనికి ఇక రెండు(పార్టీ, ప్రభుత్వం) చోట్లా డిప్యూటీ పదువులే అన్నంతగా చర్చలు సాగుతుండడం గమనార్హం. తమిళ మీడియా ఇదే అంశాలను తెర మీదకు తెచ్చే కథనాలు మొదలెట్టే పనిలో పడ్డాయి. అయితే, చర్చల్లో పై అంశాలు సాధ్యమేనా..? ఏకం అయ్యేదెన్నడో..?, విలీనం మూహూర్తం ఎప్పుడో అన్నది వేచి చూడాల్సిందే. -
బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం
-
బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం
శశికళతో సహా విద్రోహాలంతా పార్టీ వీడాల్సిందే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదు అమ్మ బతికివుంటే శశికళను తరిమేసేవారు మరోసారి ఫైర్ అయిన సెల్వం జయలలిత మృతిపై మరోసారి విచారణకు డిమాండ్ చెన్నై: అన్నాడీఎంకే వైరి వర్గాలైన ఓపీఎస్-ఈపీఎస్ గ్రూపుల విలీనానికి రంగం సిద్ధమైందని భావిస్తుండగా.. అనూహ్యరీతిలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి శశికళపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శశికళ సహా విద్రోహులంతా పార్టీని వీడాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. జయలలితకు శశికళ కుటుంబం ద్రోహం చేసిందని, జయలలిత బతికి ఉంటే శశికళను ఎప్పుడో ఇంటికి పంపించి ఉండేవారని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని తేల్చి చెప్పారు. శశికళ, ఆమె కుటుంబసభ్యలు పార్టీలో కొనసాగిస్తే.. అన్నాడీఎంకే అధికార (ఈపీఎస్) వర్గంతో విలీనం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలోని తాజా రాకీజయ పరిణామాల నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జయలలిత మృతిపై న్యాయవిచారణ జరగాల్సిందేనని, అదే తన మొదటి డిమాండ్ తేల్చిచెప్పారు. జయలలితకు అందించిన వైద్యచికిత్స వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో శశికళ కుటుంబాన్ని జయలలిత పోయెస్గార్డెన్ నుంచి పంపించారని గుర్తుచేశారు. రాజకీయాల్లోకి రానని జయలలిత బతికుండగా ఆమెకు శశికళ చెప్పిందని, ఇప్పుడు ఆ మాట తప్పి శశికళ కుటుంబం మోసం చేసిందని మండిపడ్డారు. శశికళ కుటుంబపాలనను తాను ఎంతమాత్రం అంగీకరించేది లేదని అన్నారు. అమ్మ ఆశయాలు నెరవేర్చడమే తమ లక్ష్యమని, ఆమె చూపిన బాటలోనే తామంతా నడుస్తామని చెప్పారు. శశికళను, ఆమె కుటుంబసభ్యులను పదవి నుంచి తప్పిస్తే..ప్రస్తుత సీఎం ఎడపాటి పళనిస్వామితో చేతులు కలిపేందుకు సిద్ధమని ఓపీఎస్ వర్గం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. -
శశికళపై తిరుగుబాటు.. వేటుకు రంగం సిద్ధం?
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం మారుతున్న సమీకరణాలతో ఊహకందనంత వేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు అన్నాడీఎంకేపై శశికళ వర్గానికి తిరుగులేని ఆధిపత్యం. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుపాలైనా.. కటకటాల నుంచి ఆమె మంత్రాంగం నడిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. శశికళ పేరు ఎత్తితేనే అధికార అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. సీనియర్ మంత్రులు ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారని సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళకు ఉద్వాసన పలికేందుకు వేగంగా పావులు కదుతుపున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెరపైకి వచ్చిన అన్నాడీఎంకే, పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని తాజాగా ప్రచారం జోరందుకుంది. ఒకప్పుడు శశికళకు వీరవిధేయుడిగా ఉన్న సీఎం ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్) తాజాగా ఓపీఎస్తో చేతులు కలిపేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు సీనియర్ మంత్రులు, ఓపీఎస్ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు చేతులు కలిపి.. మన్నార్గుడి మాఫియాను పూర్తిగా అన్నాడీఎంకే నుంచి బయటకు తరిమేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాల పునరేకీకరణ వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళను తప్పుకోవాలని ఆ పార్టీ స్పష్టం చేసినట్టు సమాచారం. శశికళ తప్పుకోకుంటే తాము పదవికి రాజీనామా చేస్తామని ఇప్పటికే సీనియర్ మంత్రులు అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు శశికళ కొడుకు, ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న దినకరన్ కూడా అరెస్టయ్యే అవకాశముందని తెలుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి దినకరన్ మధ్యవర్తి సుఖేష్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినకరన్ను కూడా అరెస్టు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ క్రైబ్రాంచ్ పోలీసులు చెన్నై చేరుకొని.. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శశికళను కలువకుండానే దినకరన్ వెనుదిరిగారు. మరోవైపు ఇన్నాళ్లు తన గుప్పిట్లో ఉన్న అన్నాడీఎంకేలో తనకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేస్తుండటంతో శశికళ తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పూర్తిగా చిన్నమ్మ అదుపు దాటిపోయిందని సన్నిహితవర్గాలు ఆమెకు చేరవేసినట్టు సమాచారం.