
సాక్షి, అమరావతి: అమరావతి టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్షరాలా కామధేనువేనని, కేవలం తన సామాజికవర్గం సానుభూతి కోసమే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
► చంద్రబాబుకు భూములు, వాటి రేట్లు, తన బినామీ భూముల ధరల మీద ఉన్న మమకారం ప్రజల మీద లేదు.
► అమరావతిని తనకు, తన బినామీలకు కాసులు కురిపించే కామధేనువుగా మార్చి రైతులకు మొండిచేయి చూపారు.
► అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అయితే ఆయన ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అప్పులు ఎందుకు తెచ్చారు?
► ప్రపంచమంతా తిరిగి తాను తెచ్చానని చెబుతున్న రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు హెరిటేజ్ ఫుడ్స్లోనికా.. లేక సుజనా, సీఎం రమేష్ కంపెనీల్లోకా అన్నది చంద్రబాబుకే తెలియాలి.
► మా ప్రభుత్వం చేసిందల్లా ఉత్తరాంధ్రకు, రాయలసీమకు న్యాయం. విశాఖ, కర్నూలును కూడా రాజధానులుగా ప్రకటించడం వల్ల అక్కడ కూడా భూముల రేట్లు పెరుగుతాయి.
► 2014 ఎన్నికలకు ముందు అమరావతిలో రాజధాని పెడుతున్నానని ఆయన ఓటు అడగలేదు. గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని అని చెప్పి ఎక్కడో పొలాల మధ్య పెట్టారు. సీఎం జగన్ ఎన్నికల్లో వికేంద్రీకరణ లక్ష్యంగానే మా పాలన ఉంటుందని మేనిఫెస్టోలో చెప్పారు.