
సబ్కలెక్టర్ మీషా సింగ్ విధులను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనమలూరు: వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. సెటిల్మెంట్లు, దందాలు, అధికారులపై దాడులకు అంతూ పొంతూ లేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడూ దూకుడు తగ్గలేదు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 33 కేసులు నమోదు చేయించుకొన్న ఘనుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రెండు రోజుల క్రితం పెనమలూరులో ఓ రేషన్ షాపు తనిఖీలకు వెళ్లిన డెప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలపై హత్యాయత్నానికి పాల్పడి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మన బోడె కేసుల చిట్టా పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.
సామాన్యుల నుంచి అధికారుల వరకు..
పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం, అధికారులపై దౌర్జన్యం చేయడం ఆయనకు కొత్త కాదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు బోడెకు అండగా నిలుస్తున్నారు. బోడె ప్రసాద్ గత చరిత్రను ఒక్క సారి పరిశీలిస్తే.. టీడీపీ పాలనలో వెలుగు చూసిన కాల్మనీ, సెక్స్ రాకెట్ ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆయనపై కాల్మనీ కేసులు నమోదు కాలేదు.
చదవండి👉 తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్
బోడె ప్రసాద్ సింగపూర్లో పర్యటనలో ఉండగా తనకు బదులు మరో వ్యక్తితో పోరంకిలో ఉన్నత విద్య పరీక్ష రాయించారన్న వివాదం కూడా ఉంది. అంతేకాదు గతంలో వణుకూరులో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలను అప్పటి విజయవాడ సబ్కలెక్టర్ మీషా సింగ్ అడ్డుకున్నారు. మట్టి తవ్విన పొక్లెయిన్ను స్వాధీనం చేయాలని మీషాసింగ్ ఆదేశించగా బోడె ప్రసాద్ దురుసుగా ప్రవర్తించి పొక్లెయిన్ను దాచేసి, సబ్కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఘటన సంచలనం కలిగించింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు. జగన్నాథపురంలో ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ బందరు రోడ్డు విస్తరణ బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదు. యనమలకుదురులో గ్రూప్ హౌస్లు ధ్వంసం వ్యవహారంలో కూడా బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది.
చదవండి👉🏻 నకిలీ మందుల ఊసే ఉండకూడదు
సమస్యలను నివేదించడానికి వచ్చిన ప్రజలను దూషిస్తున్న బోడె ప్రసాద్ (ఫైల్)
కేసుల్లో ఘనాపాటి
బోడె ప్రసాద్ దురుసు ప్రవర్తనతో ఇప్పటి వరకు 33 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా డెప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్కుమార్పై దాడి కేసులో ఆయన పారిపోయాడు. ఈ కేసులో తొమ్మిది మంది కటకటాల పాలై, బొడే ఒక్కరే పారిపోవడం వెనుక పోలీసుల మెతక వైఖరి ఉందన్న విమర్శలున్నాయి. ఓ పోలీసు అధికారి లోపాయికారీగా ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత పోలీస్స్టేషన్లో కూర్చొని బోడెను కేసు నుంచి తప్పించేందుకు చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. బోడె ఒక్కడే పారిపోడం దీనికి ఊతం ఇవ్వడంతోపాటు స్థానిక పోలీసు అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. తరచూ వివాదాల్లో నిలిచే ఆయనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించకుండా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
చదవండి👉 నారాయణ, లింగమనేని పిటిషన్లపై విచారణ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment